Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రవాసాంధ్రులు అనగానే అందరి దృష్టి అమెరికావైపు పోతుంది గానీ, ఈ భూగోళం మీది చాలా దేశాల్లో తెలుగువారు ఉన్నారనేది లెక్కలు తీస్తేగాని తెలియదు. అమెరికా, సౌదీ అరేబియా, బర్మా, కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో వున్నా భారతీయుల్లో తెలుగువారు పెద్ద సంఖ్యలో వున్నారు.
ఆర్థికంగా బలపడిన దేశాల్లో మ్యాన్ పవర్ అవసరం పెరుగుతుంది. సొంతదేశాల్లోని పౌరులకన్నా తక్కువ జీత భత్యాలకు పనిచేసేవాళ్ళు దొరకడం వల్ల కూడా మైగ్రేషన్కు ప్రోత్సాహం లభిస్తుంది.
బ్రిటీష్ సామ్రాజ్య కాలంలో తమ పాలనలో వున్న దేశాల్లోని పౌరులను, శ్రామికులను అవసరానుగుణంగా పక్క దేశాలకు పంపే విధానముండేది. ఆ రకంగా భారతీయులు ఆసియా, ఆఫ్రికా ఖండంలోని పలు దేశాలకు వలస పోయారు. ఒప్పంద కార్మికులుగా చెరకు తోటల పెంపకం కోసం బీహార్, తమిళనాడు, కేరళ, బెంగాల్ ప్రాంతాల్లోంచి దక్షిణాఫ్రికాకు భారతీయులు వెళ్ళారు. వీరితో పాటు తీర ప్రాంతంలో వున్న తెలుగువారు సైతం తక్కువ సంఖ్యలో సౌతాఫ్రికాకు పొట్ట చేతపట్టుకుని తరలిపోయారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో వున్న ప్రవాసులు, భారతీయ మూలాలున్నవారి సంఖ్య 15 లక్షలు దాటింది. అందులో తెలుగువారు సుమారు ఆరు వేల దాకా వుంటారు. వీరంతా డర్బన్, జోహాన్స్ బర్గ్ నగర ప్రాంతాల్లో వుంటున్నారు. 1860లో మొదలైన ఈ కార్మిక తరలింపు బొగ్గు గనుల తవ్వకాలు, రైల్వే పనుల ఆరంభంతో మరింత పెరిగింది. ఇప్పుడు ఆ దేశంలో వుంటున్న భారతీయులు నాలుగో, ఐదో తరానికి చెందినవారుగా భావించాలి. వారిలో చాలామంది సొంత భాషను గుర్తుపట్టే స్థాయిలో కూడా లేరు. తమ పూర్వీకుల మూల సంస్కృతిని, భాషను తెలుసుకునేందుకు వారు ఆయా భాషల సినిమాలపై ఆధారపడుతున్నారని ప్రస్తుత సంఘం నాయకులు అంటున్నారు.
1910లో బ్రిటీష్ పరతంత్రం నుండి దక్షిణాఫ్రికా స్వతంత్ర దేశమైనా, దేశ సంపద, పాలన అంతా అల్ప సంఖ్యాకులైన ఆంగ్లేయుల చేతుల్లోనే వుండేది. ఆ క్రమంలో వర్ణ వివక్ష, జాతి వైషమ్యాల వల్ల స్థానికులు సొంత నేలపై అష్టకష్టాలు పడ్డారు. ఆ కాలంలో భారతీయులను కూడా నల్లజాతి ప్రజలుగానే పరిగణించి హక్కుల్లో అసమానతల్ని కొనసాగించారు. 1994లో నెల్సన్ మండేలా దేశాధ్యక్షుడు కావడంతో పరిస్థితుల్లో మార్పు వచ్చింది.
అయితే తమ మాతృభాషపై దక్షిణాఫ్రికాలోని తెలుగువారికి మమకారం చావలేదు. నేల విడిచి వచ్చినా భాషా సంస్కృతులను వదులుకోలేక మిగతా ద్రవిడుల సహాయం కోరి తొలిసారిగా 1912లో తొలి తెలుగు పాఠశాలను ఆరంభించుకున్నారు. ఆ రోజుల్లోనే శ్రామికులుగా వచ్చిన చదువుకున్నవారు తమ భాష అక్షరాలను, పదాలను, వస్తువుల పేర్లను, చిన్న చిన్న వాక్యాలను తర్వాత తరానికి అందించారు. నాటల్ అనే నగరంలో మొదలైన ఈ తెలుగు బడికి ఎస్.రామస్వామి పిళ్ళై తోడుగా నిలిచి దానిని నిలబెట్టారు. 1915లో జి.ఎస్.రామస్వామి మౌంట్ ఎడ్జ్లో మరో పాఠశాల ఆరంభించారు. 1920లో ఎల్.క్రిష్ నాయుడు స్టెల్లాహిల్ ప్రాంతంలో ఒకదాన్ని తెరిచారు. ఇంతకాలం ఇళ్ళల్లో బోధించిన తెలుగు, బడిలోకి వచ్చింది.
