Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రామాయణాన్ని సీతాయణంగా మార్చిన దళిత, మహిళా ఉద్యమకారిణి దు సరస్వతి. ఏ కాలంలోనైనా, చివరకు పురాణ గాథల్లోనైనా మహిళ పరాధీనురాలేనని, పురుషాధిపత్యంలోనే బతికిందని రామాయణంలోని సీత పాత్రను ప్రధానంగా చేసుకుని సరస్వతి మహిళ ఔన్నత్యాన్ని చాటిచెప్పే నాటకాల్ని సృజియించింది. దానిపేరు 'సన్నితిమ్మి రామాయణం'. సన్నితిమ్మి అనగా కన్నడంలో సామాన్యురాలు అని అర్థం.
కర్ణాటకకు చెందిన దు సరస్వతి ప్రాథమికంగా దళిత, సామాజిక కార్యకర్త. ఆ తర్వాత కవయిత్రి. నాటకకర్త, రంగస్థల కళాకారిణిగా తన ఆలోచనలను విస్తరించేందుకు వివిధ పాత్రలు పోషిస్తోంది.
సన్నితిమ్మి రామాయణాన్ని ఏకపాత్రాభినయంతోనూ, వీధి నాటకంతోనూ పోల్చవచ్చు. 45 నిమిషాల నుండి గంట లోపు సాగే ఈ ప్రదర్శన అంతా ఒకే అంకంగా ముగుస్తుంది. దీనికి ఎలాంటి స్క్రిప్టూ లేదు. వేదికపై పాత్రధారి ఒక్కరే. ఆ ఒక్కరు దు సరస్వతి. చీరను పైకి కట్టుకుని సామాన్యురాలిగా కనబడే వేషధారణతో సరస్వతి వేదికనెక్కుతుంది. ప్రేక్షకులను ఉద్దేశించి సాగే ముచ్చటలా ప్రదర్శన సాగుతుంది. ఇంట్లో పని చేసుకుంటూనే సాధారణ స్త్రీలు ఒకరితో ఒకరు మాటలు పంచుకున్నట్లుగా మొదలవుతుంది.
వేదికపైకి రావడంతోనే ఏదో ఒక ప్రస్తావనతో ప్రేక్షకులను పలకరిస్తూ మధ్యలో కింద కూచుంటుంది. ఆమె ముందర వంట కోసం కూరగాయలు సిద్ధం చేసుకునే రీతిలో పాత్రలుంటాయి. పచ్చి కొబ్బరిని తురుముతూ, బెల్లాన్ని నానేస్తూ, అరటి పండ్లను గుజ్జు చేస్తూ ''నేను చెప్పేది రామాయణం అనుకుంటున్నారా.. సీతాయణం మరి. ఈ పేరు వినగానే మీకు విచిత్రంగా అనిపించవచ్చు. కొందరికి కోపం కూడా రావచ్చు. అసలు పురాణకథల్లో కష్టాలన్నీ సీతలాంటి మహిళలకే కదా... మగమహారాజులు రాసే పుస్తకాలు కదా... మహిళనెందుకు శీర్షిక చేస్తారు? నేను ఆడదాన్ని. సీతకష్టాలు మా అమ్మా అమ్మమ్మలు కథలుగా చెబితే వినేదాన్ని. నేను సన్నితిమ్మిని.. నా రామాయణం ఇలాగే వుంటుంది'' అంటూ మొదలుపెడుతుంది.
హరికథల్లో మధ్యమధ్యలో పిట్టకథలు చెప్పి ప్రేక్షకులను అలరించే తీరులో దు సరస్వతి తన రామాయణంలో సమకాలీన సామాజిక, రాజకీయ అంశాలను జోడిస్తూ వాటిపై వ్యంగ్యాస్త్రాలను సంధిస్తుంది.
''ఆ రోజుల్లో రాజులంటే మన రాజకీయ నాయకుల్లా కాదు. వారు వ్యాయామం చేసేవారు. మల్లయుద్ధంలో దిగేవారు. బలంగా వుండేవారు. నేడు మన రాజులేమో విధాన సౌధలో కునుకు తీస్తుంటారు. బొజ్జలు పెంచుకుని కార్లలో తిరుగుతుంటారు'' అని ఓ చురక తగిలిస్తుంది. కులం, లింగ వివక్ష పేరిట జరుపుతున్న దాడుల ప్రస్తావనా తెస్తుంది.
