Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉత్సాహం ఉరకలెత్తే యువకుడు అతడు. తానుంటున్న సమాజానికి బాధ్యత గల పౌరుడిగా ఏదో ఒక మేలు చేయాలి, తద్వారా తన జీవితానికో సార్ధకత ఏర్పరచుకోవాలి అనుకునే మనస్తత్వం అతడిది. జర్నలిజం చదువుతున్నాడు. అతడికో ఛానెల్ సిఈఓ కం యజమాని ఆదర్శం. అసలా ఛానెల్ యజమాని స్ఫూర్తితోనే అతడు జర్నలిజం కోర్సులో చేరాడు. ఒకరోజు అతడు యూనివర్సిటీ నుండి వస్తూవుండగా రోడ్డు పక్క స్పృహ లేని స్థితిలో పడివున్న ఒక అమ్మాయి కనిపిస్తుంది. అందరిలా తనకెందుకులే అనుకోకుండా ఆ అమ్మాయిని హాస్పిటల్లో చేర్పిస్తాడు. తల్లిదండ్రులు వచ్చిందాకా తానే గార్డియన్గా ఉంటాడు. నిజం నిగ్గు తేల్చాలని పోలీస్స్టేషన్కి వెళ్లి కేసు పెడతాడు. అక్కడినుండి అతడి కష్టాలు మొదలవుతాయి. న్యాయం కోసం వెళితే అన్యాయం ఎదురవుతుంది. నువ్వే ఏదో చేసి ఉంటావు అని ఎదురు నిందలు భరించాల్సి వస్తుంది. ఇలా లాభం లేదు అనుకుని తాను ఎంతో అభిమానించే ఛానెల్ యజమానిని అప్రోచ్ అవుతాడు. అలా అప్రోచ్ అయినా క్షణం నుండీ ఆ అమ్మాయి ఒక పెద్ద చర్చనీయాంశం అవుతుంది. బిగ్ డిబేట్ మొదలవుతుంది. ఆ అమ్మాయి క్యారెక్టర్ మీద సమాజం ఛానెల్ నేపథ్యంలో రకరకాల తీర్పులు ఇవ్వడం మొదలు పెడుతుంది. వారం రోజుల పాటు ఆ అమ్మాయే రాష్ట్రమంతా హాట్ టాపిక్ అవుతుంది.
ఇదంతా చూస్తున్న అతడు తట్టుకోలేక పోతాడు. తను ఆ అమ్మాయికి మంచి చేశాడా? చెడు చేశాడా? రాష్ట్రమంతా ఆ అమ్మాయి ఇంటింటి పేరు కావడానికి తానే కారకుడు కదా. రాత్రికి రాత్రి ఆ అమ్మాయి వ్యక్తిత్వం మీద సమాజం తీర్పులు చెప్పడానికి అవకాశం కల్పించింది తానే కదా. రకరకాల ఆలోచనలు అతడిని అల్లకల్లోలం చేస్తాయి. డిప్రషన్లోకి వెళ్ళిపోతాడు. ఆరు నెలల పాటు అతడు సమాజం నుండి పక్కకు జరిగి, ఒంటరి వాడై, తనలో తనే కుమిలిపోతూ, చివరకు ఒక బలహీన క్షణంలో ఆత్మహత్య చేసుకుంటాడు. గొప్ప భవిష్యత్తు ఉన్న ఒక చలాకీ యువకుడు, సమాజానికి ఎంతో సేవ చేయవలసినవాడు, ఎంతోమందికి కావలసిన వాడు, ఒక నెత్తురు మండే సూర్యుడు అర్ధాంతరంగా వెళ్లిపోవడాన్ని అతడి ప్రొఫెసర్ ఒకరు జీర్ణించుకోలేక పోతాడు. అసలేం జరిగింది అని ఆరా తీస్తాడు. ఆ ఆరాలో ఈ కథంతా బయటపడుతుంది.
