Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పిల్లల్ని పెంచడం ఫుల్ టైమ్ జాబ్ అన్నాడు గుడిపాటి వెంకటాచలం. మామూలు పిల్లలని పెంచడమే పూర్తి కాల ఉద్యోగం అయితే ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలని పెంచడం మరెంత పెద్ద ఉద్యోగం? సెరిబ్రల్ పాలసీతో పుట్టిన చిన్నారిని పదకొండేళ్ళు కంటికి రెప్పలా పెంచిన తల్లి ఒకానొక బలహీన క్షణంలో పదకొండేళ్ల పాటు తాను కోల్పోయిన తన జీవితాన్ని వెతుక్కుంటూ భర్తకి ఒక ఉత్తరం ముక్క రాసి, తనకు నచ్చిన మనిషితో వెళ్ళిపోతుంది. పదకొండేళ్ల పాప. సరిగ్గా నోటి నుండి మాట రాదు. మూతి వంకర పోయి, రెండు ముంజేతులూ వెనక్కు తిరిగి, కాళ్ళు ఈడ్చుకుంటూ నడుస్తూ ఉండే పాపకి ఆ తండ్రి ఒక్కడే దిక్కు అవుతాడు. ''పదకొండేళ్ళలో నువ్వు పదకొండు సార్లు మాత్రమే వచ్చావు'' అని తల్లి చేసిన ఆరోపణను గుర్తు చేస్తున్నట్టు తండ్రిని ఒక కొత్త మనిషిగా చూస్తూ, అనుమానిస్తూ దగ్గరకు రానివ్వని పాప. ఆ పాపకి దగ్గరవ్వాలని తపనపడే తండ్రి. వాళ్ళిద్దరినీ వెలివేసినట్టు చూసే సమాజం.
జీవితం ఒక్కొక్కసారి ఎంత సుందర నందనోద్యానవనంలా పరిమళాలు వెదజల్లుతూ ఉంటుందో ఒక్కొక్కసారి అంత చండ ప్రచండ మార్తాండతేజంలా భయపెడుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి సలలిత రాగ సుధారస సారంలా హృదయాన్ని ఆనంద డోలికలు వూగిస్తుంది. మరొక్కసారి ఆ రసరాగ ఝరిని ధిక్కరిస్తూ ప్రవాహ గమనానికి అడ్డంగా అపస్వరాల పర్వతాలు అడ్డం పడతాయి. కానీ జీవన ప్రవాహం ఎప్పుడూ ఆగిపోదు. జీవితమంటే మరేమీ లేదు అది కూడా ఒక ప్రకృతే.
జీవన ప్రకృతిని పన్నెండు అధ్యాయాలుగా విభజించి పన్నెండు రకాల ఉద్వేగాలను గుదిగుచ్చి ప్రేక్షకుడిని సంభ్రమాశ్చర్య చకితుడిని చేస్తాడు రామ్ తన 'పెరంబు' సినిమాలో. 'పెరంబు' తమిళ సినిమా. తమిళ నాట విశేష ప్రజాదరణ పొందిన ఈ సినిమా ఈ సంవత్సరం ఫిబ్రవరి 1 న విడుదలయింది. 'పెరంబు' అంటే దయ అని అర్ధం.
మమ్ముట్టి, అంజలి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం చూస్తున్నంత సేపు సన్నగా గుండెను కొస్తూనే ఉంటుంది. సెరిబ్రల్ పాలసీతో జన్మించిన పాపకి తండ్రి మమ్ముట్టి. అతడు దుబాయిలో డ్రైవర్గా పనిచేస్తూ సంవత్సరానికి ఒకసారి ఇంటికి వస్తూ ఉంటాడు. అతడి భార్య విభిన్న అవసరాలు ఉన్న పాపను కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుంది. పాపను కాపాడటం ఒక ఎత్తైతే చుట్టూ వున్న సమాజంతో ఎదుర్కొనే పుల్ల విరుపు మాటలు, వంకర చూపులు మరొక ఎత్తు.
