Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజేష్ ఖన్నా పాపులర్ సినిమా 'ఆనంద్' లో ఒక డైలాగ్ ''బాబూ! మోషారు జిందగీ బహుత్ బడీ హౌనా చాహియే. లంబి నహీ'' చాలా అర్ధవంతమైన డైలాగ్. జీవితం ఎంత పొడవుగా పెరిగిందని కాదు, ఎంతగా విస్తరించిందన్నది ముఖ్యం అని అర్ధం. మహర్షి అనే మహేష్ బాబు ఇరవై ఐదవ సినిమా చూస్తున్నప్పుడు నాకెందుకో ఆ డైలాగ్ పదే పదే గుర్తుకువచ్చింది . సామాజిక అంశాలకు కమర్షియల్ సూత్రాలు జోడించి హిట్ సినిమాలు తీసే క్రమంలో భాగంగా ఇప్పుడు చాలా సినిమాలు వస్తున్నాయి. 'జనతా గ్యారేజ్' లో పర్యావరణం, 'శ్రీమంతుడు'లో పల్లెల సర్వతోముఖాభివృద్ధి, 'ఖైదీ నెంబర్ నూట యాభయి'లో రైతు సమస్యలు తీసుకుని వాటికి చాలా సింపుల్ పరిష్కారాలు చూపించి చాలా సొమ్ము చేసుకున్నారు. నిజానికి పర్యావరణం కానీ, పల్లెల అభివృద్ధి కానీ, ఇప్పుడు 'మహర్షి'లో తీసుకున్న వ్యవసాయం కానీ చాలా చిన్న సమస్యలు కాదు. వీటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలసికట్టుగా చిత్త శుద్ధితో పనిచేస్తే కానీ కొద్దో గొప్పో ఆచరణ యోగ్యమైన పరిష్కారాలు లభించవు.
పైన నేను చెప్పిన సినిమాలు అన్నిటిలో ఒక కార్పొరేట్ ఉంటాడు. అతడికి డబ్బు సంపాదన తప్పితే మరేమీ పట్టదు. అతడు పల్లెలు అన్నా, వ్యవసాయం అన్నా వైముఖ్యంతో ఉంటాడు. అతడు విలన్. అతడి విలనిజం కింద పడి నలిగిపోయే పర్యావరణం, నీరు, వ్యవసాయం వీటన్నిటినీ హీరో రక్షిస్తాడు. ఇది ఒక రకంగా పాతరకం ఫార్ములానే. భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు అమలు కాకముందు, దేశంలోని సర్వ అవస్థలకు భూస్వాములు కారణం అని ఒక కమ్యూనిస్ట్ నాయకుడు లేదా హీరో ఆ భూస్వామిని వూరు వదిలి పెట్టేలా చేయడం ఒక సర్వజనామోద కరమైన పరిష్కారం అని తెలుగు సినిమా నమ్మి మనలని నమ్మమన్నది. ఇప్పుడు ఆ భూస్వామి స్థానంలో కార్పొరేట్ వచ్చి చేరాడు అంతే తప్పిస్తే తెలుగు సినిమాలో గుణాత్మకమైన మార్పు ఏదీ లేదు ఇన్నాళ్ళలో.
ఒకప్పుడు హిట్ సినిమాలు ఉండేవి. తరువాత సూపర్ డూపర్, తరువాత బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఈ 'మహర్షి' ఎపిక్ బ్లాక్బస్టర్ హిట్ అట. చదవడానికి, చూడటానికి బాగానే ఉంటుంది కానీ ఈ ఎపిక్ బ్లాక్ బస్టర్ సినిమాలు సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నాయి. దేశంలో ఎలాంటి వాతావరణం ఏర్పడటానికి దోహదం చేస్తున్నాయి. కార్పొరేట్ ప్రపంచానికి, మిగతా ప్రపంచానికి మధ్య ఒక వైమనస్యం సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. కార్పొరేట్ ప్రపంచం అంతా అద్భుతంగా, ఆమోదయోగ్యంగా ఉందని కాదు కానీ, ఆ ప్రపంచం నిండా విజరు మాల్యాలు, నీరవ్ మోడీలే కాదు దేశ పారిశ్రామిక అభివృద్ధికి దోహదం చేసిన టాటాబిర్లాలు, ఇన్ఫోసిస్ నారాయణమూర్తులు, విప్రో అజీమ్ ప్రేమజీలు కూడా వున్నారు.