ఒకరోజు ఆ ఛానెల్ యజమాని యూనివర్సిటీలో జర్నలిజం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించడానికి వస్తున్నాడని తెలుసుకున్న ఆ ప్రొఫెసర్ తానుకూడా అతడేం చెప్తాడో విందామని వెళ్తాడు. ఒక నాటకీయ సన్నివేశంలో ఆ ప్రొఫెసర్, ఆ ఛానెల్ యజమాని ఒకే గదిలో దాదాపు గంటసేపు లాక్ అయిపోతారు. లేదు అలా లాక్ అయ్యేలా ప్రొఫెసర్ ప్లాన్ చేస్తాడు. అప్పుడా ఛానెల్ యజమానికి ఈ కథంతా చెప్పి తప్పు ఎవరిదో తేల్చమంటాడు ప్రొఫెసర్. తప్పు ఎవరిది?
అందరిలాగా తనకెందుకులే అని వెళ్లిపోకుండా బాధ్యత తీసుకున్న యువకుడిదా? ఆ అమ్మాయి వ్యక్తిత్వం మీద తక్షణ తీర్పులు చెప్పి ఆమె లైంగికతను అవమాన పరచిన సమాజానిదా? ఆ అమ్మాయిని సెన్సేషన్ చేసి ఇంటింటా చర్చనీయాంశం చేసిన ఛానెల్ యజమాని వ్యాపార దృక్పథానిదా? లేక ఇన్ సెన్సిటివ్, మొరటు సమాజంలో ఎలా బతకాలో నేర్పలేకపోయిన ప్రొఫెసర్దా? ఎవరిదీ తప్పు? ఆ ఛానెల్ యజమాని చెప్పే జవాబు మీదే ఛానెల్ యజమాని, ప్రొఫెసర్ భవిష్యత్తు ఆధారపడి ఉందని చేతిలో రివాల్వర్ మ్యాగజిన్లో బుల్లెట్లు నింపుతూ ప్రొఫెసర్ ప్రశ్నిస్తాడు. ఆ జవాబు మీదే ఇద్దరిలో ఎవరో ఒకరు మర్నాటి నుండి మూడు రోజుల పాటు మీడియాలో ట్రెండీగా మారతారు అని ప్రొఫెసర్ చెప్తాడు. తప్పెవరిది అని ప్రేక్షకుడు మనసులోపల తర్కించుకుంటూ ఉండగానే రివాల్వర్ పేలిన శబ్దం వినిపిస్తుంది. స్క్రీన్ ఒక్కసారిగా బ్లాంక్ అయిపోతుంది.
ఇది ఇటీవల నేను చూసిన 'కథా సంగమం' అన్ని కన్నడ సినిమాలో ఒక చిన్న కథ. రిషబ్ శెట్టి విఖ్యాత కన్నడ దర్శకుడు పుట్టణ్ణ కనగళ్కి నివాళిగా తీసిన 'కథా సంగమం' సాంప్రదాయికంగా తీసిన సినిమా కాదు. ఏడు చిన్న కథల సమాహారం. ఏడు విభిన్నమైన కథలు. ఏడు సినిమాల దర్శకులు నటీనటులు వేరువేరే. ఏడు సినిమాల నేపథ్యమూ వేరువేరే. కానీ భావోద్వేగాల సమ్మేళనం ఈ ఏడూ కథలను ఒక్కటిగా ముడివేసిన అంతసూత్రం. నిజానికి 'కథా సంగమం' అన్న పేరుకూడా పుట్టణ్ణ కనగళ్ నుండి తీసుకున్నదే. 1976లో వచ్చిన పుట్టణ్ణ సినిమాలో నాలుగు కథలు ఉంటే ఇందులో ఇంద్రధనస్సులో ఏడు రంగుల్లా ఏడు కథలు ఒక్కో భావోద్వేగానికి పట్టం కడతాయి. ఏడు రంగులూ ఒక దానిలో ఒకటి ఏకమయి ఒక్క మల్లె రంగే మిగిలినట్టు, మానవ జీవన వేదన ఏదో మన మనసులను కట్టి పడేస్తుంది.
