Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వారూ మనుషులే కదా
బతకడం వేరు. జీవించడం వేరు. జీవించాలనుకునే వారు పటాటోపం కోసం పరుగులాటలో తప్పి పోకుండా ఉండాలంటే, నిరలంకార, నిరాదంబరత లోని ముగ్దత్వాన్ని చూడాలి.. అని ''అంతరంగం'' చేసిన సూచన ఆకట్టుకుంది. శరణార్థులకు సంబంధించిన కవర్ స్టోరీ చదివితే చాలా విషయాలు అవగతమైనవి. కారణాలు తెలిసినవి. అయ్యో పాపం వారు కూడా తోటి మనుషులే కదా అనిపించింది. హాసవిలాసం అందించిన జోకులు అదుర్స్. కొత్తదనం ఉన్నది, వాటిలో. ఐదు దశాబ్దాలుగా భారతదేశం మొత్తాన్ని తన పరిమళం తో ఉక్కిరిబిక్కిరి చేసిన కన్నడ కస్తూరి కర్నాడ్ మరణ వార్త చదివి ''ఇంతేనా ఈ జీవితం ''అనే వేదాంత ధోరణి లోకి జారుకున్నాము.
- పంజాల నరసయ్య, ఈసీఐల్, హైదరాబాదు.
ఎంత భయానకం!
ఈవారం కవర్ స్టోరీ చాలా బాగుంది. రచయిత మంచి విశ్లేషణ చేశారు. చదువుతుంటేనే కండ్లు చెమ్మగిల్లాయి. ఇక రాసేటపడు రచయిత ఎట్లా ద్రవించి ఉంటారో కదా! అగ్ర రాజ్యాల యుద్ధోన్మాదం, మత రాజకీయాలు మానవత్వాన్ని మంటగలుపుతున్నాయి. శరణార్థుఉలు తిరిగి తమ తమ స్థలాలకు వెళ్లగలిగే అవకాశాన్ని కల్పించడమో లేదా ఎక్కడికక్కడ పౌరసత్వం కల్పించడమో చేయాలి. ఈ విషయంలో అంతర్జాతీయ న్యాస్థానం చొరవ తీసుకోవడమే పరిష్కారం. తాము పుట్టిన దేశం వదలి వెళ్లే పరిస్థితులు ఎంత భయానకం! ఎంత బాధాకరం!! మానవతను మరచిన అమానుష సమాజం ఏ వైపు పయనిస్తుందో...
- ఎం.సంయుక్త, హైదరాబాదు
కంటతడి పెట్టనివాడు మనిషేనా?
'శరణార్థులు' అంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శరణార్థుల దయనీయమైన కథలను మంచి ఫీచర్ స్టోరీగా రాసిన రచయితకి ధన్యవాదాలు. మనిషై పుట్టినవాడెవరైనా ఈ స్టోరీ చూసి కంటతడి పెట్టాల్సిందే. ఆ ఫొటోలు చూస్తుంటేనే కడుపు తరుక్కుపోతున్నది. మయన్మార్లో బౌద్ధమతం పెద్ద మతంగా ఉన్నది. అక్కడి రొహింగ్యాలపై ప్రభుత్వ సైనికులతో పాటు బౌద్ధ సన్యాసులూ దాడులు చేయడం సాధారణ దృశ్యం అని సమాచార సాధనాల వల్ల తెలుసుకున్నాం. ఇటు శ్రీలంకలోనూ బౌద్ధ మతం మేజర్ మతంగా ఉన్నది. అక్కడా తమిళులపై అమానుషదాడులు జరగటంతో ఎంతో మంది ఇండియాకి వలస వచ్చారు. ప్రపంచ శాంతి ఆశాజ్యోతి బుద్ధుని బోధనలను అనుసరించే బౌద్ధులు హింసకు దిగుతున్నారనే సంగతి జీర్ణం కావడం లేదు.
- జీవన్, ఖమ్మం
ఆయనది ప్రజాపక్షం
గిరీష్ కర్నాడ్ గొప్ప ప్రజా కళాకారుడు. నాటకాన్ని ఆత్మగాను, సినిమాను దేహంగాను మార్చుకున్న ఆయనం జీవితం పూర్తిగా ప్రజాపక్షంగానే నడిచింది. అటువంటి కళాకారుడు ఇక లేక పోవడం చాలా బాధాకరం. ఆయన రచనల్ని, నటనను అద్భుతంగా విశ్లేషించారు రచయిత. 'మేలిమలుపు' కథ ఈ నాటి సమాజంలో కులం విషయంలో ఏం జరుగుతున్నది, ఏంచేయాలి అనే రెండు స్పష్టమైన అంశాలతో స్త్రీ పక్షపాత ధోరణిలో సాగింది. చివరికి చూపిన పరిష్కారం బాగున్నది.
- జి.ఆశాజ్యోతి, నల్లగొండ