Authorization
Mon Jan 19, 2015 06:51 pm
(నేడు అంతర్జాతీయ దంతవైద్యుల దినోత్సవం సందర్భంగా...)
మన శరీరానికి కావలసిన శక్తి చక్కగా అందాలంటే దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఇదేంటి శరీరానికి శక్తి అందడానికి, పండ్లకు సంబంధం ఏమిటబ్బా అనుకుంటున్నారు కదూ! ఔను దంతాలు మంచిగ ఉంటేనే కదా ఆహారాన్ని చక్కగా నమిలి మింగగలిగేది. బాగా నమిలినప్పుడే కదా ఆహారం జీర్ణమవ్వడానికి సిద్ధమయ్యేది. అలా ఆహారం జీర్ణమైనప్పుడే కదా శక్తి విడుదలయ్యేది. అప్పుడే కదా ఆరోగ్యంగా ఉండి దైనందిన కార్యక్రమాలను నిర్వర్తించగలిగేది. కాబట్టి దంతాలను మనం ఎంత ఆరోగ్యంగా ఉంచుకుంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటామన్నమాట!
దంతాలేమిటి? వాటికి ఒక ఆరోగ్యం ఏమిటి? అనుకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవు. చూడటానికి, తెల్లగా, గట్టిగా ఉండే దంతాలను సున్నితంగా సంరక్షించుకుంటే తప్ప అవి ఎక్కువ కాలం మనజాలవు. వీటి సంరక్షణ ఆవశ్యకత అర్థం కావాలంటే ముందు వాటి నిర్మాణం పై అవగాహన అవసరమ వుతుంది.
దంతంపైభాగం ఎనామిల్ అనే పదార్థంతో ఏర్పడుతుంది. ఎనామిల్ తర్వాత డెంటిన్ అనే మరో పొర ఉంటుంది. డెంటిన్ తరువాత పల్ప్ కనిపిస్తుంది. ప్రతి దంతానికి దవడలో మూలం ఉంటుంది. ఎన్ని పండ్లుంటే అన్ని మూలాలు దవడ ఎముకలో ఉంటాయన్నమాట. ఈ దంతాల చుట్టూ చిగురు ఆవరించి ఉండి సిమెంట్గా పనిచేస్తుంది. చిగుళ్లు ఎంత ఆరోగ్యంగా ఉంటే పన పండ్లు కూడా అంత గట్టిగా ఉంటాయి. వాటిని జాగ్రత్తగా చూసుకోకపోతే వాచిపోయి దుర్వాసన వస్తుంది. ఎదుటివాళ్లతో మాట్లాడేటప్పుడు మన నోటి నుంచి భరించలేని వాసన వస్తుంది. ఫలితంగా చాలామంది మనల్ని తప్పించుకుని తిరిగే ప్రమాదమూ ఉంటుంది. చిగుళ్ల వాపువల్ల రక్తస్రావం కూడా కలుగుతుంది. ఇంకా నిర్లక్ష్యం చేస్తే దంతాలు కదలడం ప్రారంభమవుతుంది.
చిన్న పిల్లలు- జాగ్రత్తలు
దంతాలు వచ్చినా, రాకపోయినా శిశువులు పాలు తాగిన తర్వాత నోరంతా శభ్రంగా కడగాలి. వేలితో చిగుళ్లను మర్దన చేయాలి. పాల సీసా పీకను నోట్లోనే ఉంచి నిద్రపుచ్చకూడదు. దేనినైనా తిన్న తర్వాత పుక్కిలించి ఊయడం, నోటిని శుభ్రం గా కడుక్కోవడం వంటి పనులను పిల్లలకు అలవాటు చేయాలి. పిల్లలకు శాస్త్రీయంగా ఎలా పండ్లు తోమాలో తల్లిదండ్రులే దగ్గరుండి నేర్పించాలి. కిందిపండ్లు పైకి, పై పండు కిందికి బ్రష్ చేయాలి. బ్రష్ని బ్రష్ని ప్రతి మూడు నెలలకోసారి మార్చాలి (పెద్దలు కూడా).
చేయకూడని పనులు
పంటి నొప్పి లేదా చిగురు వాపు వస్తే దంతానికి జందూబామ్ లేదా అమృతాంజన్ వంటివి రాయకూడదు.పంటి సందుల్లో పుల్లలు, పిన్సీసులు వంటివి పెట్టి కెలకకూడదు. పాన్, గుట్కా ఇతర పొగాకు ఉత్పత్తులను నమలకూడదు. గరుకైన పొడులను, గట్టిగా ఉండే బ్రష్లను దంతాలు శుభ్రంచేయడానికి (తోమడానికి) ఉపయోగించకూడదు. అతి చల్లగా కానీ లేదా అతి వేడిగా ఉండే పదార్థాలను, పానీయాలను పంటికి తగలకుండా జాగ్రత్తపడితే మంచిది.
దంతాలు-అపోహలు
దంతాలకు వైద్యం చేయించుకుంటే చూపు మందగి స్తుందని చాలామంది అనుకుంటారు. ఇది పెద్ద అపోహ. పంటి నరాలకు, కంటి నరాలకు సంబంధమే లేదు. పండ్లు పుచ్చిపోవడానికి పురుగులు కారణం అనుకుంటారు. అది కూడా తప్పే. పండ్లు పుచ్చిపోవడానికి అసలు కారణం సూక్షజీవులే.
సాధారణ దంత సమస్యలు
దంతాలను, చిగుళ్లను అన్ని వైపులా శుభ్రంచేసుకోక పోవడం వల్ల నోటి దుర్వాసన వస్తుంది. మనం తిన్న ఆహారం పండ్లలో ఇరుక్కుపోయి కుళ్లిపోయి దంత సమస్యలు వస్తాయి. ఇందువల్ల ముఖ్యంగా చిగుళ్లు వాయడం, రక్తంకారడం సంభవిస్తుంది. పండ్లు పుచ్చిపోవడం మరో సమస్య. పుచ్చడం ప్రారంభంలోనే గుర్తించి చికిత్స చేయించుకోవాలి. మధుమేహం ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండకపోతే అనేక అనర్థాలు కలిగే ప్రమాదం ఉంది.
- డా|| బిల్లా తేజ