Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాఠ్యపుస్తకంలోని బొమ్మలపై పిచ్చిగీతలు గీస్తే ఏమౌతుంది. మన దేశంలో అయితే ఏమీకాదు. కానీ తూర్పు ఆఫ్రికా దేశమైన బురుండిలో మాత్రం విద్యార్థులను అరెస్ట్ చేశారు. 15ఏళ్ల వయసున్న ముగ్గురు బాలికలతో పాటు 13ఏళ్ల వయస్సు ఉన్న ఓ బాలుడు కూడా బురుండీ దేశాధ్యక్షుడైన పీర్రే కురుంజిజా చిత్రం మీద పిచ్చిగీతలు గీసిన వారిలో ఉన్నారు. అయితే పిల్లాడిది మరీ చిన్నవయస్సు కావడంతో వెంటనే విడిచిపెట్టారు. కానీ మిగిలిన ముగ్గురిని జైలులో బంధించారు. రాజ్యాధినేత మీద ధిక్కరణకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ప్రస్తుతం వారు జువనైల్ జైల్లో ఉంచాలని న్యాయమూర్తులు ఆదేశించారు. త్వరలో వారిపై విచారణ జరగనుంది. నేరం రుజువైతే ఆ పిల్లలకు ఐదు సంవత్సరాల జైలు శిక్ష పడనుంది. అయితే విద్యార్థుల వద్ద తగినన్ని పుస్తకాలు లేకపోవడంతో వాటిని ఆ తరగతికి చెందిన అందరు విద్యార్థులూ ఉపయోగిస్తున్నారని ఉపాధ్యాయులు వెల్లడించారు. ఆ గీతలు ఎవరు గీశారో స్పష్టంగా తెలియదన్నారు. విద్యార్థులకు తగినన్ని పుస్తకాలు ఇవ్వడం చేతకాని అధ్యక్షుడిని ఒదిలేసి గీతలు పడ్డాయనే కారణంతో పిల్లలను అరెస్ట్చేయడం ఏంటనే విమర్శలు వస్తున్నాయి. ఎంతైనా మన దేశమే నయం మన నేతల దిష్టిబొమ్మలు దగ్ధం చేసినా, వారి పోస్టర్ల మీద పేడ కొట్టినా అడిగేటోడే లేడు.
- పుప్పాల