Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''పునరపి జననం, పునరపి మరణం
పునరపి జననీ జఠరే శయనం
ఇహ సంసారే, బహు దుస్సారే
కృపయా పారే పాహి మురారే''
అన్నారు జగద్గురువు ఆది శంకరాచార్యులవారు భజగోవిందంలో. మనిషికి కర్మ పరిపక్వము చెంది మోక్ష ప్రాప్తి కలిగేంతవరకు జననం, మరణం ఒక దాని వెనుక మరొకటి వస్తుందని, ఈ జనన మరణ రుజాగ్రస్థ శాఖా సంక్రమణం నుండి విడుదల పొందడానికి ఆ దేవదేవుడి కరుణ పొందటం కంటే వినా మార్గం లేదని అర్ధం. మరో సందర్భంలో జాన్కీట్స్ అనే ఆంగ్ల మహాకవి ప్రకృతిలోని ఆరు రుతువులను మనిషి జీవితంలోని వివిధ దశలతో పోలుస్తూ హ్యూమన్ సీజన్స్ అనే అద్భుతమైన కవిత ఒకటి రాసాడు. మన తెలుగు మహా కవి శ్రీశ్రీ తన 'శైశవ గీతం'లో ''రుతువుల రాణి వసంత మాసం మంత్ర కవాటం తెరచింది'' అని బాల్యాన్ని వసంత మాసంతో పోల్చాడు. చైల్డ్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ మాన్ అన్న ఆంగ్ల కవి మాటలకి శరీరం అశాశ్వతం, ఆత్మ శాశ్వతం అనే హిందూ కర్మ సిద్ధాంతానికి ఎక్కడో లంగరు కుదురుతుంది.
ఈ వాక్యాలన్నీ విడివిడిగా కనిపిస్తున్నా ఒక్కటిగా మారి 'స్ప్రింగ్, సమ్మర్, ఫాల్, వింటర్ అండ్ సమ్మర్' అన్న కొరియన్ సినిమా చూస్తున్నపుడు నన్ను ఆలోచనలో పడవేశాయి. 2003లో వచ్చిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కావలసినంత సంచలనం సృష్టించింది. 21వ శతాబ్దపు 100 గొప్ప సినిమాలలో ఒకటిగా బీబీసీ టీమ్ ఎంపిక చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమా ప్రియులందరినీ తన మ్యాజిక్తో మాయ చేసింది.
జాన్ కీట్స్ చెప్పినట్లుగానే మనిషి జీవితంలోని వివిధ దశలను ఆయా రుతువులలో పోలుస్తూ కిమ్ కి డ్యూక్ వెండి తెర మీద చిత్రించిన ఆధ్యాత్మిక కావ్యం 'స్ప్రింగ్ సమ్మర్ ఫాల్ వింటర్ అండ్ స్ప్రింగ్'. ఒక బౌద్ధ సన్యాసి బాల్యం నుండి వృద్ధాప్యం వరకు సాగించిన జీవన యాత్ర ఈ సినిమా. కొరియాలోని దట్టమైన సతత హరితారణ్యం మధ్య ఒక సరస్సు. ఆ సరస్సు మధ్య ఒక బౌద్ధ ఆశ్రమం. ఆశ్రమం నుండి బయటకు అడవిలోకి వెళ్ళలంటే పడవలో వెళ్ళవలసిందే. ఆశ్రమానికి, అడవి ఒడ్డుకు మధ్య ఒక పెద్ద దర్వాజా. పడవలో వచ్చి ఆ దర్వాజా దగ్గర పడవను లంగరేసి అడవిలోకి వెళ్ళాలి. మళ్ళీ అడవి నుండి వచ్చేటప్పుడు ఆ దర్వాజా నుండి లోపలి వెళ్లి పడవలో ఆశ్రమానికి వెళ్ళాలి. సినిమా మొత్తం ఈ ఆశ్రమం, సరస్సు, అడవిలోనే జరుగుతుంది.
