Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నైజీరియాలోని లాగూన్ జిల్లా మకోకో అట్లాంటిక్ మహాసముద్రం తీర ప్రాంతంలో వుంది. ఇక్కడి ఇండ్లన్నీ నీళ్ళల్లోనే వుంటాయి. కొన్ని ఇండ్లు మాత్రం నేలమీద కూడా వున్నాయి. ఏరియల్ వ్యూలో చూస్తే నేలమీద, నీటిమీద కలగలిసిపోయి వున్న ఇండ్ల సమూహం పెద్ద మహానగరాన్ని తలపిస్తూ కనిపిస్తుంది. నైజీరియాలో మకోకో పెద్ద పట్టణమే కాదు, వ్యాపార సంస్థలు కూడా ఎక్కువే. మొదట్లో రూరల్ ఏరియాలా వుండే ఆ ప్రాంతం ఇప్పుడు అర్బన్ సిటీ. కానీ అక్కడ నివసించేవారంతా పేదలే. అందులోనూ చేపలు పట్టేవారే ఎక్కువ.
ఇక్కడ ఊరు ఎప్పుడు, ఎలా తయారయిందో తెలియదు. వంద సంవత్సరాలకు ముందే.. (18వ శతాబ్దంలో అని కూడా అంటుంటారు) 19 వ శతాబ్దంతో బెనిన్ ప్రాంతం నుండి ఇక్కడికి చేపలు పట్టుకోడానికి కొందరు వలస వచ్చి చెక్కలతో ఆ సముద్రం ఒడ్డున ఇండ్లు ఏర్పాటు చేసుకున్నారు. క్రమంగా ఇతర పనులు చేసుకునేవారూ అక్కడికి చేరి ఇండ్లు కట్టుకోవడంతో చిన్న గ్రామంలా తయారయింది. అలా మొదలైన గ్రామం ఇప్పుడు సముద్రంలో వేల సంఖ్యలో ఇండ్లతో పట్టణమైపోయింది. అక్కడ ఎన్ని వందల, వేల ఇండ్లున్నా అది స్లమ్ ఏరియానే. వాళ్ళలో దక్షిణాఫ్రికా నుండి పని కోసం వచ్చినవారే ఎక్కువ. అందరికీ సొంత ఇండ్లు లేవు. అద్దెకుండేవారే ఎక్కువ. అద్దె ఇండ్లకోసం పోటీ పడుతుంటారు కూడా!
ఇక్కడి ఇండ్లన్నీ నీళ్ళల్లో తేలుతూ వుంటాయి. ఇండ్ల గోడలు గట్టి చెక్కతో చేస్తారు. సపోర్ట్గా కింద నీళ్ళల్లో పెద్ద పెద్ద కర్ర దుంగలు పాతుతారు. రెండు మూడు అంతస్థులుగా కూడా నిర్మించారు. ఇండ్ల మధ్య రోడ్డు కూడా చెక్కలతో ఏర్పాటు చేసిందే. చూడ్డానికి ఆ ఇండ్లు నీళ్ళల్లో తేలుతున్నాయా అనిపిస్తుంది. కానీ చుట్టూ నల్లగా మురికినీరు, ఆ నీటిపై తెప్పలాగే ఏదో తేలుతూ దుర్గంధం వస్తుంది.
చుట్టుపక్కల కర్మాగారాల్లోని కాలుష్యంతో పాటు అక్కడి వారి విసర్జితాలు కూడా అదే నీటిలో చేరుతాయి. అందుకే ఆ నీరు అంత కలుషితమయింది. అదే నీటిని ఉపయోగించాల్సి రావడంతో అనారోగ్యం బారిన పడేవాళ్ళు సంఖ్య ఎక్కువైంది. పేదరికం, అనారోగ్యం, కాలుష్యం వీరి జీవితాలతో పెనవేసుకుని వుంటాయి. ముఖ్యంగా చర్మవ్యాధులు వీరి జీవితంలో ఓ భాగం. అయినా అక్కడివారికి ఆ నీళ్ళతోనే అనుబంధం. అక్కడ కాకుండా వేరే ప్రదేశాల్లో బతకలేనంతగా ఆ ప్రాంతంతో మమేకమైపోయారు.
