Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ ఆరు అక్షరాల కన్నడ కస్తూరి పరిమళం ఐదు దశాబ్దాలుగా భారత దేశం మొత్తాన్ని తన ఘాటైన పరిమళంతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. ఇప్పుడా పరిమళం ఇగిరిపోయింది. గిరీష్ కర్నాడ్ను ఒక చట్రం లో కుదించలేం. ఒకే ఛత్రం కింద ఊహించలేం. బహుళ సంస్కృతిని, స్వేచ్ఛను, గట్టిగా సమర్ధించే కర్నాడ్ది బహుళ వ్యక్తిత్వం. భారత బహుళ అస్తిత్వానికి ఒక ముప్పు ఏర్పడిన సందర్భంలో ఆయన అస్తిత్వాన్ని వీడటం బాధాకరమైన తప్పని విషాదం. ''గతం ఎక్కడికీ పారిపోదు. అది నీలోనే ఉంటుంది'' అని తన ఒక నాటకంలో చెప్పినట్టు ఆయన ఇప్పుడు గతమైనా అభ్యుదయాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరిలోనూ నిండి ఉంటాడు.
గిరీష్ కర్నాడ్ మంచి నాటక రచయిత. గొప్ప దర్శకుడు. సెన్సిబుల్ నటుడు. బాధ్యత తెలిసిన పౌరుడు. ఇంకా చాలా.. వీటన్నిటి మధ్యా మిమ్మల్ని మీరు ఎక్కడ నిలుపుకుంటారు అని ప్రశ్నిస్తే ''నాటకం నా ఆత్మ. సినిమా నా దేహం'' అన్నాడు ఆయన.
మహారాష్ట్రలోని కొంకణీ భాషా ప్రాంతమైన మాథెరాన్ లో 1938 మే 19న జన్మించాడు గిరీష్ కర్నాడ్. వాళ్ళది సారస్వత బ్రాహ్మణ కుటుంబం. తన పూర్వీకులు సరస్వతీ నదీ ప్రాంతం నుండి వలస వచ్చారు కనుక సారస్వత బ్రాహ్మణులు అయినారు. ఉత్తర కన్నడలోని శిరిలో ప్రాథమిక విద్యాభ్యాసం, ధార్వాడ్లో డిగ్రీ చదివాడు గిరీష్ కర్నాడ్. విదేశాలలో చదవాలని, ఇంగ్లీష్లో కవిత్వం రాయాలన్నవి ఆయన చిన్ననాటి కోరికలు. విదేశాలలో చదవాలనే అయన కోరిక నెరవేరింది కానీ ఇంగ్లీష్లో కవిత్వం రాయాలి అన్న కోరిక తీరలేదు. ఉద్వేగ ప్రధానమైన కవిత్వం కాక ఆలోచనా పూర్వకమైన నాటకం ఆయనను వరించి వచ్చింది. వరించి వచ్చిన నాటక వనితను ఆయన కాదు అనలేక పోయాడు. సి. రాజగోపాలాచారి రాసిన మహాభారతం చదివినాక కర్నాడ్ అందులోని యయాతి పాత్రను ప్రధానంగా తీసుకుని 'యయాతి' నాటకం రాశారు. అది కన్నడ నాటక రంగంలో ఒక గొప్ప సంచలనం సృష్టించింది. ఇదే యాయాతి పాత్రను తీసుకుని మరాఠీలో విష్ణు సఖారామ్ ఖండేకర్ నవల రాస్తే, ఆ నవలకి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. విష్ణు సఖారామ్ యయాతిని దర్శించిన తీరు వేరు, కర్నాడ్ దర్శించిన తీరు వేరు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాల ఔన్నత్యాన్ని చాటి చెప్పే యయాతి నవలలో దేశ కాలాతీతమైన మానవ జీవిత స్వరూపాన్ని సమగ్రంగా చిత్రించే ప్రయత్నం విష్ణు సఖారామ్ ఖండేకర్ చేస్తే, కర్నాడ్ యయాతిని ఆధునిక సమాజంతో అనుసంధానింప చేసే ప్రయత్నం చేశాడు. యయాతిలాగే ఆధునిక మానవుడు కూడా కనిపించని చీకటి లోయలోకి పరుగులు తీస్తున్నాడని, అతడు గతకాలపు ఆధ్యాత్మిక విలువల వారసత్వాన్ని పూర్తిగా వదిలించుకుని, ఆధునిక విలువలను పూర్తిగా ప్రతిష్టించుకోలేక ఆనందం మాత్రమే, కేవలం భౌతిక ఆనందం మాత్రమే జీవితంలో చిట్టచివర సాధించవలసిన లక్ష్యంగా భావిస్తున్నాడని కర్నాడ్ యయాతిని ఆధునిక మానవుడికి ప్రతీకగా నిలుపుతాడు. తండ్రికి తన యవ్వనాన్ని ఇవ్వాలన్న పురు నిర్ణయం, అది యాయాతిలోనూ, పురు లోనూ, పురు భార్యలోనూ సృష్టించిన విధ్వంసాన్ని కర్నాడ్ అనితర సాధ్యంగా నాటకీకరిస్తాడు. ఈ నాటకం 1961 లో వచ్చింది.
