Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వ్యాసాలు మరిం తగా ఆకట్టుకుం టాయి. అనేక మంది సైన్స్ ఫిక్షన్ రచయితల నవలలు సినిమా లుగా వచ్చాయి. ఈ వ్యాసాలు చదివితే ఆయా సినిమాలు ఏ నేపథ్యం లోంచి రూపొం దాయో తెలు సుకో గలుగుతాం. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో శరవేగంగా వచ్చే మార్పులకీ, సైన్స్ ఫిక్షన్కీ గల సంబంధాన్ని అర్థం చేసుకోడం సులువు అవుతుంది.
సైన్స్ ఫిక్షన్ రచనలు చేయడంలో రచయిత్రులు కూడా ప్రతిభావంతమైన పాత్రని పోషించారు. అందులోనూ స్త్రీవాదాన్ని మరింత విస్తృతంగా చర్చించిన వారు, చిత్రించినవారున్నారు. స్త్రీల మనోభావాల్ని ప్రతిఫలించిన రచయితలున్నారు. జూడిత్ మెరిల్, జో అన్నారస్, టానిత్ లీ, ఉర్సులా లెగ్విన్, మార్గరెట్ అట్ వుడ్ వంటి రచయితల సైన్స్ఫిక్షన్లోని వినూత్న ప్రపంచాల ఆవిష్కరణ విస్మయం గొల్పుతుంది. కొంతమంది ఇతరేతర రచనలు చేస్తూ సైన్స్ఫిక్షన్లోకి వచ్చారు. ఈ కోవలో మార్గరెట్ అట్వుడ్ ప్రముఖంగా కనిపిస్తారు. మహిళలకు సంబంధించిన ఇతివృత్తాల్ని చిత్రించిన పద్ధతి విభిన్నమైంది. అయితే ఆమె తన సైన్స్ ఫిక్షన్ నవలల్లోనూ స్త్రీలకు సంబంధించిన అంశాల్ని చర్చించారు. ప్రాపంచిక వాస్తవికతనీ, మహిళల మనోభావాలనీ సమతూకంతో చిత్రిస్తూ నవలని నిర్వహించిన విధానం ఆకర్షణీయం. అలాగే ఉర్సులా లెగ్విన్, జో అన్నారస్ రచించిన సైన్స్ ఫిక్షన్ నవలలు చదవడం ఉద్విగ అనుభవమని సదాశివరావు చేసిన విశ్లేషణలు చూస్తే తెలుస్తుంది. ఉర్సులా లెగ్విన్ రాసిన నవల 'లెఫ్ట్హాండ్ ఆఫ్ డార్క్నెస్' గురించి చెబుతూ -సైన్స్ ఫిక్షన్ పద్ధతులను తలకిందులు చేసిన నవలగా అభివర్ణిస్తారు. ఈవిధంగా సైన్స్ ఫిక్షన్ రచించిన మహిళలు అందరూ ఏదో ఒక జానర్లో తమదైన విలక్షణతనీ, భిన్నత్వాన్నీ కనబరిచారు. తత్ఫలితంగా సైన్స్ ఫిక్షన్ సంపన్నతకు దోహదం చేశారు.
సైన్స్ ఫిక్షన్ రచయితలు భిన్న మార్గాలలో ప్రయాణి స్తున్నారు. తమదైన కంఠస్వరంతో రచనలు చేస్తున్నారు. శైలీశిల్పాల్లో వైవిధ్యమైన కౌశలాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆయా రచయితల నైపుణ్యం, కథని, పాత్రల్ని నడిపిన సంవిధానం చకితుల్ని చేస్తుంది. ఇతివృత్తాన్ని స్వీకరించడంలోనూ, దానిని నిర్వహించడంలోనూ బహుముఖ కోణాలు దర్శనమిస్తాయి. ఆయా రచయితల సాహిత్యాన్ని విశ్లేషిస్తూ సదాశివరావు ఇచ్చిన శీర్షికలు సైన్స్ ఫిక్షన్లో ఎవరు ఏ జానర్లో రచనలు చేశారో, ఏవిధంగా పాఠకలోకాన్ని ప్రభావితం చేశారో బోధపడుతుంది.