ఇలా భాషా సంస్కృతుల ప్రాభవం వల్ల సౌతాఫ్రికా హిందూ మహాసభలో తెలుగువారికి తగిన గౌరవం దక్కింది. 1932 నుండి ఆ సభ తరపున తెలుగు పండుగల సంరంభాలు కూడా మొదలయ్యాయి. అలా ఆరంభమైన తొలి పండుగ దీపావళి. ఆ తర్వాత జరిగే సభలన్నీ తెలుగు భాషలోనే సాగాలని నియమం పెట్టుకుని ఆచరించి చూపారు. డర్బన్ నగరంలోని లైబ్రరీకి వి.ఎమ్.నాయుడు అధికారిగా పనిచేసేవారు. ఆయన చొరవతో తెలుగు పత్రికలు, పుస్తకాలు ఇక్కడి నుండి అక్కడికి చేరేవి. 1948లో తొలిసారిగా సొంత ముద్రణతో తెలుగులో ఆంధ్రపత్రికను ప్రారంభించారు. అందరి సాయంతో భూమి కొనుగోలు చేసి 1957లో ఆంధ్ర భవనాన్ని నిర్మించుకున్నారు.
1948లో నాటల్ యూనివర్సిటీ తొలిసారిగా దక్షిణాఫ్రికాలో తెలుగును ఒక సబ్జెట్గా అంగీకరించి సిలబస్లో చేర్చింది. ఇలా అక్కడి విద్యావిధానంలో ప్రవేశించిన తొలి భారతీయభాష తెలుగే కావడం గొప్ప విషయం. తెలుగు బోధించేందుకు ఆంధ్రప్రదేశ్ నుండి అధ్యాపకులను నియమించుకోవడం, తెలుగులో పాఠ్యగ్రంథాల రచనకు ఉపక్రమించడం కూడా చేశారు.
క్రమంగా మిగతా దక్షిణాఫ్రికా యూనివర్సిటీలతో పాటు 1984 నాటికి తెలుగులో బోధన సాగించే తరగతులు కూడా దేశమంతటా విస్తరించాయి.
ప్రస్తుతం ఆ దేశంలో తెలుగువారు ఉద్యోగాలలోనే కాకుండా వ్యాపారాల్లోనూ నిలదొక్కుకున్నారు. సొంత స్థిరచరాస్థులకు యజమానులైనారు. తమ మూలాలను కాపాడుకునేందుకు ఏకమయ్యారు. వివిధ సాంస్కృతిక సంస్థలను స్థాపించుకుని వివిధ సందర్భాల్లో ఏకమవుతున్నారు. కలసి పండుగలను పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు. సౌత్ ఆఫ్రికా తెలుగు అసోసియేషన్, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికా తెలుగు కమ్యూనిటీ పేరిట ఏర్పడ్డ సంఘాల ద్వారా కలిసి పోయి, పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటున్నారు.
2015లో ఏర్పడ్డ తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా బతుకమ్మ పండుగను ఏటా పెద్ద ఎత్తున జరుపుకుంటోంది. 2015లో తెరాస ఢిల్లీ ప్రతినిధి అయిన ఎస్.వేణుగోపాలాచారిని, 2016లో తెలంగాణ సాంస్కృతిక సారథి.. ఎమ్మెల్యే అయిన రసమయి బాలకిషన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.
గత సంవత్సరం దసరా ఉత్సవాల సందర్భంగా కవి, గాయకులు దేశపతి శ్రీనివాస్ను ఆహ్వానించింది. 'తెలంగాణ పాట - జీవితం' అనే అంశంపై గాన ప్రసంగాన్ని ఏర్పాటు చేశారు. బతుకమ్మ పండుగను కూడా వైభవంగా జరుపుకున్నారు. దక్షిణాఫ్రికాలో వున్న తెలంగాణ వాసులంతా కుటుంబ సమేతంగా జోహన్స్ బర్గ్ చేరుకుని నిలువెత్తు పూల బతుకమ్మలు పేర్చి ఆటపాటలతో సందడి చేశారు. ఈ పండుగకు తానా అధ్యక్షులు తాళ్ళూరి జయశేఖర్ ముఖ్య అతిథిగా వచ్చారు. మిగతా భారతీయ సంఘాలతో కలిసి ఐక్యంగా ఉగాది, సంక్రాంతి, దసరా, దీపావళి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుపుకుని తమ సంస్కృతి సాంప్రదాయాలను ఆ దేశ మూల వాసులకు తెలుపడంతో పాటు, భారతీయ తెలుగు తరాలకు పరిచయం చేస్తున్నారు.
ఇప్పుడున్న వారంతా ప్రవాసులు కారు. వారి సంతతికి చెందినవారు. పుట్టుకతో భారతీయ మూలాలున్న దక్షిణాఫ్రికా దేశ పౌరులే. చాలామందికి మూల భాష మాట్లాడటానికే కాదు, కనీసం ఉచ్చరించడంలోనూ ఇబ్బందిగా వుందని, అటు మూలాలకు, ఇటు స్థానికతకు మధ్య కొట్టుమిట్టాడుతున్నామని స్థానిక సంస్థల ప్రతినిధులు అంటారు.
ప్రస్తుత ప్రసార మాధ్యమాల వల్ల విద్య, విజ్ఞానం అభివృద్ధి వల్ల తామెక్కడి నుండి ఎక్కడికొచ్చామనే విషయం తెలుస్తుంది గాని, మరింత వెనక్కి వెళితే ఎవరిది ఏ సంస్కృతో, ఏ భాషో దొరకబుచ్చుకోవడం సాధ్యపడే విషయం కాదు. మాట్లాడే భాషే, నిలబడ్డ నేలే తనది అనుకోవడం తప్పదు.
- బి.నర్సన్,
9440128169