Authorization
Mon Jan 19, 2015 06:51 pm
క్రూ అంతా ఎవరి ఎక్విప్ మెంట్ వాళ్ళు సరిచూసుకున్నారు. అందరూ ఓకే అనగానే డ్రైవర్ బండి స్టార్ట్ చేశాడు. ఆ బండి భవిష్యవాణి రికార్డింగ్ కోసం వెళుతోంది.
వెనక్కాల సీట్లో కూర్చున్నాడు దాము. ఉన్నట్టుండి అతనికి ఫోనొచ్చింది. అవతలివైపునించీ ఎవరిదో వినసొంపైన అపరిచిత ఆడగొంతు హిందీలో వినిపించింది. ఎంతటివాడినైనా మాటల్తో కట్టిపడెయ్యగల మాధుర్యం ఆ గొంతులో ధ్వనిస్తూ మైమరపింపజేస్తోంది. బ్యాంకింగ్ సర్వీసెస్ వినియోగించుకోవడంలో సమస్యల గురించి ఫీడ్ బ్యాక్ తీసుకోవడానికి ఫోన్ చేస్తున్నానని చెప్పింది. ఆ తరవాత అతని డెబిట్ కార్డ్ గురించి అడిగింది. డెబిట్ కార్డుని కూడా క్రెడిట్ కార్డులాగా మీ అంత ప్లాన్డ్గా ఉపయోగించే కస్టమర్స్ చాలా తక్కువని, అతని బ్యాంకింగ్ నైపుణ్యాన్ని పొగిడింది. దాంతో మనవాడు ఐసులా నైసైపోయాడు. ఆ తరవాత అతని నెంబర్ తీసుకుంది. ఆ నెంబర్కి వెయ్యి బోనస్ పాయింట్లు వచ్చాయనీ, వాటిని క్యాష్ చేసుకుంటే పాతికవేలదాకా బ్యాంకులో క్రెడిటయ్యే అవకాశం ఉందనీ ఎగ్జాక్ట్ ఎమౌంట్ ఎంతో వెరిఫై చేసి మరో రెండు నిమిషాల్లో మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పి కట్ చేసింది.
ఫోన్ కట్టయినా ఆమె గొంతులోని మాధుర్యం మాత్రం దాము చెవుల్లో ఇంకా గుసగుసలాడుతూనే ఉంది. అందుకే ఆమె ఫోన్ కోసం ఎదురు చూస్తూంటే రెండు నిమిషాలూ రెండు యుగాల్లా గడిచాయి. అంతలోనే ఫోన్ రింగైంది. ఆ అమ్మాయే. ఆ గొంతు హిందీలో మాట్లాడుతూనే ఉంది. మొత్తం ఇరవై ఏడువేల మూడొందల యాభైరూపాయల ఎమౌంట్ వచ్చిందనీ, జీఎస్టీ పోను మిగిలిన పాతికవేల నూట పదహార్లూ ఎక్కౌంట్లో క్రెడిటవుతుందనీ. దాన్ని క్రెడిట్ చెయ్యడానికి తనొక నెంబర్ పంపుతున్నాననీ వెంటనే ఆ నెంబర్ చెప్పమనీ అడిగింది. ఆమె అన్నట్టే ఏదో నెంబరొచ్చింది. ఆమెకి మాటిచ్చినట్టే ఆ నెంబర్ ఆ అమ్మాయికి చెప్పడం... మరుక్షణంలోనే బ్యాంకునించీ మెసేజ్ రావడం... అందులో పాతికవేల నూట పదహార్లు కనపడ్డం... దాము ఆనందం తట్టుకోలేక ముందుసీట్లో కూర్చున్న సుబ్బుకి చూపించడం... అతను తనకా పాతికవేల బోనస్ పాయింట్స్ రానందుకు తెగ బాధపడ్డం.., వీళ్ళ ఆనందం చూసి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రామ్ కుమార్ విషయం కనుక్కోవడం... సెల్లో చూడ్డం.., అందులో పాతికవేల నూట పదహార్లు అనగా వచ్చిన జీతం వచ్చినట్లే మటాషైన విషయం తెలుసుకోవడం.., అటునించటే సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంటివ్వడం... తరవాత పాతికవేలమాట మర్చిపోయి లొకేషన్కి వెళ్ళడం వరసగా జరిగిపోయాయి.
గురువుగారొచ్చి భవిష్యవాణి వినిపించడానికి కూర్చోగానే ఆయనదగ్గరకి వెళ్ళాడు రామ్ కుమార్. దాముకి జరిగిన మోసం గురించి ఆయనకి వివరంగా చెప్పాడు. ఈ విషయాన్ని భవిష్యవాణిలో చెప్పి తమ చానెల్ వీక్షకుల్లో చైతన్యం నింపవలసిందిగా కోరాడు.
గురువుగారు వెంటనే స్పందించారు. ఇటువంటి మోసాలు జరక్కుండా ఎవరికివారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని దామూతో సహా క్రూ అందరికీ సలహా ఇచ్చారు. అంతే కాదు, వెంటనే తమ ఎక్కౌంటెంట్కీ, ఆడిటర్కీ, భార్యామణికీ, కూతురికీ, కొడుకులకీ వరసగా ఫోన్లు చేసి దాముకి జరిగిన మోసం గురించి చెప్పి తన ఎక్కౌంట్ నెంబర్ ఎవరికీ ఇవ్వద్దనీ ఒకవేళ ఎవరైనా ఇస్తే ఎంత ఎమౌంట్ మోసం జరిగిందో అంత మొత్తాన్నీ వాళ్ళ ముక్కుపిండి వసూలు చేస్తాననీ నవ్వుతూనే బెదిరిస్తూ తగిన జాగ్రత్తలు చెప్పారు. ఆ తరవాత రాశులవారీగా భవిష్యవాణిని వినిపించారు. కానీ అందులో ఎక్కడా జరిగిన మోసానికి సంబంధించిన వివరాలు రాలేదు. దాంతో చివర్లో అయినా జాగ్రత్తలు చెబుతాడేమోనని ఎదురు చూశాడు రామ్ కుమార్. కానీ గురువుగారు షూటింగ్ ముగించారు. ఎవరెంత మొత్తుకున్నా ఆన్ లైన్ మోసాల ఊసెత్తలేదు. దాంతో ఆయనింక భవిష్యవాణిలో దాని గురించి చెప్పరని రామ్కుమార్కి అర్థమైపోయింది. అయినా చివరి ప్రయత్నంగా దాము గురించి కూడా వీక్షకులకో సలహా చెప్పమని కోరాడు.
గురువుగారు చిద్విలాసంగా నవ్వుతూ అన్నారు, ''పొద్దుపొద్దున్నే ప్రజలకి భవిష్యత్తుపట్ల ఆసక్తినీ ఆశల్నీ రేకెత్తించే నాలుగు మంచిమాటలు చెప్పాలిగానీ నష్టాలూ మోసాలూ కుట్రలగిరించి చెప్పి బెదరగొట్టకూడదు రామ్ కుమార్. అయినా మనీ మేనేజ్ మెంట్ గురించి మా బావమరిది మీ ఛానెల్కి ఏదో స్పెషల్ కాన్సెప్టిచ్చాట్ట కదా? దాన్ని ఓకే చేసి అందులో చెప్పించుకోండి ఈ అవేర్ నెస్ చిట్కాలన్నీ''.
- జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి,
9440037258