Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చరిత్ర గతిలో బతికి జీర్ణమైపోయిన తెలంగాణ నృత్యరీతులను పునర్జీవింప చేసి, పూర్వ వైభవాన్ని మన కళ్ళ ముందు నిలబెట్టిన వ్యక్తి 'పద్మశ్రీ' నటరాజ రామకృష్ణ. 10వ శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్య కాలంలో ప్రాచుర్యంలో ఉన్న 'పేరిణి శివతాండవం' నాట్యాన్ని పునరుద్దరించడంతో పాటు, ప్రబంధ నాట్య సంప్రదాయానికి సంబంధించిన 'నవజనార్ధనం' వంటి ప్రాచీన నాట్య రీతుల్ని తిరిగి వెలుగులోకి తెచ్చిన నాట్యా చార్యులు రామకృష్ణ
కాకతీయుల కాలంలో ఓ వెలుగు వెలిగి, పేరిణి అని పేరు మాత్రమే మిగిలి పోయిన ఈ విశిష్ట ఉదృత తాండవ నృత్యాన్ని వ్యయ ప్రయాసలతో తీర్చి, పరిశోధించి దానికొక సజీవ రూపకల్పన చేసి, పూర్వ వైభవాన్ని మన కళ్ళ ముందుంచిన చరితార్థులు నటరాజ రామకృష్ణ. 1933 మార్చి 31వ తేదీన ఇండోనేషియా లోని బాలి ద్వీపంలో జన్మించిన ఆయన తల్లి దయమంతి దేవి నల్గొండ జిల్లాకు, తండ్రి రామమోహనరావు తూర్పు గోదావరి జిల్లాకు చెందినవారు. ఇండోనేషియాకు వలస వెళ్ళిన వీరు రామకృష్ణ జన్మించిన కొద్ది సంవత్సరాలకే తల్లి మరణిం చడంతో వీరి కుటుంబం నాగపూర్ వచ్చి స్థిరపడింది. చిన్న నాటి నుంచే నాట్యం పట్ల ఆసక్తి కలిగి ఊన్న రామకృష్ణ గారు తండ్రికి ఇష్టం లేకున్నా నాట్యాన్ని నేర్చుకోవడం మొదలుపెట్టారు. కుటుంబాన్ని, సంపదల్ని వదలి ఆయన తనలోని కళా తృష్ణాన్వేషణలో మీనాక్షి సుందరం పిళ్ళై, వేదాంతం లక్ష్మి నారాయణ శాస్త్రి, నాయుడుపేట రాజమ్మ, పెండెల సత్యభామ మొదలైన ఎందరో గురువులను కలుసు కుని, వారి నుండి ఎన్నో నాట్యరీతుల్ని నేర్చుకున్నాడు. సినీ నటుడు రమణారెడ్డి కోరిక మేరకు నెల్లూర్లో 'నృత్య నికేతనం' పేర నాట్య శిక్షణాలయాన్ని స్థాపించి అక్కడ రెండు సంవత్స రాల పాటు విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన నటరాజ రామకృష్ణ కుల వైషమ్యాలను తట్టుకోలేక గుంటూరు మకాం మార్చారు. ఆ సమయంలో ఆయన ఎన్నో నాట్య గ్రంథాలను చదివారు.
రామప్ప శిల్పాలతో ఉత్తేజితుడైన నటరాజ రామకృష్ణ రామప్ప దేవాలయంలోని శిల్పాల వల్ల ఉత్తేజితుడైన నటరాజ రామకృష్ణ 'జాయప సేనాని' రాసిన ''నృత్య రత్నావళి'' గ్రంథాన్ని మార్గదర్శిగా ఎంచుకుని 'పేరిణి శివతాండవాన్ని' పునరుద్ధరించారు. సంగీతానికి సప్త స్వరాలు ప్రాణం. అలాగే మృదంగానికి త, ది, తో, ణం ఆధారమైనట్లు నృత్యం ఎన్ని విధాలుగా రూపొందినా దానికి ప్రధాన స్థానాలు ఎనిమిది మాత్రమే. ఇటువంటి మూలసూత్ర స్థానాలు ''రామప్ప'' శిల్పంలో రూపొందించబడ్డాయి. అంతే కాకుండా ఆ స్థానాలను ప్రయోగించేటప్పుడు, వాయించ వలసిన తొలి మృదంగ శబ్ధాన్ని ఎంత తూకంలో ప్రయోగిస్తే ఆ విన్యాసం పూర్తిగా వికసించటానికి అవకాశముందో ఆ హస్త విన్యాస క్రమం, మొదలైనవెన్నో ఆ మృదంగ భంగిమలలో ''రామప్ప'' మలిచాడు.
