Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్రిటిష్ వారి రాకతో కళారంగంలో ఆధునిక యుగం మొదలు అయిన సందర్భాన కళా ప్రపంచంలో రవీంద్రనాథ్ టాగూర్ వంటివారి కుటుంబాల నుండి ఎంతోమంది పురుష కళాకారులు తలెత్తారు. అందులో అవనీంద్రనాధ్ టాగూర్, గగనీంద్రనాథ్ టాగూర్ వంటి గొప్ప కళాకారుల పేర్లు గుర్తుకొస్తాయి. మరి ఆ రోజుల్లో స్త్రీ కళాకారులు ఎవరూ లేరా? అంటే, ఉన్నారనే జవాబు చెప్పుకోవచ్చు. ఎవరో కాదు స్వయానా టాగూర్ కుటుంబంలోనే ఉన్నదొక ఆర్టిస్టు. ఆమె పేరు సునైనీదేవి. రవీంద్రనాథ్ టాగూర్ మేనకోడలామె. పైన చెస్పుకున్న ఆర్టిస్టులు స్వయంగా ఆమె అన్నలే. వీరి ప్రభావంతో కుంచె పట్టిన సునైనీదేవి ఎన్నో చిత్రాలు వేసింది. స్టెల్లా క్రెమరీష్ వంటి చరిత్రకారిణికూడా ఆమె గురించి రాసింది. కానీ మన దేశంలో ఆమెకు రావలసినంతపేరు రాలేదు.
అన్నగారైన అవనీంద్రనాథ్ టాగూర్ వాష్ టెక్నిక్ని ఉపయోగించి వేసే చిత్రాలు, ఆమెకు ఎంతో ఇష్టం. అన్నలిద్దరి పద్ధతిని గమనించి బ్రష్, పెయింట్ చేబూనింది. కానీ ఆమె చిత్రకళలో ప్రవేశించి చిత్రాలు వేసింది వివాహమైనాకనే. ఆమె భర్త రాజాని మోహన్ చటోపాధ్యాయ. ఈయన రాజా రామ్మోహన్ రారు మనవడు. తన భర్త ప్రోత్సాహంతో 30 సంవత్సరాల వయసులో చిత్రం వేయడం మొదలు పెట్టింది. అన్న గారి వద్ద చూసిన వాష్ టెక్నిక్లో చిత్రాలు వేసేది. ఈ టెక్నిక్లో ముందుగా బ్రష్తో పేపర్ మీద నలుపు, ఎరుపు రంగులతో మందపాటి గీతల్లో బొమ్మకు ఔట్లైన్ వేసి అందులో ఇష్టమైన రంగులు నింపుతారు. ఆపై ఆ కాగితాన్ని నీటి తొట్టెలో ముంచి కొద్ది సేపు వుంచితే, కాగితం తడిసి అవసరమైన రంగును పీల్చుకుంటుంది. కొన్ని రంగుల పొడలు ఒక దానితో ఒకటి కలుస్తాయి. మిగిలిన రంగులు నీటిలోకి కారిపోతాయి. అప్పుడు బొమ్మపై సున్నిత రంగుల చిత్రం కానవస్తుంది. దానిపై ఎక్కడ ఎక్కువ రంగుల సాంధ్రత చూపాలంటే ఆ రంగులు, గీతలు వేస్తే అందమైన, నాజూకు రంగుల చిత్రం తయారవుతుంది. ఇది జపాన్ వారి టెక్నిక్. బెంగాలీ కళాకారులు నేర్చుకున్నారు. ఈమె ఇదే పద్ధతిన చిత్రం వేసేది. ఆమె పురాణ, ఇతిహాసాల పై, స్త్రీ దైనందిన జీవితంపై చిత్రాలు వేసేది. బెంగాల్ వారి మట్టి బొమ్మలు, కాలిఘాట్ చిత్రాల ప్రభావం ఆమె చిత్రంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఆమె చిత్రంలో అందమైన సరళత్వం, సాధారణత్వం తొంగి చూస్తాయి. తన చిత్రాల విలువ ఏంటి అనే ఆలోచన కాకుండా తనకు ఇష్టమైతే కాగితానికి వెనుకా, ముందూ కూడా వేసేది. ఆ విధంగా 15 సంవత్సరాలు వరుసగా వేసి, భర్త పోయాక కొంత కాలం మానేసింది. ఆపై మొదలుపెట్టి 1935 వరకు వేసింది.
1927లో లండన్లో ఉమెన్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్ క్లబ్ వారి వద్ద తన చిత్ర ప్రదర్శన చేసింది. ఒక చిత్రానికి ఆర్ట్ డిజైన్ చేసి ఇచ్చింది. 1935లో ఆఖరి ప్రదర్శన ఇచ్చింది. దేశంలోని ముఖ్య మ్యూజియంలన్నింటిలో ఈమె చిత్రాలు ఉన్నాయి. చిన్న తనాన రవివర్మ చిత్రాలు చూసి ఆనందించిన ఈమెకు రావలసినంత పేరు రాలేదు. బహుశ ఇందుకు కారణం ఆ కాలంలో స్త్రీలపై సమాజానికి ఉన్న చిన్నచూపేనేమో. స్వయం కృషితో ఆర్టిస్టుగా ఎదిగిన సునైనీదేవి1875లో జన్మించి, 1962లో కన్ను మూసింది.
- డా|| ఎం.బాలామణి,
8106713356