Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'పాత చింతకాయ పచ్చడి' అని మనం చాలా వాటిని పక్కకు నెట్టేస్తాం కానీ, పాత చింతకాయ పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిది. నా బాల్యంలో కొన్ని అనివార్య పరిస్థితులలో ఒక నెల రోజుల పాటు కేవలం పాత చింతకాయ పచ్చడి, మిరియాల చారుతోనే మా అమ్మ మా ఇంట్లో వాళ్ళ కడుపులన్నీ నింపింది. బహుశా దాని ప్రభావమేనేమో నేనింత ఆరోగ్యంగా ఉండటానికి కారణం.
వంశీ ఏమిటి? సినిమా వ్యాసం రాయకుండా అనుభవజ్ఞుడైన వంటవాడి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాడు అనుకుంటున్నారా? అదేమీ లేదు. 'సాహౌ, ఇస్మార్ట్ శంకర్, నానీస్ గ్యాంగ్ లీడర్' లాంటి సినిమాలు చూసి జ్వరం వచ్చి పడిపోయాక నష్ట నివారణ కోసం ఈ వారం పాత సినిమా ఏదైనా చూడాలి అనిపించింది. ఎందుకో నా మనసు అస్సామీ భాష వైపు మళ్లి సినిమా చూడటం మొదలు పెట్టాను. నేను అస్సామీ సినిమా చూస్తున్నానా? లేకపోతే మన టి.కృష్ణ, విజయశాంతి సినిమా లేదా, వేజెళ్ళ, శివకృష్ణ పాత తెలుగు సినిమా చూస్తున్నానా అన్న సందేహం సగం సినిమా చూసిందాకా నన్ను వదల లేదు. సినిమా మొత్తం చూసాక నాకు రాజేష్ ఖన్నా సుప్రసిద్ధ సినిమా ఆనంద్లోని సుప్రసిద్ధ డైలాగ్ ''బాబూ మోషారు! జిందగీ బహుత్ బడీ హౌనా చాహియే, లంబీ నహీ'' గుర్తుకు వచ్చింది
నేను, నా ఇల్లు, నా డబ్బు, నా పేరు, నా ప్రఖ్యాతి, నా అధికారం, నా ఆధిపత్యం అనుకుంటూ మనిషి జీవితంలో మును ముందుకు వెళ్ళిపోతే ఆ జీవితం వరల్డ్ ట్రేడ్ సెంటర్లా పైపైకి ఎంతో ఎత్తుకు పొడవుగా ఎదగవచ్చు. కానీ ఏదో ఒక రోజు నిట్టనిలువునా కూలక తప్పదు. కూల్చే ఆ ఆల్ ఖైదా మన పిల్లలో, మన భాగస్వాములో, మన సహచరులో ఎవరైనా కావచ్చు. కూలిపోయిన తరువాత పక్కనే నిల్చి నాలుగు కన్నీటి బొట్లు రాల్చేవాళ్ళు కరువూ కావచ్చు. 'మరణాంతాని వైరాణి' అన్న వాక్యమూ అక్కడ చెల్లుబాటు కాకపోవచ్చు.
కానీ జీవితాన్ని నలుదిశలా విస్తరించుకుంటూ పోతే ఆపదలో నువ్వున్నప్పుడు నాలుగు దిక్కుల నుండీ నిన్ను రక్షించడానికి నాలుగు వేల చేతులు కష్ట సునామీకి అడ్డంపడతాయి. నీ కంట్లో నిలిచిన దు:ఖ బిందువును తుడవడానికి ఒక్క కొనగోరు కాదు వేల చేతులు పోటీ పడతాయి. జీవితం విస్తరించడం అంటే అది. 'బహుత్ బడీ హౌనా చాహియే' అన్న అక్షర సముదాయానికి నిక్కమైన అర్థం అది.