తాండవ నృత్యం ఒక అద్భుత ప్రక్రియ
తాండవ నృత్యం ఒక అద్భుత ప్రక్రియ అంటారు నటరాజ రామకృష్ణ. శాస్త్రాన్ని, సంప్రదాయాన్ని గురుముఖంగా అధ్యయనం చేయడం వల్ల ''రామప్ప'' లోని భంగిమల్నీ పరిశీలించి అభ్యసించ గలిగానని ఆయన తన పుస్తకంలో రాసుకున్నారు. రూప సంపన్నుడుగా, అందాన్ని భావింప గలవాడుగా, రసానుభవం కలిగి, రక్తి కలిగించే వాడుగా, తాలజ్ఞుడుగా, గమకంలో నేర్పరిగా, ధ్వని గల శరీరం కలవాడుగా, మంచి రేఖ గలవాడుగా, వాయిద్యాలను ఎరిగిన వాడుగా వుండాలనీ, అటువంటివాడే పేరిణి నృత్యానికి తగిన వారని 'జాయప సేనాని' తన గ్రంథంలో పేర్కొన్న విధంగా నటరాజ రామకృష్ణ 'రామప్ప' లోని మృదంగ భంగిమల్ని పరిశీలించి, ఆ మృదంగ ధ్వనుల్ని మార్ధంగికునికి నేర్పి వాయింపజేశారు. పేరిణి తాండవాన్ని పునర్నిర్మించటానికి ఆ మాతృకలే తనకెంతో సహాయ పడ్డాయని, ప్రతి శబ్ధానికి ఉత్పత్తి, పరాకాష్ట, అంతర్థానం అనే మూడు దశలుంటాయని, ఆ నాధోత్పత్తి, విజృంభణ నిశ్శబ్ధతలను గురించి వివరంగా తెలిసి ఉన్న నర్తకుడు ఏ రూపాన్నైనా సృష్టించగలడని నటరాజ రామకృష్ణ పేరిణి నృత్యానికొక సజీవ రూపకల్పన చేసి మన ముందుంచారు.
పేరిణి నృత్యం
తెలంగాణ ప్రాంత ప్రాచీన నృత్యం అయిన పేరిణి నృత్యాన్ని ''యోధుల నృత్యం'' అని కూడా పిలుస్తారు. పూర్వ కాలంలో యోధులు యుద్ధ రంగానికి వెళ్ళబోయే ముందు పరమ శివుడి ముందు ఈ నాట్యాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రదర్శించే వారు. ఓరుగల్లును దాదాపు రెండు శతాబ్దాల పాటు పాలించిన కాకతీయుల హయాంలో ఈ కళ బాగా పరిఢవిల్లింది. ఈ నృత్యం మనిషిని ఉత్తేజ పరుస్తుందనీ శివుడికి నివేదనగానూ పరిగణిస్తారు. ఈ కళకు సంబంధించిన ఆధారాలు ఓరుగల్లుకు సమీపంలో ఉన్న రామప్ప దేవాలయంలో గల శిల్పకళలో గమనించవచ్చు. లయబద్ధంగా సాగే డప్పుల మోత దీనికి సంగీతం. ఈ కళాకారులు నాట్యం చేస్తూ ఆ పరమశివుణ్ణే తమ దేహంలోకి ఆహ్వానించి అలౌకికమైన అనుభూతిని పొందడానికి ప్రయత్నిస్తారు. కాకతీయుల శకం ముగియగానే ఈ కళ దాదాపుగా కనుమరుగై పోయింది. మళ్ళీ నాట్య పితామహులుగా పిలవబడే ఆచార్య నటరాజ రామకృష్ణ కృషితో మళ్ళీ వెలుగులోకి వచ్చింది. నటరాజ రామకృష్ణ పేరిణి నత్యంతో పాటు ప్రబంధ నాట్య సంప్రదాయానికి సంబంధించిన 'నవజనార్ధనం' వంటి ప్రాచీన నృత్యాన్ని (ఆంధ్ర నాట్యాన్ని) కూడా పునరుద్ధరించారు.
ఆంధ్రనాట్యం
డా|| నటరాజ రామకృష్ణ బౌద్ధ కాలం నుండి ప్రాచుర్యంలో ఉన్న ప్రాచీనమయిన నృత్య రీతి అయిన ఈ నాట్యాన్ని యాభై యేళ్ళ క్రితం ఆంధ్ర నాట్యమని నామకరణం చేసి పునరుద్ధరించారు. ఇది గుడిలో దేవాంగనలు ఆడే నృత్యంగా మొదలయి ఒక పూర్తిస్థాయి నృత్యశాస్త్రంగా వికసించింది. తెలుగునాట ఎంతో కాలం ప్రాచుర్యంలో ఉన్న ఈ నాట్యం దేవాలయాలకే కాక ఉత్సవాలలో కూడా ప్రదర్శించబడేది. 3000 యేళ్ళ క్రితం ఈ నాట్యాన్ని సామాజిక, ఆర్థిక కారణాల వల్ల నిలిపి వేశారు. కానీ, ప్రభుత్వ సహకారంతో ఈ నాట్యాన్ని పూర్తి స్థాయి నృత్య సాంప్రదాయంగా నటరాజ రామకృష్ణ తిరిగి ప్రవేశపెట్టారు. ఆంధ్రనాట్యం అని నామకరణ చేయక ముందు ఈ నృత్యాన్ని వ్యవహారంలో కచేరీ, కేళిక దర్బారు, మేజువాణి మొదలైన పేర్లతో పిలిచేవారు. నృత్యం, ఇంకా అభినయం, రెండూ ఈ ప్రాచీన నృత్యంలో కనిపిస్తాయి. ఈ నాట్యంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి భామా కలాపం, గొల్ల కలాపం. భామా కలపాన్నే 'నవ జనార్ధన పారిజాతం' అని కూడా పిలుస్తారు.
అయితే ఈ నృత్యం తెలంగాణలోనే విశేష ప్రాచుర్యంలో ఉన్న కారణంగా తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయిన నేపథ్యంలో ఆంధ్ర నాట్యానికి తెలంగాణ ప్రభుత్వం నుండి ఆదరణ కరువైంది. నటరాజ రామకృష్ణ వారసత్వాన్ని కొనసాగిస్తున్న ప్రముఖ నాట్యాచార్యులు కళాకృష్ణ ఆంధ్ర నాట్యంలోని 'నవ జనార్ధన పారిజాతం' పేరుతో ఈ నృత్యానికి ప్రాచుర్యాన్ని కల్పిస్తున్నారు.
నటరాజ రామకృష్ణ రచించిన పుస్తకాలు
నటరాజ రామకృష్ణ రాసిన నలబై పై చిలుకు పుస్తకాలలో ఆరింటికి భారత ప్రభుత్వం పురస్కారం లభించింది. వాటిలో 'దాక్షిణాత్యుల నాట్యకళా చరిత్ర', 'ఆంధ్రనాట్యం పరిశోధనా గ్రంథం', 'ఆంధ్ర నాట్యం, జానపద కళానృత్యం', 'అర్ధ శతాబ్ది-ఆంధ్ర నాట్యం - ఆత్మకథ', 'ఆంధ్రులు- నాట్యకళారీతులు' ప్రసిద్ధ గ్రంథాలుగా నిలిచాయి.