కర్నాడ్ నాటక రచనలో అస్తిత్వవాద ప్రభావం బలంగా కనిపిస్తుంది. ప్లేటో మొదలుకుని ఆధునిక తత్వవేత్తలదాకా అత్యున్నత నైతిక ప్రమాణం ఏదయినా ఉంటే అది ప్రతి ఒక్కరికీ ఒకేలాగా ఉండాలి అన్నారు. కానీ కిర్క్ గార్డ్ ఈ సమానం అనే మిత్ను బద్దలు కొట్టాడు. I must find a truth that is true for me. the idea for which I can live or die అని కిర్క్ గార్డ్ బలంగా ప్రవచించాడు. తరువాతి తత్వవేత్తల మీద ఈ ప్రభావం చాలావుంది. కిర్క్ గార్డ్ ప్రకారం సార్వజనీనమైన అన్న పదాన్ని మరచిపోయి ఎవరైనా తమదైన సత్యాన్ని తాము కనుగొనవలసిందే. నీషే ఇంకొంచెం ముందుకు వెళ్లి వ్యక్తి మాత్రమే నైతిక ప్రమాణాలను నిర్ణయిస్తాడని అంటాడు. ఈ అస్తిత్వవాద ప్రభావం యయాతి నాటక రచన మీద చాలా వుంది. నాటకంలో సంఘర్షణ, నాటకీయత శిఖరప్రాయాన్ని అందుకోవడానికి అస్తిత్వవాదమే ప్రధాన భూమిక పోషించింది. అందుకే కన్నడనాట ఈ నాటకం సంచలనం సృష్టించింది. తరువాత ఇతర భాషల్లోకి తర్జుమా అయింది.
కర్నాడ్ కన్నడ నాటకానికి ఒక కొత్త రూపాన్ని ఇచ్చే అన్వేషణలో ఫ్రెంచ్ Giradoux, Camus, satre రచనలతో ప్రభావితం అయినాడు. కన్నడ సంప్రదాయంలో ఉంటూనే దానికి ఆధునిక రూపాన్ని, అస్తిత్వ సంఘర్షణలకు రూపాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేసి విజయం సాధించాడు.
కర్నాడ్ మరో నాటకం 'తుగ్లక్' 1964లో వచ్చింది. మహమ్మద్ బీన్ తుగ్లక్ జీవితం ఆధారంగా రాసిన నాటకం. తుగ్లక్ వ్యక్తిత్వంలోని ద్వంద్వ ప్రవృత్తిని బలంగా పట్టుకున్న నాటకం. అల్కాజీ దర్శకత్వంలో లండన్లో ప్రదర్శించబవడిన ఈ నాటకాన్ని కర్నాడ్ స్వయంగా ఆంగ్లంలోకి అనువదించాడు.
తుగ్లక్ సంక్లిష్ట వ్యక్తిత్వాన్ని, అతడి వ్యక్తిత్వంలోని రెండు పార్శ్వాలకు మధ్య జరిగిన ఘర్షణను బలంగా ప్రతిఫలించింది ఈ నాటకం. ఒక సెన్సిటివ్, ఇంటిలిజెంట్ పాలకుడు, ప్రజలను ప్రేమించే పాలకుడు క్రూర కఠినాత్మక పాలకుడుగా ఎలా మారాడు అనే పరిణామాన్ని అద్భుతంగా చిత్రించాడు కర్నాడ్. తుగ్లక్కి బాగా దగ్గరగా వుండే బారని, నజీబ్ లు ఇద్దరూ తుగ్లక్ వ్యక్తిత్వంలోని నీడలకు ఉదాహరణలు.
