Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విప్లవ పోరాటోద్యమంతో మమేకమైన జీవితం
జీవితం, రచన : కరుణ,
పేజీలు : 328, వెల : 250/-,
ప్రతులకు : కరుణ, 9010201880
ఈ కథాసంపుటిని రచయిత్రి తన మాతృమూర్తి తాయమ్మకు, ఉద్యమంలో నేలకొరిగిన అమరులకు అంకితం చేశారు. తాయమ్మ కరుణ, మంజీర అంటూ ఎంతో విలువైన విప్లవోద్యమ జీవితాల్ని అద్దం పట్టే చక్కటి ముందు మాట అల్లం రాజయ్య రాశారు. ఎరుక అంటూ వి.వి (వరవరరావు), అలాగే కె. విమల, ఎ.కె.ప్రభాకర్, తమ్మేటి రఘోత్తమరెడ్డి, కె.శివారెడ్డి గారలు తమ తమ అభిప్రాయాలను రాశారు.
దుర్మార్గపు, భూస్వామ్య పెట్టుబడి దారీ సమాజంలో ఒక స్త్రీ పడ్డ కష్టాలు, వేదన, కుటుంబ హింస, సామాజిక హింస ఎదుర్కొని పిల్లల్ని పెంచిన సామాజిక పోరాట యోధురాలిగా తాయమ్మ జీవితాన్ని పెద్ద కథలో (మినీ నవలలా) కరుణామయంగా రాశారు రచయిత్రి. 'కవులమ్మ ఆడిదేనా' (పేజీ.218) కథ ముగింపులో కవులమ్మ తెగింపు, భర్తను, కొడుకుల్ని వదలి బైటకు రావడం చక్కటి ముగింపు. విప్లవోద్యమంలో స్త్రీ - పురుష సంబంధాల గురించి ముఖ్యంగా భార్యాభర్తల అనుబంధం లాంటి అంశాల్ని చాలా సున్నితంగా చర్చించిన కథలు 'సహచరులు - పిల్లలు'.
సుమ (అమ్ములు) ప్రదీప్ల బంధం, పార్టీ కమిట్మెంట్, పిల్లలు వద్దు అనుకునే చైతన్యం చాలా గొప్పగా వుంది. రహస్యజీవితం గడిపే విప్లవకార్ల స్థితిగతులకు అద్దం పట్టే కథలున్నాయి. భర్త శరత్ను రక్త పింజెర కాటు వేయడం, అతనికి వైద్యం అందించి బతికించుకొన్న విమల పాత్ర అద్భుతంగా మలచారు రచయిత్రి 'మహిళలు ధైర్యంగా నిలబడగలరా?' (పేజీ.289) అనే కథలో. కాని శరత్ బూటకపు ఎన్కౌంటర్ కావడంతో కథ విషాదంగా ముగుస్తుంది.
'రేపటి గెరిల్లాలు' కథ చిన్నదే అయినా... రేపటి తరానికి గొప్ప సందేశం ఇస్తుంది. గుంటూరు జిల్లాలో రెండు దళాలను కాపాడిన సాగర్ (కోటయ్య) కృష్ణల త్యాగపూరిత జీవితాల్ని చెప్పే కథే 'మీ చరిత్ర చెబుతాం' (పేజీ 304). కథలు రాయాలంటే మనసు, శరీరాన్ని ఒక సరళ రేఖపై వుంచాలి అని చెప్పే చిన్న కథ 'కథ రాయాలి'.
విప్లవోద్యమంలో ముఖ్యంగా అజ్ఞాత జీవితం, ఆశయాల కోసం అంకితమైన మహిళల స్థితి... మైదాన ఆదివాసీ, ప్రజల గాథలే వస్తువులుగా తీసుకుని రాసిన కరుణ కలం చైతన్య స్రవంతికి దర్పణం. కొన్ని కథలు డాక్యుమెంటరీ చిత్రంలా అనిపిస్తాయి. ప్రజా విముక్తి కోసం గెరిల్లా పోరాటం చేసే విప్లవకారుల వాస్తవ 'జీవితం' తెలుసుకోవాలంటే ఈ కథలు తప్పక చదవాలి.
- తంగిరాల చక్రవర్తి,
9393804472
విరజిమ్మిన గజల్ కిరణాలు
గజల్ కిరణాలు, రచన : గద్వాల కిరణ్కుమారి, పేజీలు : 120, వెల : 130/-, ప్రతులకు : రచయిత్రి, 14-113, శ్రీ తరుణి నివాస్, కోదండరామ్ నగర్, 202, దిల్సుఖ్నగర్, హైదరాబాద్- 60
గద్వాల కిరణ్కుమారి తొలి నుండి గజల్ అంటే ఇష్టపడుతుండేదని చెప్పి, ఆ గీతలపై విశేష పరిశోధన చేశారు. ప్రస్తుతం కిరణ్కుమారి తన గజల్ గీతాల్లో బాల్యం, అమ్మ, నాన్న, ఊరు, తెలంగాణ, కొన్ని సామాజిక సమస్యలను ఉటంకిస్తూ రాశారు. 'మనిషిలోని మమతలకు చిరునామాలే గజల్ అంటూ మానవతా రచయిత్రిగా కూడా కనిపిస్తారు. మనసును ఊరడించు చెలి తలపులే గజల్! తాజ్ను మరిపించే ప్రేమ సాధనమే గజల్ అని గజల్లో వున్న మాధుర్యాన్ని చవి చూపిస్తారు. 'రొట్టెలు మూడుంటే, తినేవాళ్ళు నల్గురైతే/ ఆకలి లేదంటుంది ప్రాణమిచ్చే అమ్మ' అంటూ అంతులేని వాత్సల్యం, ప్రేమలు కురిపించే అమ్మను గూర్చి గొప్పగా చెప్పారు. కిరణ్కుమారి ఇందులో రుబాయిలను కూడా రాశారు. గజల్, రుబాయి ఏది రాసినా రచయిత్రి విలువలకు, ఆదర్శాలకు పట్టం కట్టారు.
- కె.హరనాథ్,
9703542598
పిల్లల పుస్తకం(బాలల నవల)
పి.చంద్రశేఖర అజాద్
పేజీలు : 80, వెల : 70/-
ప్రతులకు : పి.చంద్రశేఖర అజాద్, ఫ్లాట్నె:909, సఫైర్ బ్లాక్, మై హోమ్ జెవెల్, మదీనాగూడ, మియాపూర్,
హైదరాబాద్-49. సెల్ : 9246573575
చింతన
రచన : కమలేకర్ డాగోజిరావు
పేజీలు : 24, వెల : 20/-
ప్రతులకు : రచయిత, లక్ష్మీనిలయం, ఇ.నెం: 4-80, రోడ్నెం:6, భగీరథ కాలనీ, మహబూబ్నగర్ - 509001. సెల్ : 8185032426