Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏప్రిల్ పన్నెండు. పాఠశాలకు విద్యాసంవత్సరపు చివరి పనిదినం. సనత్నగర్ లోని ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతిలో పిల్లలతో మాట్లాడుతున్నాడు తెలుగు ఉపాధ్యాయుడు రమణ. అతడు విద్యార్థులతో ఓమంచి స్నేహితుడిలా ఉంటాడు. 'సెలవుల్లో ఏం చేస్తారు?' అని పిల్లల్ని అడిగాడు.
'హాయిగా ఆడుకుంటామని కొందరు, అమ్మా నాన్నలతో కలిసి టూర్ వెళ్తామని కొందరు, సమ్మర్ క్యాంపులకు వెళ్ళి డ్యాన్సు, స్కేటింగ్ వంటివి నేర్చుకుంటామని కొందరు, క్రికెట్ ఆడుతామని కొందరు చెప్పారు. ఇంకా 'తమ సొంత ఊళ్ళకు వెళ్ళి తాతయ్య, నానమ్మలను, అక్కడ ఉన్న తమ స్నేహితులను కలుస్తామని, వారితో కొంతకాలం ఆనందంగా గడుపుతామని' మరికొందరు చెప్పారు. 'ట్యూషన్లకు వెళ్తామని, రాని సబ్జెక్టులు నేర్చుకుంటామని, సినీమాలు, టీవీలు చూస్తామని..' ఇలా పిల్లలు తమ వేసవి సెలవుల కార్యక్రమాల ఆలోచనలను చెప్పారు.
'సరే, కానీ ఎండలో జాగ్రత్తగా ఉండండి. అపరిశుభ్రంగా ఉండే ఆహార పరార్థాలు తినకండి. అలా తిని అనారోగ్యాలు తెచ్చుకోకండి,' పిల్లలకు రమణ జాగ్రత్తలు చెప్పాడు.
'సర్, మీ ఫోన్ నెంబర్ చెప్తారా?' ఓ పిల్లాడు అడిగాడు. రమణ చెప్తే అందరూ రాసుకున్నారు.
'సెలవుల్లో ఆనందంగా గడపండి. మీకు సంతోషం కలిగించే పనులు చేయండి. ఆటపాటలతో గడపండి. అలాగే మీలాంటి పిల్లలకు పనికొచ్చే మంచి పనులు కూడా చేయండి. అంటే.. మీ చుట్టుపక్కల ఉండే పిల్లలకు అవసరమైన సహాయం చేయడం, చదువుకు సంబంధించిన విషయాల్లో వాళ్ళను ప్రోత్సహించడం, వాళ్ళకు రానివి చెప్పడానికి, నేర్పడానికి పూనుకోవడం, చదువుకోకుండా బడికి దూరంగా ఉంటున్న పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళను బడికి వచ్చే విధంగా ప్రోత్సహిండం వంటివి చేయండి. అలాగే బాల కార్మికుల లాంటివాళ్ళు కనిపిస్తే ఆ విషయాన్ని బయటపెట్టడం, వాళ్ళకు ఆ చాకిరి నుంచి విముక్తి కలిగించడం వంటి పనులు చేయండి. మీ దగ్గర చాలా మందికి సెల్ఫోన్లు ఉండొచ్చు... ఔనా?'
'ఔను సార్, ఉన్నాయి.' చాలామంది పిల్లలు చేతులెత్తారు.
'గుడ్. వాటిలో ఉండే కెమెరా, వాట్సప్, ఫేస్బుక్ల వంటి వాటిని సరైన విధంగా ఉపయోగించడం నేర్చుకొండి. ఎంతసేపూ సెల్ఫీలు, చాటింగులూ, గేమ్సే కాకుండా అందమైన ప్రకృతి దృశ్యాలను సేకరించండి. మీ తెలివితేటలను, సృజనాత్మక శక్తిని ఉపయోగించి చిన్న చిన్న షార్ట్ఫిలిమ్స్ తీయండి. క్రియేటివ్గా ఆలోచించండి. మీరు ఆలోచిస్తే మీసెల్ ఫోన్లను సక్రమంగా వాడే పద్ధతులు ఎన్నో తెలుస్తాయి.'