దాదాపు వందేళ్ళ కాలంలో వివిధ జానర్లలో పేరొందిన రచయితలందరినీ పరిచయం చేస్తూ, వారి రచనల్ని విశ్లేషించడం వల్ల ప్రపంచంలోని సైన్స్ ఫిక్షన్కు సంబంధించిన దర్శనం ఈ నాలుగు సంపుటాల ద్వారా లభిస్తుంది. ఇంగ్లాండ్, అమెరికాలలోనే కాదు చైనాలోనూ సైన్స్ ఫిక్షన్ పాదుకున్న తీరు బోధపడి మనం ఎక్కడున్నామనే ప్రశ్నని రేకెత్తిస్తుంది. ఎందుకంటే తెలుగులోనే కాదు భారతదేశంలోనే సైన్స్ ఫిక్షన్ రచనలు చేసినవారు లేరు. భారతీయాంగ్ల రచయితల్లోనూ సైన్స్ ఫిక్షన్ సృజించిన వారు కనిపించడం లేదు.
సైన్స్ ఫిక్షన్ పుస్తకాలు చదవడమేకాదు, సైన్స్ ఫిక్షన్ రచయితలతో స్నేహ సంబంధాలున్న రచయిత సదాశివరావు. జేమ్స్ గన్తో ఇటీవలి కాలంలో రెగ్యులర్గా సంభాషిస్తున్నారు. అలాగే ఫిజిక్స్లో నోబెల్ పురస్కార గ్రహీత కిప్ త్రోన్ వంటి వారితో మితృత్వం ఉంది. గార్డన్ ఆర్. డిక్సన్ మొదలైన వారికి ఉత్తరాలు రాసేవారు. ఈవిధంగా నిత్యమూ, నిరంతరమూ సైన్స్ ఫిక్షన్ గ్రంథాలతో, రచయితలతో ఉన్న సంబంధమే సదాశివరావుతో ఈ వ్యాసాలు రాయించాయి. ఈవిధంగా తెలుగు పాఠకలోకానికి ఒక గొప్ప కానుకని అందించారు.
విశ్వసాహిత్యంలో విలక్షణ పాత్రని పోషిస్తున్న సైన్స్ ఫిక్షన్ విరాట్ స్వరూపాన్ని అద్దంలో కొండ మాదిరిగా ఈ నాలుగు సంపుటాల ద్వారా అందించిన సదాశివరావు కృషి మన లోపల నూతన అభిరుచులు పాదుకోడానికి తోడ్పడుతుంది. మన సాహిత్య అధ్యయన రీతుల వైశాల్యానికి ప్రేరణనిస్తుంది. ప్రపంచ సాహిత్యంలో అత్యున్నతమైన, సుసంపన్నమైన సైన్స్ ఫిక్షన్తో పరిచయం కలుగుతుంది. సదాశివరావు వ్యాసాలు చదువుతుంటే మన లోపలి ప్రపంచాలు విశాలమవుతాయి. కొత్త వెలుగును సంతరించుకుంటాయి. సైన్స్ ఫిక్షన్ కథలు, నవలలు చదవాలన్న మమకారం ఏర్పడుతుంది. మానవ సమాజంలోని సంక్లిష్టతలకీ, సంక్షోభాలకీ మూలాలు ఎక్కడున్నాయో ఆకళింపు చేసుకోడం మరింత సులభతరమవు తుంది. శాస్త్రీయ దృష్టికోణం, వివేచన మానవ జీవితాన్ని నడిపించే చోదకశక్తులుగా నిలవాల్సిన అవసరం ఏమిటో తెలుసుకోగలు గుతాం. ఈ జాగురూకతనీ, మేల్కొల్పునీ, చైతన్యాన్నీ అందించడం సదాశివరావు సృజన సాఫల్యం.
- గుడిపాటి