Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాతృ దినోత్సవం వస్తుందంటే సాహిత్యకారులు, కళాకారుల్లో ఓ ఉత్సుకత. అపురూప అవార్డు ఈ సారి ఎవరికి వరిస్తుందా అనే ఆత్రుత. వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న వారి టాలెంట్ను స్వయంగా ఆమే గుర్తించి సత్కరిస్తున్నారు. అంతేకాకుండా ఇంతటి అందమైన క్షణాలను పదికాలాల పాటు పదిల పరుచుకునేలా ఓ అపురూపమైన పుస్తకాన్ని తీసుకువస్తున్నారు. వారే ప్రముఖ విద్యావేత్త, నిజామాబాద్లోని విజరు విద్యాసంస్థల అధినేత, రచయిత్రి డా|| అమృతలత. మదర్స్డే సందర్భంగా ఈ రోజు తెలుగు యూనివర్సిటీలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఆ అవార్డు ప్రదానోత్సవం గురించి మరిన్ని వివరాలు ఆమె మాటల్లోనే...
అవార్డులు ఇవ్వాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది?
చిన్నప్పటి నుండి సాహిత్యమంటే ఆసక్తి. రాయడం చాలా కాలం కిందటే ప్రారంభించినా. విద్యాసంస్థలు ప్రారంభించిన తర్వాత కాస్త బిజీగా ఉండి తగ్గించా. సాహిత్య కారులను ప్రోత్సహించాలని 2011 నుండి ఈ అవార్డులు ఇవ్వడం మొదలుపెట్టా. 2011లో అమృతలత అవార్డు పేరుతో ఒకటే అవార్డు ఇచ్చా. అది కూడా అనుకోకుండా ఇచ్చింది. అప్పట్లో 'గాయాలే గేయాలు' పేరుతో కవితా సంపుటి ప్రచురించాం. ఆ పుస్తకావిష్కరణ నిజామాబాద్లో జరిగింది. దీనికి ముదిగంటి సుజాతా రెడ్డిగారు వచ్చారు. తెలంగాణ రచయిత్రులో ఈవిడ సీనియర్. ఇలాంటి వ్యక్తిని సత్కరిస్తే సముచితంగా ఉంటుందని 'అమృతలత' అవార్డు పేరుతో 25 వేలు ఇచ్చి గౌరవించాలనుకున్నాం. ఈ విధంగా మొదలయింది ఈ అవార్డుల ప్రక్రియ.
ఒక్క రంగంలోనే అనుకున్న మీరు ఇప్పుడు ఇంత మందికి అవార్డులు ఇస్తున్నారు?
ముదిగంటి సుజాతారెడ్డిగారికి అవార్డు ఇచ్చినప్పుడు ఇద్దరు ముగ్గురు రచయితలు ''ఇంత ఖర్చు పెట్టి మంచి అవార్డు ఇచ్చారు. ఇదే అవార్డు కాస్త ముందే ప్లాన్ చేసి ఇస్తే బాగుండేది' అన్నారు. నాకూ నిజమే కదా అనిపించింది. మొదట్లో నవలలకు మాత్రమే అనుకున్నా. తర్వాత సాహిత్యంలోనే కథ, కవిత్వానికి కూడా ఇవ్వాలనుకున్నా. సాహిత్యంతో పాటు కళలన్నా నాకు చాలా ఇష్టం. సాహిత్యానికి అతీతంగా ఏ కళా లేదు. ఇదంతా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకోడానికి ఏడాదిన్న పట్టింది. బాగా ఆలోచించి 2013 నుంచి వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న వారికి రెగ్యులర్గా 'అపురూప అవార్డు'ల పేరుతో ఇస్తున్నాం. ప్రస్తుతం 10, 12 ప్రక్రియల్లో అవార్డులు ఇస్తున్నాం. వీటిలో నవల, కథ, కవిత్వం, చిత్రలేఖనం, సంగీతం, నృత్యం, క్రీడలు, సేవారంగం ఉన్నాయి.
అవార్డులు ఇవ్వడానికి మదర్స్ డేనే ఎందుకు ఎంచుకున్నారు?