'సర్, మీరు బాలకార్మికుల గురించి చెప్పారు. నాకో సందేహం సర్! ప్రపంచ కార్మిక దినోత్సవం అనే మాట విన్నాం. మరి బాలకార్మికులకూ దానికీ ఏమైనా సంబంధం ఉందా?' అడిగింది నీలోత్పల.
రమణ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు ఆ ప్రశ్నకు. ఆ కోణంలో తాను ఎప్పుడూ ఆలోచించలేదు. తరువాత ఆ విద్యార్థినిని అభినందిస్తూ చప్పట్లు కొట్టి చెప్పడం మొదలుపెట్టాడు.
'ముందుగా నీలోత్సలకు అభినందనలు! ఈ కోణంలో ఇంతవరకు నేనేకాదు చాలామంది పెద్దవాళ్ళు ఆలోచించడం లేదు. చాలా కీలకమైన ప్రశ్న ఇది. మారిన పరిస్థితుల్లో కార్మికులు అనే మాటకు పరిధి చాలా పెరిగింది. బడికి దూరంగా ఉంటూ, రకరకాల శ్రమలు చేస్తూ, వెట్టిచాకిరులు చేస్తూ ఉన్న పిల్లలు కూడా ఈనాడు బాలకార్మికులే. ఈ కోణంలో మేడేకూ బాలకార్మికులకూ, బాలకార్మిక వ్యవస్థ పోవాలనుకునే వాళ్ళకూ తప్పని సరిగా సంబంధం ఉంటుంది.'
'సర్, మేడే గురించి కొంచెం చెప్పండి' అడిగాడు చంద్రం.
'మేడే ఒక చారిత్రిక ప్రాధాన్యత కలిగిన రోజు. గత చరిత్రలో కార్మికులు పనిగంటల పరిమితి లేకుండా రోజుకు పదహారు, పద్దెనిమిది గంటలు కూడా పనిచేయవలసి వచ్చేది. ఏ హక్కులు లేకుండా, సరైన జీతాలు, భద్రతలు లేకుండా పనిచేసేవాళ్ళు. ఆధునిక కాలంలో 1886లో చికాగో నగరంలో ఒక్కటైన కార్మికులు పోరాటాల ద్వారా కొన్ని హక్కులు సాధించుకున్నారు. వేలమంది కార్మికుల సమ్మెలతో, బలిదానాలతో, ప్రపంచంలోని అనేక దేశాల కార్మికుల ప్రజల సంఘీభావంతో రోజుకు ఎనిమిది గంటల పని విధానాన్ని కార్మికులు సాధించుకోగలిగారు. ఆ విజయానికి గుర్తే మేడే, ప్రపంచ కార్మిక దినోత్సవం..'
రమణ చెప్పే విషయాలు పిల్లలు ఆసక్తిగా వింటున్నారు.
'మారిన పరిస్థితులలో పనిగంటల లెక్క లేకుండా గొడ్డు చాకిరి చేయించుకునే స్థితి మళ్ళీ చాపకింద నీరులా చుట్టుముట్టింది. బాలకార్మికులను కూడా ఇది వదిలిపెట్టడం లేదు.' చెప్తున్న రమణ కొంతసేపు ఆగిపోయాడు. మనసంతా అలజడికి లోనవుతున్నట్టు అతని ముఖం చెప్తున్నది. గొంతలో ఏదో అడ్డం పడ్డట్టు జీరపోయిన గొంతుతో మళ్ళీ తన మాటలు కొనసాగించాడు.
'మన చుట్టూ ఎటు చూసినా పిల్లలు బిచ్చగాళ్ళుగా, పనివాళ్ళుగా, కూలీలుగా ఎందరో కనబడుతున్నారు. అనేక రకాల పరిశ్రమల్లో, ప్రమాదకరమైన పరిస్థితుల్లో పిల్లలు ఎందరో ఎన్నో పనుల్లో ఉన్నారు. హౌటళ్ళలో, షాపుల్లో, చౌరస్తాలో వెట్టి చాకిర్లలో పిల్లలు ఇంకా చితికిపోతూనే ఉన్నారు. పెరుగుతున్న పేదరికం, నిరక్షరాస్యత వంటివి అందుకు ప్రధాన కారణాలవుతున్నాయి...'
'మరి ఇలాంటి వాళ్ళను కాపాడ్డానికి మనం ఏమీ చేయలేమా సార్?' అడిగింది చామంతి.
