Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తండ్రి తాతలు గొప్ప వారసత్వం ఇవ్వడం అందరి విషయంలోనూ జరగదు. అలా వచ్చినవారు దాన్ని సార్థకం చేసుకుంటూ దాన్ని కాపాడుకోవడానికి తమ వంతు పాత్ర శాయశక్తులా పోషించడం మరింత అరుదు. వారు ఎంత కృషి చేసినా అవకాశాలు రావడం, అవి సత్ఫలితాలు ఇవ్వడం మరింత గగనం. ఈ మూడు ఘట్టాలూ కలసి వచ్చిన నటుడు, ప్రయోక్త త్రిపురనేని సాయిచంద్. 'మాభూమి' లో నవయువ విప్లవ కథానాయకుడుగా మొదలై 'ఫిదా'లో సాయి పల్లవి తండ్రి వేషం కట్టి భేషనిపించుకునే వరకూ సాగిన తన జీవన యానాన్ని సాయిచంద్ ఎంతో స్పందనతోనూ, భావుకతతోనూ అక్షరీకరించిన ఆత్మకథ కేరాఫ్. టైటిల్కు తగినట్టే తాత త్రిపురనేని రామస్వామి బ్రాహ్మణేతర ఉద్యమం, రచనలు, పొందిన గౌరవాలు, సాగించిన ధిక్కారాల కథనంతో మొదలు పెట్టారు. ఆయనలో హేతువాద దృష్టికి బాల్యంలోనే అంకురార్పణ జరిగిన తీరు తెన్నులు పొందుపర్చారు. ఈ విషయాలను పాతతరం సాహిత్య జీవులకు సుపరిచితాలే అయినా, ఈ తరం తెలుసుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా వున్నాయి. మతచాందసం, కులతత్వాలు పెరిగిపోయి గతాన్ని, మతాన్ని కీర్తించడమే ఘనతగా భావించబడుతున్న ఈ కాలంలో, ప్రశ్నించడమే అపరాధంగా పరిగణించే దశలో రామస్వామి వంటి సామాజిక విప్లవ కారులను తల్చుకోవడం చాలా అవసరం. కురుక్షేత్రం, ఖూనీ, శంబుక వధ వంటి నాటకాలతో, సూతపురాణం వంటి రచనలతో బూజుపట్టిన ఆధిపత్యాలను, అభ్యంతరాలను నిలదీసిన రామస్వామి జీవితాన్ని, రచనలనూ, గౌరవాలను క్లుప్తంగానూ, ఒక క్రమ పద్ధతిలోనూ ఇందులో చూస్తాం.
తెనాలిలో రామస్వామి సంచలనాత్మకంగా స్థాపించి నడిపించిన సూతాశ్రమంలోనే గోపీచంద్ చైతన్యం వికసించింది. గోపీ వాళ్లేదో అంటున్నారు చూడు అని ఆయన కుమారుడిని చర్చలకు ఉసిగొల్పేవారట. గోపీచంద్ వారికి సమాధానం చెప్పడమే గాక తండ్రిని కూడా ఏల? ఎందుకు? అని ప్రశ్నలడిగేవారు. విద్యార్థి దశలో ఆయన రాసిన మొదటి వ్యాసమే శంబుకవధ. సూతాశ్రమం కథా సంపుటి కూడా ప్రచురించారు. అంతగా తెలియని విషయమేమంటే సూతాశ్రమంలోనే అభ్యుదయ తెలుగు సినిమాకు బీజం పడింది. రామస్వామి స్నేహితుడు ఐర్లండులో ఆయనతో కలసి బారిస్టరు చదువుకున్న ఉన్నవ లక్ష్మీనారాయణ వితంతు వివాహం చేయబోతే అగ్రకులాల వారు పడనీయలేదు. రామస్వామి ఆచార్యుడుగా వుండి పెళ్ళి జరిపించారు. ఆ ఇతివృత్తం తీసుకుని ప్రముఖ దర్శకుడు వై.వి. రావు 'మళ్లీ పెళ్లి' తీశారు. గూడవల్లి రామబ్రహ్మం కూడా రామస్వామి అనుయాయి. వీరిద్దరూ జస్టిస్పార్టీలో పనిచేసేవారు. ఆయన నడిపించిన ప్రజామిత్ర పత్రికలో గోపీచంద్ 1935-40 మధ్య బళ్లారి రాఘవ, డి.వి.