Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రుబాయీలలో తెలుగుతనం
ఉమర్ఖయ్యాం రుబాయీలు, తెలుగు పద్యానువాదం : డా||బూర్గుల రామకృష్ణారావు, పేజీలు:48, వెల : 25 /-, ప్రతులకు :తెలంగాణ సాహిత్య అకాడమీ, కళాభారతి, రవీంద్రభారతి, హైదరాబాద్.
ఉమర్ఖయ్యాం పారశీక కవి. గొప్ప తత్వజ్ఞాని. సూఫీ సిద్ధాంతాలకు తన కవిత్వంతో మార్మికంగా నిక్షిప్తీకరించాడు. ఆయన రాసిన రుబాయీలను ప్రపంచంలోని అన్ని భాషలూ అక్కున చేర్చుకున్నాయి. సూఫీ భాషలోని ఆ కవిత్వ మహత్తులను తనివితీరా ఆస్వాదించని సాహిత్య రసజ్ఞులు లేరంటే అతిశయోక్తి కాదు.
11వ శతాబ్దంలో పర్షియాలో రాయబడిన ఈ రుబాయీల సొబగులను అన్ని భాషలతో పాటు తెలుగులోనూ డా||బూర్గుల రామకృష్ణారావు అనువదించారు. బహుభాషావేత్త, కవి, వక్త, రాజనీతిజ్ఞుడు అయిన బూర్గులవారు ఉమర్ఖయ్యాం తాత్వికతను పూర్తిగా ఔపోసన పట్టి చక్కటి తెలుగులో ఛందోబద్ద శైలిలో అనువదించారు. మూఢనమ్మకాలను వమ్ముచేస్తూ కొంత హేతువాద దృష్టితో రచించిన ఈ అనువాద గ్రంథం మన పూర్వీకులైన చార్వాకుల ఆలోచనా విధానాన్ని తలపింపచేస్తుంది. తెలుగు వాడైన వేమన ఇదే తాత్వికతను అనుసరించాడనిపిస్తుంది. విశ్వకవిగా పేరు గాంచిన ఉమర్ఖయ్యాం రుబాయీలను సరాసరిగా పారశీకం నుండి తెలుగుకు అనువాదం చేసి తెలుగుతనాన్ని రంగరించిన బూర్గుల రామకృష్ణారావు తెలుగు వాళ్ళకిచ్చిన గొప్ప కానుక ఇది.
నాటి సమాజానికి సరిపడని సంగతులు
సరిపడని సంగతులు (నాటకం), రచన : టి.రాఘవ, సంపాదకులు : డా||అప్పిరెడ్డి హరినాథరెడ్డి (9963912187), పేజీలు : 86,
వెల : 50/-, ప్రతులకు : ప్రజాశక్తి పుస్తకకేంద్రాలు.
బళ్ళారి రాఘవ తెలుగు సాహితీ రసజ్ఞులకు, నాటక పిపాసులకు పరిచయం అక్కర్లేని కళాకారుడు. నాటకకర్త, నటుడు, సినీ నిర్మాత, సినిమా దర్శకుడు, రచయిత, అన్నిటికీ మించి మానవతావాది. ఆయన నటించిన నాటకాలను స్వయంగా గాంధీజీ, రవీంద్రనాథ్ టాగూర్, బెర్నార్డ్ షా వంటి ప్రముఖులు వీక్షించి ముగ్దులయ్యారు. తెలుగులోనే కాక కన్నడ, తమిళ, హిందీ, ఇంగ్లీషు వంటి భాషల్లో మొత్తం 60 నాటకాల్లో ప్రధానమైన విభిన్న పాత్రలు వేసి మెప్పించారు. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ, స్విట్జర్లాండ్, జర్మనీ లాంటి దేశాల్లో పర్యటించి ప్రపంచ అగ్రశ్రేణి నటులతో సత్సంబంధాలను నెలకొల్పుకున్నారు.
