Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనకు అన్ని సమయ సందర్భాలకు ఒక ప్రత్యేకమైన రోజు ఉన్నట్టే పుస్తకాలకు కూడా ఒక ప్రత్యేకమైన రోజు ఉంది. అది 23 ఏప్రిల్. ఈ రోజును మనం 'విశ్వ పుస్తక మరియు కాపీరైట్ దినోత్సవం'గా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నాం. పుస్తకాన్ని, ఆ పుస్తకాల రచయితల గౌరవార్థం ఐక్యరాజ్య సమితి ఏప్రిల్ 23ను విశ్వ పుస్తక కాపీరైట్ దినోత్సవంగా ప్రకటించింది. 1995లో పారిస్లో ఐక్యరాజ్య సమితి మొదటిసారి పుస్తక, కాపీరైట్ దినోత్సవాన్ని నిర్వహించింది. 1611లో ఇదే రోజున ప్రఖ్యాత రచయితలు విలియం షేక్స్పియర్, గార్సిలాసో డె లా వెగాలు మరణించారు. అంతేకాక మరికొంతమంది రచయితలు మౌరిస్ డ్రూన్, హల్డర్ కె. లాక్స్నెస్, వ్లదిమీర్ నబకోవ్, జోసెఫ్ ప్లా, మాన్యుయెల్ మెజ్ఫా వల్లెజో వంటి వారి జన్మదినాలు, వర్థంతులు కూడా అదే రోజు కావడం విశేషం. నిజానికి పుస్తకాలు, రచయితలకు ఏప్రిల్ 23తో గల సంబంధం మొదట ఇదే రోజు 1923 సంవత్సరంలో మొదలైంది. స్పెయిన్లోని పుస్తక ప్రచురణకర్తలు అదే రోజు మరణించిన ప్రఖ్యాత రచయిత మిగుయెల్ డె కార్వాంటెస్ గౌరవార్థం వేడుకను నిర్వహించారు. యునెస్కో ప్రతియేడు దీనిని జరుపుతోంది. విశ్వవ్యాప్తంగా ఉన్న రచయితలు, ప్రచురణకర్తలు, గ్రంథాలయాలు, పుసక విక్రేతలు ఆ యేడాదంతా 23 ఏప్రిల్ నుండి మొదలయ్యే సంవత్సర కాలానికి విశ్వ పుస్తక రాజధానిని వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎంపికచేస్తాయి.
ప్రపంచ దేశాల్లో ఈ గౌరవాన్ని రెండుసార్లు దక్కించుకున్న ఏకైక దేశం మన భారత దేశం కావడం విశేషం. మొదటిసారి ఈ గౌరవం 1986లో దక్కగా, రెండవసారి 2006లో లభించింది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో నగరాలు విశ్వ పుస్తక నగరం గౌరవాన్ని దక్కించుకున్నాయి. గతంలో మాడ్రిడ్, అలెక్జాండ్రియా, అన్వర్స్, మాంట్రియల్, తురిన్, బగోటా, ఆమ్స్టర్డామ్, బెయిరుట్, ల్జుబింజా, బ్యూనస్ ఎయిరిస్, ఎర్వన్, బ్యాంగ్కాక్, పోర్ట్ హార్కోర్ట్, ఇంచేలోన్, రోక్లో, కాంక్రీ, సిటీ ఆఫ్ ఎథెన్స్, షార్జా నగరాలు విశ్వ పుస్తక రాజధానులుగా ఎంపిక కాబడ్డాయి.
2018 సంవత్సరానికి గాను సిటీ ఆఫ్ ఎథెన్స్ విశ్వ పుస్తక రాజధానిగా ఎంపికయ్యింది. 2019 లో షార్జా ఎంపిక కాగా, 2020కి గాను మలేషియా రాజధాని కౌలాలంపూర్ ఈ గౌరవాన్ని దక్కించుకుంది. ఈ విషయాన్ని యునెస్కో డైరక్టర్ జనరల్ సలహా సంఘం సిఫారసు మేరకు ప్రకటించారు. జ్ఞానవంతమైన సమాజం దిశగా అభివృద్ధి, విద్య ప్రమాణాల వికాసం వంటి అంశాల్లో చేసిన విశేష కృషికి కౌలాలంపూర్కు ఈ అవకాశం లభించింది. 'పఠనం ద్వారా సంరక్షణ' అన్న నినాదంతో సాగిన పుస్తక వికాసయాత్ర ఈ దిశగా కౌలాలంపూర్ ఎదిగేందుకు దోహదం చేసింది. పుస్తక ప్రచురణా రంగం అభివృద్ధి, ప్రచారం, బాల సాహిత్య విస్తారం, వికాసం వంటి కార్యక్రమాలతో పాటు కౌలాలంపూర్లో ఈకో సిటీ ప్రాజెక్ట్లో భాగంగా 'రివర్ ఆఫ్ లైఫ్ విత్ ఓపెన్ ఎయిర్ బుక్ షాప్స్' కార్యక్రమం కూడా దీనికి దోహదపడిందని చెప్పొచ్చు. గ్రంథాలయాల అభివృద్ధి, వనరుల అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా మలేషియా ప్రభుత్వం ప్రత్యేకించి డిజిటల్ లైబ్రరీల అభివృద్ధి జరిపింది. రాజధాని నగరంలోని 'మలేషియా నేషనల్ లైబ్రరీ'తో పాటు దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా చేసిన ఏర్పాట్లు, మరో పన్నెండు పేదల కాలనీల్లోని గ్రంథాలయాల్లో జరిగిన డిజిటలైజేషన్ కార్యక్రమం కూడా ఈ గౌరవానికి ఎంపికయ్యేందుకు తోడ్పడింది.