ఈ నాటకాల్లో ఏ రెండు ప్రదర్శనలూ ఒక్కలా వుండవు. ప్రదర్శిస్తున్న ప్రాంతాల్లోని సమస్యలను అప్పటికప్పుడు జోడిస్తూ, ఆ రోజు ప్రధాన వార్తలను కలుపుతూ, ప్రేక్షకుల స్పందనకు అనుగుణంగా చణుకులు వేస్తూ దేనికదే అన్నట్లు సాగుతాయి.
హైదరాబాద్కు చెందిన బబ్బన్ఖాన్ 'అదరక్ కే పంజె' కూడా రాత పూర్వకంగా లేని తాజా మౌఖిక ప్రదర్శనే. ఇందులో బహుపాత్రలుండగా, సన్నితిమ్మి రామాయణంలో ఒకే పాత్ర.
'నేటి మధ్య తరగతి కుటుంబ మహిళల మాదిరే సీత కూడా వరుణ్ని ఎంచుకునే అవకాశం దొరకలేదు. శివధనుస్సు ఎవరు విరిచినా ఆయనను చేసుకోక తప్పని పరిస్థితి ఆమెది. రాణిలా బతికిన తాను మారు మాట్లాడకుండా పద్నాలుగు ఏండ్లు చెట్లతో, పిట్టలతో, జంతుజాలాన్ని పలకరిస్తూ బతికింది'' అని చెబుతుంటే గ్రామీణ స్త్రీలు సీత బతుక్కి, తమ బతుకులకి ఉన్న సామ్యతను చూసుకుంటారని అంటోంది సరస్వతి.
'రాముడు, రావణుడు జోరుగానే యుద్ధాన్ని సాగించారు గాని, దానిలో మరణించిన సైనికుల కుటుంబాలు, భార్యాపిల్లలు దాని ఫలితాన్ని అనుభవించారని'' తన చేతిలోని పని కొనసాగిస్తూనే కథను రక్తి కట్టిస్తుంది. కరుణ, వీర రసాన్ని తన ముఖ కవళికలతోనే ప్రదర్శిస్తుంది.
జానకిగా, తల్లిలేని పిల్లగా పెరిగిన సీత, భర్తకు దూరమై ఒంటరి వనవాసినిగా కాలం వెళ్ళదీసిన సీత చివరకు మాత్రం కన్న బిడ్డలకు దూరంగా భూమిలోకి వెళ్ళిపోవడం దు సరస్వతి రామాయణంలో వుండదు. సీతకు మరణం లేదంటుంది సరస్వతి.
''పద్నాలుగేళ్ళు కోరికలతో కాలిపోయిన తనను అగ్నిపరీక్ష ఏం కాల్చగలదు'' అని సీత భావనను సరస్వతి ప్రశ్నిస్తుంది.
కూచున్న చోటినుంచి అప్పుడప్పుడు లేస్తూ వేదికపై తిరుగుతూ తన హావభావాలతో కథను నడిపిస్తుంది. మళ్ళీ కూచొని తన ముందున్న కొబ్బరి, బెల్లం, అరటి పండ్లతో ప్రసాదం తయారు చేసి సభికులకు పంచుతుంది.
''ఇంతసేపు ఓపిగ్గా నా మాటలు విన్నందుకు మిమ్మల్ని ఊర్కనే వెళ్ళనిస్తే ఏం మర్యాదగా వుంటుంది. నా చేతి ప్రసాదాన్ని స్వీకరించండి. నేను దళిత మహిళను. నా చేతి ప్రసాదాన్ని తినేందుకు, తీసుకునేందుకు వెనుకాడతారేమో. ఓ సారి రుచి చూడండి. మీ ఇంటి రుచికి ఇదేమీ తీసిపోదు'' అంటూ చేతిలో పెడుతుంది.
దు సరస్వతి కేవలం నాటకకర్త, నటియే కాదు. ఫుల్టైం సోషల్ యాక్టివిస్టు. బెంగళూరులోని సఫాయి కార్మికుల నాయకురాలు. కవయిత్రిగా 'జీవ సంపంగి, బక్సీసు, సణ్తిమ్మిపురాణ' అనే మూడు పుస్తకాలు వెలువరించింది. వాటికి కన్నడ పాఠకుల ప్రశంసలతో పాటు సాహితీ సంస్థల పురస్కారాలు కూడా లభించాయి.