బౌద్ధ గురువు, అతడు బోధనలు చేసే ఒక చిన్న పిల్లవాడు, వైద్యం కోసం బౌద్ధ గురువు దగ్గరికి వచ్చిన ఒక తల్లీ కూతురు. ఈ నాలుగే పాత్రలు. సినిమా వసంతం (స్ప్రింగ్) అంటూ మొదలవవుతుంది. బౌద్ధ గురువు అతడి శిష్యుడు ఇద్దరూ వనమూలికల కోసం అడవికి వెళతారు. శిష్యుడు మరీ చిన్న పిల్లాడు. ఐదారేళ్ళు వుంటాయేమో. గురువు వనమూలికలు వెతుకుతుంటే శిష్యుడు బోలెడన్ని ఆటలు ఆడుతుంటాడు. సరస్సు దగ్గర చేప పిల్లను పట్టుకుని చేప పిల్ల తోకకు దారం కట్టి దారం చివర ఒక రాయిని కట్టి నీళ్లలోకివదులుతాడు. కప్పకి రాయి కడతాడు. అవి ముందుకు వెళ్లలేక ఇబ్బంది పడుతుంటే చప్పట్లు కొడుతూ ఆనంద పడతాడు. ఒక పాముకు కూడా అలాగే రాయిని కడతాడు. శిష్యుడి ఈ ఆటలన్నీ గురువు నిరపేక్షంగా చూస్తూ ఉంటాడు. ఆ రాత్రి ఆశ్రమంలో శిష్యుడు నిదుర పోతున్నప్పడు ఒక పెద్ద రాయిని తీసుకుని వచ్చి శిష్యుడి నడుముకు కడతాడు. నిద్ర లేచిన శిష్యుడు నడుముకు కట్టిన రాయి బరువుతో నడవలేక గురువును రాయి నుండి విడుదల చేయమంటే ''నిన్న నువ్వు చేప పిల్లనీ, కప్పనూ, పామునూ ఇలాగే కట్టావు కదా. అవి ఎంత బాధపడి వుంటాయో ఆలోచించావా?'' అని అడుగుతాడు. తప్పైపోయింది. క్షమించమని వేడుకుంటే ''నువ్వు ఈ రాయితో ఇలాగే అడవిలోకి వెళ్ళు. నువ్వు రాళ్లు కట్టిన చేప, కప్ప, పాము ఎలా ఉన్నాయో చూడు. అవి అన్నీ క్షేమంగా ఉంటే నీకు ఈ బరువు నుండి విముక్తి కలుగుతుంది. వాటిలో ఏ ఒక్కటి చనిపోయినా ఈ బరువును హృదయంలో జీవితాంతం మోయాలి'' అని చెప్తాడు. శిష్యుడు ఆ బరువుతోనే అడవిలోకి వెళతాడు. చేప పిల్ల చనిపోయి ఉంటుంది. కప్ప ఇంకా పెనుగులాడుతూనే ఉంటుంది. పాము రక్తం మడుగులో పడి ఉంటుంది. రాయి బరువుతో కదలలేక ఉన్న పామును మరో జంతువు ఏదో చంపేసి ఉంటుంది. ఆ దృశ్యాన్ని చూడగానే శిష్యుడు వెక్కివెక్కి ఏడుస్తాడు. బుగ్గల మీద కన్నీళ్లు చారికలు కడతాయి. ఇక్కడితో వసంతం అయిపోతుంది.
రెండో అధ్యాయం గ్రీష్మం. శిష్యుడు పదహారేళ్ళ వాడు అయ్యాడు. ఒక రోజు అడవిలో నడుస్తూ ఉండగా తల్లీ కూతుళ్లు అయిన ఇద్దరు స్త్రీలు ఎదురుపడతారు. గురువు గారి ఆశ్రమం ఎక్కడ అని అడుగుతారు. శిష్యుడు వాళ్ళిద్దరినీ తీసుకుని ఆశ్రమానికి వెళతాడు. కూతురు అనుభవిస్తున్న రుగ్మత ఏమిటో ప్రేక్షకుడికి దర్శకుడు చెప్పడు. కానీ ఆమె నీరసంగా జ్వర పీడితలా కనిపిస్తుంది. కొన్నాళ్ళు ఆశ్రమంలో ఉంటే వైద్యం చేసి అమ్మాయిని ఆరోగ్యవంతురాలిని చేసి పంపిస్తాను అని గురువు చెపితే, కూతురును ఒంటరిగా వదిలి వేసి తల్లి వెళ్ళిపోతుంది. సమాన వయస్క అయిన స్త్రీని చూడగానే అతడిలో దైహిక వాంఛలు మేల్కొంటాయి. ఆమెను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఒకటి రెండు సార్లు చొరవ చేయబోతే ఆమె తిరస్కరిస్తుంది. కానీ ఆ తిరస్కరణ కొద్ది సేపే. ఒక వెన్నెల రాత్రి పంచభూతాల సాక్షిగా వాళ్లిద్దరూ ఏకమౌతారు. చివరకు ఆ విషయం గురువు గారికి తెలుస్తుంది. తప్పును క్షమించమని అడిగితే...