వాటన్నిటి నుండి విముక్తి పొందినట్టు ఒక ఉదయం ఉత్తరం రాసిపెట్టి వెళ్ళిపోతుంది. ఆ పాప బాధ్యత మమ్ముట్టి మీద పడుతుంది. మమ్ముట్టి అంటే పాపకి ఇష్టం ఉండదు. అతడిని తండ్రిగా అంగీకరించడానికి అస్సలు ఇష్టపడదు. ఆమెకు దగ్గరవ్వాలని మమ్ముట్టి తాపత్రయం. మమ్ముట్టి అద్దెకు ఉంటున్న ఇంటి ఓనరు పాపతో అసౌకర్యంగా ఉందని ఇల్లు ఖాళీ చేయమని చెప్తాడు. మమ్ముట్టి పాపను తీసుకుని ఊరిబయట ఒక ఇంటికి వచ్చేస్తాడు.
క్రమేపీ పాప అతడిని ఇష్టపడటం మొదలుపెడుతుంది. ఒక రాత్రి పాప, మమ్ముట్టి ఒకే మంచం మీద నిద్రిస్తూ ఉండగా మమ్ముట్టి చేతికి తడిగా, జిగటగా ఏదో తగులుతుంది. అప్పుడు అర్ధం అవుతుంది మమ్ముట్టికి పాప రజస్వల అయిందని. బయటకు వెళ్లి ఒక ఆడమనిషిని తీసుకుని వచ్చి ఆ కార్యక్రమం అయింది అనిపిస్తాడు. పాపకి ఒక ఆడ మనిషి తోడుకావాలని తనకు తెలిసిన గోవిందరాజుకి చెప్తాడు. ఒక ఉదయం పూట గోవిందరాజు పంపించాడని అంజలి వస్తుంది.
తనకు ఎవరూ లేరని ఇంత తిండి పెడితే చాలని పాపను చూస్తూ ఉండిపోతానని చెప్తుంది. పాపతో పాటు, మమ్ముట్టికి కూడా దగ్గర అవుతుంది. అయితే ఆమె పాపను చంపాలనే ముందస్తు ప్రణాళికతో వచ్చిందని తెలుసుకున్న మమ్ముట్టి ఆమెను వదిలివేసి పాపను తీసుకుని సిటీకి వెళ్తాడు.
సిటీలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని టాక్సీ డ్రైవర్గా వుద్యోగం వెతుక్కుంటాడు. పాపను ఇంట్లో ఉంచి తాళం వేసి బయటకు వెళ్తూ ఉంటాడు. మమ్ముట్టి బయట ఉన్నంత సేపూ ఆ తలుపులు మూసిన ఇంట్లో కిటికీ దగ్గర కూర్చుని బయటి ప్రపంచాన్ని చూస్తూ, నిరంతరాయంగా టీవీ చూస్తూ ఉంటుంది. మెల్లగా బయటి ప్రపంచం పాప పరోక్షానుభవంలోకి వస్తుంది. టీవీలో వచ్చే సవాలక్ష సెమీ పోర్నో కార్యక్రమాలు పాపకి తానొక స్త్రీ అన్న విషయాన్ని అనుభవంలోకి తెస్తాయి.
ఎప్పటిలాగే ఆ రోజు కూడా మమ్ముట్టి ఆమెకు దుస్తులు మార్చాలని ప్రయత్నం చేస్తే పాప ప్రతిఘటించి తనకుతానుగా దుస్తులు మార్చుకోవాలని బాత్రూంలో విఫల ప్రయత్నం చేస్తుంది. ఆ క్రమంలో గాయపడిన పాపను డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళితే డాక్టర్ పాపను ఒంటరిగా ఉంచితే ఇబ్బందని, ఆమెను తనకు తెలిసిన ఆశ్రమంలో ఉంచేలా మమ్ముట్టిని ఒప్పిస్తాడు.
