Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజావారికి ఒంట్లో బావులేదు. విషయం తెల్సీ తెలియంగానే మంత్రి గారు సేనానినీ, సేనాని కోశాధికారినీ, కోశాధికారి కొత్వాలునీ, కొత్వాలు రక్షకభటాధికారినీ చివాట్లు పెట్టేరు.
ప్రధాన వైద్యులూ ఉపవైద్యులూ, పరిచారికులూ... సరుకులూ సరంజామాలతో పరుగెత్తుకు వచ్చేరు. మంచం మీద నీరసంగా కూచునున్న రాజావారిని ప్రధాన వైద్యుడు బాగా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకు పరీక్షించాడు. నాడి పట్టి చూశాడు. నాలుక బయట పెట్టించి చూశాడు. కళ్ళు బాగా తెరిపించి చూశాడు. వీపు నిమిరాడు. ఛాతీ మీద అరచేయి ఆనించాడు. అంతా సజావుగా సవ్యంగా భేషుగ్గానే వుందనిపించింది.
అసలు సమస్య ఏమిటి రాజావారూ అని సవినయంగా అడిగాడు. రాజావారు నీర్సంగా 'ఈ మధ్య నిద్ర సరిగ్గా పట్టడం లేదు' అన్నాడు.
ఓస్ అంతేనా అనుకున్నారు వైద్యబృందం. ప్రధాన వైద్యుడు మాత్రం ఖంగారు పడుతున్నట్టు ముఖం పెట్టి 'చిత్రం! ఎందుకలాగ?' అన్నాడు.
ఏమో మరి. నమిలేవీ, తాగేవీ, చప్పరించేవీ, జుర్రేవీ అన్నీ టైం ప్రకారం అందిస్తూనే వున్నాను అన్నాడు రాజు గుడి గోపురంలా, ఎద్దు మూపురంలా నిలబడున్న కడుపువైపు చూసుకుంటూ.
'అస్సలు పట్టడం లేదా?' అని ప్రశ్నించాడు వైద్యుడు రాజావారి ముఖంలోకి పరీక్షగా చూస్తూ.
'పట్టడం లేదంటే అస్సలు నిద్ర పట్టడం లేదని కాదు. పట్టినా మధ్యరాత్రి ఉలిక్కిపడి లేస్తున్నాను' అన్నాడు రాజు.
'పీడకలలేమైనా బాధిస్తున్నాయా తమర్ని' అనడిగాడు మంత్రి.
'ప్రజా సమస్యలపైన ప్రజా సంక్షేమం పైన తమరికి ఉన్న శ్రద్ధ కారణంగా ఒత్తిడికి గురవుతూ నిద్ర చెడగొట్టుకుంటున్నారు ప్రభూ' అన్నాడు సేనాని తన వంతుగా.
'పైత్యం ప్రకోపించినప్పుడు, మధు సేవనం వల్ల కాలేయం కంగారు పడ్డప్పుడు నిద్రలేమి సమస్య రావచ్చు. మరేం పర్వాలేదు. మూలికలూ, గుళికలూ, కాషాయాలూ అన్నీ తయారు చేసి పంపుతాం' అన్నాడు వైద్యులు.
'కొన్నాళ్ళు తమరు ప్రజల సంగతి మరచిపొండి. అసలు వాళ్ళనే వాళ్ళు వున్నారనే విషయం పట్టించుకోకండి' అన్నాడు మంత్రి.
స్వామీజీ వస్తున్నారు పక్కకు తప్పుకోండి అనరిచారెవరో. అంతా పక్కకు తప్పుకున్నారు. కాషాయ వస్త్రాలూ, మెళ్ళో రుద్రాక్షలూ, నుదుటిమీద విభూది పట్టెలూ వున్న స్వామీజీ రాజావారి గురువు. ఆయన రాకతో ఎక్కడివారక్కడ జారుకున్నారు. గదిలో రాజావారూ స్వామీజీయే మిగిలారు. స్వామీజీ రాజావారి సమస్యను తెలుసుకుని మీనమేషాలు లెక్కపెట్టకుండానే చిరునవ్వుతో సమస్యకు పరిష్కారం చెప్పేశారు.