ఈ 'కథా సంగమం'లో రెయిన్బో లాండ్ మొదటి కథ. ఒక తండ్రి తన కూతురిని నిద్ర పుచ్చడానికి చెప్పిన ఒక అభూత కల్పన రెయిన్బో లాండ్. నువ్వు ఇప్పుడు అల్లరి చేయకుండా తొందరగా నిద్రపోతే రేపు నిన్ను నేను రెయిన్బో లాండ్కి తీసుకెళ్తానని ప్రామిస్ చేస్తాడు తండ్రి కిషోర్. పాప అలాగే నిద్రపోతుంది. పాప నిద్ర నిండా రెయిన్బో కలలు. ఉదయం స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా తండ్రి దగ్గర సాయంత్రం రెయిన్బో లాండ్కి తీసుకుని వెళతాను అని ప్రామిస్ తీసుకుని వెళ్ళిపోతుంది. పాప కిచ్చిన మాటను నిజం చేయడానికి కిషోర్ ఆఫీస్కి సెలవు పెట్టి మరీ తన ఇంటి వెనుక ఒక కృతిమ రెయిన్బో లాండ్ సృష్టించాలి అనుకుంటాడు. మార్కెట్కి వెళ్లి రకరకాల సీతాకోకచిలుక బొమ్మలు, చార్ట్లు, రంగులు, మాస్క్లు, పూలగుత్తులు ఇలా సమస్తం తీసుకుని వచ్చి తనలో ఉన్న సృజనశక్తినంతా ఒక అద్భుత ప్రపంచంగా తీర్చిదిద్దుతాడు. దాదాపు ఏడెనిమిది గంటలు కష్టపడి ఒక అద్భుతాన్ని సృష్టిస్తాడు. ఇంక పాప వచ్చి ఆ రెయిన్బో లాండ్ చూస్తే ఎంత సంతోషంగా, ఆనందంగా కేరింతలు కొడుతుంది? ఆ చిన్ని కళ్ళలో ఎన్ని మెరుపులు మెరుస్తాయి అన్న ఊహలు చేస్తూ ఉండగా ఒక పెద్ద గాలి వాన వచ్చి ఏడెమిది గంటల కష్టాన్ని నాలుగు నిమిషాల్లో తుడిచిపెట్టేస్తుంది. తన శ్రమంతా వాన పాలు అవడాన్ని కిషోర్, అతడి భార్య నిర్విణ్ణులై చూస్తూ ఉండగానే పాప స్కూల్ వాన్ దిగి వచ్చేస్తుంది. పాపకి రెయిన్బో లాండ్కి రేపు తీసుకెళ్తాను అని ఏదో సర్ది చెప్తాడు. అతడలా పెన్సివ్ మూడ్లో ఉండగానే అర్ధగంట తరువాత పాప రెయిన్బో లాండ్, రెయిన్బో లాండ్ అంటూ కేరింతలు కొడుతూ, డాడీ! డాడీ! అంటూ పిలిస్తే ఇంటి వెనక్కు పెరట్లోకి వస్తాడు.
ఆకాశంలో అందమైన ఇంద్రధనస్సు విరిసి ఉంటుంది. ఆ ఇంద్రధనస్సు రంగులను సవాల్ చేస్తున్నట్టు రంగురంగుల పక్షులు ఆకాశంలో విహరిస్తూ ఉంటాయి. చెట్ల ఆకుల చివర్ల నుండి జారుతున్న నీటి బిందువులు సూర్యకిరణాలు పడి పంచరంగులుగా పరిమళిస్తుంటాయి. ఆకుపచ్చటి పెరటి నిండా రంగుల పువ్వులు, వాన పడిన తరువాత వచ్చే మట్టివాసన అదొక అద్భుత లోకం. హృద్యంగా ఉండి ఒక గొప్ప అనుభూతిలోకి హృదయాలను తీసుకుని వెళుతుంది. కిషోర్ అసంకల్పితంగా భార్య చేయి పట్టుకోవడంతో రెయిన్బో లాండ్ షార్ట్ ఫిలిం అయిపోతుంది. చూస్తున్న ప్రేక్షకుడికి కూడా ఒక అద్భుత ఇంద్రధనస్సు లోకంలోకి వెళ్లివచ్చినట్టు ఉంటుంది. అసలీ ప్రపంచమే ఒక ఇంద్రధనస్సు. మనిషి లోపలి ప్రతి భావోద్వేగానికీ ఒక ప్రత్యేకమైన రంగు వుంది. ఆ ప్రతి వర్ణమూ మళ్ళీ స్వచ్ఛమైన తెల్లటి మల్లె రంగు మనసులో కలసిపోవలసిందే. మన్హసి లోపలే ఒక ఇంద్రధనస్సు పల్లకి, వల్లరి వుంది.
