Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొత్తగా వేసిన తారురోడ్డులా నల్లగా చిక్కగా వుంది చీకటి. అబ్బా అర్ధరాత్రి అయింది ఒకటి కాదు రెండు కాదు పన్నెండు గంటలు కొట్టాలి అనుకుంది గడియారం.
ఉన్నట్టుండి మెలకువ వచ్చింది జగన్నాథానికి. మంచం మీద లేచి కూచున్నాడు. రాత్రి పడుకుంటే తెల్లవారి సూర్యుడు వచ్చి లేవవోరు అన్నదాకా లేవని మొద్దు నిద్ర తనది. అలాంటిది ఇలాగ సడన్గా మెలకువ రావడం యేమిటి అనుకున్నాడు.
అన్నట్టు జగన్నాథం ఆ ప్లాట్లో ప్రవేశించింది ఉదయమే. జగన్నాథమే కాదు వెంకటేశం, శ్రీనివాసూ, చంద్రశేఖరూ, మరొకరూ, ఇంకొకరూ అంతా ఆ కొత్తగా కట్టబడిన అపార్ట్మెంట్లో తమ తమ ఫ్లాట్లలోకి ఇవాళే వచ్చి చేరారు. గుమ్మడికాయలూ, కొబ్బరి కాయలూ పగిలేయి. గుమ్మాలకి తోరణాలు ఊగులాడేయి. ఫ్లాట్లల్లో వోనర్లతో పాటు చుట్టాలూ పక్కాలూ వున్నారు.
మేలుకున్న జగన్నాథం కిటికీలోంచి బయటకు చూశాడు. దూరంగా సిటీ లైట్లు వెలుగుతున్నాయి. ఎక్కడ్నుంచో పరుగెత్తుకొస్తున్న గాలి వగరుస్తున్న చప్పుడు వస్తున్నది. తను ఎందుకు మేలుకొన్నాడో అర్థం కాలేదు జగన్నాథానికి. ఎందుకా అని ఆలోచిస్తుంటే సన్నగా లీలగా ఏదో చప్పుడు చెవులకు తాకింది. చెవులు రిక్కించి విన్నాడు. చప్పుడు కాదది ఏడుపు. సందేహం లేదు. ఎవరో ఏడుస్తున్నారు. ఆ చప్పుడే తనని అర్ధాతరంగా నిద్దర లేపిందనుకున్నాడు జగన్నాథం.
ఉలిక్కిపడ్డాడు. ఎవరో ఆడమనిషి ఏడుస్తున్నట్టుంది. ఒక్క ఉదుట్న లేచి నిలబడ్డాడు. కిటికీ దగ్గర నిలబడి విన్నాడు. ఎవరో కింద నించి ఏడుస్తున్నట్టుంది. ఇంత రాత్రి పూట ఎవరు ఏడుస్తున్నారు? వెన్నులో చలి పుట్టింది. మనుషులేనా లేక... ఆలోచిస్తే భయంతో ఒణుకు వచ్చేట్టుంది. ఏంచేయాలేంచేయాలి అనుకున్నాడు. కిందకి వెళ్ళి చూడాల్సిందేననుకున్నాడు. ఎవరికీ నిద్రాభంగం కలక్కుండా తలుపు తీసి వరండాలోకి వచ్చాడు. అప్పుడు వచ్చింది అనుమానం. తనకి వినిపించిన ఏడుపు చప్పుడు ఇంకెవరికీ వినిపించలేదా? వినిపిస్తే వాళ్ళూ లేచేవారే కదా అనుకున్నాడు.
ఒకటవ ఫ్లోరే కనక మెట్ల మీదుగా కిందకి వచ్చాడు. సెల్లార్లో నడుస్తుంటే ఆ ఏడుపు ఇంకా స్పష్టంగా వినిపించసాగాంది. దడదడలాడుతున్న గుండెని చేత్తో పట్టుకుని ఆ ఏడుపు వినవస్తున్న వైపుకి వెళ్ళాడు. గేటు బయట ఉన్న కంకరకుప్ప మీద ఎవరో కూచుని ఉన్నట్టనిపించింది.
