Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓ మంచి పుస్తకం ఓ మంచి మిత్రునితో సమానం. పుస్తకానికి, మిత్రునికి అంతటి సంబంధం ఉంది. సాన్నిహిత్యం ఉంది. సాహితీ బంధం ఉంది. మంచి మిత్రుడు ఉన్నవాడు తన స్నేహితునికి అపకారం తలపెట్టడు. అలాగే పుస్తకం కీడు చేయదు. విలువలు నేర్పిస్తుంది. మార్గదర్శకంగా ఉంటుంది. మానసిక పరిణతిని పెంపొందిస్తుంది. కొత్త విషయాలను తెలియజేస్తుంది. సామాజిక అంశాలను నేర్పిస్తుంది. గ్రంథాలయాలు విజ్ఞాన సర్వస్వాలు అన్నారు పెద్దలు. అంటే ఆ గ్రంథాలయాలలో ఎందరో మహనీయుల జీవితగాథలుంటాయి. మరెందరో గొప్పవారి అనుభవసారాలుంటాయి. మన జీవితానికి పనికి వచ్చే జీవితాన్ని ప్రతిబింబించే ఎన్నో వైరుధ్యమైన, విభిన్నమైన జీవన చిత్రవిచిత్రాలుంటాయి. జీవిత విలువల్ని జీవన ఔన్నత్యాన్ని తెలిపే రచనలెన్నో అక్కడ నిక్షిప్తమై ఉంటాయి.
ఓ పుస్తకం చదివితే విభిన్న వ్యక్తిత్వాలు, వివిధ ప్రదేశాల విశేషాలు, వేరువేరు కోణాలలో ఆయా రచయితల ఆలోచనలు తెలుస్తాయి. ఏది తప్పు, ఏది ఒప్పు అన్నది తెలుస్తుంది. ఎలా నడుచుకోవాలో, ఎలా నడుచుకోకూడదో అర్థమవుతుంది. అన్ని విషయాలు అందరూ దగ్గర కూర్చోబెట్టుకునే చెప్పలేరు. కాబట్టి పుస్తకం చదివే అలవాటున్న వారికి ఎన్నో విషయాలు తెలుస్తాయి. అందుకే ప్రతి ఒక్కరికీ చదవే అలవాటు ఉండాలి. ఆ అలవాటు విద్యార్థి దశ నుంచే ప్రారంభం కావాలి. ఎపుడూ క్లాసు పుస్తకాలే కాకుండా విజ్ఞానాన్ని పెంచే రకరకాల పుస్తకాలు పిల్లల చేత చదివించడం అలవాటు చేసుకోవాలి. చదవడం వలన సమయం సద్వినియోగం అవుతుంది. బోర్ కొడుతుందన్న భావన ఉండదు. పుస్తకం చదువుతుంటే ఒంటరిగా ఉన్నామన్న ఫీలింగ్ ఉండదు. పుస్తకం చదవడం ద్వారా మాటలలో చెప్పలేని మధురానుభూతులు చెప్పవచ్చు. అందుకే చదవండి, చదివించండి, చదివి ఆనందించండి.