Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెంటిలేటర్ గూడులోంచి పావురాల కువకువ శబ్దాలు, టపటపమంటూ రెక్కలు విదుల్చుకున్న శబ్దాలకు మెలకువ వచ్చింది. టైం చూసుకున్నాడు. ఆరుగంటలు.
''అప్పుడే వీటికి తెల్లారింది'' అంటూ విసుక్కున్నాడు.
బద్దకాన్ని వదిలించుకునే ప్రయత్నంగా రెండుమూడు చిన్నచిన్న ఎక్సర్సైజులు మంచం మీంచి లేవకుండానే ముగించుకున్నాడు. అల్మరాకు బిగించిన నిలువుటద్దంలో ఒకసారి తన్ను తాను చూసుకుని క్రాపు వేళ్ళతోనే సరిచేసుకుని గది బటయకు నడిచాడు శరత్.
సునీత వాళ్ళాయన కంటే ముందే లేచింది. కిచెన్ గట్టు మీది స్టవ్పై బ్రేక్ఫాస్టు కలియబెడుతూ చిన్నాడిని బాత్రూం నుంచి త్వరగా 'తగలడమం'తోంది. పెద్దాడింకా నిద్ర లేవలేదు.
బ్రష్ మీదకు పేస్టు నొక్కుకుని హాల్లోంచి మెయిన్డోర్ వేపు నడిచాడు శరత్.
భాగ్యనగరంలో శరత్ ఉంటున్నది కవాడీగూడ ఏరియా. టాంక్బండ్కు అతి దగ్గరగా వున్న ఒక 'బాడా'లో నివాసం. మెయిన్డోర్లోంచి సింహద్వారాన్ని దాటుకుని ఆ బాడాలో ప్రవేశిస్తే, రెండు వేపులా అగ్గిపెట్టెల్లాంటి చిన్నచిన్న సింగిల్ రూం పోర్షన్లు అటు నాలుగు, ఇటు నాలుగు వెరసి ఎనిమిది కాపురాలున్నాయి. రెండు వేపులా కామన్ వరండాలు. వరండాల మధ్యన ఖాళీస్థలం, ఆ స్థలంలో కొంచెం ఎత్తుగా కట్టిన నూతి పళ్ళెం వుంది. బాడా నివాసుల అవసరార్థం ఒకప్పుడు ఆ ఖాళీ స్థలంలో ఒక బావి వుండేది. కొళాయిలు వచ్చాక, బావిలోంచి నీళ్ళు తోడుకోవటం మానేశారు. బోర్లు, వాటికి బిగించే మోటార్ల పుణ్యమా అని భాగ్యనగరంలో భూగర్భ జలాలు అంతకంతకూ అడుగంటడం వల్ల బావిలో నీరు ఎండిపోయింది. ఎండిపోయిన బావి ఎందుకు పనికి వస్తుంది గనుక బావిని పూడ్చేశారు. అడుగు ఎత్తుగల గద్దె లాంటిది కట్టారు. వినాయక చవితి, దుర్గాష్టమి లాంటి పండుగలకు, పెళ్ళిళ్ళు - పుట్టిన రోజులు లాంటి కుటుంబ వేడుకలకు ఆ గద్దె బాడావాసులకు పనికివస్తోంది. ఓట్ల పండుగలొస్తే, అభ్యర్థులు ఆ గద్దె మీద నుండే బాడాలోని సభ్యులను సమావేశ పరిచి బేరసారాలు సాగిస్తారు.
సింహద్వారానికి మరోవేపు గద్దెలా కట్టిన ఆ నూతిపళ్ళేనికి అవతలగా కామన్ మరుగుదొడ్లు, స్నానపు గదులున్నాయి. శరత్ పూర్వీకులు ఆ స్నానపు గదులు వాడేవారు కాబోలు; కాని ఇప్పుడు ఎవరింట్లో వారు బాత్రూంలు కట్టించుకున్నారు. స్నానపు గదుల అవతల విశాలమైన ఖాళీస్థలం పెద్ద పెద్ద చెట్లున్నాయి. పిచ్చుకలు కాకులు, కొంగలు, రాబందులు, ఆ చెట్ల మీద కాపురాలు ఏర్పరుచుకుని పొద్దునా, సాయంకాలం ఆ బాడా వాసుల్లాగే సందడి చేస్తుంటాయి.
ఒక్కో పోర్షన్లో ఒకవేపు బెడ్రూం - కం - స్టోర్ రూం - కం - ప్రయివేట్ రూం; బెడ్రూంకు ఎదురుగా హాల్లోనే కిచెన్ గట్టు, బెడ్రూంకు 'వై' మూలన శరత్ కాలంలో కట్టుకున్న బాత్రూం వుంటుంది.