కానీ ఆశ్రమంలో పాపను మాన్ హ్యాండ్లింగ్ చేయడంతో పాపను తీసుకుని మళ్ళీ ఇంటికి తీసుకుని వస్తాడు. ఇంట్లో ఒక రోజు పక్కింటి పిల్లాడు ఒకడు పాపను సెడ్యూస్ చేయడం చూసి ఆలోచనలో పడతాడు. ఈ క్రమంలో మమ్ముట్టికి మీరా అనే ఒక ట్రాన్స్జెండర్ వేశ్య పరిచయమవుతుంది. ఆమెకు మమ్ముట్టి అంటే ఇష్టం. కానీ మమ్ముట్టికి ఆమె పట్ల ఆసక్తి ఉండదు.
పాపను పెంచడం ఇంక తనవల్ల కాదు అనుకున్న మమ్ముట్టి తనను వదిలివేసి వెళ్లిన భార్య దగ్గరకు వెళ్లి సహాయం అర్ధించాలనుకుంటాడు. మమ్ముట్టి వెళ్లేసరికి భార్యా భర్తలు, మరొక బాబుతో కలిసి ఆనందంగా కనిపిస్తారు. తనను వదిలివేసి వెళ్లిన భార్య ఒక్క మాటైనా పాప గురించి అడగకపోవడంతో మరొక్క క్షణం కూడా అక్కడ ఉండలేక బయటకు వచ్చేస్తాడు.
చివరకు ఒక రోజు ఒక బ్రోతల్ హౌస్కి వెళ్లి తనకొక మేల్ ప్రాస్టిట్యూట్ కావాలి అని అడుగుతాడు. ఆ ప్రాస్టిట్యూట్ తన కూతురుకోసం అని చెప్పగానే బ్రోతల్ హౌస్ ఓనర్ మమ్ముట్టిని చెంప దెబ్బవేస్తుంది. అప్పుడు మమ్ముట్టి ఇలా చెప్తాడు... ''ప్రతి మనిషికీ ఏదో ఒక రోజు చావు వస్తుంది. నా చావు కూడా నన్ను వరించే లోగా నేను నా కూతురు కోరుకున్నవన్నీ దానికి ఇవ్వాలి. నా కూతురుకు సెరిబ్రల్ పాలసీ. మాటలాడలేదు. రెండు చేతులు సరిగ్గా లేవు. రెండు కాళ్ళు కూడా సరిగ్గా వుండవు. కానీ శారీరకంగా, మానసికంగా ఎదిగింది. అందరు ఆడపిల్లలకి వుండే ఫీలింగ్స్ అన్నీ దానికి వున్నాయి.. ప్రకృతి తన ధర్మం తాను నా కూతురు పట్ల కూడా నెరవేరుస్తుంది. తండ్రిగా నా కూతురుకి నేను ఏమీ చేయలేక పోతున్నాను'' అని చెప్పి మౌనంగా బయటకు వచ్చేస్తాడు.
ఒక సాయంకాలం సముద్ర తీరానికి వెళదాం అని చెప్పి పాపను తీసుకుని సముద్ర తీరానికి వస్తాడు. నీళ్ళలోకి వెళితే చాలా బావుంటుంది అని చెపితే పాప సరే అంటుంది. సముద్రం లోలోపలికి వెళుతుంటే పాపకి భయం వేస్తుంది. ముందుకు వద్దు అని గింజుకుంటుంది. బలవంతంగా చెయ్యి విడిపించుకోవాలని ప్రయత్నం చేస్తుంది. కానీ మమ్ముట్టి ఉన్మాదంలో వున్నట్టుగా పాపను తీసుకుని వెళుతుంటాడు. సముద్రం ఆ ఇద్దరినీ తనలోకి లాగేసుకునే క్షణంలో ఒక చెయ్యి పాపను, అతడినీ వెనక్కు లాగుతుంది.
