Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గంటి బానుమతి గారి 'ఎందరో శిరీషలు' అనే కథా సంపుటి 13 కథలున్నాయి. ఇందులో ఏ కథకు ఆ కథే ఒక ప్రత్యేకం. ప్రతి నిత్యం మనం ఎన్నో సమస్యలు ఎదురుచూస్తూనే ఉంటాం. కాకుంటే కొందరు ప్రతి సమస్య నుండి ఒక సమాధానం వెతుక్కుంటారు. కొందరు ఆ సమస్యల్లోనే మునిగి తేలుతుంటారు. కొందరు సమస్యల్ని సృష్టించే పనిలో ఉంటారు. దాదాపుగా మనకు మనమే సమస్యలన్నీ సృష్టించుకుంటాం. ఉదాహరణకు అబద్ధాలు చెబుతాం, ఇక్కడి మాటలు మరోచోట చెబుతాం. అసూయను పెంచుకుని ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటాం. స్వార్థం కోసం స్నేహాల్ని తోసిపుచ్చుతాం. ఆశపడి ప్రేమను దూరం చేసుకుంటాం. ఇవి కాకుండా మనిషిని విపరీతంగా కుంగదీసే అకాల మరణాలు, అనుకోని శిక్ష, ఆకలి, రోగం లాంటి సమస్యలకు పరిష్కారం లేవనే చెప్పాలి. రచయిత్రి గంటి బానుమతి తమ రచనల్లో అనేకానేక సమస్యల్ని ఎత్తి చూపడమే కాకుండా పరిష్కారం కూడా చూపారు. శీర్షిక కథ 'ఎందరో శిరీషలు' ఎంతో ఆలోచనాత్మకంగా ఉంది. తల్లితండ్రులు తమ ఆశల్ని పిల్లలపై రుద్దటం, సాధించకపోవటంతో తిట్టడం, మాట్లాడకపోవటం ద్వారా పిల్లలు అయోమయ స్థితిలోకి జారిపోయి, చివరకు ఆత్మహత్యలు చేసుకోవడం వంటి సంఘటనలు ఈ కథలో తెలిపారు. పిల్లలకు దేనిపై ఆసక్తి ఉందో తెలుసుకుని అందులోనే ప్రోత్సహించాలనే విషయాన్ని తెలియజేసిన కథ ఇది. అలాగే మరో అద్భుతమైన కథ 'పరిష్కారం' ఇది కొడుకు అకాల మరణాన్ని తట్టుకోలేని తల్లితండ్రుల బాధ. కానీ రచయిత్రి కోడలు ఆత్మీయంగా మీకు నేనున్నాను, మీ మనవలు ఉన్నారు అని ధైర్యం చెప్పడం ద్వారా ఎంతో ఊరట కలుగుతుంది. మరొక కథ 'భూమి గుండ్రంగా లేదు' కాలానుగుణంగా మనిషి తన మనసు మార్చుకుని జీవించడం ద్వారా ఒక స్నేహితుడి నమ్మకాన్ని కోల్పోయిన కథ. అలాగే 'మానవత్వపు స్పర్శ, కెరటాలు, శిశిరకుసుమం' లాంటి ఎన్నో కథలు పాఠకుల్ని కట్టి పడేస్తాయి.