Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభుత్వాలు ఎన్ని మారిపోతున్నా నిరుద్యోగ యువతకు మాత్రం ఉద్యోగాలు లభించడం లేదు. ఎన్నికల ముందు అన్ని లక్షల ఉద్యోగాలిస్తాం.. ఇన్ని లక్షల ఉద్యోగాలిస్తాం అంటూ ఊదరగొడుతున్న రాజకీయ నాయకుల వాగ్దానాల్లో నిరుద్యోగ యువత తమ అందమైన ఉద్యోగ జీవితాన్ని ఊహించుకుని మోసపోతుందనే విషయాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించిన బెంగాలీ చిత్రం 'కోరస్'. నాటి నుంచి నేటి వరకు మన దేశంలో నిరుద్యోగ యువత శాతం పెరుగుతూనే ఉంది. ఒక్క ప్రభుత్వ ఉద్యోగానికి లక్షల సంఖ్యలో పోటీ పడుతున్న వైనాన్ని, పాలకుల చేతిలో దగా పడి దుర్భర జీవితాల్ని గడుపుతున్న నిరుద్యోగ యువత మానసిక వేదనకి తెరరూపంగా నిలిచిన ఈ చిత్రం 22వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డుని కైవసం చేసుకుంది.
'కోరస్' చిత్ర కథ..
ఓ రాజుని పొగుడుతూ ఒక కవి పాట పాడుతూ ఉండటంతో ఈ సినిమా మొదలవుతుంది. పాట అనంతరం తన కొలువులో ఉన్న మంత్రివర్గాన్ని ఉద్దేశిస్తూ రాజు, 'ఓ మేధావుల్లారా మన దేశంలో కోరికలే లేని మనుషులున్న ప్రాంతం ఏదైనా ఉందా? ఎందుకంటే మేము చాలా కాలంగా నిద్రపోతున్నాం కదా' అని ప్రశ్నిస్తాడు. 'ప్రభూ.. ప్రజల్లో తరచూ కోరికలనేవి కలుగుతూ ఉంటాయి. ఒకవేళ లేకపోయినా కోరికలు కోరడానికి తగిన క్లిష్టమైన వాతావరణాన్ని కల్పించాలి. వాళ్ళ అవసరాలకు ఎప్పుడూ లోటన్నది ఉంటూనే ఉండాలి. లేకపోతే వాళ్ళకు మీరన్నా, దేవుడన్నా భక్తి ఎలా ఉంటుంది చెప్పండి. మనం కల్పించిన మతమ్మీద, కర్మ సిద్ధాంతం మీద నమ్మకం ఎలా ఏర్పడుతుంది చెప్పండి?' అంటూ మంత్రివర్గం ఇచ్చిన సమాధానం రాజుకి సబబుగానే తోస్తుంది. అంతేకాదు వాళ్ళు చెప్పినట్టు ప్రజల్లో అవసరాలనేవి ఎప్పటికీ ఉండి తీరాలనుకుంటాడు.
రాజుల్లాంటి దేవుళ్ళు, దేవుళ్ళుగా చెలామణి అయిన రాజులు ఎప్పట్నుంచో భూమి మీద అవతరిస్తూనే ఉన్నారు. కానీ వారి వేషధారణ మాత్రమే మారిపోతోంది. ప్రజల్లో కోరికలు, అవసరాలను సృష్టించిన నాటి మహారాజులు నేడు కోటూ సూట్లతో అవతరించారు. పెద్ద పెద్ద కోటల్లాంటి కార్యాలయాల్లో వాళ్ళ సుఖభోగాలకేమీ తక్కువ ఉండదు. కోటల బయటి ప్రపంచంతో వాళ్ళకి అస్సలు అక్కర్లేదు. నాటి పరిస్థితులను నేటి పరిస్థితులకు అన్వయిస్తూ అప్పటి రాజును ఇప్పుడు చైర్మన్గా చూపిస్తూ ఉద్యోగాలను సమకూర్చే ఓ ప్రభుత్వ కార్యాలయం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది.