రాజావారికి సుఖ నిద్ర పట్టాలన్నా, పీడకలలు రాకుండా వుండాలన్నా, రాచరికం కలకాలం నిలవాలన్నా, రాజావారి కీర్తి పదికాలాల పాటు పదిలంగా వుండాలన్నా ప్రస్తుతం వారు వుంటున్న రాజభవనాన్ని కూల్చేసి, నేలమట్టం చేసి మరో రాజభవనాన్ని నిర్మించడమే ఆ పరిష్కారం.
అసలే రాజ్యం అప్పుల ఊబిలో చిక్కుకుని ఉంది. విద్యా వసతులు లేవు, వైద్య వసతులు అరకొరగా వున్నాయి. నిరుద్యోగ సమస్య భగ్గుమంటున్నది. ఇలాంటి సమయంలో నిక్షేపంగా వున్న రాజభవనాన్ని కూలగొట్టడం తిరిగి కట్టడం సాధ్యమేనా అని రాజోద్యోగులు సందేహించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ స్వామీజీ చెప్పిన విధంగా ప్యాలెస్ను కూలగొట్టి తిరిగి కట్టి వాస్తు పురుషుడి ఫుల్ సపోర్ట్ పొంది తీరాల్సిందేనన్నారు రాజావారు.
అనేక సంవత్సరాల నుంచీ రాజులు ఆ భవనంలో వుంటూ రాజ్యం చేశారని, ప్రజలు సుఖశాంతులతో జీవించేట్టు పరిపాలించారని, ఇప్పటికిప్పుడు రాజభవనాన్ని కూలగొట్టడం అనవసరం అని ప్రజలు గొణుక్కున్నారు. కేవలం తనకు నిద్రపట్టడం లేదని, పీడకలలు వస్తున్నాయని ప్రజాధనాన్ని మట్టిలో పోయడం తగునా అని లోలోపల తిట్టుకున్నారు.
ఇప్పటికే రాజావారి అవకతవకల వల్ల అర్థం లేని పథకాల కారణంగా ఖజానా ఖాళీ అయిందని, పూర్వీకులు దాచిపెట్టిన చివరాఖరి డబ్బు పెట్టెను రాజావారి ముందుంచాడు కోశాధికారి.
ప్రధాన రాజోద్యోగుల ముందు పెట్టె తెరువబడింది. డబ్బు సంచులపైన ఒక చీటీ వున్నది. రాజావారు అది మంత్రిగారి చేతిలో పెట్టి చదవమన్నారు. మంత్రిగారు చదివి సేనాపతికి, ఆయన చదివి కోశాధికారికి ఇచ్చాడు. అది తిరిగి రాజావారికి అందింది. నగరంలో శిథిలమై కూలిపోవడానికి సిద్ధంగా వున్న పెద్ద ఆసుపత్రి పునర్నిర్మాణానికి, నగరంలో వైతరణిలా ప్రవహిస్తున్న మురిక్కాలవ కారణంగా ప్రజలు అనుభవిస్తున్న బాధల నుండి విముక్తి పొందడానికి దాన్ని శుభ్రం చేయడానికి, వసతులు లేని హాస్టళ్ళ నిర్మాణానికి మాత్రమే ఆ ధనం వినియోగించాలని దాన్లో రాసి వుంది. 'కళ్ళజోడు మరిచిపోయా. దీన్లో ఏమి రాసి వుంది' అనడిగాడు రాజు.
రాచరికం పదికాలాల పాటు పదిలంగా వుండడానికి, రాజావారి కీర్తి కలకాలం నిలవడానికి ఆ ధనం వినియోగించాలని వుందని మంత్రి, సేనాపతి, కోశాధికారి ఏక కంఠంగా చెప్పారు. రాజావారు ఆ కాగితాన్ని నమిలి మింగేస్తూ 'రాచరికం జిందాబాద్' అన్నారు. రాజభవనం కూల్చివేత ఆరంభమైంది.
- చింతపట్ల సుదర్శన్,
9299809212