Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రాణులన్నిటికీ ప్రాణవాయువు ఆక్సిజన్ అవసరం. అలాగే చేపలు కూడా. అయితే చేపలు ఆక్సిజన్ను పీల్చుకోడానికి మొప్పల ద్వారా శ్వాసక్రియను నిర్వర్తిస్తాయి. ఈ మొప్పలు నీటిలోని ఆక్సిజన్ను చేపల శరీరంలోనికి పంపిస్తాయి. కార్బన్డై ఆక్సైడ్ను విడుదల చేస్తాయి. నదులు, సరస్సుల్లోని చేపలు ఆక్సిజన్ను ఎంత పీల్చుకున్నా, నీటి పరిమాణం ఎక్కువగా వుండటం వల్ల పెద్ద తేడా ఏమీ వుండదు. ఎందుకంటే చేపలు పీల్చుకునే ఆక్సిజన్ పరిమాణం తక్కువగా వుంటుంది. పైగా వర్షాల మూలంగా సరస్సుల్లోకి, నదుల్లోకి ఎప్పటికప్పుడు నీరు చేరడం, హైడ్రిల్లా వంటి మొక్కల కిరణజన్య సంయోగక్రియ వల్ల ఆక్సిజన్ విడుదల కావడం వంటి కారణాల వల్ల ఎప్పటికప్పుడు నదులు, సరస్సుల్లో ఆక్సిజన్ చేరుతుంటుంది. అందువల్ల ఆ నీళ్ళల్లో ఆక్సిజన్ ఆక్సిజన్ నిష్పత్తిలో మార్పు ఉండదు.
అక్వేరియంలో అయితే నీటి పరిమాణం తక్కువగా వుంటుంది. ఆక్సిజన్ పరిమాణాన్ని స్థిరంగా ఉంచే నీటి మొక్కలు కూడా అక్వేరియంలో పెంచలేం. వున్న నీటిలోని ఆక్సిజన్ని చేపలు పీల్చుకోవడంతో కొన్ని రోజులకు అక్వేరియం చేపలకు ఆక్సిజన్ అందక చనిపోతుంటాయి. అందుకే అక్వేరియంలోని చేపలు ఆరోగ్యంగా జీవించడానికి నీటిని తరచూ మారుస్తుండాలి. తరచూ నీటిని మారుస్తుండడం వల్ల చేపలకి ఆక్సిజన్ లభించడమే కాకుండా, అవి విసర్జించే వ్యర్థాలను కూడా శుభ్రం చేసినట్లవుతుంది.