సుబ్బారావు కన్నాంబ తదితరులపై వారానికో వ్యాసం రాశారు. గూడవల్లి తీసిన 'మాలపిల్ల'కు చలం రచయిత అయితే, 'రైతుబిడ్డ'కు రచన చేసింది గోపీచంద్. గూడవల్లివారే అక్కినేని ప్రారంభ దశలో తీసిన 'మాయాలోకం' కూడా గోపీచంద్ రచనే. 1943లో రామస్వామి మరణానంతరం గోపీచంద్ కేంద్ర స్థానంలోకి వచ్చారు. వివిధ సాహిత్య రూపాల్లో ఇబ్బడి ముబ్బడిగా రచనలు చేశారు. ఆ దశలో మిత్రుడైన కె.ఎస్.ప్రశాశరావు ఆయన కథతో 'గృహ ప్రవేశం' తీశారు. ఎల్.వి.ప్రసాద్ దీనికి కథానాయకుడూ, దర్శకుడు కూడా. ఆ కాలంలోనే స్త్రీల హక్కులను గురించి చెప్పిన కథగా ఇది పేరుపొందితే, ఎల్.వి.ప్రసాద్ తాను దర్శకుడు కావడానికి గోపిచంద్ దయ కారణమని ఇంటర్వ్యూలలో చెబుతుండేవారు. ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో 1945-46 మధ్య గోపిచంద్ సీరియల్గా రాసిన 'అసమర్థుని జీవయాత్ర' ఒక కొత్త ప్రామాణిక ప్రయోగంగా నిలిచిపోయింది. తండ్రి నీడలో పెరుగుతూ ఆరాధనా పూర్వకంగా చూస్తూనే తనవైన ఘర్షణలనూ ఎదుర్కొన్న గోపీచంద్ అంతరావలోకనం కూడా ఆ నవలలో వుందంటారు విమర్శకులు. రచయితలుగా పేరు తెచ్చుకున్నాక సినిమాలలో ప్రవేశించిన అరుదైన ఉదాహరణ గోపిచంద్. 1950లో స్వీయ రచన 'లక్ష్మమ్మ' చిత్రం రూపొందించారు. ఘంటసాల బలరామయ్య మహా కోలాహలంగా ఉద్దండులతో తీసిన చిత్రం శ్రీలక్ష్మమ్మ కథ పోటీ తట్టుకుని అఖండ విజయం సాధించింది. ఆ చిత్రంలో భర్తను వేశ్య నుంచి దూరం చేసేందుకై లక్ష్మమ్మ వెళ్లినప్పుడు వారి మధ్య జరిగే సంవాదం తర్వాత ఒక నమూనా అయింది. వూరూరా వుండే పేరంటాళ్ల కథతో గోపిచంద్ 'పేరంటాలు' చిత్రం తీశారు. 'ప్రియురాలు'లో జగ్గయ్యను పరిచయం చేశారు.
1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు సమాచార శాఖ డైరెక్టర్గా కర్నూలు వెళ్లారు. అక్కడే సాయిచంద్ పుట్టాడట. పుట్టిన వెంటనే ఏడవక పోవడంతో గోపిచంద్ షిర్డి సాయిబాబాకు మొక్కుకున్నాడని సాయిచంద్ రాశారు. రామస్వామి కుమారుడికి ఇదో యాంటీ క్లైమాక్స్ అనొచ్చునా? అది వేరే విషయం (ఈ రచయితలోనూ ఆధ్మాత్మిక ప్రభావాలు స్పష్టమే). తన తండ్రి రచనల గురించి చాలా వివరంగా రాసినప్పటికీ చీకటి గదులు ఆయనకు బాగా ఇష్టమని పదే పదే చేసిన ప్రస్తావనలను బట్టి అర్థమవుతుంది. పండితపరమేశ్వర శాస్త్రి వీలునామాను గురించి కూడా వివరంగానే రాశారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత హైదరాబాద్ వచ్చిన గోపిచంద్ నారాయణగూడలో తన ఇంటికి తెనాలిని గుర్తు చేసుకునేలా లిటిల్ పారిస్ అని పేరు పెట్టుకున్నారు. 1962లో ఆయన కన్ను మూశారు. అయినా హైదరాబాదులోనే కుటుంబం కొనసాగింది. పెద్ద కొడుకు రమేష్ గోపిచంద్ ప్రచురణలు ప్రారంభించారు. జ్యోత్స్న మాసపత్రిక నడిపించారు. చిత్రకారుడు చంద్ర ఈ పత్రికతోనే పరిచయం అయ్యారట. ఆ ఉదంతం తమాషాగా వుంటుంది.
