Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొత్త రాజావారికి ప్రజలు జయజయధ్వానాలు చేశారు. బహిరంగ సభాస్థలి కిటకిటలాడింది. రాజావారు ఏం చెప్తారో ఏయే వరాలు దయచేస్తారోనని ఆత్రుతగా వున్నారు.
కొత్తరాజావారు పాత రాజావారి హయాంలో రాజ్యంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని తాము ఆ సమస్యని చిటికె వేసి తీర్చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఉన్నపళాన నిరుద్యోగులందరినీ ఉద్యోగులను చెయ్యడానికి అల్లావుద్దీన్ అద్భుతదీపం వుంటే కాని సాధ్యపడదని ఆంతరంగికుడు రాజావారి చెవిలో ఊదాడు. మరో ఆంతరంగికుడు రాజావారి మరో చెవిలో గుసగుసపెట్టాడు.
అప్పుడు రాజావారు వీలయినన్ని ఉద్యోగాలు ఇస్తాం, ఉద్యోగాలు ఇవ్వలేని వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇస్తాం అని ప్రజల జైజైకారాల మధ్య హామీ ఇచ్చేశారు. నిరుద్యోగులు ఉద్యోగం అన్నా వస్తుంది, తప్పితే నిరుద్యోగ భృతి అన్నది తప్పకుండా వస్తుందని గంపనిండా ఆశల్ని మోసుకుని వెళ్ళిపోయేరు.
కొత్తగా రాజయిన రాజావారు మొదట విందులూ వినోదాలతో విపరీతంగా బిజీ అయిపోయేరు. ఎంత బిజీ అయ్యేరంటే దేవుళ్ళని సంతృప్తి పరచడానికి పూజలూ, నోములూ, వ్రతాలూ, యాగాలూ చేస్తూ కొత్త మంత్రులని నియమించడానికి కూడా తీరిక లేనంతగా. అలా రాజుగారు 'నేనే రాజు నేనే మంత్రి' అంటూ కొంతకాలం గడిపారు. వివిధ శాఖల వారు మంత్రుల నియామకం లేకపోవడం వల్ల పనులు కావడం లేదని ఏడ్చి మొత్తుకున్నారు.
ఇప్పటికీ మీ కర్థం కాలేదా! రాజ్యానికి రాజవసరం కానీ మంత్రులవసరం లేదని. మంత్రులనేవారు లేకపోయినా రాజ్యపాలన సాఫీగానే సాగిపోయిందని, మంత్రులకయ్యే ఖర్చు మిగిలిపోయిందని రాజావారు పంచ్లు గుప్పించారు. అసలు మంత్రులంతా నామ్కే వాస్తేనే. రాజుగారు తల్చుకుంటే తప్ప ఏదీ జరగదు కదా అని రాజావారు నవ్వులు కూడా రువ్వారు.
మంత్రులు లేకపోయినా రాజ్యానికీ పాలనకీ వచ్చిన ఢోకా ఏమీ లేదని ఒప్పుకుంటున్నాం ప్రభూ. కానీ నిరుద్యోగుల సంగతేమిటి నిరుద్యోగుల భృతి మాటేమిటి అనడిగారు గంపెడాశలు తలమీద మోస్తూ తిరుగుతున్న నిరుద్యోగులు.
అప్పుడేదో అత్యుత్సాహం కొద్దీ హామీ పారేశాం. ఇప్పుడు వీళ్ళు మనల్ని చెయ్యగలిగేది ఏమీలేదు. అంతా నా ఇష్టం ఏం చేసుకుంటారో చేసుకోండోరు అనాలనుకున్నాడు ఏరు దాటాక తెప్ప తగలవేసే టైపు రాజావారు. కానీ అలాగ డైరెక్టుగా ప్రజల నెత్తిమీద నిప్పులు కుప్పపోయకుండా సాఫ్టుగా పొలైట్గా జారిపోయే జున్నులా కరగిపోయే వెన్నలా చెప్పవచ్చునన్నారు కుడిభుజం, ఎడమభుజంగా వున్న ఆంతరంగికులు.
ఉద్యోగాలు ఇచ్చేద్దామంటే పరీక్షలు నిర్వహించాలి. పరీక్షలు నిర్వహిస్తే అవకతవకలు తథ్యం. అందువల్ల ముందు నిరుద్యోగ భృతి ఇద్దాం అన్నాడు ఎడమభుజం. ఇద్దాం సరే అసలు రాజ్యంలో ఎతమంది నిరుద్యోగులున్నారో అందరికీ భృతి ఇవ్వడమంటే నా సీటే కాదు, కిరీటమూ భుజకీర్తులూ తుప్పట్టిన కత్తీ కూడా అమ్ముకోవాల్సి వస్తుందేమోనని భయపడ్డారు రాజావారు.
రాజావారూ మీకు బెంగా బెదురూ భయమూ గియమూ అక్కర్లేదు. అసలు నిరుద్యోగులు అనగానెవరో తేల్చడానికే దీర్ఘకాలం పడుతుంది. దానికో కమిటీ వెయ్యాలి, కమిటీ నివేదిక ఇవ్వాలి అన్నాడు కుడిభుజం.
కమిటీ ఏర్పాటయింది రాజావారి బంధు మిత్రులు, శ్రేయోభిలాషులతో. నిరుద్యోగుల కళ్ళు కాయలు కాశాక నివేదిక వచ్చింది. రాజ్యంలో పనీపాటా లేని వాళ్ళు ఎవరు అనే దాని మీద విస్తృతంగా అధ్యయనం జరిగింది.
అసలు ఒక మతస్తుల వారందరూ కులస్తులుగా విభజించబడ్డారు కదా ఎప్పుడో. కుండలు చేసేవాడు కుండలు చేస్తాడు, బట్టలు నేసేవాడు అవి నేస్తాడు. ఏ కులంలోని వాడు ఆ కులవృత్తిని చేసుకుంటే సరిపోతుంది కదా. కులవృత్తికి సాటిలేదు గువ్వలచెన్నా అన్నారు కదా. అందుచేత ఏదో ఒక కులవృత్తి చేసుకునేవాళ్ళని ఆ వృత్తిలో కంటిన్యూ అయిపోమందాం. వాళ్ళు ఎవరూ నిరుద్యోగులు కానేకాదు కనక లిస్టులోంచి తీసెయ్యాలి. అయితే కులమూ కులవృత్తీ లేని మతస్తులలోని నిరుద్యోగుల వివరాలు బయటికి లాగాలి. వాళ్ళల్లో కొందరికి భృతి ఇస్తే సర్వమత సమానత్వమూ లౌకిక రాజ్య స్థాపనమూ జరిగిపోతాయి అన్నది కమిటీ.
ఈ సంగత్తరవాత, ముందస్తుగా మీరు రాజ్యానికి రావడానికి ముందు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినవారూ, గతంలో మంత్రి పదవులు చేసి ఇప్పుడు మీరు ఇవ్వని పక్షంలో అవి దక్కని వారూ అసలు సిసలైన నిరుద్యోగులు కదా. వారికి వారి స్థాయికి తగినట్టు నిరుద్యోగ భృతిని లేదా సంపాదించుకునే అవకాశాన్ని కల్పించడం మన కర్తవ్యం అన్నాడు ఎడమభుజం. అవునవును అదే మన తక్షణ కర్తవ్యం అన్నారు రాజావారూ కుడిభుజం ఏకకాలంలో!
- చింతపట్ల సుదర్శన్,
9299809212