కర్నాడ్ మరో నాటకం 'హయవదన' భారతీయ నాట్య సంఫ్ు వారి కమలాదేవి అవార్డు అందుకున్నది. కథాసరిత్సాగరంలోని కథ ఆధారంగా రాశారు. విజరు మెహతా దర్శకత్వంలో ప్రదర్శించారు. రకరకాల వ్యూహాలతో చిక్కుబడిన మానవ సంబంధాలలోని అస్తిత్వ రాహిత్యాన్ని బలంగా పట్టుకున్న నాటకం హయవదన. కర్నాడ్ 'నాగ మండల' నాటకానికి కన్నడ నాట బహుళ ప్రచారంలో వున్న రెండు జానపద గాథలు ఆధారం. ఈ రెండు జానపద గాథలను ఏ.కే రామానుజన్ కర్నాడ్కి చెప్పాడట. ఈ నాటకాన్ని కూడా కర్నాడ్ స్వయంగా ఇంగ్లీష్ లోకి అనువదించాడు. విజరు మెహతా దర్శకత్వంలోనే ప్రదర్శించారు. చికాగో యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్గా కర్నాడ్ వున్నప్పుడు ఈ నాటకం రాశాడు. అక్కడ యూనివర్సిటీలో కూడా ఈ నాటకం ప్రదర్శనకు నోచుకుంది.
నిజానికి నాగమండల ఒక సంక్లిష్టమైన నాటకం. ఒక తాచు పాము ఈ నాటకంలో కథానాయకుడి పాత్రను పోషిస్తుంది. నాటకం అంతా నమ్మశక్యం కానీ అద్భుతాలతో నిండి ఉంటుంది. గాథ అంటేనే అనేక మిత్లతో నిండి ఉంటుంది కదా.
'తులా దండ' నాటకం దేశంలో మండల్ మందిర్ వివాదం బలంగా వున్న రోజులలో రాశారు. భారత సామాజిక ముఖచిత్రం మీద మండల్ మందిర్ వివాదం ఒక పెద్ద మచ్చ. కన్నడ నాట సాంఘిక విప్లవకారుడు అయిన బసవన్న తాత్వికత ఈ నాటక నేపథ్యం. కర్నాడ్ నాటక రచన గురించి Kirthinath Kurukoti ఇలా రాస్తున్నాడు...
His work has the tone and expression of great drama. he has the genius and the power to transform any situation into an aesthetic expression. He has imparted real dramatic verse to the technique of Indian English drama. This is an abiding contribution. As a rule drama can not remain in isolation from the stage. It is designed for representation by actors who impersonate the characters of its story. It is not a self contained art like story, epic, and novel. His dramatic technique is conspicuous for consummate excellence Had karnad to acting and filim industry, he would surely have been one of the greatest dramatists of Indian English Literature.
ఇలా నాటకకాలతో, రచనతో, ప్రదర్శనలతో బిజీబిజీగా వుండే కర్నాడ్ను యు.ఆర్.అనంత మూర్తి రాసిన 'సంస్కార' నవల కల్లోల పరచింది. విదేశాల నుండి తిరిగివచ్చాక మద్రాస్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ మంజీరగా పనిచేసేవాడు కర్నాడ్. అప్పుడే అక్కడ ఉన్న మన పఠాభితోనూ తన డ్రామా ట్రూప్తోనూ కర్నాడ్కి పరిచయం. ఆ పరిచయం ఆధారంగానే సంస్కార నవల గురించి పఠాభికి చెప్పడం, పఠాభి నిర్మాణ దర్శకత్వంలో ప్రాణేశాచార్య పాత్ర పోషించడం చకచకా జరిగి పోయాయి. ఇండియా టుడే కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో 'సంస్కారకి దర్శకుడిగా పఠాభి పేరు ఉంటుంది కానీ అది ఒక కలెక్టివ్ ఎఫర్ట్. సినిమా గురించి ఎవరికీ ఏమీ తెలియదు. అందరికీ అన్నీ తెలుసు' అన్నాడు కర్నాడ్. సంస్కార సంసార ఇబ్బందులలో చిక్కుకుని విడుదలకి ఇబ్బంది పడినా, విడుదల అయిన తరువాత ఒక సంచలనం. ఆ తరువాత బి.వి.కారంత్తో కలసి 'వంశవృక్ష' సినిమాకు దర్శకత్వం వహించాడు కర్నాడ్. ఆ సినిమాకు జాతీయ పురస్కారం కారంత్తో కల్సి అందుకున్నాడు. అదే 'వంశవృక్షం' తరువాత తెలుగులో బాపూ దర్శకత్వంలో అనిల్ కపూర్ హీరోగా వచ్చి తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఆ తరువాత 'కాడు' సినిమాకు దర్శకత్వం వహించాడు కర్నాడ్. కాడు సినిమా కమలహాసన్కి 'క్షత్రియ పుత్రుడు' సినిమా తీయడానికి స్ఫూర్తిని ఇచ్చింది.