విశ్వ పుస్తక కాపీరైట్ దినోత్సవం సందర్భంగా మళ్ళొక్కసారి మనం నడిచివచ్చిన పుస్తకాల దారిని తిరిగి చూసుకోవాల్సిన అవసరం వుంది. ఇవ్వాళ సాంకేతికంగా ఎంతగా అభివృద్ధి చెందినా, ఈ బుక్స్, కిండెల్, ట్యాబ్లు, ల్యాప్టాప్లు, కంప్యూటర్ల వంటివి ఎంతగా అభివృద్ధి చెందినా పుస్తకం స్థానం పుస్తకానిదే. ప్రపంచ వ్యాప్తంగా వందలాది భాషల్లో కోట్లాది పుస్తకాలు ప్రతియేడూ అచ్చవుతున్నాయి. ఇక మన దేశం విషయానికి వస్తే ఆంగ్ల పుస్తకాల ప్రచురణలో ప్రపంచంలో మనం నాలుగవ స్థానంలో ఉన్నాం. భారతీయ భాషల విషయానికి వస్తే తెలుగు ప్రచురణలో మనం మొదటి వరుసలోనే ఉన్నాం. కానీ పుస్తకాన్ని సామాన్యునికి చేరువగా తేవడం విషయంలో మాత్రం వెనుకబడి ఉన్నాం. పాశ్చాత్య దేశాలు గ్రంథాలయాలకు పెద్దపీట వేసి, పుస్తకాలను అందుబాటులోకి తెస్తున్నాయి. వేల సంవత్సరాల విజ్ఞాన, వైజ్ఞానిక చరిత్ర కలిగిన మనం అక్షరాస్యతను పూర్తిగా సాధించలేకపోగా, పుస్తకాలను మారుమూల పల్లెల్లోకి ఇంకా తీసుకెళ్ళలేక పోతున్నాం.
మన దేశంలో గ్రంథాయోద్యమాలు నిర్వహించిన పాత్ర గణనీయమైంది. నిజానికి స్వాతంత్య్రోద్యమానికి మూల భూమికను ఇచ్చిన ఉద్యమాల్లో గ్రంథాలయోద్యమం ఒకటి. అయినప్పటికీ ఇప్పటికీ దేశవ్యాప్తంగా గ్రంథాలయాలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసుకోలేకపోయాం. ఒకవేళ అక్కడక్కడ గ్రంథాలయాలున్నా మానవ వనరులు మొదలుకుని వివిధ కొరతలు వాటిని పూర్తిగా నిర్వీర్యం చేశాయి. స్థానిక సంస్థలు గ్రంథాలయాల నిర్వహణ కోసం పన్నులు వసూలు చేస్తున్నప్పటికీ ఆ దిశగా జరిగిన ఉపయోగం తక్కువేనని చెప్పాలి.
పుస్తక వికాసం కోసం చేయాల్సిన పనులు : పుస్తకం సామాన్యునికి అందించేందుకు ఏకైక సాధనం పౌరగ్రంథాలయాలు. వాటిని మళ్ళీ పూర్తిస్తాయిలో పునర్నిర్మించుకుని ఉపయోగించుకున్నప్పుడే పుస్తకం జండాలాగా ఎగురుతుంది. యేడాదికి ఒకటి రెండుసార్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న విజయవాడ పుస్తక మహోత్సవం, హైదరాబాద్ పుస్తక మహోత్సవం, నేషనల్ బుక్ ట్రస్ట్ వంటి సంస్థలు రెండు రాష్ట్రాల్లో జరుపుతున్న పుస్తకాల పండుగలు కొంత వరకు ఈ లోటును తీరుస్తుండొచ్చు కానీ పూర్తి స్థాయిలో పుస్తకాలను ప్రజలకు అందించేవి మాత్రం గ్రంథాలయాలే.