కాసేపు వెళ్దామా వద్దా అని తటపటాయించి గేటు తీసుకుని బయటకు వెళ్ళాడు. అపార్ట్మెంట్ కట్టేటప్పుడు పనులకి వచ్చిన వాళ్ళ గుడిసెలు అక్కడ వున్నాయి. వీధిలైటు వెలుతురులో ఓ ఆడమనిషి ముఖానికి చేయి అడ్డం పెట్టుకుని ఏడుస్తున్నది.
ఇంతరాత్రివేళ ఆమె అక్కడ కూచుని ఏడవడం ఏ మాత్రం నచ్చలేదు జగన్నాథానికి.
బాగా పరీక్షగా చూసి మనిషేనని నిర్థారించుకున్నాక అడుగు ముందుకు వేశాడు జగన్నాథం. గబగబా నడిచి కంకర దగ్గరికి చేరుకున్నాడు. ఆ ఆడమనిషిని నాలుగు తిట్టి అక్కడ్నించి వెళ్ళగొడదామనుకున్నాడు. ఏరు ఎవరమ్మా అంటూ తలపైకెత్తాడు. తను చూసిన ఆడమనిషి అక్కడ లేనేలేదు.
గతుక్కుమన్నాడు జగన్నాథం. గాబరా పడ్డాడు జగన్నాథం. కంకర కాలికి తగిలి బోర్లా పడబోయాడు జగన్నాథం. అతి కష్టమ్మీద తమాయించుకు నిలబడ్డాడు. ఏడుపు వినిపించడం ఆగిపోయింది. తను పొరపడ్డాను అనుకున్నాడు. అక్కడ్నించి వెనక్కు అడుగువేశాడు. మళ్ళీ వినపడింది ఏడుపు. ఈసారి ఏడుపు గేటు లోపల్నుంచి వినిపించింది.
చెమట జగన్నాథం ఒంటిని తడిపేసింది. వణుకుతున్న కాళ్ళతో గేటులోపలికి వెళ్ళాడు. సెల్లార్లో ఓ పిల్లర్కి ఆనుకుని నిలబడ్డ ఆడమనిషి ఏడుస్తూ వుంది. అక్కడ్నించి ఆమె ఇక్కడికి ఎలా వచ్చిందీ అర్థం కాలేదు జగన్నాథానికి. ఎ.. ఎ.. ఎవరు? అన్నాడు వణుకుతూ. ఆడమనిషి తలెత్తింది. కన్నీళ్ళు ధారాపాతంగా కారుతున్నాయి. ఉన్నట్టుండి పెద్దగా అరిచింది 'చెరువు చచ్చిపోయింది' అని. జగన్నాథానికి ఏమీ అర్థం కాలేదు. ధైర్యం చేసి అసలు నువ్వెవరు? అన్నాడు. 'నేనే చెరువుని' అందా ఆడమనిషి. 'నన్ను చంపేశారు' అంటూ ఈసారి పెద్దగా ఏడవసాగింది.
ఎట్లా తిరిగి తన గదిలోకి వచ్చేశాడో అర్థం కాలేదు జగన్నాథానికి. మర్నాడు నిద్ర లేచిన జగన్నాథానికి రాత్రి జరిగింది కలో నిజమో అర్థం కాలేదు.
సిటీకి దగ్గరగా వున్న చెరువుల్ని హత్య చేశారు రాజకీయనాయకులు, భూ కబ్జాదారులు, రియల్ ఎస్టేట్ బిల్డర్లు. వాళ్ళు చంపేసిన చెరువులన్నీ ఇళ్లయ్యేయి, కాలనీలయ్యేయి. ఆ చెరువే ఇలా అర్ధరాత్రి హృదయవిదారకంగా ఏడిస్తే, ఎవరైనా నివాసం ఉండగలరా అక్కడీ
- చింతపట్ల సుదర్శన్,
9299809212