కమర్షియల్ సినిమా, సమాంతర సినిమా అన్న తేడా లేకుండా అన్ని సినిమాలలో తన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు కర్నాడ్. జంధ్యాల దర్శకత్వం వచ్చిన 'ఆనంద భైరవి'లో నాట్యాచార్యుడుగా, వెంకటేష్ హీరోగా వచ్చిన 'ధర్మచక్రం'లో కొడుకును ద్వేషించే తండ్రిగా, 'శంకర్ దాదా ఎమ్ బి బి ఎస్' లో కొడుకును అమితంగా ప్రేమిస్తూ కనపడనివ్వని తండ్రిగా, శంకర్ పణికర్ దర్శకత్వంలో వచ్చిన 'ప్రేమికుడు'లో గవర్నర్గా వంకపెట్టలేని నటనను అనితర సాధ్యంగా పోషించాడు. సంస్కృత మృచ్ఛకటికం నాటకాన్ని 'ఉత్సవ్' సినిమాగా దర్శకత్వం వహించాడు. కర్నాడ్ మొత్తం 13 సినిమాలకు దర్శకత్వం వహించి 92 సినిమాలలో నటించాడు.
కర్నాడ్లోని మరొక పార్శ్వం అతడి సామాజిక నిబద్ధత. ఛాందసవాద ధోరణులు ఎక్కడ తలెత్తినా నిర్ద్వందంగా ఖండించాడు. చివరకు మొన్నటికి మొన్న అర్బన్ నక్సలైట్ అనే కొత్త పదబంధాన్ని సృష్టించి ప్రభుత్వం పాశవికంగా ప్రవర్తిస్తున్నప్పుడు శరీర ఆరోగ్యం సహకరించకపోయినా 'మీ టూ అర్బన్ నక్సలైట్. నేను కూడా' అని ఆంగ్ల భాషలలో రాసిన ప్లకార్డు మెడలో వేసుకుని బెంగళూరులో ధర్నాలో కూర్చున్నాడు.
కర్నాడ్ను వరించిన పురస్కారాల గురించి రాస్తే అదొక కొండవీటి చాంతాడు. జ్ఞానపీఠ్, పద్మశ్రీ, పద్మ భూషణ్ పురస్కారాలు ఆయన కీర్తి కిరీటంలో మెచ్చుతునకల్లా కనిపించి మెరుస్తూ ఉంటాయి. ఇంత ప్రజ్ఞావంతుడైన గిరీష్ కర్నాడ్ ఒక డాక్టర్ సెలవు పెట్టడం వలన పుట్టాడట. గిరీష్ కర్నాడ్ కడుపులో వున్నప్పుడు ఆయన తల్లి కృష్ణాబాయి, ఇప్పటికే ముగ్గురు పిల్లలు వున్నారు కదా, ఇంకో సంతానం ఎందుకు అబార్షన్ చేయించుకుందాం అనుకున్నదట . డాక్టర్తో మాట్లాడితే ఫలానా రోజు క్లినిక్కి రమ్మని చెప్పిందట ఆ డాక్టర్. ఆ రోజు కృష్ణాబాయి క్లినిక్కి వెళ్లి చాలాసేపు నిరీక్షించినా డాక్టర్ రాకపోవడంతో విసుగు చెంది వెనక్కు వెళ్లిపోయిందట. ఆ తరువాత ఆమెకు అబార్షన్ మీద ఆసక్తి పోవడంతో గిరీష్ కర్నాడ్ పుట్టి కర్ణాటకకి ఒక జ్ఞానపీఠ్ సాధించి పెట్టాడు.
ఒక సృజన కారుడు సృజనతో పాటు ఇంకా ఏమేమి చేయాలో అన్నీ చేసినవాడు కర్నాడ్. ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లడమే ఆయనకు ఇవ్వవలసిన నివాళి.
- వంశీకృష్ణ,
9573427422