Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కనుచూపు మేరలో ఒక్క చెట్టూ లేదు. అలుపు తీర్చుకుం దుకు కాస్సేపు ఆగుదామంటే నీడ జాడ లేదు. మండే ఎండకు ఎర్రబడ్డ నేల ముఖం పొగలు చిమ్ముతున్నది.
ఆకలి బాధను ఏ ప్రాణీ తట్టుకో లేదు. అది చీమంత చిన్నదైనా ఏనుగంత పెద్దదయినా. అది పేగుల్ని ఉండచుట్టే బాధ. అది కళ్ళు బైర్లు కమ్మిస్తుంది. కాళ్ళూ చేతులూ ఆడకుండా చేస్తుంది. పంచప్రాణాలనూ మూటకట్టి శరీరంలోంచి నిర్దాక్షిణ్యంగా బయటకి విసిరేస్తానంటుంది.
ఆకలి బాధను తట్టుకోవడానికి ఎవరైనా ఎంత దూరమైనా నడిచి తీరాల్సిందే. శరీరాన్ని వొదిలి పోకుండా ఊపిరి బిగబట్టాల్సిందే. మూసుకుపోయే కళ్ళను బలవంతంగా తెరిచి ఉండాల్సిందే.
నడుస్తున్నది ఆ తల్లి. అది పరుగులాంటి నడక. తన ఒళ్ళు తనకే భారం అయినా అడుగు తీసి యిక వెయ్యలేను అన్న నిస్సత్తువ ఆవరించినా ఆ కతే నడుస్తున్నది.
అలా నడుస్తున్న ఆ తల్లితో బిడ్డ 'అమ్మా! ఇంకా ఎంత దూరమే?' అని అడుగుతున్నది ఆగి ఆగి మళ్ళీ మళ్ళీ తల్లికి జవాబు తెలియని అదే ప్రశ్న వేస్తున్నది.
'ఇదిగో వచ్చేశాం వచ్చేశాం!' అని ఎన్ని సార్లు చెప్పిన జవాబే చెప్తుంది ఆ తల్లి. అందుకే కొన్నిసార్లు మౌనంగా ఉంటుంది. కొన్నిసార్లు బిడ్డకు ఏమీ అర్థం కాని విధంగా తల ఆడిస్తుంది. నడక వేగం కొంచెం పెంచుతుంది.
ఆకలి బాధ తల్లికే కాదు బిడ్డకూ అంతకంతకూ పెరుగు తున్నది. బిడ్డను సముదాయించడానికి తల్లికి ఓ కొత్త జవాబు తట్టింది. 'చెప్పాను కదా మనుషులు మసలే చోటుకి వెళ్తున్నాం. అక్కడికి చేరామా ఇక ఆకలి అనేదేఉండదు' అంది తల్లి. 'అవున వును ఎన్నోసార్లు చెప్పావు. అరటి పళ్ళూ చెరకు గడలూ చిన్న ప్పుడు అప్పుడెప్పుడో అన్నీ తిన్నానని భలేగా ఉన్నాయని చెప్పావు. అక్కడికేనా. మనకింక రోజూ రకరకాల పండ్లన్న మాట. తొందరగా వెళ్ళమ్మా మనుషులని నేనెప్పుడూ చూళ్ళేదు. చూడాలని ఉందమ్మా! వాళ్ళు పెట్టే పండ్లన్నీ తినాలని ఉందమ్మా!' అంది బిడ్డ.
తల్లి కళ్ళ నిండా నీళ్ళు నిండినయి. ఎంత ఆకలిగా ఉందో నా బిడ్డకి అనుకుంది. అనుకోకుండా హఠాత్తుగా ఎదురుపడింది 'అది'. తల్లికి ఎదురుగ్గా నిలబడి తోక పైపైకి ఎత్తింది. పరిస్థితి అర్థం అయినట్టుంది. 'ఎక్కడికి బైలు దేరావు?' అని అడిగింది.
'అడవి అంతా సర్వనాశనం అయింది కదా. పొట్ట చేత్తో పట్టుకుపోతున్నా నది వైపుకి' అంది తల్లి.