మొదటిసారి అపురూప అవార్డులకు అక్కినేని నాగేశ్వరరావుగారిని పిలిచాం. 2012లో అవార్డులపై ఓ నిర్ణయానికి రాకపోవడం వల్ల 2013లోనే 2012 అవార్డులు కూడా ఇచ్చాం. అవార్డులు ఇవ్వడానికి ఏరోజైతే బాగుంటుందని ఆలోచిస్తే తీసుకునే వారందరూ మహిళలే. అందుకే మదర్స్డేను ఎంచుకున్నా. తర్వాత జరిగిన కార్యక్రమాలకు వరుసగా సి.నారాయణ రెడ్డి, కె.విశ్వనాథ్, శారద, జయసుధ గార్లు వచ్చారు. ఇప్పుడు రమణాచారి, షావుకారు జానకి అతిథులుగా వస్తున్నారు.
అవార్డులు ఎక్కువగా వయసు పైబడిన వారికే ఇస్తుంటారు ఎందుకు?
మొదట్లో కేవలం సీనియర్స్కే ఇవ్వాలని అనుకున్నాం. ఎందుకంటే వారి జీవితమంతా సాహిత్యానికి సేవ చేసి ఉంటారు. కానీ ఎలాంటి గుర్తింపు లేకుండానే వారి జీవితం ముగిసిపోతుంది. అందుకే ముందు పెద్దవారినే ఎంపిక చేశాం. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అప్పుడప్పుడు జూనియర్స్కి కూడా అవకాశం ఇస్తున్నాం. గతంలో ఎవరెస్టు ఎక్కిన మలావత్ పూర్ణకు ఇచ్చాం. ఇప్పటి వరకు అవార్డులు తీసుకున్న వారిలో ఈమెదే చిన్న వయసు. ఈ ఏడాది కథల్లో తాయమ్మ కరుణకు ఇస్తున్నాం. ఈసారి అవార్డు తీసుకోబోయే వారిలో ఈమే అందరికంటే చిన్నది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ అవార్డుల్లో రెండు తెలుగు రాష్ట్రాల వారికి దాదాపుగా సమాన అవకాశం ఇస్తున్నాం.
ఇతర అవార్డులకు మీరిచ్చే అవార్డులకు ఏమైనా తేడా ఉందా?
ప్రస్తుతం సమాజంలో పరిస్థితి ఎలా ఉందంటే అవార్డులంటే పైరవీలు చేస్తేనే వస్తాయనే ప్రచారం ఉంది. పైగా మా టాలెంట్ను గుర్తించండి అంటూ అప్లికేషన్ పెట్టుకోవాలి. అంటే అవార్డులను అడుక్కోవాలి. ఈ పద్ధతి నాకు అస్సలు నచ్చలేదు. అందుకే టాలెంట్ ఎక్కడ ఉందో మేమే గుర్తించి పిలిచి అవార్డులు ఇస్తున్నాం. ఇదే మా అవార్డుల ప్రత్యేకత.
ఎంపిక ఎలా ఉంటుంది?
ముందు ఐదారు పేర్లు మా దృష్టికి వస్తాయి. వాటిలో వడపోతలు ఉంటాయి. మా టీంలో ఎక్కువ మంది ఓకే చేసిన పేరును చివరకు సెలక్ట్ చేస్తాం. అయితే మా దృష్టికి రాకుండా ఇంతకంటే టాలెంట్ ఉన్నవారు కూడా ఉండి ఉంటారు. అలాంటి వారిని కూడా వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నాం.
అవార్డులు ఇవ్వడంతో పాటు వారి వివరాలతో ఓ అందమైన సావనీర్ కూడా తీసుకువస్తున్నారు. కష్టంగా లేదా?
నిజానికి అవార్డులు ఇవ్వడం చాలా తేలిక. ఓ రోజు కార్యక్రమం పెట్టి డబ్బులు చేతిలో పెట్టి, అవార్డు ఇచ్చి, సన్మానం చేసి పంపించవచ్చు. సెలక్షన్ మాత్రం కాస్త కష్టంగా ఉంటుంది. అయితే సెలక్షన్ కంటే కూడా మాకు కష్టమైన పని సావనీర్ తీసుకురావడం. అయితే ఇది మాకు ఓ పెద్ద యజ్ఞం లాంటిది. పదే పదే ఫోన్లు చేయాలి. వెంటబడాలి, సమాచారం సేకరించాలి. ఆ వచ్చిన సమాచారాన్ని అందమైన అక్షరాలతో ఎడిట్ చేయాలి. ఫొటోలు తెప్పించుకోవాలి, ప్రింటింగ్ చేయించాలి. ఏదో తూతూ మంత్రంగా సన్మానించి పంపించడం కంటే వారి జీవిత విశేషాలను అక్షర రూపంలో తీసుకువస్తే కలకాలం పదిలంగా దాచుకుంటారు. అందుకే ఇంత కష్టపడుతున్నాం.
