Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హిమాలయాల నుంచి ప్రతి ఏడాది ఒక సాధువు కొన్ని రాజ్యాలలోని గ్రామాలకు వచ్చి వెళుతుంటాడు. ఆ సాధువు వస్తే ఆ గ్రామంలోని వారికి ఏదో ఒక లాభం చేకూరుతుందని ఆశిస్తారు. ఒకసారి అతను తన శిష్యుడితో సింహపురి రాజ్యంలో ఉన్న సీతాపురానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.
సాధువుతో పాటూ శిష్యుడు జోలె పట్టుకొని ప్రతి ఇంటికీ వెళ్ళి గుప్పెడు ధాన్యం ఇవ్వండి అని అడగ సాగాడు. అందరూ పిడికెడు ధాన్యం జోలెలో వేయసాగారు. సాధువు వారిని ఆశీర్వదిస్తూ ముందుకు సాగాడు.
అలా అందరి ఇళ్లూ అయిపోయాక పొలిమేర వద్దకు వచ్చారు గురుశిష్యులు.
అక్కడ ఆ గ్రామానికి సంబంధించిన అంటరాని వాడు రామయ్య చిన్న గుడిసె వేసుకొని తన కుటుంబంతో ఉంటున్నాడు.
అతణ్ణి కూడా శిష్యుడు గుప్పెడు ధాన్యం ఇవ్వు నీకు మేలు జరుగుతుంది అని అడిగాడు.
''అయ్యా! రెక్కలు ముక్కలు చేసుకుని కాయ కష్టం చేస్తుంటేనే మేలు జరగడం లేదు, మీకు గుప్పెడు ధాన్యం ఇచ్చేంత స్థోమత నాకు లేదు'' అన్నాడు రామయ్య.
శిష్యుడు అడిగితే ఇవ్వలేదని సాధువు ''మేము అడిగింది గుప్పెడు ధాన్యమే కదా నాయనా!'' అన్నాడు.
''అయ్యా! నాకు పంట భూములు లేవు. పని ఉన్న రోజే కష్టం చేయాలి. కష్టం చేసిన నాడే కాస్త సొమ్ము దొరుకుతుంది. దానితో ధాన్యం కొని ఏ పూటకు ఆ పూట వడ్లను దంచి కాస్త అన్నంతో పొట్ట పోసుకుంటున్నాము నేను, నా భార్య, నా కొడుకు. పని లేని నాడు నేను నా భార్య పస్తు ఉండాల్సిందే.. నీకిచ్చే ఆ గుప్పెడు ధాన్యంతో ఒక పూట మా పిల్లవాడికి కాస్త గంజితోనైనా కడుపు నిండుతుంది. కనుక మీకు గుప్పెడు ధాన్యం ఇవ్వలేను'' అన్నాడు రామయ్య.
''గుప్పెడు ధాన్యం ఇవ్వకపోతే మానేరు! కనీసం నాలుగు ధాన్యం గింజలైన ఇవ్వు నాయనా!'' అన్నాడు సాధువు.
''ఏందయ్యా! అయ్యగారు అడిగింది నాలుగు ధాన్యం గింజలే కదా దానికి ఆలోచనెందుకు?'' అని లోపలికి వెళ్లి నాలుగు ధాన్యం గింజలు తెచ్చి శిష్యుడి జోలెలో వేసింది రామయ్య భార్య.
''ఆ అన్నపూర్ణ అనుగ్రహం మీకు కలుగు గాక'' అని ఆ సాధువు ఆ కుటుంబాన్ని దీవించి ముందుకు కదిలాడు, శిష్యుడు గురువును అనుసరించాడు.
మరుసటి రోజు తెల్లవారేసరికి ఆ గ్రామంలో ధాన్యం ఇచ్చిన వారి ప్రతి ఇంట్లో ఒక బస్తా ధాన్యం చేరింది. అందరూ సాధువు అనుగ్రహించాడు అని సంతోషించారు.
పొలిమేరలో ఉన్న రామయ్య చిన్న గుడిసె కాస్తా పెద్ద గుడిసెగా మారింది, అంతే కాదు గుడిసె నిండా ధాన్యం బస్తాలతో నిండిపోయింది.
రామయ్యకు ఏమి అర్థం కాక ''నా గుడిసె ఇలా మారిపోయిందేమిటి... ఇన్ని బస్తాల ధాన్యం నేను ఏమి చేసుకొను?'' అని ఇంటి బయటకు వచ్చి అన్నాడు.
అప్పుడే ఆ ఇంటి ముందు ఒక వ్యక్తి వచ్చి ''నువ్వు ఇచ్చిన నాలుగు గింజల ధాన్యానికి ఆ సాధువు నీకు ఇచ్చిన ధాన్యం బస్తాలు అవి. ఆ ధాన్యంతో నీవు ధర్మంగా వ్యాపారం చేసి లేని వారికి పట్టేడు అన్నం పెట్టు!'' అని చెప్పి ఆ వ్యక్తి కూడా మాయమయ్యాడు.
రామయ్య భార్య ''ఆ దేవుడు సాధువు రూపంలో వచ్చి మనకు సాయం చేశాడు'' అని అంది.
''గురువు గారు గుప్పెడు ధాన్యం ఇచ్చిన వారికి ఒక బస్తా ధాన్యం మాత్రమే ఇచ్చి నాలుగు ధాన్యం గింజలు ఇచ్చిన ఆ రామయ్యకు అన్ని బస్తాల ధాన్యం ఇవ్వడంలో ఆంతర్యమే మిటి?'' అన్నాడు శిష్యుడు.
''ప్రతిఫలాపేక్ష లేకుండా గుప్పెడు ధాన్యం విలువ తెలిసిన వ్యక్తి రామయ్య అందుకే అతనికి ఎక్కువ సాయం అందింది'' అన్నాడు సాధువు.
తరువాత రామయ్య ఆ ధాన్యంతో నగరంలో చిన్న వ్యాపారం మొదలు పెట్టి అచిర కాలంలోనే పెద్ద వ్యాపారిగా మారి బీదవారి ఆకలి దప్పులు తీరుస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు.
లిలిలిలి
- యు.విజయశేఖర రెడ్డి, 9959736475