Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫ్రాన్స్ నైరుతి భాగంలో పురావస్తు శాస్త్రవేత్తలు ఒక ఇసుక రాయిపై ప్రాచీన శిలాయుగం-మధ్యశిలాయుగం మధ్య కాలానికి చెందిన బొమ్మలను కనుగొన్నారు. ఈ బొమ్మలను ఎజిలియన్ పరిశ్రమలు వర్థిల్లిన కాలం నాటి మానవుడు రాతి మొనలతో ఈ ఇసుక రాయిపై గండరించి ఉంటాడని భావిస్తున్నారు. ఈ బొమ్మలు ఉన్న ఇసుకరాయి 10 ఇంచిల పొడవు, ఏడు ఇంచిల వెడల్పు కలిగి ఉన్నదని, అప్పట్లో బొమ్మలు గీసినప్పుడు దీని పరిమాణం కాస్త పెద్దదిగానే ఉండేదని ప్రస్తుతం అది పగిలిపోయినదని అంటున్నారు. ఈ రాయి పగిలిపోయినందువల్లనే దీనిపై ఉన్న గుర్రం బొమ్మ ముఖ భాగం కనిపించడంలేదని ఆర్కియాలజిస్టులు చెబుతున్నారు. చరిత్ర పూర్వ యుగానికి చెందిన ఎజిలియన్ వేటగాళ్లు ఈ ప్రాంతాల్లో తిరుగాడారని వీరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు ఈ ప్రాంతాల్లో జరిగిన తవ్వకాల్లో ఈ మనుషులు వాడిన గులకరాళ్ల పనిముట్లతో పాటు వారు వేటాడిన జంతువుల అవశేషాలు కూడా బయటపడ్డాయి. మొత్తం మీద ఈ ఇసుకరాతిపై కనిపించే చిత్రాలు 12 వేల ఏండ్ల క్రితం నాటివై ఉంటాయని భావిస్తున్నారు.