Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రాణానికంటే విలువైన దేమిలేదు. అలాంటి అమూల్యమైన ప్రాణాలను విద్యార్థులు ఉత్తినే తీసుకుంటున్నారు. చిగురుటాకుల్లా రాలిపోతున్నారు. గత కొన్ని రోజులుగా మన రాష్ట్రంలో జరుగుతున్న ఈ సంఘటనలు అనేక మందిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా బాధితుల తల్లిదండ్రులను కన్నీరు పెట్టిస్తున్నాయి. వారి కడుపుకోత అక్షరాల్లో వర్ణించలేనిది. ఆ మానసిక బాధ అనుభవించే వారికే తెలుస్తుంది. మనం ఎన్ని కంటి తుడుపు మాటలు మాట్లాడినా అది పోయేది కాదు. కుంగుబాటు మనిషి చేత ఎంతటి కఠిన నిర్ణయాన్నైనా అమలు చేయిస్తుంది.
కుంగుబాటుకు గురైన వ్యక్తి మానసిక విచక్షణను కోల్పోతాడు. తాను ఎదుర్కొంటున్న సమస్యకు చావే పరిష్కారమనుకుంటాడు. తనకు జరిగిన అవమానానికి సమాజంలో తలెత్తుకుని తిరగలేనని భావిస్తాడు. వాస్తవానికి ప్రతి మనిషి జీవితంలో ఎత్తుపల్లాలుంటాయి. ఆలోచనలు ఎల్లప్పుడు ఒకే మాదిరిగా ఉండవు. ఒక సమయంలో మనసు ఉత్సాహంతో ఉరకలేస్తుంది. మరో సమయంలో అంతులేని విషాదానికి లోనవుతుంది. ఆ సమయంలో ఏ పనినీ సవ్యంగా నిర్వహించలేరు. సమస్యలు చుట్టుముట్టినపుడు కుంగుబాటుకు గురవుతారు. అయితే అది తాత్కాలికమే. ఎల్లకాలం మనసును పట్టి పీడించదు. సమస్యను ఎదుర్కొంటున్నపుడు ధైర్యంగా ఉండాలి. సన్నిహితుల సహకారాన్ని తీసుకోవాలి. సమస్య తాత్కాలికమేనని, క్లిష్ట సమయంలో సమస్యను ఎదుర్కొంటే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ధైర్యం చెప్పే మనిషి తోడుగా వుండాలి. సమస్య ఎదుర్కొంటున్నవారిని ఒంటరిగా వదిలి వెళ్లకూడదు. సమస్య నుంచి బయట పడే వరకు ఆ వ్యక్తికి మానసిక నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పిస్తూనే ఉండాలి.
ఎలాంటి విపత్కర పరిస్థితిలోనైనా ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదు. వాస్తవంగా ఆలోచించాలి. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని విలువైన జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. ఆత్మబలిదానం ఏ సమస్యకూ పరిష్కారం కాదు. ప్రాణం పోయాక సాధించేదేమి ఉండదు. దుర్భర స్థితిలోకి నెట్టిన పరిస్థితులతో పోరాడాలి. ఆ పరిస్థితి ఏర్పడిన కారణాలను విశ్లేషించుకోవాలి.
ఈ అస్తవ్యస్త సమాజంలో అన్నీ సవ్యంగా జరుగుతాయని, అందరూ నిజాయితీగా పనిచేస్తారని భావిస్తాం. కానీ ఆశ్రితపక్షపాతం, బంధుప్రీతి అధికంగా గల సమాజంలో కొన్ని సందర్భాల్లో అవకతవకలు జరుగుతాయి. కొంతమంది బాధ్యతా రాహిత్యమే రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలకు దారితీసిందని విజ్ఞులు భావిస్తున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో జరిగిన అక్రమాలకు సుమారు 24 మంది విద్యార్థులు బలయ్యారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు తల్లిదండ్రులను తీవ్రమైన ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే చాలా నష్టం జరిగింది. ఈ సమస్యకు పరిష్కారమేమిటి?
ఇంటర్మీడియట్ పరీక్షల మూల్యాంకనంలో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడాలి. యువ విద్యార్థులను ఆత్మహత్యల బారినుంచి కాపాడేందుకు ప్రయత్నించాలి. ప్రభుత్వమే కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. కుంగుబాటుకు గురైన విద్యార్థులకు మానసిక స్థైర్యాన్నిచ్చి, వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పాలి. తాత్కాలిక ఉద్వేగాలకు లోనై ప్రాణాలు తీసుకోవద్దని బోధించాలి. కొంతమంది విద్యార్థుల్లో ఏర్పడిన కుంగుబాటుకు ప్రభుత్వ పక్షపాత విధానాలే కారణమని వివరించాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు విద్యార్థుల పరిస్థితిని అర్థం చేసుకోవాలి. వారి మానసిక స్థితిని సరిగ్గా అంచనా వేయాలి. అకారణంగా వారిని దూషించకూడదు, అవమానించకూడదు. రీవాల్యుయేషన్ తరువాత కూడా ఫెయిలైన విద్యార్థులకు మరోసారి పరీక్షలు రాయిస్తామని చెప్పాలి. ఆ దిశగా వారిని ప్రోత్సాహించాలి. ఒక పరీక్షలో ఫెయిలైనంత మాత్రాన జీవితమంతా కోల్పోయినట్టు కాదని ఉద్బోధించాలి. బ్రహ్మాండమైన భవిష్యత్తు రాబోయే రోజుల్లో వుందని, జీవితాన్ని సంపూర్ణంగా జీవించాలని చెప్పాలి.
ప్రస్తుత పరీక్షల వ్యవస్థతో వీసమెత్తు ప్రయోజనం లేదని, లోపాల పుట్టగా మారి, భ్రష్ఠుపట్టిన దేశీయ విద్యావ్యవస్థను పూర్తిగా మార్చాలని ఏడు మాసాల క్రితమే సీఎన్ఆర్ రావు అనే విద్యా నిపుణులు ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించారు. యువతరం మెదళ్లలో తీవ్రాందోళన పెంచుతున్న ఈ విద్యావిధానాన్ని మార్చాలని పిలుపునిచ్చారు. పునాది స్థాయి నుంచి విద్యావ్యవస్థను ప్రక్షాళన చేయాలని సూచించారు. విద్యార్థుల బహుముఖ వికాసాన్ని సరైనా రీతిలో మదింపు చేయాలని కోరారు. పరీక్షల నిర్వహణ విధానం మారితేనే యువ విద్యార్థులు ధీమాగా జీవితంలో ఎదుగుతారని చెప్పారు. వారే బావి భారతదేశాన్ని నిర్మిస్తారని ఉద్బోధించారు.
- జి గంగాధర్ సిర్ప,
9010330529