ఇక్కడి నుంచి సాయిచంద్ జీవితంలోకి వస్తే ఇంటి దగ్గరలో వున్న ఆంధ్ర బాలానంద సంఘంలో నటన మొదలెట్టారు. 'సతీ అరుంధతి' సినిమాలో గౌతముడి శిష్యుడిగా సినిమాల్లో ప్రవేశించారు. వేసవిలో విజయవాడకు వెళ్లినప్పడల్లా దుర్గామహల్లో దర్జాగా ఉచితంగా సినిమాలు చూసేవాడు. అప్పుడే గోరా గారి కుటుంబంతో కలిగిన పరిచయం ఆయన వాసవ్య అనే వారి పాఠశాలలో చదువుకునేలా చేసింది. మొత్తంమీద సాయిచంద్ పెంపకంలో హైదరాబాద్ విజయవాడ రెండింటి ప్రభావం పెనవేసుకుపోయింది. అన్నయ్య రమేష్ అక్కడే నాటక రచన దర్శకత్వం చేసేవారు. ఆయన లండన్ వెళ్లాక చంద్ర ఒక గదిలో తన స్టూడియో పెట్టుకున్నారు. దాంతో అక్కడకు వచ్చే కవులూ చిత్రకారులూ అభ్యుదయ వాదులతో సాయిచంద్ ప్రపంచం మరింత కళాత్మకమైంది. చంద్ర ద్వారా పరిచయమైన బి.నర్సింగరావు, చిత్రకారుడు వైకుంఠం, విమర్శకుడు మోహన్ కూడా ఆయన జీవితాన్ని మలుపు తిప్పారంటారు. నర్సింగరావు గౌతం ఘోష్ దర్శకత్వంలో తీస్తున్న 'మాభూమి'లో హీరో రామయ్య పాత్రకు సాయిచంద్ ఎంపిక కావడమే పెద్ద మలుపు. ఆ చిత్రం కోసం జరిగిన కృషి, తన ఎంపిక చిత్రంగా జరిగిన తీరు ఆసక్తిగా చెబుతారు. తెలుగు సినిమా చరిత్రలోనూ తెలంగాణ పోరాట చరిత్రలోనూ మైలురాయి వంటి 'మాభూమి' నిర్మాణం, విజయం, విశ్లేషణ ఈ ఆత్మకథకు ప్రాణవాయువుగా చెప్పాలి. ఒక ప్రజా విప్లవాన్ని మొదటిసారి తెరకెక్కించిన 'మాభూమి' తెలుగులో విజయవంతం కావడమే గాక జాతీయంగానూ, అంతర్జాతీయంగానూ కూడా ప్రశంసలు పొంది జైత్ర యాత్ర సాగించింది. 1980లో 'మాభూమి', 'శంకరాభరణం' ఒకేసారి విడుదలైంది. కళకు రెండు పార్శ్వాలు చూపిన చిత్రాలవి. ఈ క్రమంలో చిత్రోత్సవాలలో ఎందరో గొప్ప దర్శకులను, నటీనటులు, రచయితలను కలుసుకున్న ఘట్టాలలో వారి వారి విశిష్టతలు ప్రత్యేకతులు కూడా వర్ణిస్తారు.
