Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వసంత టకటకా అడుగుతూంటే చింటూ చకచకా చెప్పేస్తున్నాడు...
''పదిహేడు ఎనభైనాలుగులెంత?''
''పధ్నాలుగొందల ఇరవై ఎనిమిది''
''గాడ్సే పేరులో ఉండి మనిషిలో లేనిది ఎవరు?''
''గాడ్''
''మహారాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి ఎవరు?''
''మొరార్జీ దేశారు, బల్సార్ చిక్లి నించీ ఎంపికై పంథొమ్మిది వందల యాభైరెండు ఏప్రిల్ ఇరవై ఒకటి నుండి పంథొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ ముప్పై ఒకటి వరకు మొత్తం నాలుగు సంవత్సరాల నూట తొంభైమూడు రోజులు ముఖ్యమంత్రిగా పనిచేశారు''
''అడిగిన ప్రశ్నకి మాత్రమే సమాధానం చెప్పాలని తెలియదా? ఓహౌ తాతయ్యగారి ముందు గొప్పలు చూపించుకోవడానికా?'' అంటూ చింటూ నెత్తి మీద మురిపెంగా మొత్తింది వసంత. కానీ వాడి చేత అనవసరమైన ప్రశ్నలన్నింటికీ బలవంతంగా సమాధానాలు చెప్పించడం ద్వారా తన బాబారు ముందు చింటూ మేధస్సుని ప్రదర్శనకి పెడుతున్నది వసంతే. తద్వారా తన ప్రయోజకత్వాన్ని నిరూపించుకోవాలని తహతహలాడిపోతున్నది కూడా వసంతే. ఈ విషయం గ్రహించలేకపోతున్నది కూడా వసంతే. ఆమె తీరుని గమనించి లోలోపలే నవ్వుకుంటూ చింటూని తల్లి బారినుండి కాపాడ్డం కోసం చేతులు చాచాడు వెంకటేష్. ఆయన వసంతకి బాబారు.
చింటూ పరిగెత్తుకుంటూ వెంకటేష్ దగ్గరకి వెళ్ళబోతుంటే చెయ్యిపట్టుకుని ఆపింది వసంత. అక్కడికక్కడే అతని చేత మరో పాతిక ప్రశ్నలకి బలవంతంగా సమాధానాలు చెప్పిస్తేగానీ ఆమెకి తృప్తి కలగలేదు. పాపం తాతయ్య చంకెక్కచ్చనే ఉత్సాహంతో వసంత అడిగిన అడ్డమైన ప్రశ్నలకీ ఏమాత్రం తడుముకోకుండా సమధానం చెప్పాడు చింటూ. అయినాసరే వాడిని తాతయ్య దగ్గరకి వెళ్ళనివ్వలేదు వసంత. వాడిని అటునించటే తిన్నగా స్నానానికి లాక్కెళ్ళిపోయింది.
స్నానం చేసి రాగానే వాడు వెంకటేష్ వైపుకి పరిగెత్తబోయాడు.
''ఇదిగో ఈ రెండిడ్లీలూ తినేస్తే తాతయ్యగారితో ఆడుకోవచ్చు'' అంటూ తాతయ్యని తాయిలంలా చూపించి పలహారం పెట్టేసింది. పనిలో పనిగా తాతయ్య దగ్గరకి పంపిస్తానని బులిపిస్తూనే యూనిఫాం తొడిగేసి బూట్లు వేసేసింది. వాడు బంగారుకొండలా సిద్ధమై తాతయ్యవైపు పరిగెత్తాడు. అంతలోనే బయటినుండి బస్సు హారన్ వినపడింది. వెంటనే వాడిని ఎత్తుకోబోతున్న వెంకటేష్ వైపు అభ్యర్థనగా చూస్తూ, ''స్కూలైపోయాక ఇంక టైమంతా మీతోనే గడుపు తాడులెండి బాబారు'' అంటూ వాడిని తీసికెళ్ళిపోయింది.
చింటూని బస్సెక్కించి వచ్చేసరికి ఎక్కడలేని నీరసమూ ఆవహించేసింది వసంతని.
ఈలోగా వెంకటేష్ స్నానం పూర్తి చేసి వచ్చాడు.
ఇద్దరూ పలహారం చేశాక సోఫాలో సోలిపోతూ పక్కనే ఉన్న అమృతాంజనం సీసాని అందుకుంది వసంత.
ఆ సీసానే చూస్తూ అన్నాడు వెంకటేష్, ''ఇంత పొద్దున్నే తలనెప్పేమిటమ్మా?''
''ఏం చేస్తాం బాబారు. ఈ మాత్రం అయినా శ్రద్ధలేకపోతే వాడు వెనకబడిపోతాడు'' అంటూ కణతలకి అమృతాంజనం రాసుకోవడం మొదలుపెట్టింది.
వెంకటేష్ నవ్వుతూ అడిగాడు, ''వాడిని గొప్ప మేధావిని చేసెయ్యాలనేది నీ తపన. దాంతోనే నీకీ తల నెప్పి. అవునా?''
''అవును బాబారు. వాడెప్పటికైనా గొప్పవాడు కావాలి''
''పిచ్చిదానా నీ తలనెప్పికి నువ్వు అమృతాంజనం రాసుకుంటే తగ్గిపోతుంది. కానీ వాడికి ఏ తలనెప్పీ లేదు. అయినా సరే నువ్వు అమృతాంజనంతో వాడి తలంటేస్తున్నావ్. తలనెప్పి లేకుండా అమృతాంజనం రాస్తే ఏమౌతుంది? మండిపోతుంది. ఏ మంటా రాకుండా చూసుకోవాల్సిన తల్లే కొడుక్కి ఇలా మండేలా చేస్తే ఎలా చెప్పు.''
- జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి