Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏదైనా చేయాలి, ఏదో ఒకటి చేసి చూపించాలి అని అందరూ అనుకుంటారు. కానీ అనుకున్న దాన్ని ఆచరణలో పెట్టడం కొంతమందే చేయగలుగుతారు. అలాంటి వాళ్ళలో ఒకరు రాంభక్త పద్మావతి. సరదాగా ప్రారంభించిన టెర్రస్ గార్డెనింగ్ ఆమెకో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అలాగే అనుకోకుండా సాహిత్యంవైపు వేసిన అడుగులు ప్రారంభ దశలోనే అవార్డులను తెచ్చిపెడుతున్నాయి. అతి కొద్ది కాలంలోనే సాహిత్యరంగంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా, తను రాసే సాహిత్యానికి ఓ అర్థం, పరమార్థం వుండాలి అనుకుంటున్నారు ఆమె.
పద్మావతి గారి గురించి చెప్పాలంటే ఆమెలోని రెండు పార్శ్వాల గురించి మాట్లాడుకోవాలి. తన సమయాన్ని రెండు భాగాలుగా విభజించి కొంత సమయాన్ని గార్డెనింగ్కి, కొంత సమయాన్ని సాహిత్యానికి కేటాయిస్తున్నారు. ఆమె చదివింది ఎం.ఎ ఇంగ్లీష్, ఎంసిఎ, బిఈడీ. ఎక్కడా తెలుగు సబ్జెక్ట్ లేదు. అయినా తెలుగు కవిత్వం అవలీలగా రాసేస్తారు. పైగా ఆమె రచనల్లో పాఠకులకు ఏదో సందేశం అందించాలన్న తపన కనిపిస్తుంది. ఇదే విషయం అడిగితే... ''స్కూల్లో చదివే రోజుల నుండి మిగతావారికంటే భిన్నంగా ఆలోచించడం అలవాటయిపోయింది. పరిచయమున్న వారితో శుభ్రత గురించి, దాని వల్ల వచ్చే వుపయోగాలు చెప్తాను. కొంతమంది విని మారారు కూడా. నా ఆలోచనల్ని పంచుకోవడం ద్వారా అవతలి వాళ్లని కన్విన్స్ చేయగలను అన్న నమ్మకం వచ్చింది. అలాగే రచనల ద్వారా కూడా చెప్పాలనిపించింది'' అంటారామె.
రచనా ప్రస్థానం
మీ రచనలకు ప్రేరణ ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానంగా... సంతోషం, దు:ఖం, బాధ... ఇలా కదిలించే దృశ్యం, సంఘటన ఏదైనా వెంటనే దానికి అక్షరరూపం ఇస్తానన్నారు పద్మావతి. అలా రాసి పంపిన కవితలు పత్రికల్లో ప్రచురించినప్పుడు వచ్చిన ఉత్సాహంతో మరికొన్ని కవితలు రాశానన్నారు. రొటీన్గా వుండేవి కాకుండా కొంచెం భిన్నంగా రాయాలనే ఆలోచన వున్న పద్మావతి, సమాజంలో చైతన్యం వచ్చేలాగ రాయడమంటే ఇష్టపడుతున్నారు. ఆడ, మగ అనే బేధం లేకుండా సమానత్వం కోరుకుంటాననే ఆమె కవితల్లో స్త్రీవాదం ఎక్కువే కనిపిస్తుంది. పద్మావతి రాసిన వాటిల్లో 'అంతిమం, సేల్స్గాల్, నలుపుముఖం, గాయాల గురుతు, గాయాల చెట్టు, అమ్మ చెట్టు, జీవితం' లాంటి కవితలెన్నో వివిధ దిన, వార, మాస పత్రికల్లో ప్రచురితమయ్యాయి. శివారెడ్డి, ఆశారాజు కవిత్వాన్ని ఎక్కువగా ఇష్టపడతానంటున్నారు పద్మావతి. ఆమె రాసిన కథలు కూడా సామాజిక స్పృహ వున్నవే. అయితే కథల కంటే కూడా కవితలకే ప్రాధాన్యం ఎక్కువ అంటారు.