ఆర్థిక స్థోమత అంతంతగానే వున్న ఆ బాడా వాసులు ప్యూను, డ్రైవర్, అటెండర్ లాంటి చిరుద్యోగులు, చిరు వ్యాపారులు.
శరత్ తల్లిదండ్రులు సుమారు ఎనభై ఏళ్ళ క్రితం నిజాం నవాబు దగ్గర కొలువుకు వచ్చారట. శరత్ ఎదురు పోర్షన్ ప్రకాశ్ నాయక్ది. ఆదిలాబాద్ రాజపుత్రులం అని చెప్పుకుంటారు కాని నిజానికి లంబాడాలు. శరత్కు ఎడమవేపు రాఘవేంద్రది రాయచూరు. కుడివేపు పండిత్ రావుది మరఠ్వాడం. ప్రకాశ్ నాయక్కు రెండువేపులా బట్టల చిరువ్యాపారులు. కరీంనగర్ నుంచి వచ్చారట.
అక్కడ నివాసమేర్పరచుకున్న పక్షుల్లానే, పొద్దున్నే ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళి, ఏ రాత్రికో 'గూళ్ళకు చేరుతారు.
నిజానికి ఆ బాడా శరత్, ప్రకాశ్ వాళ్ళది కాక పోయినా; వాళ్ళదే!
ఆ బాడా అసలైన యజమాని 1940 దశకంలో నిజాం నవాబు దివాణంలో గుర్రాల సంరక్షణ చూసుకునేవాడట! ఏదో ఓ సందర్భంలో నవాబుగారు సంతోషించి, ఈ గుర్రాల కాపరికి బాడా స్థలం దానంగా ఇచ్చాడు. ఆయన ముందుచూపుతో ఇలా పావురాల గూళ్ళలాంటి ఎనిమిది పోర్షన్లు కట్టుకుని, ఒకదాంట్లో తానుంటూ, మిగతా పోర్షన్లను శరత్, ప్రకాశ్ల తాత, తండ్రులకు నెల ఒకంటికి 'ఆఠాణా'కు అద్దెకు ఇచ్చాడు. 1948లో భారత ప్రభుత్వ మిలిటరీ దాడికి భయపడి పాకిస్తాన్కు పారిపోయాడు.
అప్పుడప్పుడు ఫలానా సాయేబు వారసులం అంటూ ఎవరో వస్తుంటారు. ఖాళీ చెయ్యాలంటారు. ఒకరంటే మరొకరికి పడని ఆ ఎనిమిది కుటుంబాలు ఆ సమయాన ఏకం అయి ఒక్క తాటిమీద నుంచుని ప్రతిఘటిస్తారు. ఇందుకు పరోక్షంగా ఆ వార్డ్ కౌన్సిలరమ్మ వీళ్లకు అండగా వుండి ధర్నా ప్రదర్శన చేపిస్తుంది. అరుపులు, కేకలు, ఠాణాలో ఎఫ్.ఐ.ఆర్లు. రెండు మూడు రోజులకు అంతా సర్దుకుంటుంది. ఆ కౌన్సిలరమ్మ ఏం మంత్రం వేస్తుందో కాని మరో ఆరు నెలల వరకు నిశ్చింత.