'చేయొచ్చు... మన దృష్టిలోకి ఇలాంటివి వస్తే పోలీసులకో, బాలల రక్షణ కోసం పని చేస్తున్న సంస్థలకో తెెలియజేస్తే చాలు. వాళ్ళు చూసుకుంటారు. కానీ మనం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆధునిక సాంకేతిక వ్యవస్థను ఇందుకోసం వాడుకోవచ్చు..'
బయటినుంచి లాంగ్బెల్ వినబడింది.
'ఓకే!, మీ అందరికీ వేసవి సెలవుల శుభాకాంక్షలు...' అంటూ వీడ్కోలుగా చేతిని ఊపాడు రమణ.
ననన
సెలవుల్లో అమ్మా నాన్నలతో కలిసి వరంగల్ దగ్గర్లో ఉన్న తమ స్వంత ఊరికి వెళ్ళి, అక్కడ సెలవులు గడిపి, మళ్ళీ హైదరాబాదుకు బయల్దేరాడు విక్రమాదిత్య.
జనరల్ కంపార్ట్మెంట్లో అమ్మానాన్నలతో బాటు తనకు కూడా కూచోడానికి సీట్లు దొరికాయి. రైలు బయలుదేరిన ఓ అరగంట తరువాత టారులెట్ వెళ్ళడానికని లేచి అటువైపు వెళ్ళాడు విక్రమాదిత్య. టారులెట్లకు ముందు రెండు వైపులా దాదాపు ఇరవై అయిదు ముప్పై మంది పిల్లలు ఒకరిమీద ఒకరున్నట్టుగా కిక్కిరిసి కూచుని ఉన్నారు. అందరూ సుమారు పన్నెండు నుంచి పదహారు పదిహేడేళ్ళ వయస్సులో ఉన్నట్టున్నారు.
అక్కడక్కడ చిరిగిపోయిన మురికి బట్టలు, అపరిశుభ్రంగా ఉన్న శరీరాలు. వాళ్ళు హిందీ భాషలో మాట్లాడుకుంటున్నారు. అక్కడ పెద్దవాళ్ళెవరూ కనిపించడం లేదు.
విక్రమాదిత్యకు తమ రమణసార్ చెప్పిన విషయాలు గుర్తుకొచ్చాయి. వాళ్ళ గురించి తెలుసుకోవాలనిపించింది. 'హలో' అంటూ చిరునవ్వుతో వాళ్ళవైపు చూస్తూ పలకరించాడు. ఆ పిల్లలు కొందరు తమ మాటలు ఆపి అతని వైపు చూశారు. 'ఎక్కడ్నుంచి వస్తున్నారు?' అని హిందీలో అడిగాడు వాళ్ళను.
వాళ్ళు ఏమీ జవాబు చెప్పకుండా మొహాలు చూసుకొని తలలు దించుకున్నారు. వాళ్ళ కళ్ళలో భయం, సందేహం వంటి భావాలు కనిపిస్తున్నాయి.
'హమ్ బీహార్ సే' అన్నాడు హఠాత్తుగా ఒక పిల్లవాడు.
'ఏరు, ఛుప్...' అంటూ ఇంకో పిల్లాడు వేలు చూపిస్తూ అతణ్ణి వారించాడు చెప్పొద్దన్నట్టుగా.
ఇదేదో మామూలు విషయంలాగా అనిపించలేదు విక్రమాదిత్యకు.
'క్యా హౌనా?' అంటూ అక్కడికి హఠాత్తుగా ఓ వ్యక్తి వచ్చి ప్రశ్నించాడు, అతని గొంతు కర్కశంగా హెచ్చరిస్తున్నట్టుగా వినిపించింది.
ఉలిక్కిపడ్డ విక్రమాదిత్య ఏమీ లేదన్నట్టుగా తలూపి, టారులెట్ లోపలికి వెళ్ళి తలుపులు మూసుకున్నాడు. ఆలోచిస్తూ నిలబడ్డాడు. బయట ఆ వ్యక్తి ఆ పిల్లల్ని ఏదో బెదిరిస్తున్న మాటలు వినిపిస్తున్నాయి. కాసేపటి తరువాత అంతా నిశ్శబ్దం. రైలు శబ్దం మాత్రమే వినిపిస్తున్నది.
