Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''నాకు/ దేవుడి మీద కన్నా/ మనిషి మీదే/ ఎక్కువ నమ్మకం/ అందుకే/ గుడి బయటే/ ఆడుకుంటాను'' అంటూ భిక్షగాడి స్వగతంగా కవిత్వం చెప్పిన కవి మాడభూషి సంపత్కుమార్. ఈ కవి అందిస్తున్న కవితా సంపుటి పేరు 'వికారి'. వికారి అంటే తెలుగు సంవత్సరాల్లో 33వది. త్రి సంధ్యలు, త్రికాలాలు కలిసి ఒండురులు చేరి 33 అయ్యాయని భావించి ఈ శీర్షికను 3+3=33గా పెట్టాడు. వికారిని సంబోధిస్తూ ''కాలానికి ఎదురొడ్డి/ నిన్ను దాటినవాడు/ మహౌన్నత పౌరుడు'' అన్న వాక్యాల్లో ఎంతో తాత్వికత వుంది. ''కులం కన్నా/ మలమే గొప్ప/ మలాన్ని విసర్జించగలుగుతున్నాం'' అన్న చిన్న పంక్తుల్లో ఈ దేశ దురాచారతత్వం కుల పోకడలనేది కవి భావన. మలం విసర్జించగలిగే మనిషి కులం విసర్జించలేకపోవడం దారుణం, బాధాకరం. అత్యల్ప పదాల్లో అనల్పార్థ విషయాల్ని చెప్పడమంటే ఇదేమరి. అట్లే ''మరణం లేని/ సమాజంకన్నా/ మానవత్వం లేని/ సమాజం గొప్పది కాదు'' అనడంలో మాయమైపోయే మానవత్వంపై కవిగారి ఆవేదన ఇది. 'సేవ' అనే కవితలో సూర్యచంద్రుల గమనాలను ఇలా అన్వయించి చూపుతూ ''ఇతరులకు/ సేవ చేసేవాళ్ళకు/ నిద్ర వుండదు/ నిలకడ వుండదు'' అంటాడు. సమాజంలో ఆకాశంలో సగభాగంగా భావించే మహిళల పట్ల 'నోరు తెరవండి' అని సంబోధిస్తూ ''నువ్వు మోసపోతే నీకు ఎవరూ సానుభూతి చూపరు/ నువ్వు నోరు తెరవనంత మాత్రాన/ లోకం నోరు మూసుకోదు'' అంటూ మహిళను తమ సమస్యల సాధనలో నోరు పెకల్చమంటాడు కవి. బాధ్యతతో రాసిన కవిత్వం ఇది.
- కె.హరనాథ్
9703542598
కనుక్కోండి చూద్దాం
మొదటి టర్మ్ సెలవుల తర్వాత హిజ్ స్కూల్ అనబడే బోర్డింగ్ స్కూల్కు వెళ్ళడానికి ఆయేషా మానసికంగా సిద్ధపడుతుంది. అక్కడ ఆమెకు తన క్లాస్మేట్స్తో పాటు కొత్త స్నేహితులు ఏర్పడతారు. ఇంటి మీది బెంగతో పారిపోబోయే సారాకు ధైర్యం చెప్పి తీసుకురావడంతో, ఆమె ఆయేషాకు శిష్యురాలిగా మారి సేవలు చేస్తూ, ఆమెను ఇబ్బందుల్లో పడేస్తుంటుంది. కొత్తగా వచ్చిన కంప్యూటర్ సార్ అహ్మద్ తెలివైన అందగాడు. పైగా సేవా అంకిత భావాలతో పనిచేసే ఉపాధ్యాయుడు కావడంతో విద్యార్థినుల దృష్టిలో అతడొక హీరో అయిపోతాడు. మాలి కూతురు పుష్ప కాలేజీ నుండి వస్తుంటే, కొంతమంది అల్లరి కుర్రాళ్ళు వెంబడించి వేధించడంతో, నుదుటి మీది గాయంతో ఏడుస్తూ ఇంటికి వస్తుంది. ఈ సంఘటనతో తల్లిదండ్రులు ఆమెను కాలేజీ మానేయమంటారు. స్కూలు పిల్లలందరికీ ఇది అన్యాయమనిపిస్తుంది. స్కూల్ టీచర్లు, విద్యార్థినులు ఆ దుండగులను ఎలా పట్టుకోవడం? బుద్ధి చెప్పడం ఎలా అని ఆలోచిస్తుంటారు. వాళ్ళు ఈ విషయంలో విజయం సాధించారా లేదా అనేది తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే. నోయిడా ఇంటర్నేషనల్ స్కూల్లో బాగా చదివే ఆయేషాను అక్కడ మాన్పించి బోర్డింగ్ స్కూల్లో వేయడం వెనుక వున్న రహస్యం తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే. రచయిత్రి ఎ.కోవెన్ ఆంగ్లంలో రాసిన ఈ పుస్తకానికి కె.సురేష్ చేసిన అనువాదం బాగుంది.
- కె.పి.అశోక్కుమార్,
9700000948