'అక్కడికా వద్దు. ఆ మనుషులు నా కన్నా, రూపు రేఖలు మారిపోయిన మన అడవిలో తిరుగాడే క్రూరమృగాల కన్నా క్రూరులు. వాళ్ళ చేతిలో ప్రాణాలు పోకుండా కాపాడుకుని పారిపోతున్నా' అంది 'అది'.
'నువ్వు మాంసాహారివి క్రూర జంతువ్వి. అందుకే నిన్ను తరిమి ఉంటారు. నిజానికి మనుషులు చాలా మంచి వారు. ఎవరికీ ఏ అపకారం తల పెట్టని నన్ను యేమీ అనరు' అన్నది ఆ తల్లి.
'తోకలు ఊపుతూ నాలుగు కాళ్ళ మీద నడిచే మనమంటే తోక తెగకోసుకుని రెండు కాళ్ళ మీద నడిచే మనిషికి ఏ మాత్రం లక్ష్యం లేదు. మనకు తిండానికి తిండి, ఉండటానికి నీడ లేకుండా చేస్తున్న మనిషికి నిలువెల్లా విషమే. నా మాట విని వెనక్కి వచ్చెయి. చావో బతుకో మనకు మన అడవే దిక్కు' అంది 'అది' ఆ తర్వాత మాట్లాడకుండా వెళ్ళిపోయింది.
'అమ్మో చావా! నేను చస్తే చస్తాను కానీ నా బిడ్డను చావనీయను. అది బతకాలి దానికి మనుషుల్ని చూపించాలి. మనుషులు దాన్ని ప్రేమగా చూసుకుంటారు' అనుకుంటూ మనుషులు మసిలే నది దగ్గరికి వచ్చేసింది తల్లి.
అమ్మయ్య! అక్కడక్కడా చెట్టున్నయి. నిలవడానికి నీడ ఉంది. పారే నది. తాగడానికి కావల్సినన్నీ నీళ్ళున్నయి అనుకుంది.
ఎదురుగ్గా నవ్వుతూ నిలబడ్డాడు ఒక మనిషి!
ఆ మనిషి తన చేతిలో ఉన్న దాన్ని ఆ తల్లికి అందించాడు. 'ఏమిటమ్మా అది?' అని అడిగింది బిడ్డ. 'ఇంక మనకు ఆకలి అనేది ఉండనే ఉండదు. ఈ పండు ఎంత తియ్యగా ఉంటుందో' అన్నది తల్లి. 'అలాగా అమ్మా తొందరగా తినిపించు అలాగే మనిషిని కూడా చూపించు' అన్నది బిడ్డ.
'చూపిస్తా! తొందరపడకు ఇంకా నువ్వు నా కడుపులోనే ఉన్నావు. బయటకి వచ్చాక చూద్దువు కాని' అంది తల్లి.
తన ఆకలీ బిడ్డ ఆకలీ తీరుతుందని పండుని నోటికి అందించింది తల్లి.
తల పగిలి ముక్కలై పోయిందో.. కడుపులో పేగులు గుడ్డ పేలికల్లా చిరిగి చెల్లా చెదరయ్యేయో.. అర్థం కాలేదు తల్లికి.. నోటి నిండా నెత్తుటితో నదిలోకి నడిచింది. నదిలో నీళ్ళు రక్తంలో ఎర్రబడ్డయి. 'అమ్మా! అమ్మా! ఏమైంది?' ఏడుస్తూ అడిగింది బిడ్డ. తల్లి నోట మాట రావడం లేదు నెత్తురు తప్ప!
బిడ్డ ఆకలి తీర్చాలని, మనిషిని చూపించాలని లోకంలోకి వచ్చాక తొండంతో దాని వీపు రుద్దాలని అనుకున్న తల్లి ఏనుగు ఆశ అడియాశే అయింది. దాని బిడ్డ లోకాన్ని లోకంలో అన్నింటికంటే క్రూర జంతువైన మనిషిని చూడలేకపోయింది.
- చింతపట్ల సుదర్శన్, 9299809212