Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతి ఒక్కరు తమ జీవితంలో సొంత ఇల్లు, కారు, పొలాలు ఇలా ఏదో ఒకటి సంపాదించాలని కోరుకుంటారు. అందుకోసం ఎంతో కష్టపడి, రూపాయి.. రూపాయి కూడబెట్టి వాటిని సంపాదించుకుంటారు. మరికొందరు అడ్డదారులు తొక్కుతుంటారు. అది వేరే విషయం. కానీ ఇంకో రకం మనుషులు ఉంటారు.. వారిని చూస్తే అమాయకులా.. అతి తెలివి తేటలు ఉన్నవారా అనే విషయం అంత సులువుగా అర్థం కాదు. ఇలాంటి సంఘటనే ఒకటి జర్మనీలో చోటు చేసుకుంది. ఓ 20 ఏళ్ల యువతి తనకు ఎంతో ఇష్టమైన ఆడి కారును కొనాలని భావించింది. స్థానికంగా ఉండే కైసర్స్లేటర్న్ కారు షోరూంకు వెళ్లి అక్కడి సిబ్బందితో మాట్లాడి తనకు కావాల్సిన ఆడి ఏ3 2013 మోడల్ను ఎంచుకుంది. అనంతరం కారు తాలూకు డబ్బులు చెల్లించేందుకు బిల్ కౌంటర్కు వెళ్లింది. అక్కడ 15వేల యూరోల (రూ. 11లక్షల 57వేలు) ఫేక్ కరెన్సీ తీసి చెల్లించబోయింది. చూడగానే నకిలీ నోట్లు అని గుర్తు పట్టేలా ఉన్న ఆ కరెన్సీని చూసిన కౌంటర్ సిబ్బందికి నోటమాట రాలేదు. తేరకుని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు సిబ్బంది. షోరూం వద్దకు వచ్చిన పోలీసులు యువతిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను విచారించగా కరెన్సీని తన ఇంట్లోనే ముద్రించినట్లు తెలిపింది. దాంతో ఆమె ఇంట్లో సోదాలు చేయగా ఇంక్జెట్ ప్రింటర్ దొరికింది. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు సదరు యువతిని అరెస్ట్ చేశారు.
- పుప్పాల