ఎవరి పోర్షన్ రిపేర్లు వాళ్ళు చూసుకుంటారు. ఇంటి పన్ను, మరుగుదొడ్ల రిపేరు, వర్షాకాలంలో 'అడవి'లా పెరిగిన చిన్నచిన్న పొదల్ని కొట్టేయడానికి, వినాయక చవితి లాంటి సామూహిక కార్యక్రమాలకు, ఎనిమిది కుటుంబాలు అప్పటికప్పుడు చందాలు వేసుకుంటారు. సామూహిక విషయాల అజమాయిషీ బాధ్యత ఏడాదికి ఒకరు వంతున చూసుకుంటారు. ఇప్పుడు ప్రకాశ్ నాయక్ వంతు. ప్రకాశ్ ఓ ప్రభుత్వ సంస్థలో అటెండర్. జీతం గీతం బాగానే ముడుదుందని చెప్పుకుంటాడు. ఆఫీసులో బాసు పెట్టిన చీవాట్లన్నీ సార్... సార్... అంటూ చేతులు కట్టుకుని విని, బయటకు వచ్చి, బాసునే దబాయించానని చెప్పుకునే రకం. ఒక్కోసారి లంచ్ బ్రేకులోనే వచ్చి పెళ్ళాన్ని మేటనీకి తీసుకెళుతాడు. ఆ రోజంతా దంపతులిద్దరూ, మిగతా కుటుంబాల్ని సినిమా కబుర్లతో ఊదరగొడ్తారు. ఇక ఆ రోజు శరత్ లాంటి మరో ఇద్దరు ఇళ్ళల్లో ప్రచ్ఛన్న యుద్ధం మొదలవుతుంది. ఆమె ''మనమూ సినిమాకి వెళ్దాం'' అని అడక్కుండా ''ప్రకాశ్ వాళ్ళు ఫలానా సినిమా చూశారు'' అంటుంది. అదీ చిన్నాడి ముందు. ''నాన్నా మనమూ వెళ్దాం'' అంటాడు చిన్నాడు. చిన్నబ్బాయిలో శరత్ తండ్రి పోలికలుంటాయి. ఈ పోలికలు ఎలా వస్తాయో కాని, వాడి మేనరిజం, ఒక్కో పదాన్ని ఒత్తి పలకటం, కోప్పడితే తల ఎగరేయటం - శరత్ నాన్నను గుర్తుకు తెస్తాడు. అందుకే సునీత అవసరాలను బట్టి వాడినో 'పనిముట్టు'గా ఉపయోగించుకుంటుంది.
ప్రకాశ్కు రెండు వేపులా కరీంనగర్ నుంచి వచ్చిన ముదిరాజ్ అన్నదమ్ములుంటారు. సైకిల్ క్యారియర్ల మీద పెద్ద గుడ్డల మూటలు కట్టుకుని ఊరంతా తిరిగి గుడ్డలమ్ముకుంటారు. 'అక్కా, వదినా' అంటూ వరసలు కలిపి, పండగలకు బట్టలు అంటగడ్తారు. బాడా వాళ్ళకు క్రెడిట్ ఇస్తారు. క్రెడిట్ అయినా ఏదో ఒకరోజు తీర్చక తప్పదు కదా. అందుకే శరత్, నాయక్ లాంటి వాళ్ళకు వీళ్ళంటే గిట్టదు. కాని వాళ్ల ఆడవాళ్ళకు వీళ్ళంటే ప్రేమ.
శరత్ పెద్దకొడుకింకా లేవలేదు. కిచెన్ గట్టు దగ్గరుండే సునీత వాడికి 'సుప్రభాతం' పాడుతోంది. రాత్రిళ్ళు టీవీ ముందర కూర్చున్న పిల్లల్ని 'ఇక పడుకోండి' అంటూ గద్దించి పడుకోబెట్టాలి. తెల్లారాక 'లేవండి!' అంటూ నిద్రలేపాలి. పెద్దాడికి లౌక్యం బాగా ఒంటపట్టింది. ''ఒక్క ఐదు నిమిషాలు'' అంటూ కొసర్తాడు.
'ఇవ్వేళ్ళా అదేతంతు' అనుకున్నాడు శరత్.
దిగిపోయిన మెయిన్డోర్ తలుపుల్ని బలవంతంగా లాగి తెరిచాడు. కీచుమన్న శబ్దం చేస్తూ తెరుచుకున్నాయి తలుపు రెక్కలు.
మెయిన్డోర్ వెంటిలేటర్మీదున్న ఓ పావురం ఉలిక్కిపడి రెక్కలు టపటపలాడించి ఎగిరిపోయింది.
గుడ్లు పెట్టే సమయం వచ్చింది కాబోలు... గడ్డీగాదం, దారంముక్కలు, ప్లాస్టిక్ కవర్ల చిదుకులు వెంటిలేటర్ గూట్లో పోగేస్తున్నాయి పావురాలు. గడ్డీగాదం ముక్కలు చాలాభాగం నేలమీద పడి నేలంతా అసహ్యంగా తయారయింది. అదాట్న తలుపు తెరవటంతో, దడుసుకున్న ఆ పావురం వెంట తీసుకువచ్చిన గడ్డిముక్కలు, ఈకలు శరత్ నెత్తిన పడ్డాయి.
కోపంతో పైకి చూస్తూ తిట్టబోయాడు. నోట్లో బ్రష్ వుండటం వల్ల మాట బయటకు రాలేదు. చికాగ్గా ముఖంపెట్టి ప్రకాశ్ ఇంటివేపు చూశాడు.
వాడూ అప్పుడే లేచినట్లున్నాడు. శరత్ విష్ చేశాడు. శరత్ అన్నది ప్రకాశ్కు వినబడకపోయినా సందర్భాన్ని బట్టి ఊహించుకుని 'వెరీగుడ్ మార్నింగ్' అన్నాడు.