దేశాభివృద్ధికి మూలమైన రెండు ప్రధాన రంగాలలో ఒక ప్రధానమైన రంగం మీద నిశ్శబ్దంగా ఒక వ్యతిరేక, విషపూరిత భావం కల్పించడం మాత్రం హర్షించదగిన పరిణామం కాదు. 'ఆనంద్'లో రాజేష్ ఖన్నా చెప్పినట్టు ఇది జిందగీ బడీ హొనీ చాహియే కాదు. జిందగీ బహుత్ లంబీ అన్న మాటకి అర్థం ఇప్పుడు వస్తున్న తెలుగు సినిమాలు. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు ముఖ్యమంత్రులు అధికారంలోకి రాగానే ఒకరు హరిత హారం అనీ, మరొకరు నీరు చెట్టు అనీ రెండు పెద్ద కార్యక్రమాలు తీసుకుని ఒక వారం రోజులపాటు హడావిడి చేసి ఆ తరువాత వారం పది రోజులకు భూగర్భ జలాలు నాలుగు మీటర్ల మేర పెరిగాయి అని వాళ్లకు వాళ్ళే చెప్పేసుకున్నారు. నిజానికి ఒక మీటరు భూగర్భ జలం పెరగడం అనేది నిరంతరాయంగా ఒక సంవత్సరం పాటు పని చేస్తే కానీ సాధ్యపడే విషయం కాదు. కానీ ఆత్మవంచనకి హద్దు ఉండదు కదా. ఇప్పటి సో కాల్డ్ సామాజిక సినిమాలు కూడా ఆత్మ వంచన చేసుకోవడంలో హద్దులన్నీ చెరిపివేసాయి.
'మహర్షి' సినిమా అనేకానేక సినిమాల సమాహారం. అది ఒక కలేజ్. 'ఇడియట్' నుండి 'భరత్ అనే నేను' వరకు ప్రతి సన్నివేశం ఎక్కడో చూసినట్టే అనిపిస్తుంది. మహేష్బాబు ప్రతి ఎక్ప్రెషన్ గతంలో చూసినట్టే ఉంటుంది. ఏ పాత్రలోనైనా పాత్ర కనపడక నటుడు కనపడితే ఆ పాత్ర ప్రేక్షకుడి మనసులో ఎక్కడా నిలవదు. 'నిజం' నుండి 'మహర్షి' వరకు ఆయా సినిమాలలో మహేష్బాబు తప్పిస్తే ఆయా పాత్రలు కనిపించడం లేదు అంటే మహేష్ బాబు ఆత్మ విమర్శ చేసుకోవలసిన సమయం వచ్చేసింది. మరీ ముఖ్యంగా 'శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి' సినిమాలలో మహేష్ బాబు ఏ సినిమాలో ఏ ఎక్స్ప్రెషన్ పెట్టాడో గుర్తుంచుకుని చెప్పగలిగితే వాళ్లకు పి.హెచ్.డి ఇవ్వవచ్చు.
వంశీ పైడిపల్లి కథ రాసుకోవడంలోనే చాలా గందరగోళానికి గురయ్యాడు. విజయం అంటే గమ్యం కాదు గమనం అని చెప్పాలి అనుకున్నాడు. కానీ గమ్యం లేని గమనానికి అర్ధం లేదని సినిమా ప్రారంభం అయిన ప్రతి అర్ధగంటకీ హీరో గమ్యం మారుస్తూ తాను గందరగోళంలో పడిపోయి, ప్రేక్షకుడిని అగాథంలోకి నెట్టేశాడు.
మొదట్లో విజయానికి వున్న తాత్విక భూమికలు నిర్వచించే క్రమంలో విజయానికీ అపజయానికీ మధ్య వున్న సన్నని రేఖను గుర్తించలేకపోయిన మహేష్ బాబు రకరకాల గమ్యాలు చేరుకున్న తరువాత కూడా విజయాన్ని అర్ధం చేసుకోలేక పోయాడు. 'బిజినెస్మెన్' తరహాలో ఈసారీ ప్రపంచాన్ని ఏలాలని ప్రయాణం మొదలుపెట్టి, 'శ్రీమంతుడు' తరహాలో పల్లెటూరికి వెళ్లి, 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' తరహాలో తనకు తెలియని వ్యవసాయం చేయాలనీ తలపెట్టి, గూగుల్లో సెర్చ్ చేసి వ్యవసాయ రంగ సమస్యలు అర్ధం చేసుకున్నట్టు భ్రమపడి, వారెన్ బఫెట్ తరహాలోనో, అజీమ్ ప్రేమజీ తరహాలోనో వేలకోట్ల రూపాయలు వ్యవసాయరంగ అభివృద్ధి కోసం విరాళం ఇచ్చి గొప్ప ఆత్మ సంతృప్తి పొందుతాడు. ఈ మధ్యలో చెప్పలేనన్ని ప్రసంగాలు చేసి, యువలోకం మొత్తం ఆకట్టుకుని వాళ్ళను వీకెండ్ వ్యవసాయం వైపు నడిపిస్తాడు. వ్యవసాయం అనేది వీకెండ్ పార్టీ కాదు అని వంశీ పైడిపల్లికి, మహేష్ బాబుకి ఎవరు చెప్పాలి.
ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ చూస్తున్నంత సేపూ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'లో ప్రకాష్రాజ్ క్యారెక్టర్ గుర్తుకు వస్తుంది. అతి మంచితనం చేతకానితనం అనిపించుకుంటుందని అతడు రెండు సినిమాలలోనూ నిరూపించాడు. మహేష్ బాబు 'అతడు', అంతకుముందు వెంకటేష్ 'వారసుడొచ్చాడు', సినిమాల ఛాయలు అన్నీ ఈ 'మహర్షి'లో కనిపించి ప్రేక్షకుడిని చిరాకు పరుస్తాయి. రామవరం ఆ ఒక్క ఊరూ వదిలి ఉంటే బావుండేది అని జగపతిబాబు అనుకుంటున్నపుడు ''దట్ వజ్ ది గుడ్ ఇంటర్వ్యూ'' అని 'ఒకే ఒక్కడు' సినిమా చివర్లో అనుకున్న రఘువరన్ గుర్తుకు వచ్చాడు. పూజా హెగ్డే గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. నిజానికి ఆమెకు సినిమా మొత్తం మీద వున్నది ఒకే ఒక బలమైన సన్నివేశం. ఆమె ఆ ఒక్క సన్నివేశాన్నీ తన ఎక్స్ప్రెషన్ లెస్ ఫేస్తో జీవం చంపేసింది. ఇంతకుముందు ఒక సినిమా విమర్శకుడు సుహాసిని గురించి రాస్తూ సుహాసినికి రెండే రెండు ఎక్స్ప్రెషన్స్ వచ్చు. ఒకటి ముక్కు విరిచి నవ్వడం మరొకటి ముక్కు విరవకుండా నవ్వడం అని. ఇప్పుడు పూజాహెగ్డే ను చూస్తుంటే ఆమెకు ఒక్క ఎక్స్ప్రెషన్ కూడా వచ్చినట్టు లేదు.
'ఎం ఎల్ ఏ, ఎం సి ఏ' ఇవీ ఇటీవలి మన సినిమాలు. వీటికి అందరికీ తెలిసిన అర్ధాలు వేరు. సినిమా వాళ్ళు ఇచ్చిన అర్ధాలు వేరు. 'ఎం.ఎల్.ఏ' అంటే మంచి లక్షణాలు వున్న అబ్బాయి అట. 'ఎం.సి.ఏ' అంటే మిడిల్ క్లాస్ అబ్బాయి అట. ఇవాళ 'మహర్షి'కి కూడా ఒక వింత అర్ధం ఇచ్చారు. మంచిని అందరికీ పంచేవాడు మహర్షి అట. నిజానికి రిషి కుమార్ మహర్షిగా మారడానికి చేసిన ప్రయాణం అంతా ఒక అభూత కల్పన. నేల విడిచిన సాము. నిజానికి 'మహర్షి' అంటే ఒక ఆధ్యాత్మిక పరిమళాన్ని, ఆధ్యాత్మిక సంపదను, జాగృతిని ప్రజలకు అందించే నిష్కామ యోగి. ఈ మహర్షికి నిష్కామం ఏదీ లేదు. వున్నదంతా కామమే. కామం అంటే కోరిక అన్న అర్థం కూడా వున్నది. ఈ సినిమాలో గొప్పగా చెప్పుకోవలసింది ఏదైనా ఉన్నదా అంటే అది అల్లరి నరేష్ నటన. హీరోగా అవకాశాలు లుప్తం అవుతున్న దశలో వచ్చిన ఈ సినిమా అతడి కెరీర్ మరొక మలుపు తిరగడానికి దోహదం చేస్తుంది.
తీరిక దొరికినా ఈ ఆదివారం ఒకటికి రెండు సార్లు ఆలోచించి మరీ ఈ సినిమాకు వెళ్ళండి.
- వంశీకృష్ణ, 9573427422
వంశీ పైడిపల్లి కథ రాసుకోవడంలోనే చాలా గందరగోళానికి గురయ్యాడు. విజయం అంటే గమ్యం కాదు గమనం అని చెప్పాలి అనుకున్నాడు. కానీ గమ్యం లేని గమనానికి అర్ధం లేదని సినిమా ప్రారంభం అయిన ప్రతి అర్ధగంటకీ హీరో గమ్యం మారుస్తూ తాను గందరగోళంలో పడిపోయి, ప్రేక్షకుడిని అగాథంలోకి నెట్టేశాడు.
'మహర్షి' సినిమా అనేకానేక సినిమాల సమాహారం. అది ఒక కలేజ్. 'ఇడియట్' నుండి 'భరత్ అనే నేను' వరకు ప్రతి సన్నివేశం ఎక్కడో చూసినట్టే అనిపిస్తుంది. మహేష్బాబు ప్రతి ఎక్ప్రెషన్ గతంలో చూసినట్టే ఉంటుంది. ఏ పాత్రలోనైనా పాత్ర కనపడక నటుడు కనపడితే ఆ పాత్ర ప్రేక్షకుడి మనసులో ఎక్కడా నిలవదు. 'నిజం' నుండి 'మహర్షి' వరకు ఆయా సినిమాలలో మహేష్బాబు తప్పిస్తే ఆయా పాత్రలు కనిపించడం లేదు అంటే మహేష్ బాబు ఆత్మ విమర్శ చేసుకోవలసిన సమయం వచ్చేసింది.