ప్రభుత్వం వీరికి కరెంటు, తాగడానికి నీరు లాంటి కనీస సదుపాయాలు కూడా కల్పించలేదు. ఇక్కడి వారంతా తాగేందుకు మంచినీరు కొనుక్కోవాల్సిందే. ఇక్కడ మంచినీళ్ళ వ్యాపారం కంటే లాభసాటి వ్యాపారం మరోటి లేదు. నిత్యావసర వస్తువులమ్మే షాపులన్నీ పడవల మీదనే. రవాణాకు కూడా పడవలనే ఉపయోగిస్తారు.
రాబర్ట్ న్యూవిర్త్ అనే వ్యక్తి ఆ ప్రాంతం గురించి, ఆ ప్రాంత ప్రజలు, వారి ఇబ్బందుల గురించి మిగతా ప్రపంచానికి తెలియజేసే విధంగా వ్యాసాలు రాసేవాడు. అలా మీడియా ద్వారా మకోకో ప్రజల పరిస్థితిని, సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో ప్రభుత్వం ఆ ప్రాంతం వారికి కొన్ని సదుపాయాలు కల్పించింది. ఒక స్కూల్ కూడా ఏర్పాటు చేసింది.
ప్రభుత్వంతో పాటు ఒకటి రెండు ఎన్.జి.వో సంస్థలు కూడా మకోకో ప్రజలకు చేయూతగా వున్నాయి. వారి ఆధ్వర్యంలో రెండు స్కూళ్ళు నడుస్తున్నాయి. ఇక్కడి పిల్లలకి చదువుకోవడమంటే చాలా ఇష్టం. రెండు స్కూళ్ళున్నా అవి సరిపోవడం లేదు.
అక్కడి ప్రభుత్వ లెక్కల ప్రకారం మకోకో జనాభా 85 నుండి 86 వేలు మాత్రమే. అయితే నిజానికి అక్కడ లక్షన్నర నుండి రెండున్నర లక్షల వరకు నివసిస్తున్నారు. ప్రభుత్వ లెక్కలకి, వాస్తవానికి చాలా తేడా వుండటానికి కారణముంది. భద్రత పేరుతోనో, కాలుష్యం పేరుతోనో ఆ ప్రదేశాన్ని పోలీసుల సహకారంతో ప్రభుత్వం ఎప్పుడూ ఖాళీ చేయించాలని చూసేది. 2012 జులైలో ప్రభుత్వం పోలీసులతో కొన్ని వందల ఇండ్లను కూల్చివేయించింది. ఆ సమయంలో వేల సంఖ్యలో ప్రజలు ఇళ్ళు పోగొట్టుకుని నిరాశ్రయులయ్యారు. అయినా వెళ్ళేవారు వెళ్తుంటే వచ్చేవారు వస్తూనే వుంటారు. రోజుకు రెండువేలమంది ఏదో పని కోసం అక్కడికి వస్తూనే వుంటారని ఓ నివేదిక.
మకోకో ప్రజలకు అన్నీ తాత్కాలికమే. ముఖ్యంగా ఇక్కడి వారి ఆరోగ్య రక్షణకు హాస్పిటల్ చాలా ముఖ్యం. కానీ అది కూడా తాత్కాలిక వసతే. ఓ సంవత్సరం పాటు కొనసాగిన హాస్పిటల్ తర్వాత లేదు. హెల్త్ సెంటర్లు వుండవు. అనారోగ్యం బారిన పడినప్పుడు వారే ఏదో తాత్కాలిక మందులు వేసుకుంటారు. ఈ ఆధునిక కాలంలో కూడా పురుళ్ళకు హాస్పిటల్కు వెళ్ళడం లేదంటే వారు ఎంత వెనుకబడి వున్నారో అర్థం చేసుకోవచ్చు. చుట్టూ నగరం నుండి వచ్చే కాలుష్య పదార్థాలు, మురికి, చెత్తా చెదారం మొత్తం వారి చుట్టూనే వుంటుంది. మకోకో వాసులకు ఆ ప్రాంతం ప్రశాంతంగా అనిపిస్తుంది. బయటినుండి వచ్చే పర్యాటకులకు మాత్రం ఎప్పుడూ చేపలు పడుతూనో, మరో పని చేసుకుంటూనో హడావుడిగా వుండే జనాన్ని చూసి ఈ ప్రదేశం గజిబిజిగా గందరగోళంగా వుంది అంటారు. అయినా వారు ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళరు. ప్రభుత్వం ఒత్తిడి చేసినా అంతే! వారి జీవితం, వారి లోకం అక్కడే!!
- బి.మల్లేశ్వరి