కరీంనగర్ ముదిరాజ్లు సైకిళ్ళు తుడుచుకుంటున్నారు. వాళ్ళూ శరత్కు 'నమస్తే' చెప్పారు.
మెయిన్డోర్ తలుపురెక్కలు నెడ్తూ లోపల ప్రవేశించాడు. మరో పావురాల జంట ఏకంగా ఇంట్లోనే ఫ్యాను రెక్కల మధ్య కాపురం పెట్టాలనుకున్నాయి కాబోలు... కొన్ని గడ్డిపోచలు, పతంగిల మాంజా దారపు ముక్కలు ఫ్యాను రెక్కల మీంచి వేలాడుతున్నాయి. హాలు మధ్యన చెత్త పోగుపడిపోయిందప్పుడే!
మరో మాట కోపంగా శరత్ నోటి వెంట వచ్చింది.
ఎవర్ని ఉద్దేశించి ఆ మాట శరత్ వాడాడో తెలుసుకున్న సునీత ''ఈ పావురాలు, కోతులతో వేగలేకపోతున్నాను. ఏదైనా చేయాలండీ'' అభ్యర్థన లాంటి ఆదేశం.
''ఈ కాంప్లెక్సులు కట్టటం, చెట్లు నరకటం వల్ల కోతుల బెడద భాగ్యనగరంలో రోజురోజుకూ ఎక్కువవుతోంది. తలుపులు తోసుకుని మరీ వస్తున్నాయి'' విసుక్కున్నాడు శరత్.
చీమలు, కాకులు, కోతులు, పావురాలు ఇవన్నీ బాడా వారిని చికాకు పెడుతున్నాయి. గడ్డీగాదం, చెత్త ఊడ్చేస్తే పోతోంది. కాని రూం మధ్య, మెయిన్ డోర్ ముందు, మెయిన్డోర్ వెంటిలేటర్ కిందకు కారుతున్న పావురాల రెట్టలు.... అసహ్యం వేస్తోంది శరత్కు.
శరత్ పెద్దబ్బాయి క్లాసు పుస్తకంలో 'పర్యావరణంతో సహజీవనం సాగించాలి' అని వుంది. అది గుర్తుకు వచ్చి -
ఏం సహజీవనమో ఏమిటో... పిల్లలిద్దరినీ చెరో పక్కన వేసుకున్న సునీతతో రాత్రుళ్ళు 'సహజీవనం' సాగించడం కుదరదు కదా అనుకున్నాడు శరత్.
ననన
నగరం అంతా ఎన్నికల వేడి రాజుకుంది. ఎంత చిన్నవి అయినా, దేశవ్యాప్తమైనవైనా, అభ్యర్థులకు 'జమాఖర్చు'ల లెక్కలు, యాతనలూ తప్పవు.
ఈ విషయంలో ఆ కౌన్సిలరమ్మా ఏం తక్కువ తినలేదు. వర్షాకాలం రాకముందే చీమలు ఆహారాన్ని పోగేసుకున్నట్లు అభ్యర్థులు ఎన్నికలు అనగానే పోగేసే ప్రయత్నాలు చేస్తుంటారు. వరుసగా మూడోసారి గెలిచి 'హాట్రిక్' సాధించాలని కౌన్సిలరమ్మ గొప్ప పట్టుదలతో వుంది.
కాస్త అటూఇటుగా మూడు నాలుగు నెలల్లో మున్సిపల్ ఎన్నికలు ఖాయం అంటున్నారు. రాజకీయరంగ విశ్లేషకులు.
ఆ నాటి సాయంకాలం కౌన్సిలరమ్మ 'బాడా'కు వస్తోందని, అందరూ ఆమె వచ్చేసమయానికి 'నూతిగద్దె' మీద సమావేశమై వుండి తీరాలన్న ఆదేశాన్ని ప్రకాశ్ మోసుకొచ్చాడు.
'దున్నేవాడిదే భూమి' అన్న నినాదాన్ని పేర్కొంటూ వాళ్ళు 'ఉండేవాడిదే బాడా' అన్న నినాదం సృష్టించి ఆనాటి సాయంత్రం కౌన్సిలరమ్మ ముందుంచారు.
తనను గెలిపిస్తే ఆ నినాదం తప్పకుండా సాకారమవుతుందని ఆమె భరోసా ఇచ్చింది.