మీ ఎడిటోరియల్ టీం గురించి చెబుతారా?
ఇంత కష్టమైన పనిని నేను చేయగలుగుతున్నానంటే అది కేవలం మా టీం వల్లనే. నాతో పాటు, నెల్లుట్ల రమాదేవి, కిరణ్బాల, తుర్లపాటి లక్ష్మి సంపాదక వర్గంగా ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కో రంగంలో నిష్ణాతులు. వీరు కాకుండా ఇంకా సహకరించే వారు చాలా మంది ఉన్నారు. అయితే ఎక్కువ భారం మాత్రం మాపైనే ఉంటుంది.
ఇంకా కొత్తగా ఏమైనా ఆలోచిస్తున్నారా?
ఇప్పటి వరకు అవార్డుల ఫంక్షన్ హైదరాబాద్లోనే చేస్తున్నాం. నిజామాబాద్లోని గుడిలో అవార్డులు ఇవ్వాలి. అందుకే ఆ గుడి ప్రాంగణంలోనే 2000 మంది పట్టే హాలు సిద్ధం చేస్తున్నాం. అలాగే వేదికపైనే 200 మంది వరకు కూర్చోవచ్చు. మరో రెండు నెలల్లో హాలు పనులు పూర్తవుతాయి. దీనికి అపురూప కన్వెన్షన్ అని పేరు పెట్టాం. వచ్చే ఏడాదికి అవార్డులు ప్రారంభించి 10 సంవత్సరాలు అవుతుంది. వచ్చే ఏడాదికి అవార్డులు తీసుకునే వారి సంఖ్య వందకు చేరుతుంది. అందుకే 2020లో మెగా అవార్డుల ఫంక్షన్ పెట్టాలనుకుంటున్నా. దీనికి గతంలో అవార్డులు తీసుకున్న వారిని కూడా పిలిచి సన్మానాలు చేయాలనే ప్లాన్లో ఉన్నాం. వచ్చే ఏడాది నుండి ఈ అపురూప పురస్కారాలు నేను కోరుకున్నట్టు నిజామాబాద్ గుడి ప్రాంగణంలో జరుగుతాయి. అక్కడికి వచ్చే వారికి బస్సు, ట్రైన్ సౌకర్యం ఉంది. ఉండేందుకు 20 రూమ్లు ఉన్నాయి. భోజన సౌకర్యం కూడా అక్కడే ఉంది. కాబట్టి దేనికీ ఇబ్బంది ఉండదు. ఈ గుడి ప్రాంగణంలో ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు రకరకాల ఈవెంట్స్, ఐటీ రిలేటెడ్ కార్యక్రమాలు, స్పోర్ట్ లాంటివి నిత్యం జరిగేలా ప్లాన్ చేస్తున్నా. నా తర్వాత కూడా ఈ కార్యక్రమం ఇలాగే జరిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నా.
- సలీమ
2019- అమృతలత అవార్డు గ్రహీతలు
నవలా రచన- శ్రీమతి జలంధర
సంగీతం - శ్రీమతి ఎస్.పి శైలజ
2019- అపురూప అవార్డు గ్రహీతలు
కవిత్వం - శీలా సుభద్రాదేవి
సేవారంగం - గోళ్ళమూడి సంధ్య
అనువాదం - స్వాతి శ్రీపాద
విద్యారంగం - ఆచార్య శరత్ జ్యోత్స్నారాణి
కాలమిస్ట్ - డా||శిలాలోలిత
నాటిక రచన - కిరణ్బాల
బాలసాహిత్యం - కన్నెగంటి అనసూయ
నాట్యం - వనజా ఉదయ్
రేడియోరంగం - అయినంపూడి శ్రీలక్ష్మి
కథారచన - తాయమ్మ కరుణ