చాలా చిన్న ఊరది. చిన్న ద్వీపంలా ఉంటుంది. చదువుకోవడానికి ఒక ప్రాథమిక పాఠశాల, జ్వరమొస్తే చూపించుకోవడానికే ఒక వైద్యశాల ఇలాంటి అతి చిన్న ప్రాథమిక సమస్యల పరిష్కారానికి కూడా దిక్కు లేని ఊరది. పేరు కొరంగా. ఉత్తర అసోంలోని ఒక మారు మూల గ్రామం. ఆ గ్రామానికి ప్రాథమిక పాఠశాల టీచర్గా రీతూ వస్తుంది. సినిమా మొదలు కావడమే ట్రైన్ పరుగులు తీస్తూ రావడంతో మొదలవుతుంది. కిటికీ పక్కన కూర్చున్న రీతూ తన గత జీవితాన్ని నెమరువేసుకుంటూ, భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న సంశయపడుతూ ప్రయాణిస్తూ ఉంటుంది. పెళ్ళై ఏ అచ్చటా ముచ్చటా తీరకుండానే భర్త ఒక రోడ్ యాక్సిడెంట్లో మరణిస్తాడు. అసలా పెళ్లే ఇష్టం లేని భర్త సవతి తల్లి ఆమెను 'వచ్చీ రాగానే భర్తను పోగొట్టుకున్న పెద్దమ్మ' అని నింద వేసి బయటకు గెంటేస్తుంది. తండ్రి సైతం నీ దారి నువ్వు చూసుకో అని ఖరాకండిగా చెప్పిన సమయంలో వచ్చిన టీచర్ వుద్యోగం ఆమెకు పెద్ద ఊరట. కొరంగలో టీచర్గా చేరడానికి ఆమె ఇల్లు వదిలి బయలుదేరడంతో సినిమా మొదలు అవుతుంది.
గ్రామ పెద్ద దగ్గరికి వెళ్లి తాను ఆ ఊరికి కొత్తగా వచ్చిన టీచర్ను అని, స్కూల్ ఎక్కడ వున్నదని ఆమె పరిచయం చేసుకుని ప్రశ్నిస్తే... ఆయన ఆశ్చర్యపోయి ''మా వూళ్ళో స్కూలే లేదు కదా'' అంటాడు. ఆమె తన అపాయింట్మెంట్ ఆర్డర్ చూపించి, ఈ లెటర్ మీకు కూడా వచ్చే ఉంటుందే అంటుంది. ఐదు నెలల క్రితం ఇక్కడ టీచర్ రిటైర్ అయ్యాడని, ఆయన స్థానంలో తనను వేశారని అంటుంది. అప్పటికి కానీ గ్రామ పెద్దకు అర్థం కాదు, గత పన్నెండు సంవత్సరాలుగా అక్కడ టీచర్ స్కూల్కి రాకుండా, అక్షరం ముక్క చెప్పకుండా, అప్పనంగా జీతం తీసుకుని రిటైర్ కూడా అయిపోయాడని.
కొత్తగా స్కూల్ మొదలు పెడదామని ఆమె ఇంటింటికీ తిరిగి పిల్లల్ని పాఠశాలకి పంపించమని అడుగుతుంది. చాలామంది ఆమెను అనుమానంగా చూస్తారు. కొంతమంది ఎద్దేవా చేస్తారు. చదువు చెపితే నీకు డబ్బొస్తుంది. మాకేమొస్తుంది అని ప్రశ్నిస్తారు. మంచి జీవితం లభిస్తుంది కదా అంటే ఇప్పుడు మంచిగానే వున్నాం కదా అంటారు. ఇప్పుడు మా పిల్లాడిని పాఠశాలకు పంపిస్తే పొలంలోకి అదనంగా మరొక కూలీని పెట్టుకోవాలి, ఆ కూలీ ఎవరు ఇస్తారు? నువ్విస్తావా? అని అడుగుతారు. కొంతమంది అయితే వూళ్ళోనుండి వెళ్లక పోతే చంపేస్తామని బెదిరిస్తారు. ఆమె అన్నిటినీ తట్టుకుని, సానుకూలంగా స్పందించిన ఒకరిద్దరు పిల్లలతోనే ఊరి బయట ఒక పెద్ద చెట్టు కింద స్కూల్ తెరుస్తుంది.
