Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చలికాలం... డిసెంబర్ నెల... రాత్రి 8 గంటలు దాటింది. ఆ రోజు చలి ఎక్కువగానే ఉన్నదనిపిస్తోంది. నాతో పాటు వీణ, కుమార్లు (పేర్లు మార్చాను) ఉన్నారు. వాళ్లిద్దరూ ఉత్సాహంగా అంటున్నారు. ''అక్కా! ఇక్కడ డోలక్లు అమ్మేవాళ్ళు ఉన్నారు. వెళదామా!'' నేనే కొంచెం ఆలోచనలో పడ్డాను. ఫలక్నుమా నుంచి మా ఇల్లు చాలా దూరం. నేను ఇంటికి వెళ్ళటం లేటయితే అమ్మ ఎంతో కంగారు పడుతుంది. నేను ఎక్కడకు వెళ్ళినా రాత్రి 8 గంటలలోపు ఇంట్లో ఉండాలి. లేకపోతే అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి, మళ్ళీ రేపు ఇక్కడకు వస్తే... కానీ వీణ, కుమార్లు ఇందాకనే అన్నారు ఈ రోజే వాళ్ళకు నాతో రావటానికి కుదురుతుందని. ఆలోచనలు పరిపరి విధాలుగా ఉన్నాయి. ఇంతలోకి జంగం మెట్ నుండి ఫలక్నుమా రైల్వేస్టేషన్కు రాను - పోనూ ఆటో మాట్లాడింది వీణ.
వీణ, కుమార్, నేను ముగ్గురం ఆటో ఎక్కాం. ఫలక్నుమా బ్రిడ్జి దిగాక ఎడమ వైపున ఉన్న గల్లీలోకి ఆటో వెళ్తోంది. అక్కడక్కడా వీధిలైట్లు ఉన్నా చీకటిగానే ఉంది. అది గతుకుల రోడ్డు. అంతా గుంతలు పడి ఉంది. చీకట్లో ఆటో ఆ గతుకుల లోంచే వెళుతోంది. ఒక కిలోమీటర్ పైగా వెళ్ళాక కుమార్ ఒక ప్రహరీ గోడ కట్టి ఉన్న చోట కుడి వైపున ఆటోను ఆగమని చెప్పాడు. ముగ్గురం ఆటో దిగాం. ఆ ప్రహరీ గోడకు ఒక గేట్ ఉంది. గేట్ దాటి లోపలకు అడుగు పెట్టాం. అంతా కటిక చీకటి. ఆ గుడిసెల్లో అక్కడక్కడా లాంతర్ల వెలుగు తప్ప మరింకేమీ కనిపించటం లేదు. కుమార్ ఆ గేట్ దగ్గర ఉన్న వాళ్ళతో మేం ఎందుకు వచ్చామో చెప్తున్నాడు. నేను, వీణ నడుచుకుంటూ లోపలకు వెళ్ళాం.
అక్కడ మొత్తం 50 నుండి 70 దాకా టార్పాలిన్ పై కప్పుగా ఉన్న నేల బారు గుడిసెలు ఉన్నాయి. ఒక్కొక్క గుడిసెలో ఏడెనిమిది మంది నివసిస్తున్నారు. ఇక్కడ నివసిస్తున్న వాళ్ళందరూ ముస్లింలే. ఇక్కడ తాగటానికి, వాడటానికి నీళ్ళు లేవు. కరెంటు లేదు. మహిళలు మంచి నీళ్ళ కోసం వెనుక ఉన్న బస్తీలోకి వెళ్ళి పది రూపాయలకు ఒక బిందె చొప్పున కొనుక్కొచ్చుకుంటారు. అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే వీళ్ళకు బాత్రూమ్లు లేవు. ఒంటి మీద బట్టలతోనే మహిళలు స్నానాలు చేస్తుంటారు. వర్షం వస్తే ఇక్కడ నీళ్ళు నిలిచి నానా అవస్థలు పడుతుంటారు. ఇక దోమలకు కొదవే లేదు. వీళ్ళు చిన్న పిల్లలకు డోలక్లు తయారు చేసి అమ్ముతుంటారు. ఇక్కడి మహిళలు ఇళ్లల్లోనే ఉంటారు. మగవాళ్ళు బెంగుళూరు నుండి మెటీరియల్ తెస్తుంటారు. ఆడవాళ్ళు ఇళ్ళల్లో డోలక్లు తయారు చేస్తే మగవాళ్ళు మియాపూర్, లింగంపల్లి, వట్టపల్లిలలో బస్తీలు, గల్లీలు తిరుగుతూ అమ్ముతుంటారు. రోజుకు 150 నుండి 200లకు మించి ఆదాయం ఉండదు.
ఆ గుడిసెలలో ఉండే చెన్నా మమ్ములను కూర్చోమని ప్లాస్టిక్ కుర్చీలు ఇచ్చాడు. చెన్నా ఇలా చెప్తున్నాడు... ''మా చిన్నతనం అంతా ఇక్కడే గడిచిందమ్మా! మొదట్లో మేం నాంపల్లిలో ఉండేవాళ్ళం. తర్వాత ఆళ్ళపలి,్ల దాని తర్వాత జంగం మెట్ వచ్చాం. మొదట్లో ఇది అంతా అడవి. పది ఏళ్ల నుంచి ఇలా మారింది. 'చిమ్మర్ కీ బావళీ' అంటారు దీన్ని. లఖ్నవూ (లక్నో)లో కూలిపోయిన గుడిసె తప్ప ఏమీ లేవు. మేం చిన్న పిల్లలకు డోలక్లను అమ్ముతాం'' కనపడీ కనపడని లాంతరు వెలుగులో చెన్నా భార్య బేగం కట్టెల పొయ్యి మీద రొట్టెలు కాలుస్తోంది. ఆమె ఎంతో బలహీనంగా ఉంది. ఇద్దరు పిల్లల తల్లి. 6వ నెల గర్భిణీ. రక్తహీనత, లోబి.పితో, జ్వరంతో బాధపడుతోంది. కడుపులోని బిడ్డ కండిషన్ తెలుసుకోవటానికి ప్రభుత్వ దవాఖానాలో ఆమెకు స్కానింగ్ చేయించమని చెప్పారుట. ఆ దవాఖానాలో స్కానింగ్ చేసే డాక్టర్ రావటం లేదట. ప్రైవేట్గా స్కానింగ్ చేయించే ఆర్ధిక స్థితి వీళ్ళకు లేదు.
చెన్నా ఇంకా చెప్తూనే ఉన్నాడు... ''మేక చర్మంతో ఈ డోలక్లను తయారు చేస్తాం. బెంగళూర్ నుండి మెటీరియల్ తెస్తాం. రోజుకు నాలుగైదు అమ్ముడు పోతాయి. ఇదే మా జీవనం. పిల్లల ఆరోగ్యాలు బాలేదు. రెండు నెలలయింది రేషన్ లేదు.. అన్నీ సమస్యలే. కష్టాలల్లో బతుకుతున్నాం మేం. ఎక్కడికి వెళ్ళి బతకగలమో చెప్పు?''
తమ జీవితాలకు ఏమన్నా ఆధారం దొరుకుతుందేమో అన్న చిన్న ఆశ అతని మాటలలో తొంగిచూస్తోంది.
- కవిని ఆలూరి,
9490438391