గురువు ''ూబర్ శ్రీవaసర ్శీ సవరఱతీవ టశీతీ జూశీరరవరరఱశీఅ. aఅస జూశీరరవరరఱశీఅ శ్రీవaసర ్శీ ఎబతీసవతీ'' అని చెప్తాడు. నీకిప్పుడు వొంట్లో బావుందా అని అమ్మాయిని అడిగితే ఆ అమ్మాయి బావుంది అనగానే ఆమెను పంపించివేస్తాడు. ఆ వియోగాన్ని భరించలేని శిష్యుడు ఆ రాత్రి ఆశ్రమంలో వున్న చిన్న బుద్ధుడు విగ్రహాన్ని, ఆశ్రమంలో తిరుగాడుతున్న కోడిపుంజును తీసుకుని ఆ అమ్మాయిని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళిపోతాడు. బౌద్ధ సంప్రదాయంలో కోడిపుంజు లైంగిక కోరికలకు ప్రతీక. ఇప్పుడా శిష్యుడు రెండు రకాల బరువులతో సతమతమౌతున్నాడు. కోడి పుంజు దైహిక వాంఛలకు ప్రతీక అయితే, బుద్ధుడి విగ్రహం గురువు బోధనలకు ప్రతీక. శిష్యుడు అలా వెళ్లి పోవడంతో గ్రీష్మం అనే అధ్యాయం ముగుస్తుంది.
మూడో అధ్యాయం శిశిరం. దీన్నే కొన్ని చోట్ల ఫాల్ అనీ, కొన్ని వెర్షన్స్లో ఆటమ్ అనీ అన్నారు. కొన్ని సంవత్సరాల తరువాత బౌద్ధ గురువు ఒక రోజు పక్కనే ఉన్న ఒక గ్రామానికి వెళ్లి తిరిగివస్తూ వస్తూ ఒక పిల్లిని తన వెంట పెట్టుకుని వస్తాడు. కొరియన్ జానపదాలలో పిల్లి దుష్టశక్తులను పారదోలుతుంది అని ఒక నమ్మకం వుంది. అలాగే కొన్ని తూర్పు ఆసియా దేశాలలో పిల్లిని లైంగిక వాంఛలకు ప్రతీకగాను భావిస్తారు. వృద్ధుడైన బౌద్ధ గురువు గ్రామం నుండి పొట్లం కట్టి తెచ్చుకున్న ఆహారాన్ని భుజిస్తున్నప్పుడు ఆ పొట్లం కట్టిన పేపర్లో ఒక మూలగా తన పాత శిష్యుడి ఫోటో కనిపిస్తే విషయం అంతా వివరంగా చదువుతాడు. అతడు తన భార్యను చంపేశాడని, అతడికోసం పోలీసులు వెతుకుతున్నారని అందులో ఉంటుంది. ఆ రాత్రి బౌద్ధ గురువు తన శిష్యుడి కోసం చిరిగిపోయిన ఒక స్వెటర్ను స్వయంగా కుడతాడు. గురువు ఊహించినట్టుగానే శిష్యుడు తిరిగి వస్తాడు. వస్తూ వస్తూ రక్తపు మరకలు అంటిన ఒక కత్తిని, బుద్ధుడి విగ్రహాన్ని దుస్తుల మధ్య దాచుకుని తెస్తాడు. ప్రధాన ద్వారం దగ్గరకు శిష్యుడు రాగానే ఒక్క మాటైనా మాట్లాడకుండా ''రా పడవ ఎక్కు. వెళదాం'' అంటాడు గురువు. ఇద్దరూ ఆశ్రమానికి వస్తారు. శిష్యుడు మాత్రం అశాంతితో కుతకుత ఉడికిపోతూ ఉంటాడు. ఆ రాత్రి విశ్రాంతిగా కూర్చున్నప్పుడు ''ఇక్కడి నుండి వెళ్ళిపోయాక నీ జీవితం ప్రశాంతంగా గడిచిందా?'' అని గురువు ప్రశ్నిస్తాడు. శిష్యుడు