Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జనరల్ నాలెడ్జ్ 2000 బిట్లు, పుష్పలత, పేజీలు: 64, వెల : 50/-, ప్రతులకు : నవచేతన, నవతెలంగాణ పుస్తక కేంద్రాలు
సామాజిక నానీలు, ఎస్.ఎం.సుభాని
పేజీలు : 40, వెల : 60/-
ప్రతులకు : షేక్ సల్మా బేగం, 8-3-248/బి, 6వ లైను, బుచ్చయ్యతోట, గుంటూరు - 522001
పాల్కురికి సోమనాథుని కవితా ప్రాభవం
పాల్కురికి సోమనాథుని కవితా ప్రాభవం,
రచన : డా||పులిగడ్డ విజయలక్ష్మి, పేజీలు : 132,
వెల : అమూల్యం, ప్రతులకు : 9989063761
తెలుగు/ కన్నడ/ సంస్కృతాలలో దాదాపు 30కి పైగా (పుస్తకాలు) గ్రంథాలు వెలువరించిన పాల్కురికి సోమన కవితా ప్రాభవంపై చక్కటి విశ్లేషణాత్మక గ్రంథం రాశారు డా||పులిగడ్డ విజయలక్ష్మి. జాను తెలుగును, ద్విపదను తీసుకుని సామాన్య జనులకు సాహిత్యాన్ని చేరువ చేయడానికి తొలి ప్రయత్నం చేసిన సాహసిగా పాల్కురికి సోమనను పేర్కొనడం; జీవిత చరిత్ర రచనలకు బీజం వేసినవానిగా; ద్విపదను తెలుగువారికి దగ్గర చేసిన వ్యక్తిగా రచయిత్రి చక్కగా రాశారు. అల్పాక్షరములలో అనల్పార్థ రచన చేస్తానని ప్రతిజ్ఞ చేసిన పాల్కురికి... తన తరువాత తరం - తిక్కన లాంటి వారికి మార్గ దర్శకుడయ్యాడు. వ్యాకరణ, ఛందశ్శాస్త్ర; అలంకార శాస్త్రాదులలో; హఠయోగ, నేత్రవైద్య, విషవైద్య, రసవాద విజ్ఞానంలో; భరతనాట్యం సంగీతాది కళలలో; జ్యోతిషాది వేదాంగాలలో పాల్కురికి సోమనాథుని ప్రావీణ్యం అపారం అంటూ చిన్న పుస్తకంలో ఎన్నో అంశాల్ని విజయలక్ష్మి చక్కగా విపులీకరించారు.
- తంగిరాల చక్రవర్తి,
9393804472
తెలంగాణ మహనీయులు
తెలంగాణ మహనీయులు, నాగబాల సురేశ్కుమార్, వెల : 150/-,
ప్రతులకు : ప్రముఖ పుస్తక కేంద్రాలు.
నాగబాల సురేశ్కుమార్గారు తెలంగాణకు చెందిన 48 మంది ప్రతిభావంతులను 'తెలంగాణ మహనీయులు' శీర్షికతో పరిచయం చేశారు. ఈ ప్రాంత ప్రతిభావంతులపై నిర్లక్ష్య ధోరణితో చరిత్రల నిర్మాణంలోనూ, గుర్తించడంలోనూ తీరని అన్యాయం జరిగింది అనడం కంటే నిర్లక్ష్యతనే ప్రధానమైంది. ప్రస్తుతం తెలంగాణ ఏర్పడినాక రచయితల కళాకారుల దృష్టి కన్నభూమిపై పడి ఈ ప్రాంత ప్రతిభావంతులను వెలికి తీయడం ప్రారంభమైనది.
ఇందులో ప్రతిభావంతులకు ప్రభుత్వం నుండి రావలసిన గుర్తింపు రాలేదు. ఇందులోని ప్రతిభావంతులు పద్మ పురస్కారాలకు అర్హులు, సినిమా అవార్డులకు, కళారత్న అవార్డులకు, సామాజిక అవార్డులకు ముందు వరుసలోకి వచ్చేవారు అనేకులు. భాగ్యరెడ్డి వర్మ, ఆళ్వారుస్వామి, మగ్దూంమొహియుద్దీన్, షోయబుల్లాఖాన్, పైడిరాజు, టి.ఎల్.కాంతారావు, బి.ఎన్.శాస్త్రి, గోండురాజు అంకమరాజు... ఇలా ఎందరో! అందరినీ స్మరించుకోవడానికి, తెలుసుకోవడానికి అవకాశం కల్పించిన సురేశ్కుమార్కి అభినందనలు. తెలంగాణ మహనీయుల గ్రంథాన్ని అనుసరించి మరిన్ని లఘుచిత్రాల కథనాలు పుస్తకరూపంలో వస్తే తెలంగాణ చరిత్ర సమగ్ర స్వరూపం ఏర్పడుతుంది. అందుకు ఎవరి ప్రయత్నం వారు చేయవలసిన కర్తవ్యాన్ని గుర్తు చేశారు రచయిత. ఇందుకు అభినందనలు.
- టి.శ్రీరంగస్వామి
జీవన చిత్రాలు
మా ఫణిగుట్ట కథలు,
రచన : శిరంశెట్టి కాంతారావు, వెల : 100/-,
ప్రతులకు:ప్రముఖ పుస్తక కేంద్రాలు
'మా ఫణిగిరిగుట్ట కథలు' నల్లగొండ జిల్లాలోని ఫణిగిరిగుట్ట నేపథ్యంగా రాశారు. ఫణిగిరిగుట్టకు బౌద్ధులకాలం నుండి చారిత్రక నేపథ్యం వుంది. ఈ రచయిత బాల్యం ఫణిగిరిగుట్టతో ముడిపడివుండటం వల్ల కూడా దీన్ని కేంద్రంగా తీసుకుని రాశారు. తన తల్లిదండ్రులను, అమ్మమ్మ, బాపమ్మలను, వారి చుట్టూ అల్లుకున్న వాతావరణాన్ని, అక్కడి భాష - యాసలతో ఈ కథలు రచించారు. కథకు శైలి, శిల్పం, ఎత్తుగడ, ముగింపు ప్రాణాల్లాంటివి. ఈ నాల్గింటికి కాంతారావు సమన్యాయం చేకూర్చారనిపిస్తుంది. జొన్న కల్లాల రోజులలో రచయిత చినబాపు పెట్టిన కేక ''వొంపుల అద్దులు దాటి గాలి అలల మీన పర్గులు తీస్కుంట బోయిన ఫణిగిరిగుట్టను బలంగ తాకింద''ట! దేశాంతరం పోతున్న రచయిత కుటుంబాన్ని సాగనంప వచ్చిన అమ్మమ్మ తాతల ఏడ్పు ''ఫణిగిరిగుట్ట గుండెల్లో ప్రతిధ్వనిస్తుంటే విన్న ఊరూవాడా దిగ్గున లేచి కూసుందట! జీవన వాస్తవికత, తాత్త్వికత, పల్లె ప్రజల అమాయకత్వం, ఆర్థిక సంఘర్షణ, బతుకుపోరులోని కఠోర సత్యాలను ఈ కథలు చెబుతాయి.
- కూర చిదంబరం,
8639338675