'మనకి వచ్చిన సమాచారం మేరకు కనీసం 100 ఉద్యోగ ఖాళీలున్నాయి. వీటిని భర్తీ చేయాల్సిన అవసరం ఉంది' అని ఆఫీస్లో ఏర్పాటు చేసిన మీటింగ్లో సహోద్యుగులు చైర్మన్ (ఉత్పల్దత్) దృష్టికి తీసుకొస్తారు. వారి ప్రతిపాదన విని, ఖాళీలున్నాయని వెంటనే మనం ఉద్యోగాలిచ్చినంత మాత్రాన మళ్ళీ ఖాళీలు రాకుండా ఉంటాయా? మీరు చెప్పిన 100 ఖాళీలను ఇప్పట్లో భర్తీ చేసే ప్రసక్తే లేదని చైర్మన్ ఇచ్చిన సమాధానంతో సహోద్యోగులు నివ్వెరపోతారు. సరైన పనులు దొరక్క పట్టణాల్లో ఉన్న అన్ని వయసుల వాళ్ళతోపాటు, గ్రామాల్లో ఉన్న వాళ్ళూ కూడా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటన కోసం ఎదురు చూస్తుంటారు. ఈ 100 ఉద్యోగ ఖాళీల గురించి సహోద్యోగులు పదే పదే చెప్పడంతో వాటిని భర్తీ చేసేందుకు చైర్మన్ అంగీకరించి వార్తపత్రికల్లో ప్రకటన ఇస్తాడు. ఫలానా సమయంలో ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు ఫారాలను అందజేయనున్నట్టు కూడా ఆ ప్రకటనలో పేర్కొంటాడు.
ఆ ప్రకటన చూసి దాదాపు 30 వేల మంది దరఖాస్తు ఫారాల కోసం కోల్కతాలో ఉన్న ప్రభుత్వ కార్యాలయానికి వస్తారు. కేవలం 100 ఉద్యోగాల కోసం 30 వేల మంది వస్తారని చైర్మన్తోపాటు మిగిలిన ఉద్యోగులు కూడా ఊహించలేదు. అన్ని వేల దరఖాస్తులు తమ దగ్గర లేవని, వీటి ముద్రణ కోసం మరి కొన్ని రోజులు సమయం పడుతుందని, మళ్ళీ దరఖాస్తులను ఇచ్చే తేదీని ప్రకటిస్తామని చెర్మైన్ ఇచ్చిన సూచన మేరకు సహోద్యోగులు మైకుల ద్వారా ఎనౌన్స్ చేస్తారు. ఆ ఎనౌన్స్మెంట్ విని కార్యాలయం బయట నిరీక్షిస్తున్న నిరుద్యోగులు నిరాశ, నిస్పృహలతో వెనుదిరుగుతారు.
అలా వెనుదిగిరి వెళ్తున్న వారిలో ఓ యువకుడు తానెంత కష్టపడి తన గ్రామం నుంచి కోల్కతాకి వచ్చాడో చెప్పడం ప్రారంభిస్తాడు. కోలకతాకి దూరంగా ఉన్న ఓ గ్రామంలో ఈ యువకుడు నివసిస్తుంటాడు. ఆ గ్రామంలో పంటలు సరిగా పండక తనతోపాటు చాలా మందికి సరైన పని దొరకదు. ప్రభుత్వ పథకాల ద్వారా అందాల్సిన ఎరువులు, విత్తనాలు, స్కూల్ అభివృద్ధి నిధులు వంటి వాటిని ఆ గ్రామపెద్ద మండల్చాచా దోచేస్తుంటాడు. పైగా వడ్డీ వ్యాపారం చేస్తూ అందరి దగ్గర అధిక వడ్డీలను వసూలు చేస్తుంటాడు. చదువుకున్నప్పటికీ ఊర్లో సరైన పని దొరక్క ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఉద్యోగ ప్రకటన పేపర్లో రావడం చూసి ఈ యువకుడు కొంత డబ్బుని అప్పుగా తీసుకుని కోలకతాకి వస్తాడు.