బళ్ళారి రాఘవ ఆ కాలంలో కందుకూరి వీరేశలింగం పంతులు వంటి వారి నుండి ప్రేరేపితుడై, ఆ సమాజంపై విమర్శనాస్త్రాలు సంధించాడు. ఆ కాలంలోనే సాంఘిక సమస్యలపై నాటకాలు రాసి నటించి, ప్రజలకు కనువిప్పు కలిగించాడు. అటువంటి ఆలోచనలే నాటి సంఘానికి 'సరిపడని సంగతులు'. ఇందులో న్యాయవాది భీమసేనరావు కుటుంబ నేపథ్యంగా నాటకం నడిచి, బాల్య వివాహాలను ఖండిస్తూ, విధవ వివాహాలను ప్రోత్సహిస్తూ, సాంఘిక దురాచారాలను దునుమాడుతూ స్త్రీల పట్ల సహృదయత ప్రకటిస్తూ సాగుతుంది. పోలీసుల, న్యాయవాదుల అక్రమాల్ని బయటపెడుతూ, మేడిపండు వంటి సామాజిక పోకడల్ని ఈ నాటకం బయటపెడుతుంది.
- కె.హరనాథ్, 9703542598
కథలు చిన్నవి - సంగతులు పెద్దవి
కథాకళి, రచయిత : బెల్లంకొండ చంద్రమౌళి శాస్త్రి, వెల : 40/-, ప్రతులకు : తెలంగాణ సాహిత్య అకాడమి, కళాభారతి, రవీంద్ర భారతి ప్రాంగణం, హైదరాబాద్.
బెల్లంకొండ చంద్రమౌళి శాస్త్రి రాసిన కథల్లో వైవిధ్యముంది. ఈ కథల్లో స్వాతంత్య్రం రాకముందు వున్న స్థితిగతులున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తరువాత వున్న పరిస్థితులున్నాయి. ఇందులోని 'రసహౌలీ' కథ విదేశీ వస్త్ర బహిష్కరణ గురించి రాసింది. అన్ని రాష్ట్రాలు భారత యూనియన్లో విలీనం కాగా, విలీనం కాని నైజాం రాష్ట్ర పరిస్థితులను 'కల కాదు నిజం' కథలో రచయిత చిత్రీకరించారు. ఇమ్తెహాన్ అంటే పరీక్ష. నాదిర్షా రాజకాంతలకు పెట్టిన పరీక్షను ఈ కథలో రచయిత వివరించారు. ఇందులో చారిత్రాత్మకమైన అంశంతో పాటు స్త్రీ మనస్తత్వ చిత్రీకరణ వుంది. బాహ్య సౌందర్యం కంటే అంత: సౌందర్యమే గొప్పదని 'పరివర్తన' కథలో రచయిత చాటి చెప్పారు. కళాకళిలో భిన్న మనస్తత్వాలనూ, పల్లెపట్నం వ్యత్యాసాలను రచయిత వివరించారు. 'సిమెంటు గోడకు వల్లెవేయడం మొదలుపెట్టినట్టు తూర్పు తెల్లారింది' వంటి పద చిత్రాలు ఈ కథల్లో వున్నాయి.
- తెలిదేవర భానుమూర్తి, 9959150491
ధనాభిరామం
నూతనకవి సూరన
పేజీలు : 110, వెల : 60/-, ప్రతులకు : తెలంగాణ ప్రచురణలు, ఇందిరా నివాస్, 3/97, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్.
ఫోన్ : 9849220321
అమృతవర్షిణి
సందేశాత్మక నాటిక
రచన : అమృతవర్షిణి జయరాజు
పేజీలు : 92, వెల : 100/-, ప్రతులకు : అమృతవర్షిణి జయరాజ్, ఫ్లాట్నెం.205, ఐశ్వర్య అపార్ట్మెంట్, ఎ బ్లాక్, త్రివేణి స్కూల్ దగ్గర, కవిరాజ్ నగర్, ఖమ్మం.