Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వృత్తినే ప్రపంచంగా భావించి ఆఫీసు నాలుగు గోడలకే పరిమితమై యంత్రాలుగా మారిపోతున్న మనుషుల జీవితాలు ఎలా ఉంటాయో కళ్ళకు కట్టినట్టు చూపించిన హిందీ చిత్రం 'భువన్ షోమే'. ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో తలమునకలై క్షణం కూడా కుటుంబానికి సమయం కేటాయించని వాళ్ళకు కనువిప్పు కలిగేలా ఉన్న ఈ చిత్రం ఆద్యంతం భావోద్వేగ భరితంగా సాగుతుంది. ప్రతి మనిషికి వృత్తితోపాటు కుటుంబం ముఖ్యమని, అలాగే ప్రకృతిని ఆస్వాదించడమూ మరెంతో ముఖ్యమని తెలియజేసిన ఈ చిత్రం మోడరన్ ఇండియన్ సినిమాకి ల్యాండ్ మార్క్ సినిమాగా అటు ప్రేక్షకుల్ని, ఇటు విమర్శకుల్ని సైతం మెప్పించింది. 17వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లోనూ జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డుని దక్కించుకుంది.
'భువన్ షోమే' చిత్రకథ..
దాదాపు ఆరు పదుల వయసుకు దగ్గరగా ఉన్న భువన్ షోమే (ఉత్పల్ దత్) భారతీయ రైల్వే శాఖలో ఓ పెద్ద హౌదాలో పని చేస్తున్న ఉద్యోగి. వృత్తే ఆయనకు జీవితం. ఆఫీసు నాలుగు గోడలే ఆయనకు ప్రపంచం. వృత్తి విషయంలో తన కింది స్థాయి ఉద్యోగులు ఎవరైన తప్పు చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించడు. లంచం తీసుకుంటే ఏకంగా ఉద్యోగంలో నుంచే పీకేస్తాడు. చాలా స్ట్రిక్ట్. దీంతో ఆయన్ని అందరూ ఓ పెద్ద పులితో పోలుస్తుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయనంటే అందరికీ హడల్. బెదిరిపోతారు. తప్పు చేయాలనే ఊహ కూడా రానంతగా భయపడుతుంటారు.
టిక్కెటు లేని ప్రయాణీకుల దగ్గర అనధికారికంగా డబ్బులు వసూలు చేస్తున్నాడనే ఆరోపణ ఓ రైల్వే టిక్కెట్ కలెక్టర్ మీద పడుతుంది. అతని మీద ప్రాధమికంగా చేసిన దర్యాప్తులో అది నిజమని రుజువు కూడా అవుతుంది. అతని మీద భువన్ షోమే ఎటువంటి చర్య తీసుకుంటాడనే చర్చ ఉద్యోగుల్లో విస్తృతంగా జరుగుతుంటుంది. పెద్ద పులి చేతుల్లో పడ్డాడు. కచ్చితంగా ఉద్యోగం పోవడం ఖాయమనే నిర్ణయానికి ఉద్యోగులందరితోపాటు ఆ టిక్కెట్టు కలెక్టర్ కూడా తన ఉద్యోగం మీద ఆశలు వదిలేసుకుంటాడు. నిరాశ నిస్పృహలతో ఉన్న ఆ టీసీకి కొంతమంది మిత్రులు ఉపశమనం కలిగించే మాటలు చెబుతారు. అలాగే భువన్ షోమే దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇటువంటి తప్పు చేయను. క్షమించమని అడిగితే తప్పకుండా నీ ఉద్యోగం నిలుస్తుందనే సలహా కూడా ఇస్తారు. సహౌద్యోగులు ఇచ్చిన సలహా మేరకు ఆ టీసీ భువన్ షోమేకు క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమవుతాడు.
భార్య చనిపోయిన దగ్గర్నుంచి భువన్షోమే ఒంటరిగా జీవిస్తున్నాడు. భువన్ షోమేకి ఓ కొడుకు కూడా ఉంటాడు. అయితే తన తండ్రి ఆలోచనా తీరు, పద్ధతులు నచ్చక ఆ కొడుకు దూరంగా ఉంటాడు. దీంతో భువన్ షోమేకి ఆఫీసే ఓ పెద్ద ప్రపంచమవుతుంది. క్షణం తీరిక లేకుండా పని చేస్తుంటాడు. తన దగ్గరికొచ్చిన ఏ ఫైల్నూ పెండింగ్లో పెట్టకుండా రేయింబవళ్ళూ ఆఫీస్లోనే గడుపుతుంటాడు. ఇన్నేండ్లుగా కొనసాగిస్తున్న జీవితం భువన్ షోమేకి ఓ రోజు ఎందుకో నచ్చలేదు. తానొక యంత్రంగా మారిపోయాననే భావనలో కూడా ఉంటాడు. ఆఫీస్కి సెలవు పెట్టి వేటకెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. అనుకుందే తడవుగా లీవ్ లెటర్ కూడా అప్లై చేస్తాడు. ఇన్నేండ్లుగా సెలవు అడగని భువన్ షోమేకి వెంటనే లీవ్ దొరుకుతుంది.