30 వేల దరఖాస్తులను ముద్రించినప్పటికీ 100 ఉద్యోగాల కోసం వచ్చే 30 వేలమందిని ఇంటర్వ్యూ చేయడం, అందులో 100 మందిని మాత్రమే ఎంపిక చేయడమనేది తలనొప్పితో కూడిన వ్యవహారమని, 30 వేల దరఖాస్తు ఫారాల ముద్రణ నిలిపివేయాలని చైర్మన్ ఆదేశిస్తాడు. అయితే ఈ విషయంపై మరోసారి ఆలోచిస్తే బాగుంటుందని సహోద్యోగులు ఇచ్చిన సలహా మేరకు చైర్మన్ చివరకు 30 వేల ఫారాలను ప్రింట్ చేయమని ఆర్డర్ జారీ చేస్తాడు. ముద్రణ పూర్తయిన తర్వాత ఫారాలు తీసుకోవడానికి కార్యాలయానికి రావాలంటూ మరోసారి ప్రకటన ఇస్తారు. ఈ ప్రకటన చాలా మంది నిరుద్యోగుల్లో ఉత్సాహం నింపుతుంది. ఫారాలను తీసుకునేందుకు మునుపటిలాగానే 30 వేల మంది వస్తారు. ఫారాల పంపిణీ జరుగుతున్నప్పుడు ఎటువంటి తోపులాట జరగకుండా పెద్దఎత్తున పోలీసు బలగాలను ఏర్పాటు చేస్తారు.
ఈ ఫారాలను తీసుకున్న వాళ్ళలో ఓ ఫ్యాక్టరీ కార్మికుడు కూడా ఉంటాడు. అతనెందుకు ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాడనే విషయాన్ని చెబుతాడు. ఫ్యాక్టరీలో ఉద్యోగుల అవసరం ఉన్నప్పటికీ యాజమాన్యం కొత్తవారిని పనిలోకి తీసుకోకుండా ఉన్న వారితోనే ఎక్కువ పని గంటలు పని చేయిస్తుంటుంది. ఇది అన్యాయమని ఉద్యోగ సంఘాలన్ని ఏకమై తమ నిరసనని వ్యక్తం చేసినా ఉపయోగం ఉండదు. పైగా తమకి ఎదురు తిరిగిన ఉద్యోగులను యాజమాన్యం పనిలోనుంచి తొలగిస్తుంది. అలా తొలగించిన వారిలో ఈ ప్యాక్టరీ కార్మికుడూ ఉన్నాడు.
ఈ ఫారాలను తీసుకున్న వారిలో భర్తని కోల్పోయిన ఓ మహిళ కూడా ఉంటుంది. తండ్రి చనిపోవడంతో కుటుంబ భారమంతా తల్లి మీద పడుతుంది. నాలుగు ఇళ్ళల్లో వంట వండుతూ తల్లి కష్టపడుతున్నప్పటికీ ఇల్లు సరిగా గడవదు. పైగా మూడు నెలల నుంచి అద్దె కట్టకపోవడంతో ఇంటి యాజమని త్వరలోనే ఇల్లు ఖాళీ చేయిస్తానని బెదిరిస్తాడు. ఈ పరిస్థితులు చక్క బడాలంటే తాను తప్పకుండా ఏదో ఒక ఉద్యోగం చేయాలనుకుంటుంది. అటువంటి సమయంలోనే ఈ ప్రభుత్వ ఉద్యోగ ప్రకటన రావడాన్ని చూసి తమ కష్టాలన్ని తీరినట్టేనని కలలు కంటుంది. ఎన్నో ఆశలతో ఫారాన్ని పూర్తి చేసి ప్రభుత్వ కార్యాలయానికి పంపటానికి ఏర్పాట్లు చేసుకుంటుంది. అయితే తన కూతురు చేసిన పొరపాటు వల్ల ఆ ఫారం మీద ఇంకు ఒలుకుతుంది. పాడైపోయిన ఫారాన్ని చూసి భోరున ఏడుస్తుంది.
గడువు ముగియడంతో 30 వేల దరఖాస్తులు కార్యాలయానికి వస్తాయి. వాటిని పరిశీలించి అభ్యర్థులను ఎప్పుడు ఇంటర్వ్యూకి పిలవాలనే చర్చను ముందుకు సాగనీయకుండా చైర్మన్ దాటవేస్తాడు. దీంతో ఇటు సహోద్యోగులకు, అటు అభ్యర్థులకు ఎప్పుడు ఇంటర్వ్యూలు జరుగుతాయో తెలియని అయోమయ స్థితి ఏర్పడుతుంది. రోజులు గడుస్తున్నా ఇంటర్వ్యూ తేదీని ప్రకటించకపోవడంతో అసహనం పెరిగి అభ్యర్థులు ఒక్కొక్కరిగా కోలకతాలోని కార్యాలయానికి వస్తుంటారు. 30 వేల మంది కార్యాలయం బయట నిరీక్షిస్తుంటారు. తక్షణమే ఇంటర్వ్యూ తేదీ ప్రకటించకపోతే అభ్యర్థుల అసహనానికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని సహోద్యోగులు చైర్మన్ని హెచ్చరిస్తారు. దీంతో చేసేది లేక ఫలానా రోజు ఇంటర్వ్యూలు ఉంటాయని మైకుల ద్వారా సహోద్యోగులు ఎనౌన్స్ చేయడంతో అభ్యర్థులందరూ ఊపిరి పీల్చుకుంటారు.