ఏ సమాధానమూ చెప్పడు. ఆ మధ్య రాత్రి శిష్యుడు కళ్ళు, చెవులు, ముక్కు, నోరు మూసుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేస్తాడు. గురువు అతడిని వారించి, విపరీతమైన ఆగ్రహంతో కొట్టి అతడిని తాడుతో వేలాడదీస్తాడు. భార్యను చంపినంత తేలికగా నిన్ను నువ్వు చంపుకోలేవు అంటాడు. వెంటనే బయటకు వచ్చి ప్రజ్ఞా పారమితలోని హృదయ సూత్రను ఇంటిముందు రాస్తాడు. హృదయ సూత్ర రాసేటప్పుడు తాను తీసుకుని వచ్చిన పిల్లిని వొళ్ళో కూర్చోపెట్టుకుని, దాని తోకను నల్లటి సిరాలో ముంచి రాస్తాడు. తాడుతో కట్టి వేయబడిన శిష్యుడు కింద పడి రక్తపు మరకలు అంటిన కత్తితోనే జుట్టు కత్తిరించుకుని మళ్ళీ బౌద్ధ సన్యాసి వేషంలో బయటకు వస్తాడు. తాను రాసిన హృదయసూత్రను చెక్కి రంగులు వేయమని, అలా చేయడం ద్వారా అతడిలోపలి అశాంతి తగ్గుతుందని చెప్తాడు. శిష్యుడు అలా చెక్కుతూ ఉండగా ఇద్దరు డిటెక్టివ్లు శిష్యుడ్ని వెతుక్కుంటూ ఆశ్రమానికి వస్తారు. గురువు మాట మీద శిష్యుడు పని పూర్తి చేసేవరకు ఉండి అతడిని తీసుకుని వెళతారు. శిష్యుడు వెళ్ళిపోయిన తరువాత గురువుకు తన చివరి ఘడియలు సమీపించాయన్న ఎరుక కలుగుతుంది. పడవలోలోనే చితి పేర్చుకుని తనను తాను దహించుకుంటాడు.
నాలుగో అధ్యాయం హేమంతం. కొన్ని సంవత్సరాల తరువాత శిష్యుడు తిరిగి వస్తాడు. సరస్సు అంతా ఘనీభవించి, మంచు గడ్డకట్టుకుని ఉంటుంది. అతడా మంచు మీద అలా నడుచుకుంటూ వచ్చి గురువుగారి పాద రక్షలు, దుస్తులు, అగ్ని సంస్కారం పొందడానికి ముందు వదిలివేసిన వాటిని చూస్తాడు. వసంతంలో చేపపిల్ల, కప్ప, పాము; గ్రీష్మంలో కోడిపుంజు; శిశిరంలో పిల్లి లాగే ఆ అధ్యాయంలో మళ్ళీ పాము ఒకపాత్రగా కనిపిస్తుంది . బౌద్ధ సంప్రదాయంలో పాము క్రోధానికి ప్రతీక. శిష్యుడు గడ్డకట్టిన మంచును తవ్వినప్పుడు గురువుగారి దంతం ఒకటి దొరుకుతుంది. శిష్యుడు గడ్డకట్టిన మంచులో ఒక బుద్ధుడి విగ్రహాన్ని చెక్కుతాడు. దానికి జ్ఞాన నేత్రంగా ఉండవలసిన చోట గురువుగారి శరీరాన్ని (చిన్న చిన్న పూసల లాంటి అవశేషాలు) ఎర్రటి గుడ్డలోలో చుట్టి ఉంచుతాడు. ఆశ్రమంలో అతడికి ఒక పుస్తకం దొరుకుతుంది. దాన్నిండా బొమ్మలతో కూడిన ధ్యాన సూత్రాలు ఉంటాయి. వాటిని శిష్యుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు.
