Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మరీ చల్లగా వున్న మంచినీళ్ళని తాగకూడదని పెద్దలు అంటుంటారు. ఎందుకో తెలుసా? మన పొట్టలో ఎప్పుడూ శరీర ఉష్ణోగ్రత కంటే కాస్త ఎక్కువ వేడి వుంటుంది. వుండాలి కూడా. ఆ వేడి వున్నప్పుడే మనం తిన్న ఆహారం జీర్ణమవుతుంది. జీర్ణక్రియ సజావుగా సాగాలంటే, కనీస ఉష్ణోగ్రత పొట్టలో వుండాలి. చల్లని నీరు తాగగానే, పొట్ట చల్లబడిపోతుంది. చల్లారిన పేగులు, కణాలు, నాడులు తిరిగి వేడెక్కడానికి కొంత సమయం తీసుకుంటుంది. ఈ సమయం సుమారు 15 నిమిషాలు తీసుకుందనుకోండి... ఆ 15 నిమిషాలు పొట్టలో పేగులు స్తబ్దుగా వుండిపోతాయి. లేదా నిదానంగా పనిచేస్తాయి. తిన్న ఆహారం అరగటం ఆలస్యమయ్యే కొద్దీ పొట్టలో గ్యాస్, విషవాయువులు తయారవుతాయి.
మరో విషయం ఏంటంటే... గోరు వెచ్చని నీరు తాగడం వల్ల పొట్టలో కొవ్వు త్వరగా కరుగుతుంది. చల్లని నీటి వల్ల కొవ్వు గడ్డగట్టి జీర్ణమయ్యేందుకు సమయం తీసుకుంటుంది. అలాగే భోజనం పూర్తయిన వెంటనే నీరు తాగకూడదు. భోజనానికి కనీసం అరగంట ముందు, తర్వాత ఎక్కువ నీరు తాగకూడదు. తాగాలనిపిస్తే... గోరువెచ్చని నీరు తాగొచ్చు. చలికాలంలో బిందెలో నీళ్ళు కూడా చల్లగానే వుంటాయి. అలాగని మరీ ఎక్కువ వేడి నీరు తాగినా పేగులకు, లివర్కు ప్రమాదం.