దర్శకుడు రామ్ ఈ కథను అనేక అధ్యాయాలుగా విడగొట్టి అధ్యాయం ఒకటి, రెండు అని చెప్తూ ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కో పేరుపెడతాడు. నేచర్ ఈజ్ మిరాక్యులస్ అనీ, నేచర్ ఈజ్ రుత్ లెస్ అనీ ఇలా ఒక్కోపేరు కథాగమనాన్ని సూచించేలా. ఒక బాలిక స్త్రీ అయ్యే క్రమంలో సెక్సువాలిటీని గొప్ప గౌరవంతో, ప్రేమతో దర్శకుడు రామ్ దృశ్యమానం చేసాడు. ముఖ్యంగా టీనేజ్లో ఆడపిల్లలకి తల్లి అవసరం ఎంత ఉంటుందో సినిమా చూస్తూ ఉంటే ఎవరూ చెప్పకుండానే అర్థమవుతుంది. మమ్ముట్టి లాంటి పెద్ద నటుడు ఈ పాత్రను ఒప్పుకోవడం ఒక విశేషమయితే తన అనుభవంతో ఆ పాత్రను అసామాన్యంగా పోషించడం మరొక విశేషం.
ముఖ్యంగా పాపకి దగ్గరవ్వాలని చేసే ప్రయత్నాలలో విఫలం అయి నిస్సహాయంగా నిలిచినప్పుడు, పాప మెచ్యుర్ అయిందని తెలుసుకున్నప్పడు, తన మాజీ భార్య దగ్గరకు వెళ్ళినప్పుడు ఎంత సున్నితమైన నటన ప్రదర్శించాడో అక్షరాల్లో వివరించలేం. సెరిబ్రల్ పాలసీకి గురయిన పాపగా సాధనను తప్పిస్తే మరొకరిని ఎవరినీ ఆ పాత్రలో ఊహించలేం. ఏటికి ఎదురీదే మనస్తత్వం ఉన్న దర్శకుడు రామ్, ఈ సినిమాను కూడా తన పాత సినిమాలు 'కాత్రాడు తమీజ్, టాంగా మీంగల్' లాగా విభిన్నంగా రూపొందించాడు.
ప్రకృతి అన్నిటినీ సృష్టించింది. మనలాగే వికలాంగులను కూడా. మనం నార్మల్గా వున్నాం కనుక వికలాంగులను ప్రకృతి శపించింది అనుకుంటాం. ఏ పాపం చేసారో ఇలా పుట్టారు అనుకుంటాం. ఇలా అనుకోవడం మనిషికే కానీ నేచర్కి లేదు. నార్మల్గా వున్నా మనం మన లోపాలను దాచేస్తాం. వాళ్ళు దాచలేరు అంతే తేడా. ఈ సినిమాలో రామ్ చేసిన గొప్ప పనేమిటంటే అతడు ఎవరినీ జడ్జ్ చేయలేదు. పాత్రలను, వాటి ప్రవర్తనను యధాతథంగా ఆమోదించాడు. ఆమె మొహం కూడా దర్శకుడు పూర్తిగా మనకు కనపడనీయడు. దర్శకుడికి తన పాత్ర పట్ల గొప్ప అవగాహన. ఆమె పదకొండేళ్ళు పాపను పెంచింది. ఉమ్మడి కుటుంబంలో ఎన్నో సమస్యలుంటాయి. వాటన్నిటినీ భరించింది. ఆమె కూడా మామూలు మనిషే. దు:ఖం వస్తే వాల్చడానికి ఆమెకూ ఒక భుజం కావాలి. అది దుబాయిలో వుండే భర్త ఇవ్వలేడు. మరి ఆమె ఏమి చేయగలదు? ఒక రచయితకు తన పాత్రల పట్ల ఉండవలసిన సమ్యక్ దృష్టి అది.
వికలాంగుల మీద చాలా సినిమాలు వచ్చి ఉండవచ్చు కానీ ఈ 'పెరంబు' మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే వాళ్ళ ఫీలింగ్స్ను, లైంగికతను, మానవీకరించిన సినిమాగా ఈ సినిమా చాలాకాలం గుర్తుండి పోతుంది. ఈ ఆదివారం ఈ సినిమా చూడండి. మీరూ ఎంతో కొంత చలించి పోతారు.
- వంశీకృష్ణ,
9573427422