అందుకు జవాబుగా ఆ బాడాజనాలు ఎలక్షన్లకు ముందే పని సానుకూలం కావాలని, అలా జరిగిన పక్షంలో వయోజనులందరూ ఆమెవెంట వుండి జండాలు పట్టుకుని ఆమె వెంటే తిరుగుతామని వాగ్దానం చేశారు. సానుకూలం కాలేదూ - ఫలాన పార్టీ మమ్మల్ని ఆదుకునేందుకు సంసిద్ధంగా వుందని చెప్పారు.
ఆవిడ సరేనంది. అందుకు సిద్ధమయ్యే వచ్చినట్లుంది. వెంటనే తయారుచేసి వుంచుకున్న 'బ్లూ ప్రింటు' వాళ్ళముందు పరిచింది.
కౌన్సిలరమ్మ ప్లాను ప్రకారం బాడాను కూల్చేసి, మూడు అంతస్థుల కాంప్లెక్సు లేపుతుంది. ఒక్కో ఫ్లోరులో ఆరు ఫ్లాట్ల చొప్పున పద్దెనిమిది... లేదూ - కనీస పక్షాన పన్నెండు ఫ్లాట్లు వస్తాయి. ఇప్పుడు వుంటున్న ఎనిమిది కుటుంబాలకు ఒక్కో ఫ్లాట్ 'అలాట్' చేస్తుంది. మిగతా ఫ్లాట్లను కౌన్సిలరమ్మ ఏం చేసుకున్నా 'బాడా' వాసులకు ఎట్టి అభ్యంతరం వుండకూడదు. వాళ్ళకు భూమి, అంటే 'అన్ డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్' ఉచితంగా వస్తున్నది. కనుక వారి వారి ఫ్లాట్ల నిర్మాణానికి అయ్యే ఖర్చు వారు భరించాలి.
కౌన్సిలరమ్మ చూపిన ప్లాను ప్రకారం బాడాలో ఇదివరకున్న నిర్మాణాలు, ఖాళీస్థలం మొత్తం మేరా ఫ్లాట్లు కట్టబడతాయి. అంటే ఇప్పుడున్న చెట్టూ చేమా సమూలంగా నరికి వేయబడతాయి. కాకులు, కొంగలు, పక్షులు, పావురాలు, కోతులు అన్నీ తమ ఆవాసాల్ని కోల్పోతాయి.
అయితేనేం - ఆ కౌన్సిలరమ్మ చూపించిన ప్లాను అమలైతే - ఇప్పుడున్న ఇక్ష్వాకుల కాలం నాటి ఇళ్ళకు బదులుగా అధునాతన సౌకర్యాలు గల ఫ్లాట్లు వస్తాయి. సెరామిక్ టైల్స్, సిమెంటు గోడలు, రెండు బెడ్రూంలు, ఇంట్లోనే టాయిలెట్ వసతి, మార్బుల్ కిచెన్ ప్లాట్ఫాం, సింకూ, ప్లైవుడ్ షెల్ఫులు వుంటాయి. సునీత లాంటి గృహిణులు, మసాలాలు అవీ పొడి చేసుకోవటానికి, రుబ్బుకోవటానికి గ్రైండర్ సౌకర్యం వుంటుంది.
ఇదంతా ఊరిస్తూ ఊరిస్తూ కౌన్సిలరమ్మ చెబుతోంటే, శరత్, సునీత, ప్రకాశ్, అతని భార్య, రాఘవేంద్ర దంపతులు, కరీంనగర్ ముదిరాజ్ కుటుంబాలు ఊహాలోకాల్లో విహరిస్తున్నారు.
శరత్ సలహా మేరకు ఫ్లాట్లలోకి పావురాలు, దోమలు, ఈగలు, పిల్లులు, కోతులు అవీ రాకుండా ఫ్రైప్రూఫ్ షటర్లు, కిటికీలకు - బాల్కనీలకు ఇనుప గ్రిల్స్ బిగించాలన్న ఒప్పందం కుదిరింది.
ఏళ్ళ తరబడి ఆ బాడాలోని కుటుంబాల వారితో 'సహజీవనం' సాగిస్తోన్న జంతువులు, పక్షులు, పావురాలు, మరెన్నో వృక్షాలు ఏమయితేనేం - ఆ బాడా స్థానంలో కాంప్లెక్సు నిర్మాణం పనులు చకచకా సాగిపోతున్నాయి.
శరత్ పెద్దబ్బాయి, సాంఘికశాస్త్రం పుస్తకంలోని పాఠం 'పర్యావరణ పరిరక్షణ'లో చెప్పినట్లు పర్యావరణ పరిరక్షణకై అందరూ పాటు పడుతూనే వున్నారు.
- కూర చిదంబరం
రచయిత సెల్ : 8639338675