మూడో కథ చాలా చిన్నదే కానీ కలిగించే సంచలనం చాలా పెద్దది. ఒక నైతిక ప్రశ్నను ప్రేక్షకుడి ముందు వేస్తుంది. కథాకాలం స్వాతంత్య్రానికి పూర్వం. స్థలం ఒక బార్బర్ షాప్. ఆ బార్బర్, స్వాతంత్య్రం కోసం పనిచేస్తున్న ఒక సాయుధ దళం రహస్య ఇన్ఫార్మర్గా పనిచేస్తూ ఉంటాడు. అలా స్వాంత్య్రోద్యమానికి తనవంతు దోహదం తాను చేస్తున్నాను అని సంతృప్తి పడతాడు. ఒక రోజు ఉదయమే తమ దళంలోని ముగ్గురు సభ్యులను పోలీసులు హతమార్చారని, మరో ఇద్దరు తప్పించుకుని పోయారని, వాళ్ళ కోసం పోలీసులు గాలిస్తున్నారని అతడికి తెలుస్తుంది. బార్బర్ ఆ విషయం ఆలోచిస్తుండగానే, ఆ స్వాతంత్య్ర సమరవీరులను మట్టుబెట్టిన పోలీస్ అధికారి ఆ బార్బర్ షాప్కి షేవింగ్ చేయించుకోవడానికి వస్తాడు. కుర్చీలో కూర్చుని షేవింగ్ చేయమని చెప్తాడు. తమ దళ సభ్యులను మట్టుబెట్టింది ఆ అధికారే అని, ఇంకా ఇద్దరికోసం వెతుకుతున్నాడని ఆ అధికారి నోటి ద్వారానే బార్బర్ వింటాడు. అతడి మనసులో ఒక సంచలనం. శత్రువు ఎదురుగా వున్నాడు. చేతిలో కత్తి ఉంది. పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. కత్తి కూడా ఇవాళ పదునుగా ఫాస్ట్గా తెగుతోంది. ఒక చిన్న నరం గొంతు దగ్గర కట్ చేస్తే సరి. చేసేద్దామా? ముగ్గురిని మట్టుబెట్టి మరొక ఇద్దరికోసం మాటువేసి ఉన్న శత్రువును మట్టుబెట్టి భరతమాత పాదాల ముందు పడవేద్దామా? తనను నమ్మి, తనవృత్తిని నమ్మి వచ్చినవాడిని చంపేయడం తన వృత్తికి అన్యాయం చేయడం కదా? ఇలా విభిన్న భావాల వరద అతడిని ముంచెత్తుతుంది. దేశం కోసం తాను ఏమైనా ఫరవాలేదు. చంపేద్దాం. కత్తి స్వరపేటిక మీద ఆనగానే ఆ పోలీస్ అధికారి మూసుకున్న కళ్ళు తెరుస్తాడు. ఊపిరి పీల్చుకోవడంతో స్వర పేటిక ముందుకూ వెనక్కూ కదలాడుతుంది. గొంతు మీద కత్తి పెట్టిన బార్బర్ కత్తి తీసేస్తాడు. చంపడం అనుకున్నంత తేలిక కాదు అని తెలుస్తుంది.