Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజుల కాలం...
ప్రజలనేవాళ్ళున్నాక రాజ్యాలుంటయి. రాజ్యాలంటూ వున్నాక రాజులూ ఉంటారు. రాజులు ప్రజల్ని ఏలుకుంటారు. ప్రజల్ని రాజులు ఏలుకునే కాలం రాజుల కాలమే కదా!
రాజులనే వాళ్ళు ప్రజల్ని పరిపాలించడం కోసం కదా వుండేది. అయితే ఎల్లకాలమూ ఒక్క రాజే ఉండడు కదా. రాజ్యాలు మారకపోయినా ప్రజలు వాళ్ళే అయినా రాజులు మాత్రం మారుతుంటారు. పాత రాజుల జాగాలో కొత్త రాజులు వస్తారు. పాత రాజుల పాత పద్ధతుల్ని కొత్త రాజులు భూమిలో పాతేసి తుంగలో తొక్కేసి కొత్త పద్ధతులు కనిపెడ్తారు. కొత్త పరిపాలన మొదలెడ్తారు.
పాత రాజు ప్లాస్టిక్ బక్కెట్ తన్నేయడమో, మంచానికి అంటుకుపోవడమో జరిగాక కొత్త రాజావారు రాజరికం మొదలుపెడ్తారు.
కొత్త రాజావారు సింహాసం మీద ఎక్కి కూచోడానికి ముందు జరిగేదే పట్టాభిషేకం. రాజ్యానికి కొత్తరాజు పాలన మొదలవడానికి ముందు జరిగే మహౌత్సవం. పట్టాభిషేకం.
రాజుల కాలం...
పట్టాభిషేకం ఒక అపూర్వమైన ఘట్టం. అదొక ఊళ్ళో పెళ్ళి. అంగవంగ కళింగ కాశ్మీర కాంభోజ రాజ్యాల్లో ఓ రాజ్యం. రాజావారికి పరలోకం 'వీసా' రావడంతో 'హరీ' అంటూ ఇక తెర్చుకోవడానికి వీల్లేకుండా కన్ను మూశారు. 'ఛాన్సు దొరికెరా హొయ్యా హొయ్యా' అంటూ కుమార్రాజావారు అంగరంగ వైభోగంగా పట్టాభిషేక మహౌత్సవం ఏర్పాట్లు చెయ్యమని అధికారులను ఆదేశించారు.
ఉరుకులూ పరుగులూ మొదలయ్యేయి. సభాస్థలి ఏర్పాట్లు షురూ అయినవి. హంగూ ఆర్భాటం హడావిడీ ఊరంతా సందడీ మొదలనయి. చాలా చాలా ప్రాముఖ్యం, చాలా ప్రాముఖ్యం కలిగిన ప్రసిద్ధులకు ఆహ్వానాలు వెళ్ళాయి. రక్షకభటాధికారులు కొత్త డ్రస్సులు వేసుకుని కొత్త లాఠీలు పుచ్చుకుని ఊరంతా కవాతులు చేశారు. మామూలు ప్రజలు ఉత్సవం జరిగే చోటుకి రాకుండా కట్టడి చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించబడ్డాయి. రోడ్లు మూతబడ్డాయి. విశాలమైన ఖాళీ రోడ్ల మీద రథాలు విర్రవీగుతూ పరుగులు తీశాయి. గుర్రాలు నురగలు కక్కుతూ దౌడు తీశాయి. పట్టాభిషేక మహౌత్సవానికి విచ్చేసే సెలబ్రిటీల వాహనాల పార్కింగుకు స్థలాలు నిర్దేశించబడ్డవి. ఏనుగుల పార్కింగ్ ఓచోటయితే గుర్రాల పార్కింగు మరోచోట.
ఉత్సవం వైభవంగా కన్నుల పండుగగా జరిగాక ప్రముఖులకు విందు ఏర్పాట్లు కూడా జరిగాయి. నోరూరించే తినుబండారాల సువాసన మామూలు ప్రజల ముక్కులవైపు వెళ్ళకుండా కట్టుదిట్టం చేశారు. మామూలు ప్రజలు, కుక్కలు అటువైపుకి రాకుండా కాపలా పెట్టారు.
కొత్త రాజావారు పడవంత రథం మీద కిరీట ధారణ కోసం సభాస్థలికి వచ్చేశారు. కుడి ఎడమల వస్తాదులు కండలు తిరిగిన చేతులు దారి చేస్తుంటే ఎర్ర తివాసీ మీద అల్లనల్లన అడుగులు వేస్తూ కాబోయే రాజావారు వస్తుంటే వందిమాగధులు (భజన చేసేవారు) రాజాధిరాజ, రాజమార్తాండ, రాజగంభీర, మహా వీర శూర బహుపరాక్... బహుపరాక్ అని పొగడ్తలతో ముంచెత్తారు. రాజావారు సింహాసనం అధిష్టించారు. రాజగురువు కిరీటంలో తల ఇరికించారు. ప్రముఖులు గజమాలలు వాసన చూపారు. పుష్పగుచ్ఛాల బరువుతో వేదిక కుయ్యో మొర్రో అంది. రాజగురువు, కొత్త రాజావారి చేత ప్రమాణం చేయించారు. కొత్త రాజావారు శుద్ధమైన అంత:కరణతో, పక్షపాత రహితంగా ప్రజల్ని సమంగా పరిపాలిస్తానని ప్రమాణం చేశారు.
రాజుల కాలం కదా!
ప్రజలకి ఈ అద్భుతాన్ని కళ్ళచూసే భాగ్యం కలగనే లేదు. ఈ అద్భుత అపురూప ఘట్టాన్ని గురించి ఆనోటా ఈ నోటా విని తరించిపోయారు.
రాజుల కాలం పోయింది కదా!
ఇప్పుడు ప్రజలే ప్రభువులు అంటున్నారు కానీ ప్రజలు ప్రజలే.. ప్రభువులు ప్రభువులే. అప్పుడు రాజుల పట్టాభిషేకం, ఇప్పుడు రాజుల ప్రమాణ స్వీకారోత్సవం. అంగరంగ వైభోగం, వురుకులూ పరుగులూ హంగూ ఆర్భాటం, హడావిడీ సందడీ అంతా అదే. కొత్త సీసాలో పాత సారానే. సందడీ అంతా అదే. పట్టాభిషేక ఘట్టం మొత్తం 'రిపీటే!' కాకపోతే అప్పుడు ప్రజలు పట్టాభిషేక వైభోగం విని తరించేవారు. ఇప్పుడు టీవీల్లో చూసి ధన్యులౌతున్నారు. ఇక రాజాధిరాజ, రాజమార్తాండ, రాజగంభీర, మహావీర శూర అంటూ భజన చెయ్యడానికి మన 'మీడియా' చేసే కృషి ప్రశంననీయమే కదా!
- చింతపట్ల సుదర్శన్,
9299809212