నాటి ఉమ్మడి రాష్ట్ర నాటక అకాడమికి చైర్మన్గా ఉన్న నటరాజ రామకృష్ణ 50ఏళ్ల పాటు నాట్యకళను ముందుకు నడిపించారు. రామకృష్ణ అనేక మంది దేవదాసి నృత్య కళాకారిణులను సంఘటితం చేసి వారి సాంప్రదాయ నృత్యరీతులను అధ్యయనం చేశారు. సాత్వికాభినయం చేయడంలో ఉద్దందుడైన రామకృష్ణ పేరిణి, ఆంధ్రనాట్య పునరుద్ధరణకై చేసిన కృషి కళాప్రియులు మరచిపోలేరు. ఆయన లేకపోతే పేరిణి శివతాండవం, ఆంధ్రనాట్యం ఏనాడో మరుగున పడిపోయేవి. గోల్కొండ నవాబు, కుతుబ్ షాహి ఆస్థాన నర్తకీమణులైన తారామతి మందిరము, ప్రేమావతి మందిరాలను హైదరాబాదులో ఆయన బాగు చేయించారు.
కాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక ప్రభుత్వం పేరిణి శివ తాండవానికి విశేష ప్రాచుర్యాన్ని కలిపించి ప్రోత్సహించడం ముదావహం. తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పలు ప్రాంతాలలో పేరిణి ఉత్సవాలు నిర్వహిస్తు, ఈ నృత్యానికి గుర్తింపును తీసుకు వస్తుంది. అయితే ప్రభుత్వం ఈ నృత్యాన్ని రాష్ట్ర నృత్యంగా గుర్తిస్తే నటరాజ రామకృష్ణ చేసిన కృషికి తగిన గుర్తింపు ఇచ్చినట్లవుతుంది.
పొందిన పురస్కారాలు
- 18వ ఏట రామకృష్ణకు నాగపూరులో రాజా గణపతి రావు పాండ్య ''నటరాజ'' అనే బిరుదును ఇచ్చారు. అప్పటి నుంచి అది ఆయన పేరు ముందు శాశ్వతంగా చేరిపోయింది.
- 1968లో ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ చే ''భారత కళాప్రపూర్ణ''
- 1979లో పశ్చిమ గోదావరి జిల్లా కళాకారుల సంఘం చే ''భారతకళా సవ్యసాచి''
- 1981లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ''కళాప్రపూర్ణ''
- 1982లో హైదరాబాదులోని కళావేదిక ద్వారా ''కళాసరస్వతి''
- 1984లో కేంద్ర సంగీత నాటక అకాడమీ ద్వారా ''దక్షిణ భారతపు ఉత్తమ నాట్యాచార్యుడు''
- 1986లో ఎల్.వి.ఆర్. ట్రస్ట్, మద్రాసు నుంచి - పేరిణీ శివతాండవంపై పరిశోధనకు ''ఉత్తమ పరిశోధకుడు''
- 1980లో శ్రీశైలం దేవస్థానంలో 'ఆస్థాన నాట్యాచార్యుడు'
- 1980లో ఆంధ్రప్రదేశ్ 'ఆస్థాన నాట్యాచార్యుడు'గా నియామకం
- 1985లో ఆంధ్రప్రదేశ్ కళాప్రేమికులు ఆయనకు స్వర్ణ కిరీటాన్ని బహూకరించారు.
- 1991లో శ్రీ రాజా లక్ష్మీ పురస్కారం
- 1992లో భారత ప్రభుత్వంచే ''పద్మశ్రీ''
- 1995లో రాజీవ్గాంధీ ఫౌండేషన్ అవార్డ్
- 1998లో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి నృత్యంలో విశిష్ట పురస్కారం
- 1999లో కళాసాగర్ అవార్డుతో పాటు, తాను రచించిన 'దాక్షిణాత్యుల నాట్యకళా చరిత్ర' పుస్తకానికి కేంద్ర ప్రబుత్వ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు.
- పొన్నం రవిచంద్ర, 9440077499