ఒకళ్ళు, ఇద్దరు కాస్తా యాభై మంది పిల్లలు అవుతారు. పాఠాలు చెప్పడం మాత్రమే తన డ్యూటీ అని అనుకోదు రీతూ. వాళ్లకు వ్యక్తిగత పరిశుభ్రత నేర్పుతుంది. పరిసరాలను ఎలా శుభ్రంగా వుంచుకోవాలో నేర్పుతుంది. నిజం చెప్పడంలో ఉన్న ఆనందం ఏమిటో వాళ్ళ అనుభవంలోకి తెస్తుంది. వాళ్లకు అమ్మ అవుతుంది, అక్క అవుతుంది. ఒకరోజు ఆమె పాఠశాలలో చదువు చెపుతున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఆమె బోధనను గమనిస్తాడు. ఈ పాఠశాలది ఒక ఫొటో తీసుకొవచ్చా? అని అడుగుతాడు. ఎందుకు అని ఆమె ప్రశ్నిస్తే ''ఈ వాతావరణం నచ్చింది కనుక!'' అంటాడు. ఒక్కసారి ఆమె తన చుట్టుపక్కల తేరిపార చూస్తుంది. అప్పుడా ప్రదేశం ఆమె కళ్ళకు కొత్తగా కనిపిస్తుంది, ఒక శాంతినికేతన్ లాగా. పచ్చటి చెట్లు, చుట్టూ ఎత్తైన కొండలు, ప్రకృతిలో ఒక భాగమైన పిల్లలు, వాళ్ళను కౌగిలించుకోవడానికి ఆతురత పడుతున్న అక్షర సముదాయం. ఎంత అద్భుతంగా ఉందీ ప్రాంతం! ఎంత సౌందర్యవంతంగా ఉందీ వాతావరణం. ఈ సౌందర్యాన్ని తానెందుకు గుర్తించలేక పోయింది? కొత్త ప్రశ్న ఎదురువుతుంది ఆమెకు.
నిజం. మనిషి ఎప్పుడూ తన లోపలి సౌందర్యాన్ని గుర్తించడు. బాహ్య సౌందర్యం కోసం పరుగులు తీస్తాడు. లోలోపల వెలుగుతున్న జ్యోతిని గమనించక బయట వెలుగు కోసం నానా తాపత్రయ పడతాడు. అప్పటికప్పుడు ఆమె ఫొటో తీసుకోవడానికి నిరాకరిస్తుంది. ఆ సాయంత్రం అతడిని కలిశాక, అతడిది ఆ వూరే అని, అతడొక ప్రముఖ రచయత అని ఆమెకు తెలుస్తుంది. అతడి మాటలతో ఆమె మరింత స్ఫూర్తిని పొందుతుంది. ఎంత పెద్ద జ్వాల అయినా ఒక చిన్న నిప్పురవ్వతోనే మొదలవుతుందని, ఆమె చెపుతున్న చదువు, ఆమె పునరుజ్జీవం కలిగించిన పాఠశాల ఒక చిన్న నిప్పు రవ్వలాంటిదని, అది ఆ వూళ్ళో వెలుగులు నింపుతుందని అతడొక మాట చెపుతాడు.
రానున్నది వర్షాకాలం కనుక పిల్లలకి వర్షం వస్తే ఇబ్బంది అని అలోచించి, గ్రామ పెద్దను కలిసి రెండు బాంబూ పోల్స్ కావాలని అడుగుతుంది. ఎందుకు అంటే, రానున్నది వర్షాకాలం కనుక పిల్లల కోసం చిన్న పాక లాంటిది వేయిద్దామని చెపుతుంది. ఈ కష్టం అంతా ఎందుకు? మా ఇంట్లోనే స్కూల్ పెట్టు అంటే... ఇదేమీ కష్టం కాదు, ఊరంతా తలా ఒక చేయి వేస్తారు కదా అంటుంది. ఆమె అనుకున్నట్టే ఊరంతా ఒక్కటై, తలా ఒక చేయి వేసి మంచి పర్ణశాల లాంటి పాక వేస్తారు.
అది కావడానికి చిన్న పూరిపాకే కావచ్చు, కానీ అదొక జ్ఞాన మందిరం. ఆ పాఠశాలలో ఆ ఊరంతటి శ్రమ దానం వుంది. ఆ పాఠశాల అణువణువునా శ్రమైక జీవన సౌందర్యం ఉంది. ఆ పాఠశాల మా సొంతం అన్న గ్రామస్తుల సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ నెస్ ఉంది. అది చాలు... ఆ నిప్పు ఆరకుండా వెలుగు పంచడానికి.
