Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆటలు మానసికోల్లాసాన్ని కలిగించడంతో పాటు శరీరాన్ని దారుఢ్యంగా ఉంచడంలో ఎంతో ఉపయోగపడతాయి. వేగంగా పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మనుషుల అలవాట్లు కూడా అంతే వేగంగా మారుతున్నాయి. విచిత్రమేమంటే ఆటలు కూడా టెక్నాలజీకనుగుణంగా మారడం. ఒకప్పుడు పిల్లలాడే ఆటల వల్ల వారి రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు ఆరోగ్యంగా వుండేట్లు చేసేవి. ఇప్పుడు పిల్లలు బయటకెళ్తే చాలు దుమ్ము, ధూళి, మట్టి అంటుతుందని పెద్దవాళ్ళే వాళ్ళని ఆటలకు దూరం చేస్తున్నారు. ఇప్పుడు పిల్లల్ని బయట ఆడొద్దు అన్న తల్లిదండ్రులే వారి చిన్నతనంలో పల్లెల్లో గిల్లికర్ర, తొక్కుడు బిల్ల, కరెంట్షాక్, ఉప్పుగెర్రె, కచ్చకాయలు, అష్టాచెమ్మ, వనగుంతలు, పులిమేక, పుంగురిపూత, దొంగాపోలీస్, రింగ్బాల్, మూడురాళ్లాట, దాగుడు మూతలాట, గవ్వలాట, బండా నేలా ఆట, డొప్పాట, అంత్యాక్షరి, కోతికొమ్మ, కండ్లగంతలు, బొంగరాలాట, కబడ్డీ, కోకో, రన్నింగ్, పావులాట, వంగుడుదుంకులాట, బోకుపిచ్చలాట, ఇసుకగూళ్లు, గోటీలాట వంటి మరెన్నో ఆటలు ఆడేవారు. ఆటల్లో అబ్బాయి, అమ్మాయి అనే తేడా లేకుండా మట్టిలోనే ఆడేవారు. అయినా కూడా వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు.
కాలం ఎంతో వేగంగా ముందుకు పోతోంది. దీనికి ధీటుగా అభివృద్ధి కూడా వుంది. కాలంతో పోటీ పడి మరీ మనుషులు వారి అలవాట్లనూ అంతే వేగంగా మార్చుకుంటున్నారు. టెక్నాలజీ పేరుతో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆరోగ్యానికి ఉపయోగపడే వాటిలో పోషకాహారం, ఆటలు ముఖ్యమైనవి. అయితే ఆరోగ్యాన్నిచ్చే ఆటల రూపే మారిపోతే ఇక పిల్లలు ఎలా హెల్దీగా ఉంటారు. నేటి తల్లిదండ్రులు టెక్నాలజీ కనుగుణంగా మార్పు చెందాలంటూ తమ పిల్లలకు ఫోన్, ల్యాప్టాప్, కంప్యూటర్, టాబ్లెట్లను అలవాటు చేసి వాటిలోనే ఆటలాడమని, లేదంటే టీవీ చూడమని ప్రోత్సహిస్తున్నారు. దీనితో పిల్లలు ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడి పబ్జి, టెంపుల్ రన్ లాంటి వాటికి బానిసలుగా మారుతున్నారు. కూర్చుని ఆడటం వల్ల ఒంటికి వ్యాయామం లేక నీరసం, బద్దకం వంటి వాటితో అనేక రోగాల పాలవుతున్నారు. ఇవన్నీ నేటి తల్లిదండ్రులకు అర్థం అవడం లేదు. వీటితో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులు విడుదల చేసే రేడియేషన్ మూలంగా పిల్లలు చిన్న వయసులోనే కంటి చూపు కోల్పోతున్నారు. ఫోన్లో పబ్జీ వంటి ఆన్లైన్ గేమ్స్ వల్ల పిల్లలు చనిపోయిన సంఘటనలూ వున్నాయి. ఇవన్నీ చూస్తూ కూడా తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఫోన్లకే ప్రాధాన్యతనిస్తున్నారు.
ఇంట్లో తల్లిదండ్రులే కాదు, స్కూల్లో కూడా ఆటలకు ప్రధాన్యతనివ్వడం లేదు. చాలా పాఠశాలల్లో పీఈటీ టీచర్లే లేరు. ప్రస్త్తుత కాలంలో తల్లిదండ్రులు, ఉపాద్యాయులు మార్కులు, ర్యాంకులకు ఇచ్చే విలువ, పిల్లలు శారీరకంగా ఎదిగేందుకు ఉపయోగపడే ఆటలకు ఇవ్వడం లేదు. ఒకవేళ స్కూళ్ళలో ఆటలాడించినా అది కేవలం సంబంధిత స్కూల్కో, కోచ్లకో పేరు తీసుకొచ్చే క్రికెట్, వాలీబాల్, టెన్నిస్ లాంటి ఆటలనే ఆడిస్తున్నారు.
అలా కాకుండా తల్లిదండ్రులైనా, టీచర్లైనా పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎదిగేందుకు ఉపయోగపడే ఆటలను ఇంటి దగ్గరా, స్కూల్లో ఆడించాలి. ఆడేట్లు ప్రోత్సహించాలి. అందుకు తగిన వాతావరణం కూడా ఏర్పాటు చేయాలి.
- రాజమోని శివలీల సావిత్రి