విక్రమాదిత్య ఓ నిర్ణయానికి వచ్చాడు. జేసులోంచి సెల్ఫోన్ తీసి ఓ నెంబర్కు మెసేజ్ పెట్టాడు. 'తను ఫలానా రైల్లో ఫలానా కంపార్ట్మెంటులో ఉన్నానని, రైలు మరో గంటలో సికిందరాబాద్ చేరొచ్చని, ఈ కంపార్టుమెంటులో సుమారు ముప్పై మంది పిల్లలు ఆనుమానాస్పదంగా ఉన్నారని, వాళ్ళను ఎవరో, ఎక్కడికో తీసుకెళ్తున్నారని అనుమానంగా ఉందని, వాళ్ళను కాపాడాలని' మెసేజ్ పెట్టాడు.
తరువాత సెల్ఫోన్లో వీడియో రికార్డింగ్ ఆన్ చేసి, ఏదో చూస్తున్నట్టుగా ఆ ఫోన్ను పట్టుకొని బయటకు వచ్చి, నిదానంగా అందరివైపు తిరిగి మెల్లగా తమ సీట్లున్న వైపు వెళ్ళాడు, కానీ అక్కడ కూర్చోకుండా కంపార్ట్మెంటు మరో చివరికి వెళ్ళి కాసేపు నిలబడి, ఆ వీడియోను ఇందాకటి నెంబర్కు వాట్సాప్లో పంపించాడు. చుట్టూ ఎవరూ లేకుండా చూసి, ఆ నెంబర్కు ఫోన్ చేశాడు. విషయం చెప్పాడు, తన పేరు చెప్పకుండా. తరువాత వచ్చి తన సీట్లో కూర్చున్నాడు.
సిికింద్రాబాద్లో ఆ రైలు ఆగుతుండగానే కొందరు పోలీసులు ఆ పెట్టె దగ్గరకు రావడం గమనించాడు విక్రమాదిత్య. తాము దిగేసరికి, అప్పుడే రైలు దిగిన ఆ పిల్లలను అదుపులోకి తీసుకొని ఓ పక్కగా నిలబెట్టి ప్రశ్నిస్తున్న పోలీసులు కనిపించారు. విక్రమాదిత్య అక్కడ ఆగకుండా తన తల్లిదండ్రులతో కలిసి స్టేషన్ బయటకు నడిచాడు.
మరునాడు పేపర్లో పడ్డ వార్తను చదివి చాలా సంతోషపడ్డాడు విక్రమాదిత్య. ఇరవై ఎనిమిది మంది పేద పిల్లలను బీహర్ నుంచి ఓ మాఫియా ముఠా బాలకార్మికులుగా హైదరాబాదుకు తరలిస్తుండగా పోలీసులు ఆ పిల్లలను విడిపించారని, ఆ ముఠాలోని వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని, ఆ పిల్లలను స్వంత ఊళ్ళకు పంపి బడిలో చేర్పించే ఏర్పాట్లు చేస్తున్నారని ఆ వార్త సారాంశం. ఎవరో గుర్తు తెలియని ఓ పిల్లవాడు ఈ సమాచారాన్ని పోలీసులకు అందించడం వల్ల ఇది సాధ్యపడిందని, ఆ పిల్లవాడిని పోలీసులు అభినందించారని కూడా అందులో రాశారు.
సంతోషం పట్టలేక వెంటనే తమ రమణ సార్కు ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడు విక్రమాదిత్య.
'అభినందనలు విక్రమాదిత్య! నిజంగా నాకు చాలా ఆనందంగానూ, గర్వంగానూ ఉంది. ఈ తరం పిల్లలకు నిజమైన ప్రతినిధివి నువ్వు. సెల్ఫోన్ వంటి ఆధునిక సాంకేతిక పరికరాలను సరిగ్గా ఉపయోగించుకుంటే సమాజానికి ఎలా మేలు కలుగుతుందో చెప్పడానికి ఇదో బలమైన ఉదాహరణ. బాలల తరఫున, బాలల్ని ప్రేమించేవారి తరఫున నీకు హృదయపూర్వక అభినందనలు!!!' అంటూ రమణ సార్ మాట్లాడుతుంటే విక్రమాదిత్యకు కూడా ఎంతో సంతోషం, సంతృప్తి కలిగాయి.
- డా||వి.ఆర్.శర్మ,
91778877489