గ్రంథాలయాల్లో ప్రతియేడూ అన్ని వయోవర్గాల వారు చదివే అన్ని విషయాలకు సంబంధించిన కొత్త కొత్త పుస్తకాలు చేరేట్టు చూడాలి. ఇతర విషయాలకు సంబంధించిన పుస్తకాలతో పాటు సాహిత్యం ఉండాలి. వాటిలో కనీసం 20 శాతం వరకయినా బాల సాహిత్యం ఉండాలి. అప్పుడే అన్ని వయసులవారు గ్రంథాలయాలకు వస్తారు. కేవలం పౌర, సమూహ గ్రంథాలయాలే కాక ప్రతి పాఠశాలలో గ్రంథాలయం తప్పని సరిగా ఉండేట్టు ప్రభుత్వాలు చర్య తీసుకోవాలి. వీలయితే ప్రతి తరగతిలో ఆయా తరగతుల స్థాయిలో విద్యార్థులు స్వయంగా గ్రాంథాలయం నిర్వహించుకునేట్టుగా వారిని ప్రోత్సహించాలి. చాలామందికి తెలియని విషయం ఒకటుంది... అభివృద్ధి చెందిన దేశాల్లో పాఠశాలలో పిల్లలకు ఇచ్చే పుస్తకాలను సంవత్సరాంతంలో తిరిగి తీసుకుని, వాటినే తరువాత సంవత్సరం వచ్చే విద్యార్థులకు అందజేస్తారు. మన ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పుస్తకాలను ఉచితంగా అందిస్తున్నాం. వాటిని తప్పక తిరిగి ఇవ్వాల్సి ఉంటుందన్న విషయం విద్యార్థులకు తెలిపితే పుస్తకాల నిర్వహణ పట్ల పిల్లలకు బాధ్యత పెరుగుతుంది.
పుస్తకం గొప్పదనం పిల్లలకు తెలిపేందుకు ప్రతి సందర్భంలో బహుమతులుగా, ప్రోత్సాహకాలుగా పుస్తకాలు ఇచ్చే సంప్రదాయాన్ని కాపాడుకోవాలి. విద్యాలయాల్లో జరిగే ఉత్సవాల్లో బహుమతులుగా పుస్తకాలు ఇవ్వడమే కాక, గ్రామంలోని పుస్తకాల విక్రేత చేత లేదా ఇతరుల చేత పుస్తక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలి. సంచార పుస్తక ప్రదర్శనశాలలను పిలిపించి పిల్లలకు పుస్తకాలు అందేట్టు చూడాలి. తప్పని సరిగా గ్రంథాలయం పీరియడ్ పాఠశాల ప్రణాళికలో ఉండేటట్టు చర్యలు తీసుకోవాలి. వనరులను బట్టి పాఠశాలల స్థాయిలో బాలల పత్రికలు, గ్రంథాలయాల్లో అన్ని రకాల పత్రికలు అందుబాటులో ఉంచినట్లయితే పుస్తకం పట్ల పాఠకునికి ప్రేమ కలుగుతుంది. ఏదైనా బడినుండి మొదలు కావాల్సిందే. అందుకోసం వివిధ బహుమతులు, పురస్కారాలు పొందిన పుస్తకాలు పిల్లలకు అందుబాటులో ఉండేవిధంగా వారి స్థాయిలో వాటిని సంక్షిప్తీకరించి ముద్రించి, వాటిని తక్కువ ధరలకు అందేట్టుగా చూడాలి. వీటితో పాటు ప్రపంచ ప్రసిద్ధి పొందిన రచయితలు, పుస్తకాలను క్లుప్తీకరించి ప్రచురించాలి. లలిత కళలు వంటివి తామే స్వయంగా పుస్తకాల ద్వారా చదువుకుని నేర్చుకునే విధంగా పుస్తకాలను ప్రచురించాలి. తద్వారా పుస్తకాలంటే ప్రజలకు ఆసక్తి అభిరుచి కలుగుతుంది. కేవలం సంగీతం, సాహిత్యమే కాకా వివిధ సామాజిక సమస్యలు, ఆ దిశగా జరిగిన ఉద్యమాలు, పరిష్కార మార్గాలకు సంబంధించిన పుస్తకాలు, రాజకీయ, సినిమా వంటి అనేక అంశాలకు సంబంధించిన పుస్తకాలు అచ్చులోకి వచ్చి ప్రజలకు అందుబాటులోకి రావాలి. అప్పుడే పుస్తకం సామాన్యుని చెంతకు చేరగలుగుతుంది. పుస్తకం వర్ధిల్లుతుంది.
(ఏప్రిల్ 23, విశ్వ పుస్తక కాపీరైట్ దినోత్సవం)
- డా||పత్తిపాక మోహన్, 9966229548