భువన్ షోమే అడవికి వెళ్ళి పక్షుల్ని వేటాడాలనుకుంటాడు. ఎలా వేటాడాలో కొన్ని పుస్తకాల్ని చదివి తెలుసుకుంటాడు. అలాగే వేటకు కావాల్సిన ఏర్పాట్లను చేసుకుంటాడు. అడవికి వెళ్ళే మార్గంలో ఉన్న ఓ గ్రామంలోని వ్యక్తితో ఎద్దుల బండిని మాట్లాడుకుంటాడు. వేటగాడి వేషధారణలో ఉన్న భువన్ షోమేని చూసి ఆ ఎద్దులబండి అతను నవ్వుకుంటాడు. పైగా పులుల్ని కాకుండా పక్షుల్ని వేటాడటం కోసం వెళ్తున్నాడని తెలిసి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతాడు. అలా అతను నవ్వడాన్ని ఇన్నేండ్ల భువన్ షోమే యాంత్రిక జీవితాన్ని ప్రశ్నిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అడవికి వెళ్ళే దారిలో పెద్ద పెద్ద కొమ్ములతో ఉన్న ఎద్దు ఒకటి ఎదురుగా రావడంతో ఎద్దుల బండి అతను బెదిరిపోతాడు. అంతేకాదు బండిలో నుంచి దూకేసి పారిపోతాడు. అతనిలాగానే భువన్ షోమే కూడా పరిగెత్తుతాడు. ఈ క్రమంలో ఆ ఎద్దు భువన్ షోమేని తరుముతూ వస్తుంటుంది. దాన్నుంచి తప్పించుకోవడానికి భువన్షోమే తన శక్తినంతటినీ కూడ గట్టుకుని పరుగెత్తుతాడు. అలా చాలా దూరం పరుగెత్తి అలసిపోయి ఆగిపోతాడు. అలాగే ఆ ఎద్దు కూడా హఠుత్తుగా ఆగిపోవడాన్ని చూసి భువన్ షోమే ఆశ్చర్యపోతాడు. కేవలం ఓ అమ్మాయి (సుహాసిని ములారు) పిలుపుతో ఆ ఎద్దు ఆగిపోవడాన్ని చూసి నమ్మకలేకపోతాడు. ఇంతవరకు తరుముతూ వచ్చిన ఆ ఎద్దు మీదే ఆ అమ్మాయి కూర్చుని చక్కగా ఓ పాట పాడుకుంటూ వెళ్ళడాన్ని చూసి మతిపోతుంది.
భువన్షోమే అడవిలోని ఓ ప్రాంతానికి వెళ్ళి పక్షుల్ని వేటాడే ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఆ దగ్గర్లో ఉన్న గ్రామానికి చెందిన ఓ వ్యక్తి భువన్ షోమేని పలకరిస్తాడు. తన ఇంట్లో అతిథిగా ఉండమని ఆహ్వానిస్తాడు. అలాగే వేటకు సహాయం చేసేందుకు తన కూతురు గౌరీ కూడా సహాయకారిగా ఉంటుందని చెబుతాడు. అతని ఆహ్వానం మేరకు భువన్షోమే అతని ఇంటికి వెళ్తాడు. ఆ ఇల్లు ఎవరిదో కాదు ఇంతకముందు ఎద్దుపై కూర్చుని పాట పాడుకుంటూ వెళ్ళిన అమ్మాయి గౌరీ ఇల్లే. గౌరీ చాలా చలాకీ అమ్మాయి. గౌరీ మాటలు, చేతలు, అల్లరి ఇవన్నీ.. ఎంతో స్వచ్ఛంగా ఉండటాన్ని చూసి భువన్షోమే ముచ్చటపడతాడు.
