Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పిల్లలూ.. ఖాళీ సమయం దొరికితే మీరేం చేస్తారు...? ఆడుకుంటారు కదూ... కానీ ఓ పిల్లోడు మాత్రం వ్యవసాయంలో వాళ్ల నాన్న పడుతున్న కష్టాన్ని తగ్గించాలనుకున్నాడు. ఆలోచన వచ్చిన వెంటనే ఓ సరికొత్త వ్యవసాయ పరికరాన్ని రూపొందించి.. అందరిచే శభాష్ అనిపించుకుంటున్నాడు. అంతేకాదు తేనీటి విందులో పాల్గొనాల్సిందిగా రాష్ట్రపతి నుంచే ఆహ్వానాన్ని దక్కించుకున్నాడు. మరి అతనెవరో తెలుసుకుందామా....
ఈ బాలుడి పేరు బిప్లవ్ కుమార్ ఘోష్. వయసు పన్నెండేళ్లు. ఒడిషా రాష్ట్రం బాలేశ్వర్ జిల్లాలోని మధురపురం గ్రామం ఇతనిది. బిప్లవ్ ఏడో తరగతి చదువుతున్నారు. అయితే వ్యవసాయ పనులతో తన తండ్రి ఎండలో పడుతున్న కష్టాల్ని చూసి బిప్లవ్చలించిపోయాడు. ఆ బాధల్ని తగ్గించాలని సంకల్పించాడు. అందుకోసమే ఓ సరికొత్త వ్యవసాయ పరికరాన్ని రూపొందించాడు. సౌరశక్తితో నడిచే ఈ పరికరం ద్వారా శారీరక శ్రమ తగ్గడంతో పాటు, డబ్బు, సమయం కూడా ఆదా అవుతుంది. నేలను చదును చేయడం, దుక్కి దున్నడం, ఎరువులు చల్లడం, విత్తనాలు నాటడం వంటి ఆరు రకాల పనులకు ఉపయోగపడుతుంది. దీని తయారీకి రూ. 10 వేలు ఖర్చయినట్లు బిప్లవ్ చెబుతున్నాడు. 'మిలియన్ మైండ్స్ ఆగ్మెంటింగ్ నేషనల్ యాస్పిరేషన్స్ అండ్ నాలెడ్జ్ అవార్డుకు జాతీయ స్థాయిలో ఎంపికైన ఏడు ప్రాజెక్టుల్లో బిప్లవ్ రూపొందించిన ప్రాజెక్టు ఒకటి. అంతేకాదు మార్చి ఏప్రిల్లో రాష్ట్రపతి భవన్లో నిర్వహించే తేనీటి విందులో పాల్గొనాల్సిందిగా రాష్ట్రపతి కార్యాలయం నుండి బిప్లవ్కు ఆహ్వానం దక్కింది. చూశారుగా పిల్లలు ఎంత గొప్ప పరికరాన్ని కనిపెట్టాడో బిప్లవ్. మరి మీరు స్ఫూర్తిగా తీసుకుంటారు కదూ..