1963లో బెంగళూరులో పుట్టి పెరిగిన దు సరస్వతి కాలేజీ విద్యార్థిగానే వామపక్ష, దళిత కార్యక్రమాల వైపు ఆకర్షితురాలైంది. విద్యార్థినిగానే దళిత, పీడిత పక్షాలకు చెందిన ఆందోళన, నిరసనలో ముందుండేది. ఎం.ఎ పూర్తయినాక తల్లిదండ్రుల ఒత్తిడితో బ్యాంకు ఉద్యోగంలో చేరింది. ధర్నాలు, రాస్తారోకోలలో పాల్గొనడం, అరెస్టు కావడం, కేసుల్లో ఇరుక్కోవడంతో... ఉద్యోగం నుంచి సస్పెన్షన్ను ఎదుర్కోవడం, మళ్ళీ కొంతకాలం ఉద్యోగం చేయడం, మళ్ళీ ఉద్యోగానికి దూరమవడం... ఇలా ఇరవై ఏళ్ళ కాలంలో సగం సమయమే ఉద్యోగిగా గడిచింది. అలా డ్యూటీ చేయలేక సరస్వతి ఉద్యోగాన్ని వదిలేసి పూర్తికాలం దళిత మహిళా సామాజిక కార్యక్రమాలకు అంకితమైంది.
బెంగళూరు, 1963లో జన్మించిన సరస్వతి తన ముప్పయవ ఏటనే ఈ రామాయణ ప్రదర్శన ఆరంభించింది. రాజకీయంపై వ్యంగ్యాస్త్రాలతో సమాజాన్ని నిలదీసే తన రామాయణ తీరుకు ఆమె సనాతన వాదులతో బెదిరింపులు కూడా ఎదుర్కొంది. కన్నడ నేలపై నగరాల్లోని థియేటర్లలోనే కాకుండా, గ్రామాల్లో ప్రదర్శనలకు ఆమె ప్రాధాన్యత నిచ్చింది. కరెంటు అందుబాటులేని ప్రాంతంలో సైతం తన శక్తివంతమైన స్వరంతో మైకు లేకుండానే ప్రదర్శన కొనసాగించడం ఆమెకు అలవాటే.
న్యూఢిల్లీలో దళిత్స్ Ê ఆఫ్రికన్ ట్వంటీఫస్ట్ సెంచరీ లెర్నింగ్ ఫ్రమ్ క్రాస్ లెక్చరల్ ఎక్స్పీరియన్సెస్ జులై 2015లో నిర్వహించిన రెండు రోజుల అంతర్జాతీయ సెమినార్లో సరస్వతి తన నాటకాన్ని ప్రదర్శించింది.
హైదరాబాద్లో నిర్వహించే హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్లో పాల్గొనడం, వివిధ అంశాలపై ప్రసంగించడం, ఫెస్ట్ ప్రియులకు తెలిసిన విషయమే.
2018 మార్చి మొదటివారంలో జరిగిన ఈ లిటరరీ ఫెస్టివల్లో దు సరస్వతి తన రామాయణ ప్రదర్శననిచ్చింది. ఆసక్తిపరులు యూట్యూబ్లో చూడవచ్చు.
ప్రధాని మోడి సఫాయి కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ దేవాలయాన్ని శుభ్రం చేసే పూజారికి, సమాజంలోని చెత్తను, అశుద్ధాన్ని నిర్మూలించే పారిశుద్ధ కార్మికులకు తేడా లేదన్నారని, ఇద్దరూ చేసేది శుద్ధినే అని అన్నారని దు సరస్వతి ప్రస్తావిస్తూ... 'మీకు చేతనైతే', మీ దృష్టిలో వారిద్దరూ సమానమేనని రుజువు చేసేందుకు వారి విధులను ఒకరివి ఒకరికి మార్చమని సవాలు విసిరింది.
2007లో నరేంద్రమోడి రాసిన కర్మయోగి పుస్తకంలో పాకీపనిని ఆధ్యాత్మిక కర్మకాండగా, అనువంశికంగా వచ్చిన వృత్తిధర్మంగా చెప్పడాన్ని దు సరస్వతి తీవ్రంగా నిరసించింది. బెంగళూరు నగరంలో ఆ పుస్తక ప్రతులను దగ్దం చేసి ఆనాడే మోడీ దిష్టిబొమ్మను తగలబెట్టింది. ఈ నిరసనలో బెంగళూరు సఫాయి కార్మికులు పాల్గొన్నారు.
అవివాహితగానే మిగిలిపోయిన దు సరస్వతి ఇప్పటికీ దళితోద్యమ, స్త్రీవాద కార్యక్రమాల్లో కన్నడ నేలపై బిజీబిజీగా వుంటుంది.
- బి.నర్సన్,
9440128169