Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆధునిక సాహిత్య పహారా - సమాహార
సమాహార (సాహిత్య వ్యాసాలు), రచన : డా|| ఏనుగు నరసింహారెడ్డి (8978869183), పేజీలు : 144, వెల : 100/-, ప్రతులకు : నవోదయ పుస్తక కేంద్రాలు.
చక్కని పరిపాలనా దక్షతతో పాటు కవిగా, వ్యాసకర్తగా, విమర్శకుడిగా, సమీక్షకుడిగా, కావ్యకర్తగా, కార్యకర్తగా బహుముఖీనమైన సాహితీ సేవలందిస్తున్న ప్రజ్ఞాశాలి డా||ఏనుగు నరసింహారెడ్డి. 'సమాహార' రూపంలో సమర్పిస్తున్న సాహిత్య వ్యాసాలు రచయిత సునిశిత పరిశీలనాశక్తికి ప్రకటిస్తున్నాయి.
42 వ్యాసాలుగల ఈ పుస్తకంలో నవల, కథ, పాట, కవిత్వం, శతకం, వ్యాసం, మహనీయుల వ్యక్తిత్వాలు, ఉద్యమాలు, ఉత్తముల వ్యక్తిత్వాలు ఎన్నో కలబోతగా వున్నాయి. ఈ రచయిత ఏ అంశాన్ని తడిమినా నిజాయితీగా, నిర్మొహమాటంగా, నిష్పక్షపాతంగా చక్కని తూకంతో పరిచయం చేశాడు. హెలెక్స్ హేలీ, వట్టికోట ఆళ్ళారుస్వామి, బుచ్చిబాబు వంటి సాహితీ దిగ్గజాల సాహిత్యంలో పాటు నేటి కాలపు ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ వంటివారి సాహిత్యాంశాలను తడిమి చూపాడు. నందిని సిధారెడ్డి పోరుబాటలో రాసిన 'నాగేటి చాల్లల్ల నా తెలంగాణ' వంటి గీతాలను వింగడించడంతో పాటు, మృణాళిని సాహితీ జీవనంలోని సరళత, స్పష్టత బహుముఖీనతలను విడమర్చి చెప్పడంలో ప్రతిభను కనబరిచారు. వివిధ రచయితల శైలీ, శిల్ప నిర్మాణాలను విప్పి వివరించాడు.
సరైన న్యాయ నిర్ణేత వలె ఈ సాహితీ వ్యాసంగాలలో పాలు నీళ్ళను వేరు చేసిన విధంగా రాసిన ఆయన వైఖరికి 'ఉపన్యాసాలే కథలై' అన్న వ్యాసంలో ''ఉద్యమం పేరిట ఏదైనా చెలామణి అవుతుందని ఎవరైనా భావిస్తే అది ఉద్యమానికి పరోక్షంగా నష్టంచేయడం కాదని ఎవరమూ అనలేం'' అంటూ చురకలంటించాడు. అట్లాగే 96వ పేజీలో భీంరెడ్డి నర్సింహారెడ్డిపై రాసిన వ్యాసంలో ''సుప్రతిష్టమైన నిజాం ప్రభుత్వంలోని భూస్వాములు, దేశముఖ్లపై పోరాటం చేయడమే అతి పెద్ద సాహసం. దానికి భారత ప్రభుత్వ సహకారం కోసం ప్రయత్నం చేసే ఏ వేదికా లేకపోవడం అతి పెద్ద విషాదంగా భావించవచ్చు. పైగా భారత ప్రభుత్వ సైన్యం కూడా రజాకార్లపై దాడి మిషతో సాయుధ పోరాట యోధుల్ని వేటాడటం దౌర్భాగ్యం'' అంటూ నిష్కర్షగా చెప్పాడు.
- కె.హరనాథ్, 9703542598
మాండలికంలో భారత కథ
ఇట్లసుత (కురుక్షేత్ర రహిత మహాభారత గాధ), వరిగొండ కాంతారావు, ప్రతులకు : ప్రధాన పుస్తక కేంద్రాలు, వెల :400/-, క్రౌన్ సైజు
వరిగొండ కాంతారావు గారు 'ఇట్లసుత'ను తెలంగాణ మాండలికం, భాష, నుడికారంలో అందించారు. ఇట్లసుతంటూ తను ఎన్నుకున్న భారతకథను 21 అధ్యాయాలలో చెప్పారు. ఈ పుస్తకంలో - కేవలం శ్రీకృష్ణ రాయబారానికి వెళ్ళిన కృష్ణుడు - కుంతితో కర్ణుడు నీ కొడుకని తెలపడంతో మొదలెట్టి... కర్ణుడు, దుర్యోధన, దుశ్శాసనుల అంతంవరకు గిట్లంటూ అందించారు.
'ఇట్లసుత' అంటే ఇలా కూడ చెప్పచ్చు అనీ, కథను ఈ దృష్టితో చూడవచ్చునని అన్నమాట. కాంతారావు మహాభారతాన్ని ఒక నూతన దృక్కోణంతో చెప్పారు. ఇలా అనుకున్నప్పుడు టీవీలలో మహాభారతాన్ని ఆటవికుల, జానపదుల నేపథ్యంలో అందించిన సీరియల్స్ను గుర్తుంచుకుంటే ఈ రచనను చదవడంలో ఏమీ ఇబ్బందనిపించదు. లోకోభిన్నరుచి, జిహ్వకోరుచి, ఎవరి కోణం వారిదే అనుకుంటే సరిపోతుంది. పాఠకులకు ఒక నూతన దృక్పథాన్ని దర్శింపచేసినందుకు అభినందించ వచ్చు.
కాంతారావు గత రచనలలో తెలంగాణ మాండలికాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకున్నారు. ఐతే ఒక ఇతిహాసమును అందించేటప్పుడు రచయిత ఎంచుకున్న శైలిని ఆస్వాదించడానికి సగటు పాఠకుడి మనసంగీకరింపకపోవచ్చు. ఏదెలా ఉన్నా రచయిత ప్రయ అభినందించాల్సిందే.
- డా|| టి. శ్రీరంగస్వామి, 9949857955
ఎందరొచ్చినా... జూలూరి గౌరీశంకర్
పేజీలు : 200 వెల : 150/-
ప్రతులకు : ప్రముఖ పుస్తక కేంద్రాలు
అడుగు జాడలు పబ్లికేషన్స్
ఊటుకూరు రంగారావు శరధార
పేజీలు : 36, వెల : 25/-
ప్రతులకు : తెలంగాణ సాహిత్య అకాడమి, 040-29703142
తెలంగాణ గ్రామాలయం
మారంరాజు సత్య నారాయణ, పేజీలు : 72, వెల : 50/- ప్రతులకు : ప్రముఖ పుస్తక కేంద్రాలు. అస్తిత్వ ప్రచురణలు.
బౌద్ధం - తెలంగాణ అస్థిత్వం
ఆచార్య అడపా సత్యనారాయణ
పేజీలు : 82, వెల : 35/-
ప్రతులకు : ప్రముఖ పుస్తక కేంద్రాలు. అడుగు జాడలు పబ్లికేషన్స్
గీతా పంచామృతమ్
సూర్య ప్రసాదరావు
పేజీలు : 240, వెల : 100/- ప్రతులకు : ఎం.సూర్య ప్రసాదరావు, 9885156844