అవి చైనా యుద్ధం రోజులు. రీతూ ఒక రోజు టౌన్కి వెళితే యుద్ధం మొదలై మూడు రోజులవుతున్నదని తెలుస్తుంది. ఆమె ఒక చిన్న ట్రాన్సిస్టర్ కొనుక్కుని వస్తే, అందరూ ఆ ట్రాన్సిస్టర్ ద్వారా యుద్ధ వార్తలు వింటూ వుంటారు. వూళ్ళో రచ్చబండ కింద కబుర్లాడుకునే వాళ్ళు కూడా ఆటంబాంబ్ అంటే ఏమిటో చెప్పమని అడుగుతారు. హిరోషిమా, నాగ సాకీ గురించి అడుగుతారు. ఆటం బాంబ్ ఎలా తయారు చేస్తారని అడుగుతారు. వాటన్నిటికీ ఆమె ఓపిగ్గా జవాబులు చెపుతుంది. అంతా విన్నాక ఒక వృద్ధుడు ''అబ్బే! అమెరికా వాడు పరమ మూర్ఖుడు అనుకుంటా. ఆటం బాంబ్ వేస్తే అందరూ చచ్చిపోతే వాడూ చచ్చిపోతాడు కదా? ఒకవేళ మిగిలినా అందరూ పోయాక వాడొక్కడూ ఏమి చేస్తాడు?'' అంటాడు.
ఈలోగా ఆ ఊరినుండి వెళ్ళిపోయిన ఒక భూస్వామి కుమారుడు వచ్చి స్కూల్ని తన పరం చేయమంటాడు. ఆ స్కూల్ ఉన్న స్థలం తనదే అంటాడు. ఆమెను బెదిరిస్తాడు. ఆమె వినకపోతే ఆమె మీద భౌతిక దాడులు చేస్తాడు. చివరకు కొంతమంది పోకిరి కుర్రాళ్లతో కలసి గ్రామస్థుల సహకారంతో నిర్మించిన పాఠశాలను తగుల బెట్టేస్తాడు.
ఒక పక్క ప్రళయాగ్ని కీలల్లో పాఠశాల తగలబడి పోతుంటే ఆమె నిస్సహాయంగా, ఏడుస్తూ కూలబడిపోతే గ్రామస్థులు ఒక్కక్కరే వచ్చి ఆమె వెనుక దృఢంగా నిలబడతారు. వాళ్ళ హృదయాల్లో మొలకెత్తిన జ్ఞానదాహం అనే నిప్పురవ్వను ఏ ప్రళయాగ్ని కీలలూ అంతరింప చేయలేవని తేల్చి చెపుతారు.
ఇది 'ఫిరంగోటి' పేరుతో జాహ్ను బారువా 1991లో నిర్మించిన అస్సామీ సినిమా. 'ఫిరంగోటి' అంటే నిప్పురవ్వ అని అర్థమట . రీతూగా మొలయా గోస్వామి నటన ఎక్కడా హెచ్చు తగ్గులు లేకుండా తూకం వేసినట్టు ఉండి మనసును దోచేస్తుంది.పెళ్ళైన కొద్దిరోజులకే భర్తను పోగొట్టుకున్న యువతిగా, గ్రామస్థులకు నచ్చ చెప్పే కార్యసాధకురాలిగా, ఎంత కష్టం వచ్చినా నిబ్బరంగా ఎదుర్కునే మహిళగా ఆమె నటన చాలాకాలం గుర్తుండి పోతుంది. జాహ్ను బారువాకి అసోం చిత్ర రంగంలో పెద్ద పేరుంది. 'ఫిరంగోటి'కి ముందు 'అగ్నిస్నాన్' లాంటి సినిమాలు, ఆ తరువాత 'మై నే గాంధీ కో నహీ మారా' లాంటి సినిమాలు తీసి భారత దేశం దృష్టి యావత్తూ అసోం మీద కేంద్రీకృతం అయ్యేలా చేశాడు. భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్తో ఇటీవలే సత్కరించింది. 1992లో ఉత్తమ ద్వితీయ చిత్రంగా రజత కమలం అందుకున్న 'ఫిరంగోటి' క్లీన్గా నీట్గా ఉండి మనసును ఆకట్టుకుంటుంది.
ఈ ఆదివారం అద్భుతంగా గడవాలంటే యు ట్యూబ్లో ఉంది చూడండి.
- వంశీకృష్ణ,
9573427422