ఇక్కడి నుంచి మరో ఘట్టం. 'మాభూమి' తర్వాత తనకు వచ్చిన కీర్తి ప్రతిష్టలూ, ప్రచారం ఒలింపిక్ సిండ్రోమ్ అంటారాయన. ఆ వెంటనే మాదల రంగారావు 'యువతరం కదిలింది'లో అవకాశం. కుడివైపునకు వెళితే సుదర్శన్ థియేటర్లో 'మాభూమి', ఎడమవైపు బసంత్ టాకీస్లో 'యువతరం కదిలింది' అంటూ ఆ కాలాన్ని యథాతథంగా గుర్తు చేశారు. తదుపరి 'ఎర్రమల్లెలు'. అదో నవ చిత్ర వైభవం. ఆ దశలో తెలుగులోనే గాక కన్నడ తమిళ రంగాల నుంచి వాణిజ్య ఫార్ములా చిత్రాలు కుర్రకారు ప్రేమ కథలు వచ్చినా వద్దని భిన్నచిత్రాల కోసం నిలబడ్డం సాయిచంద్ నిబద్దత అయితే... అందుకు అండగా వుంది అన్న రమేష్. తమ్మారెడ్డి సోదరుల మరో 'కురుక్షేత్రం', గోపిచంద్ కథతో తీసిన 'ధర్మవడ్డీ', వేజెళ్ల దర్శకత్వంలో పరుచూరి గోపాల కృష్ణ మొదటి రచనగా తీసిన 'మరో మలుపు', బాపు రమణల 'పెళ్లీడు పిల్లలు', చిరంజీవి, సుహాసిని తదితరులతో వంశీ తొలిచిత్రం 'మంచుపల్లకి, ఈ చరిత్ర ఏ సిరాతో, రంగుల కల, విముక్తికోసం, ఈ పిల్లకు పెళ్లవుతుందా, ఈ చదువులు మాకొద్దు, అంకురం', వీటి మధ్యలో రాంగోపాల్ వర్మ 'శివ'. ఇలా సాయిచంద్కు మంచి చిత్రాలు కొనసాగాయి. అవన్నీ చదువుతుంటే పాత వారికి జ్ఞాపకాలు, కొత్తవారికి ఆసక్తి ముప్పిరిగొనడం తథ్యం. ఇంత నేపథ్యం వున్న నటుడు హఠాత్తుగా సినిమాల నుంచి డాక్యుమెంటరీలు, టెలిఫిలింల నిర్మాణం చేపట్టడం మరో మలుపు. అక్కడ కూడా ఆయన కృషి మంచి ఫలితాలే ఇచ్చింది. దూరదర్శన్ కోసమూ, ఈటీవీ కోసమూ తీసిన సినిమా ఆణిముత్యాల పరంపర అలనాటి మహామహుల జ్ఞాపకాలు నిక్షిప్తం చేసింది. ఈ సందర్భంగా సాయిచంద్ సినిమా చరిత్రను సంక్షిప్తంగా అయినా వివరంగా చెప్పారు. టెలిఫిలిం యాత్ర నాన్న గోపీచంద్ రచనలకు బుల్లితెర రూపమిచ్చే అవకాశమూ కల్పించింది. కళాభిరుచి, చారిత్రక దృష్టి గల పాఠకులకు వాటి గురించి చదవడం గొప్ప అనుభవమే గాక భవిష్యత్తుకు దోహదకారి కూడా. ఈ చిత్రయాత్ర మధ్యలోనే తన పర్యటనలు విదేశీయాత్రల గురించి కూడా చాలా విజ్ఞానాత్మంగా రాశారు. బహుశా ఆత్మకథకు ప్రేరేపణ నిచ్చిన బిబిసి మార్క్టుల్లీ మాటలు ఇందుకు కారణం కావచ్చు. ఈ మధ్యలో తన తండ్రి తాతల సంస్మరణ సందర్బాలు.. రచనా సంపుటాల ముద్రణ వివరాలు...
పాతికేళ్ల విరామం తర్వాత సరిగ్గా తన అరవయ్యో పుట్టినరోజున శేఖర్ కమ్ముల పిలుపు. అవివాహితుడుగా మిగిలిపోయిన సాయిచంద్ వన్పీస్ బానుమతి సాయిపల్లవి నాన్నగా జీవితం మళ్లీ 'ఫిదా'. 'విముక్తి కోసం' కథానాయుడు విముక్తి వైపు నా ప్రయాణం మొదలైంది అంటూ ముగిస్తాడు సాయిచంద్. ఆత్మకథ చరిత్రలో ఎన్నో గొప్ప ఘట్టాలకూ మహనీయుల జీవిత దృశ్యాలకూ గొప్ప చిత్రాల సందర్శనకూ వీటి మధ్య ఆలోచనా పరుడైన ఒక కళాకారుడి జీవిత మజిలీలకు కేరాఫ్. ఆద్యంతం పఠనీయం. విషయ సంపన్నం. వివాదాలకు తావులేని వినమ్ర నివేదనం. కేరాఫ్ చదివాక నిన్నటి యువ నాయకుడు, నేటి అనుభవ సంపన్నుడు సాయిచంద్ను అభినందించకుండా వుండలేం. పైగా ఆయనతో వెళుతున్న అనుభవం పొందుతాం.
- తెలకపల్లి రవి