పక్షుల్ని వేటాడాలంటే ఇలాంటి వేటగాళ్ళ డ్రస్తో వెళ్ళకూడదని తాము ఎలాంటి డ్రస్ వేసుకుంటున్నామో అలాంటి డ్రస్ వేసుకోవాలని చెప్పి మరీ భువన్షోమే వేసుకునేలా చేస్తుంది. ఇద్దరూ కలిసి వేటకు వెళ్తారు. వెళ్తున్న క్రమంలో గౌరీ తనపై చూపిస్తున్న ఆప్యాయత, అభిమానానికి భువనషోమే సంబరపడిపోతాడు. ఇద్దరూ కల్సి ఓ పెద్ద రాజభవనం పైకి వెళ్తారు. వీళ్ళు వెళ్ళిన మరుక్షణంలోనే ఎవరో తుపాకితో పక్షుల్ని వేటాడటంతో పక్షులన్ని ఎగిరిపోతాయి. దీంతో భువన్ షోమేని కొద్ది దూరంలో ఉన్న ఎడారికి గౌరీ తీసుకెళ్తుంది. ఆ ఏడారిలో ఉన్న ఓ పెద్ద సరస్సులో రకరకాల పక్షులు ఉండటాన్ని చూసి భువన్ షోమే ఎంతో ఆనందపడతాడు. తన చేతిలో ఉన్న తుపాకితో కాల్చబోతుంటే, పక్షులు ఏం చేశాయి?, వాటిని ఎందుకు మీరు చంపాలనుకుంటున్నారు?, అవి కూడా మనలాంటి ప్రాణులే కదా అని గౌరీ అడిగిన ప్రశ్నకు భువన్ షోమే సరైన సమాధానం చెప్పడు. అంతేకాదు తుపాకితో పక్షుల్ని కాల్చే ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయత్నంలో ఓ పక్షి నేల మీద పడుతుంది. ఆ పక్షి దగ్గరికి గౌరీ పరుగెత్తుకుంటూ వెళ్లి ఆసాంతం పరిశీస్తుంది. ఆ పక్షికి తుపాకి గుండు తగల్లేదు. ఆ తుపాకి గుండు మోతకి భయపడి ఆ పక్షి కింద పడిపోయిందనే విషయాన్ని భువన్ షోమేకి చెబుతుంది. అంతేకాదు ఆ పక్షిని తీసుకుని ఈ ఇద్దరూ ఇంటికి తిరిగి వస్తారు. ఈ క్రమంలో తాను చేసిన తప్పేంటో అర్థమై భువన్షోమే సిగ్గుతో తలదించుకుంటాడు.
ఆ గ్రామం నుంచి పట్టణానికి తిరిగి వెళ్తున్న తరుణంలో గౌరీ భర్త టిక్కెట్ కలెక్టర్గా పని చేస్తున్నాడని, ప్రయాణీకుల దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడనే నెపంతో ఆ శాఖలో పని చేసే భువన్షోమే అనే ఆయన ఉద్యోగంలోనుంచి పీకేస్తాడనే విషయాన్ని గౌరీ మాటల్లో భువన్షోమే తెలుసుకుంటాడు. పైగా ఇకపై తన భర్త అలా చేయకుండా తాను జాగ్రత్త తీసుకుంటానని, మీరూ రైల్వే శాఖలోనే పని చేస్తున్నారు కాబట్టి కొంచెం ఆ భువన్ షోమే సార్కి తన భర్తని ఉద్యోగంలో నుంచి తీసేయవద్దని చెప్పండని గౌరీ అడగటాన్ని చూసి భువన్ షోమే కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. పైగా తానే భువన్ షోమే అని విషయం గౌరీకి తెలియకపోవడం ఆశ్చర్యం కలిగించినా ఆమె భర్త విషయంలో ఆచితూచి చర్య తీసుకోవాలనే ఆలోచన మాత్రం భువన్షోమేకి కలుగుతుంది.
మరుసటి రోజు ఆఫీస్కి భయం భయంగా వచ్చిన గౌరీ భర్తకు మళ్ళీ ఇటువంటి తప్పు చేస్తే క్షమించను. ఇకపై జాగ్రత్తగా ఉద్యోగం చేసుకో అని భువన్ షోమే హెచ్చరించి పంపిస్తాడు. తనకొక సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేసిన గౌరీని తల్చుకుని ఎంతో సంబరపడిపోతూ ఎప్పుడూ యంత్రంగా పని చేసే మాదిరిగా కాకుండా ఎంతో ఆనందంతో భువన్ షోమే ఆఫీస్ పని చేస్తుండటంతో సినిమా ముగుస్తుంది.
- రెడ్డి హనుమంతరావు,
8332995426
ఉత్పల్ దత్, సుహాసిని ములాయ్ ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈచిత్రాన్ని బాలాయ్ చంద్ర ముఖ్యోపాధ్యాయ రాసిన కథ ఆధారంగా మృణాల్సేన్ తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు.
1969లో రూపొందిన ఈచిత్రానికి కె.కె.మహాజన్ అందించిన ఫొటోగ్రఫీ, విజరు రాఘవరావు సమకూర్చిన సంగీతం హైలైట్స్గా నిలవడం ఓ విశేషమైతే, ఈ చిత్రంతోనే బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ డబ్బింగ్ కెరీర్ ప్రారంభం అవడం మరో విశేషం. ఈ చిత్రానికి అమితాబ్ చెప్పిన వాయిస్ ఓవర్ ప్రేక్షకుల్ని విశేషంగా అలరించింది.
ఆద్యంతం హృద్యంగా తెరకెక్కిన ఈ చిత్రం సినీ విశ్లేషకుల ప్రశంసల్ని సొంతం చేసుకోవడంతోపాటు 17వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో జాతీయ ఉత్తమ చిత్రం, జాతీయ ఉత్తమ దర్శకుడు (మృణాల్ సేన్), జాతీయ ఉత్తమ నటుడు (ఉత్పల్ దత్) వంటి విభాగాల్లోనూ అవార్డులను కైవసం చేసుకుంది.