చివరకు ఒక స్త్రీ ఒక చిన్న పిల్లవాడిని పొత్తిళ్ళలో పట్టుకుని ఆశ్రమానికి వస్తుంది. ఆ స్త్రీ తన మొహమంతా ఒక స్కార్ఫ్ చుట్టుకుని ఉంటుంది. దర్శకుడు ఆమె మొహం ప్రేక్షకుడికి చూపించడానికి ఇష్ట పడడు. ఆమె ఆ శిశువును ఆశ్రమం ముంగిట ఉంచి రాత్రికి రాత్రి పారిపోయే క్రమంలో చనిపోతుంది. మర్నాడు శిష్యుడు మంచును తవ్వి ఆ స్త్రీ మొహం చూడాలని ప్రయత్నం చేస్తాడు. శిష్యుడు చూస్తాడు కానీ ఆ స్త్రీ మొహం ప్రేక్షకుడికి దర్శకుడు చూపించడు.
తన స్వయం శిక్షణ అంతా ముగిసాక ఆశ్రమంలో ఉన్న ఒక పెద్ద వలయకారపు బండను నడుముకు కట్టుకుని బుద్ధుడి విగ్రహాన్ని తీసుకుని శిఖరారోహణకి బయట దేరుతాడు. ఆ పెద్ద వలయాకారపు బండ బౌద్ధ సంప్రదాయపు భావచక్రకి ప్రతీక. జననం మరణం అనేవి అలా ఒక చక్రంలా పరిభ్రమిస్తాయని చెప్తుంది. శిఖరారోహణ చేసేటప్పుడు అతడు ఎక్కలేక ఎక్కడం, కిందకు జారడం లాంటివన్నీ అతడు బాల్యంలో చేసిన కర్మ ఫలాలుగా దర్శకుడు పరోక్షంగా చెప్తాడు. చివరకు శిఖరం చేరుకున్నాక బుద్ధుడిని అక్కడ ఆ భవచక్రం మధ్య ప్రతిష్టించి వెళ్ళిపోతాడు ఇక్కడితో నాలుగవ అధ్యాయం ముగుస్తుంది.
చివరిది మళ్ళీ వసంతం. ఆ స్త్రీ వదిలివెళ్లిన పొత్తిళ్ళలోని పిల్లాడు శిష్యుడు స్థానంలోకి, శిష్యుడు గురువు స్థానంలోకి వెళతారు. ఇద్దరూ అడవికి వెళ్ళినపుడు మళ్ళీ ఆ చిన్న శిష్యుడు చేప పిల్లకి దారం కడతాడు. కప్పకి రాయి కడతాడు. మళ్ళీ కథ మొదలు. అవును పునరపి జననం. పునరపి మరణం. పునరపి జననీ జఠరే శయనం.
గురు శిష్యుల బంధం మళ్ళీ కాల చక్ర భ్రమణాన్ని ముందుకు తెస్తుంది.
అమాయకత్వం, అన్వేషణ, ఆలోచనాలేమి, అందం, అనుభవం... వీటిని వసంతంగా; నేను అనే భావం, ఉగ్రత, గ్రీష్మంగా; ఆశ నిరాశల దోబూచులాటలు, అస్తిత్వ అన్వేషణలు శిశిరంగా; నిర్లిప్తత, ఏదైతే అది అవుతుందిలే అనే అలసట హేమంతంగా జీవితంలోని వివిధ దశలను, వివిధ భావ సంచయాలను పోలుస్తూ సినిమా ముందుకు జరుగుతుంది. కొరియన్ లాండ్స్కేప్ కళ్ళకి విందుగా, మనసుకు పసందుగా ఉంటుంది.
కోరిక దు:ఖానికి మూలం అంటుంది బౌద్ధం. నిష్కామ కర్మ అంటుంది హైందవం. నిష్కామంగా కర్మ చేయడం మానవ మాత్రుడికి సాధ్యంకాదు. కనుక కర్మ ఫలాన్ని అనుభవించవసిందే అంటుంది హైందవం. ఆ ఫలం దు:ఖం అంటుంది బౌద్ధం. ఇలా సినిమా చూస్తున్నంత సేపు ఏవో ఆలోచనలు మిమ్మల్ని ఆరాది చేస్తూనే ఉంటాయి.
ఈ ఆదివారం ఈ సినిమా చూసి మీ ఆధ్యాత్మిక దాహాన్ని అసంతృప్త స్థాయిలో అయినా సరే సంతృప్తి పరచుకోండి.
- వంశీకృష్ణ,
9573427422