పద్మావతిగారు రచనా వ్యాసంగం మొదలు పెట్టి కేవలం సంవత్సరంన్నర కాలం మాత్రమే అయినా ఆమె ఖాతాలో బహుమతులు చాలానే వున్నాయి. ప్రపంచ కవితా దినోత్సవ పోటీల్లో ప్రథమ బహుమతి, గొట్టిపర్తి పురస్కారం, వీరాస్వామి భీమిలి అవార్డు, ఆంధ్రాపూణె సంఘం వారు నిర్వహించిన హాస్యకవితల పోటీలో ద్వితీయ బహుమతి, నందిని కుందుర్తి, ఎక్స్రే అవార్డు, విశాఖ సమాచారం వారి అవార్డు, కవిసంధ్య అవార్డు, విశాలాక్షి బహుమతులు కూడా వచ్చాయి. అనతి కాలంలోనే ఇన్ని అవార్డులు, రివార్డులు ఎలా సాధ్యం అనడిగితే... ''ఏమో తెలీదండీ, బహుశా... పర్యావరణం, సామాజిక స్పృహ మీద కవితలు రాస్తున్నాను కాబట్టి బహుమతులు వస్తున్నాయేమో'' అన్నారు నవ్వుతూ.
అతి భక్తి, కులం, మతం కూడా బలహీనతే అని నమ్మే పద్మావతి, వాటి నుండి బయటికి వచ్చి చేయాల్సిన మంచి పన్లు చాలా వున్నాయి అంటారు. పనికిరాని వాటితో టైం వేస్ట్ చేసుకోకుండా, ఇతరులకు సహాయం చేయడం లాంటి పనికొచ్చే మంచి పనులు చేస్తే బాగుంటుంది అంటారామె. అనడమే కాదు... విశాలాక్షి ఓల్డేజ్ హోమ్, బ్లైండ్ స్కూల్కి, పేద విద్యార్థులకి ఆర్థికంగా సహాయం చేశారు కూడా.
మొదటి నుండి ఇలాంటి కార్యక్రమాలే చేస్తుంటారా అంటే... కాదన్నారు పద్మావతి. పెళ్ళయ్యాక మొదట 12 సంవత్సరాలు ప్లే స్కూల్ నడిపానని, కుటుంబ అవసరాల రీత్యా ఆపేయాల్సి వచ్చిందన్నారు. కుటుంబ బాధ్యతలు పూర్తయి, కాస్త తీరిక సమయం దొరకడంతో టెర్రస్ గార్డెనింగ్, రచనా వ్యాసంగం ప్రారంభించానన్నారు. ఇవన్నీ చేయగలగడానికి కుటుంబ సభ్యుల సహకారం, ముఖ్యంగా భర్త ప్రోత్సాహం చాలా వుందన్నారు పద్మావతి.
గార్డెనింగ్ ఎలా మొదలయిందంటే...
ఐదారేళ్ళ క్రితం మూడంతస్తుల పాత ఇంటిని రెనోవేషన్ చేయించినప్పుడు సరదాగా ప్రారంభమయింది మొక్కల పెంపకం. ఇలా సరదాగా, కాలక్షేపానికి ప్రారంభించిన టెర్రస్ గార్డెనింగ్ పద్మావతికి, ఆమె ఇంటికి కూడా ఓ ప్రత్యేకతని తీసుకొచ్చింది. పూల మొక్కలు పెంచడంతో ఆగకుండా కాయగూరలు, ఆకుకూరలు, అరటి, జామ, మొక్కజొన్న లాంటి ఎన్నో మొక్కలు వంద రకాలకు పైగా ఆమె టెర్రస్ గార్డెన్లో కొలువుదీరాయి. ఆ మొక్కలను పెంపకంలో, చీడపీడల నివారణకు కూడా సేంద్రియ ఎరువులను మాత్రమే వాడుతున్నారు. ఇందుకోసం పేడ, గోమూత్రం, వేప నూనె, వేపపిండిని ఉపయోగిస్తున్నారు. నాలుగైదేండ్లుగా అతిథులు వచ్చిన ప్రత్యేక సందర్భాలలో తప్పితే కాయగూరలు కొనే పరిస్థితి రాలేదంటేనే అర్థమవుతోంది ఆమె ఏ స్థాయిలో మొక్కల పెంపకం సాగిస్తున్నారో! మొక్కల పెంపకంతో ఆమె ఆగిపోలేదు, ఇంటికి అవసరమైన విద్యుత్ కోసం సోలార్ సిస్టమ్ను ఏర్పరచుకున్నారు.
ఒక వైపు పర్యావరణ పరిరక్షణ, మరో వైపు సాహిత్య వ్యాసంగంతో పద్మావతి తనకంటూ ఓ ప్రత్యేకతని చాటుకుంటున్నారు. ఏదైనా సృజనాత్మకతని కనబరచడం ఆమె జీవనతత్వం.
- బి.మల్లేశ్వరి