Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పుస్తక పఠనం విలువ తెలిసిన వారు ఆ అభ్యాసాన్ని ఏనాటికీ వదిలిపెట్టరు. చదవడం బద్దకంగా భావించేవారు జీవితంలో విలువైన మార్గదర్శకత్వాన్ని కోల్పోతారు. పలురకాల మానసిక, శారీరక ఒత్తిళ్ళకు పఠనం ఉపశమనాన్ని ఇస్తుందని పెద్ద పెద్ద కంపెనీల నిర్వాహకులు చెబుతుంటారు. పఠనాసక్తి పెంపొందించడమంటే మనిషిని సంపూర్ణ మానవశక్తిగా మార్చివేయడమే. దానిని జీవితాదర్శంగా, ఉద్యమ స్థాయిలో కొనసాగించిన వాడు పోలన్ సర్కార్. తన రెండు కాళ్ళను నమ్ముకుని మైళ్ళదూరాన్ని దాటుకుంటూ ఇంటింటా పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయడమే తన దినచర్యగా మలచుకున్నాడాయన. సుమారు 30 ఏళ్ళపాటు ఇదే పనిగా సాగిన ఆ గుండె శ్వాస ఈ మార్చి ఒకటిన ఆగిపోయింది.
బంగ్లాదేశ్కు చెందిన పోలన్ సర్కార్ రాజ్షాహి జిల్లాలోని ఓ కుగ్రామంలో 1921లో జన్మించాడు. ఐదేళ్ళ వయసులో తండ్రి కోల్పోవడంతో మేనమామ ఇంట్లో గడుపుతూ ఆర్థిక ఇబ్బందులతో ఆరవ తరగతి వద్దనే చదువు మానేశాడు. జాతర అనే నాటక కంపెనీలో చేరి హాస్య పాత్రలతో ప్రేక్షకులను నవ్వించేవాడు. నాటకానికి సంబంధించిన జానపద గీతాలు, సంభాషణలు నేర్వక తప్పని స్థితిలో వాటిపై శ్రద్ధ పెంచుకుని బంగ్లా భాషపై పట్టు సాధించాడు. ఆ క్రమంలో చదవడం ఇష్టంగా మారి దొరికిన పుస్తకాన్నల్లా చదివాడు. బంగ్లా భాష, సాహిత్యంపై అభిమానం పెరిగి వాటి ఔన్నత్యం అందరికీ చేరాలనే సంకల్పంతో తన వద్ద వున్న పుస్తకాలను ఉచితంగా పంచిపెట్టడం మొదలుపెట్టాడు. కొద్దిరోజుల తర్వాత వాటిని తిరిగి తీసుకుని కొత్త పుస్తకాలను అందజేసేవాడు. ఇలా జీవితం సాగిస్తూ దస్తావేజు లేఖిగా పనిచేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకున్నాడు. విద్యార్థులపై మక్కువతో తన ఊర్లో తన సొంత స్థలంలో పాఠశాలను కట్టించి గ్రామంలో విద్యను ప్రోత్సహించాడు. చదువులో ముందున్న విద్యార్థులకు ప్రోత్సహక బహుమతులుగా పుస్తకాలను పంచేవాడు.
తన 65వ సంవత్సరం మధుమేహ పీడితుడు కావడంతో వైద్యుడు పోలన్ను రోజూ నడక కొనసాగించాలని సలహా ఇచ్చాడు. ఇదే అదనుగా పాలన్ భుజాన పుస్తకాల సంచి వేసుకుని గ్రామాలు తిరగడం ఆరంభించాడు. తొలికోడి కూయగానే గ్రామంలో అడుగు పెట్టి ఇల్లిల్లూ తలుపు తడుతూ తన వద్ద నున్న పుస్తకాల్లోంచి ఒకటి ఎంపిక చేసుకొమ్మని కోరేవాడు. ప్రత్యేకంగా విద్యార్థులు, గృహిణులను తన లక్ష్యంగా చేసుకునే వాడు. పుస్తకాలు అయిపోయాక ఇంటిదారి పట్టి మరో పుస్తకాల మోతతో మరో గ్రామాన్ని సందర్శించేవాడు.
గత 30 ఏళ్ళుగా ఇదే జీవనం. నడిచే గ్రంథాలయంగా ప్రజలకు దగ్గరయ్యాడు. అలోర్ ఫెర్రీవాలా (వెలుగు పంపిణీదారు)గా జనం ప్రేమతో పిలుచుకున్నారు. 2008లో తన సొంత ఇంటినే లైబ్రరీగా మార్చివేశాడు. రాజ్షాహీలోని సుమారు 20 గ్రామాలు పోలన్ వల్ల పుస్తక పఠన ప్రయోజనాన్ని, ఆసక్తిని పెంపొందించు కున్నాయి. పోలన్ వల్ల ప్రభావితుడైన అబ్దుల్ రహీమ్ అనే కిరాణా దుకాణందారు రోజూ సాయంత్రం తన కొట్టులో పుస్తక పఠన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు.
2011లో బంగ్లాదేశ్లోని జాతీయ స్థాయి పురస్కారం అయిన 'ఏకుషే పదక్' ఆయన కృషికి గుర్తుగా లభించింది. 'ఏకుషేపదక్' అనగా ఇరవై ఒకటవ పురస్కారం. బంగ్లాభాషకు అధికార హోదా కోసం అక్కడి విద్యార్థులు ఉద్యమించగా 21-2-1952 నాడు పాకిస్థాన్ పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. ఆ ఉద్యమ గుర్తుగా 21వ తేదీని బంగ్లాదేశ్ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించి ఆ అవార్డును ప్రవేశపెట్టింది.
98 ఏళ్ళ వయసులో కూడా ఐదు రోజుల క్రితం ఆయన్ని పుస్తకాల సంచితో రోడ్డుపై చూశామని గ్రామస్థులు అంటున్నారు. తను నిర్మించిన గ్రంథాలయం పక్కనే ఆయనను ఖననం చేసి ఆయన మృతికి అభిమానులు శ్రద్దాంజలి ఘటించారు.
2016లో ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ పోలన్ సర్కార్ 'తనలో శక్తి ఉన్నంత కాలం నడుస్తూ పుస్తకాలు పంపిణీ చేస్తూనే వుంటాను. నా తర్వాత నా గ్రంథాలయం నా ఆశయాన్ని కొనసాగిస్తుంది' అని అన్నాడు.
పోలన్ జీవితం ఎంతో స్ఫూర్తిదాయకమైనది. పుస్తకం విలువను, పఠనం వల్ల కలుగు ప్రయోజనాలను దశాబ్దాలుగా అందిస్తూ వచ్చిన ఆయన ఆశయాన్ని అందిపుచ్చుకోవలసిందే.
- బి. నర్సన్,
9440128169