Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మునుముందుకు సాగిపోయే కవిత్వం
నదిలాంటి మనిషి (కవిత్వం), రచన : ఉదయమిత్ర (9985203376), పేజీలు : 216, వెల : 100/-, ప్రతులకు : రచయిత, ఇం.నెం.9-24, చైతన్య నగర్, జడ్చర్ల - 509301.
ఉదయమిత్ర చేయి తిరిగిన కవి. ప్రపంచ సాహితీ వీధులన్నీ పరిచయమున్న కవి. 'అడ్డా కూలీలు' నుండి 'గగన తార'ల వరకు అవగాహన చేసుకున్న కవి. 'చావు పుట్టుకల రహస్యం తెలిసిన వాడిగా' చెప్పుకున్న కవి. ధైర్యంగా 'మరణం ఒక సందేశం' అని ప్రకటించుకున్న కవి. 'మత మౌఢ్యం మీద/ విసిరిన అక్షరాయుధ'మైన గౌరీలంకేష్ను, 'ప్రశ్నల కొడవళ్ళు నూరి/ వ్యవస్థ తెగుళ్ళు నరికి/ వేల సంవత్సరాల/ తెలంగాణ ధిక్కార గీతాలే పలికే' కాళోజీ విశ్వకేతనాలపైకెక్కించిన కవి.
ఉదయమిత్ర స్వయంగా ''నాకు/ చీకటిని రచించటమంటే ఇష్టం.../ చరిత్ర చూడ సాహసించని/ అధోజగత్ సహౌదరులు/ చీకటి బతుకుల రచించడమన్నా ఇష్టం/ జలతారు మేలిమబ్బుల దోబూచులాటగాదూ... / రక్తమోడు, కాళరాత్రులకు స్పందించడం నా నైజం...'' అని చెప్పుకున్నాడు. వ్యభిచార గృహంలో మగ్గుతున్న ఆదివాసీ స్త్రీలను చూసినా, సిరియా, ఇరాక్, అఫ్ఘాన్ పౌరులను గమనించినా వెంటనే స్పందిస్తాడు. అంతేకాదు రోజువారీ తక్షణ సమస్యలపై స్పందించటం ఈ కవి నిత్యకృత్యం. అయితే ఈయన రాసే కవిత్వం ''కవిత్వాన్ని కుప్పబోయటం కాదు/ కరకు కత్తుల జేసి/ వ్యవస్థ విషపు వేళ్ళను తెగనరుక విసరాలి'' అన్న దీక్షతో సాగుతుంది. మానవీయత కోసం, మనిషి కోసం నదిలా ఉదయమిత్ర కవిత్వం పరుగెడుతుంది. మనిషి అభ్యున్నతికి తోడ్పడుతుంది. మనిషిలో ధైర్యాన్ని నూరిపోసి, జీవితంపైన నమ్మకాన్ని కలిగించే విధంగా ఈ కవి కలం సాగిపోతూ వున్నది. ఈ కవితలన్నింటిలో భాష చాలా సులభమైన వాక్యాలతో నిండి వుంది. పురోగమనంపై దారి చూపుతుంది.
- కె.హరనాథ్, 9703542598
పద్యంపై ప్రేమని పెంచే కావ్యాలు
ఉత్పల సత్యనారాయణాచార్య నగర కావ్యాలు, పేజీలు: 208, వెల: రూ.75
ప్రతులకు : తెలంగాణ సాహిత్య అకాడమీ, కళాభవన్, రవీంద్రభారతి, హైదరాబాద్-500 004
నగర జీవనాన్ని, ఆ జీవన ఔన్నత్యాన్ని అద్భుతమైన కవిత్వంగా సృజించారు ఉత్పల సత్యనారాయణ చార్య. వారి పద్య కావ్యాల్లో 'ఈ జంట నగరాలు హేమంత శిశిరాలు, పాతబస్తీ విలాసము' ఎంతో విలువైనవి. ఈ కావ్యాల్లోని సౌందర్యం విశ్వనాథ సత్యనారాయణ, దాశరథి, సినారె, తిరుమల శ్రీనివాసాచార్య వంటి ప్రముఖులని ముగ్ధులని చేసింది. వాటిని ఇపుడు తెలంగాణ సాహిత్య అకాడమీ పునర్ముద్రించడం ముదావహం. పద్యంలో ఆధునిక జీవనం ఒదిగిన తీరుకు దర్పణం ఈ కావ్యాలు. పాతబస్తీని, హైద్రాబాద్, సికింద్రాబాద్లలోని నవ్యపోకడల్ని ప్రతిఫలించిన సుందర కావ్యాలు ఇవి. పద్యం మీద ప్రేమని పెంచే ఈ కావ్యాలని కవిత్వ ప్రేమికులకు అవశ్య పఠనీయం.
- వికర్ణుడు
వస్తు స్పృహ, భావుకత కలిగిన కవిత్వం
నది అంచున నడుస్తూ (కవితా సంపుటి), డా||సి.భవానీదేవి, పేజీలు : , వెల : 150/-, ప్రతులకు : రచయిత్రి, 102, గగన్మహల్ అపార్ట్మెంట్స, హైదరాబాద్ - 29.
ఒక నది, దాని పుట్టుక నుండి సముద్ర గర్భంలో కలిసేదాకా దాని ప్రయాణం - మానవ జీవిత యానం రెంటికీ ఒక గొప్ప సామ్యత వుంది. సాగరంలో సంగమించే వరకూ, నది నిరంతరంగా ప్రవహిస్తూనే వుంటుంది. కొండలు, కోనలు, లోయల్లోంచి ప్రవహించినప్పుడు వేగంగా మైదానంలోకి చేరాక నెమ్మదత్వం సంతరించుకుని ఆ తరువాత, తన ఆత్మనే కోల్పోయి సముద్రంలో కలుస్తుంది. సూర్య తాపానికి మేఘాల్లో చేరి వర్షపు చినుకై, పర్వత సానువుల్లో రాలి, తిరిగి తన ప్రయాణం మొదలెడుతుంది. మానవ జీవితమూ ఇంతే! జననం, శైశవం, యవ్వనం ఉరుకులు పరుగుల అనంతరం నెమ్మదితత్వం, మరణం - మళ్ళీ ఎక్కడో జన్మించటం.
డా||సి.భవానీదేవి ఈ నీతిని బాగా అధ్యయనం చేశారు. నది అంచున నడుస్తూ మనిషి ఎన్నడూ విడిచిపోలేని 'జీవన' సంగీతాన్ని వినిపిస్తున్నారు. ఆ ఆలాపనల్లోని, తన 56 జ్ఞాపకాల్ని 'అంతర్నిహిత భావ సాంద్రత'లో మనసును ఆకట్టుకునే భాషతో మనకు అందిస్తున్నారు. తన ముంగిట అల్లుకున్న పొదరింటికి అనుకోని అతిథిలా వచ్చాయి' అంటూ ఆహ్వానిస్తున్నారు. కవిత్వంలో అగుపించే అంత:శ్చేతనకు పాఠకుడు కూడా ఒకరకమైన వేదనకు గురవుతాడు. విలక్షణమైన ఈ కవిత్వం పాఠకుల్ని ఆకట్టుకుంటుంది.
- కూర చిదంబరం,
8639338675