30 వేల మందిని ఇంటర్వ్యూ చేయడమంటే మాటలు కాదు. పైగా అందరూ దాదాపు అర్హత ఉన్నవాళ్ళే. ఇంత తల నొప్పిని మనం భరించేకంటే పోలీసు శాఖ చేసే ఎంక్వైరీలో మంచి రిపోర్ట్ వచ్చిన వాళ్ళనే ఉద్యోగాల్లోకి తీసుకుందామని చైర్మన్ చెప్పినదానికి ఎదురు చెప్పలేక సహోద్యోగులు మౌనంగా ఉంటారు. పోలీసు ఉన్నతాధికారిని పిలిచి చైర్మన్ పరిస్థితి వివరిస్తాడు. ఉద్యోగాల కోసం పోలీస్ ఎంక్వైరీ చేయడం సబబు కాదు. పైగా ఇందులో ఏదైన చిన్న పొరపాటు జరిగినా ఉద్రికత్తలు నెలకొంటాయని పోలీస్ ఉన్నతాధికారి చెప్పినప్పటికీ చైర్మన్ వినడు. దీంతో ఒక్కొక్క అభ్యర్థిని పోలీస్స్టేషన్కి పిలిపించి రకరకాల ప్రశ్నలతో ఎంక్వైరీ చేస్తుంటారు. ఉద్యోగాలు ఇవ్వకుండా అభ్యర్థులను పోలీస్ ఎంక్వైరీ పేరుతో పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతుందంటూ పేపర్లలో రకరకాల వార్తలొస్తాయి. ఆ వార్తలతో అభ్యర్థుల్లో ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. ఆ ఆవేశాన్ని అణచివేయటానికి కొన్ని సంఘ విద్రోహ శక్తులు కావాలనే అభ్యర్థుల్లో లేనిపోని అపోహల్ని సృష్టిస్తోందని చైర్మన్ విరుచుకుపడతాడు. అయితే అప్పటికే సహనం కోల్పోయిన అభ్యర్థులందరూ ఏకమై కార్యాలయం మీద దాడి చేసేందుకు చేసిన ప్రయత్నంలో విఫలమై పోలీసుల చేతుల్లో చాలామంది చనిపోతారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రాణాలను కోల్పోయిన నిరుద్యోగుల దయనీయ స్థితిని చూపిస్తూ సినిమా ముగుస్తుంది.
ఉత్పల్దత్, శేఖర్ ఛటర్జీ, గీతా సేన్, దిలీప్రాయ్, అజిత్ బెనర్జీ ముఖ్యపాత్రధారులుగా రూపొందిన 'కోరస్' చిత్రం 1974లో మృణాల్సేన్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ చిత్రానికి ఆనంద్ శంకర్ సమకూర్చిన సంగీతం, కె.కె.మహాజన్ కెమెరా పనితనం ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి.
నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వాలు ఆడుకుంటున్న తీరును వెండితెరపై చూపించిన విధానానికి అటు ప్రేక్షకులు, ఇటు విమర్శకులు సైతం ప్రశంసించడం ఓ విశేషమైతే, 22వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ఈ చిత్రం జాతీయ ఉత్తమ చిత్రం, ఉత్తమ సినిమాటోగ్రఫీ (కె.కె.మహాజన్), ఉత్తమ సంగీత దర్శకుడు (ఆనంద్ శంకర్) విభాగాల్లోనూ పురస్కారాలను దక్కించుకోవడం మరో విశేషం. అలాగే 9వ మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ చిత్రం ప్రదర్శితమై ఉత్తమ చిత్రంగా అవార్డులను కైవసం చేసుకుంది.
- రెడ్డి హనుమంతరావు,
8332995426