Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సినిమా ప్రజలను ప్రభావితం చేయగల గొప్ప మాధ్యమం. మన ఆలోచనలను, జీవన శైలిని, మేధను సినిమా ప్రభావితం చేయగలిగినట్లు మరే కళాత్మక మాధ్యమం చేయలేదు. అందుకే తెరపై కనిపించే పాత్రలను మలచడం ఎంతో ఆలోచనతో, సామాజిక భాద్యతతో జరగాలి అన్నది నా అభిప్రాయం. ప్రపంచ సినిమాను వీక్షించడం మొదలు పెట్టిన తరువాత ఈ అభిప్రాయం ఇంకా బలపడింది. సినిమాలో స్త్రీ పాత్రల పై శ్రద్ధ వహించే దర్శకులు మన దేశంలో బహు తక్కువ. ప్రస్తుత పరిస్థితులలో ఆ సంఖ్య ఇంకా తగ్గిపోయింది. తెలుగు సినిమాలో ఇప్పటి స్త్రీ పాత్రలను చూస్తే చాలా బాధ కలుగుతుంది. కాని గతంలో తెలుగు సినిమా మరీ ఇంత మెటీరియలిస్టిక్ అప్రోచ్తో ఉండేది కాదు. స్త్రీ జీవితాన్ని ప్రతిబింబించే గొప్ప పాత్రలు కొన్ని నాలాంటి వారికెందరికో ఆలోచించడం నేర్పించాయి. టెక్నికల్ స్థాయిలో అవి గొప్ప సినిమాలు కాకపోవచ్చు. కాని ఒక మూసలో కొట్టుకుపోతున్న ఆ నాటి సమాజాన్ని కదిలించగల ఆలోచనలను పుట్టించగల పాత్రలు ఆ సినిమాలో కనిపిస్తాయి. అలా కొందరిని ప్రభావితం చేయడంలో విజయం సాధించిన సినిమా ''శిక్ష''. ఇది 1985లో రేలంగి నరసింహారావు గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా. చంద్రమోహన్, సుహాసినీ, శరత్ బాబు ప్రధాన తారాగణం. అనురాధ రామనన్ గారు అందించిన కథ ని దర్శకులు గొప్పగా తెరకెక్కిం చారు. రజని, సత్యనారాయణ, సుత్తి వేలు, వీరభద్రరావు, రాళ్ళపల్లి సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు.
ఒక చిన్న పల్లేటూరికి పూజారిగా చంద్రమోహన్ వస్తాడు. అతని భార్య సుహాసిని. బ్రాహ్యణ సాంప్రదాయం, భావజాలంలో పెరిగిన జంట. మడి, తడి, సుచి పాటించే ఆచార సాంప్రదాయాల కుటుంబం. సుహాసిని అంటే చంద్రమోహాన్ కి ఎంతో మోహం, ప్రేమ, ఆమె వల్ల శారీరకంగా, మానసికంగా, ఎంతో ఆనందాన్ని అనుభవిస్తూ తన అదృష్టానికి మురిసిపోతూ ఉంటాడు ఆ పూజారి. అదే ఊరిలో శరత్ బాబు బాగా డబ్బు ఉన్న జమిందారు. క్రిస్టియన్. వ్యక్తి మంచివాడే కాని తాగుబోతు. డబ్బుతో చట్టాన్ని, ప్రజలను కొని విలాసంగా బ్రతికే ఒక బడాబాబు. తనను నమ్ముకున్న వ్యక్తుల కోసం ఏమైనా చేసే మంచితనం ఉన్న వ్యసనపరుడు, విలాస పురుషుడు. ఇతని దఅష్టి సుహాసిని మీద పడుతుంది. ఆమె అందం అతన్ని చపలచిత్తున్ని చేస్తుంది. ఆనందంగా ఉన్న ఆ భార్యా భర్తలను చూసి సుహాసిని పై మరింత మోహం పెంచుకుంటాడు. భర్త లేని రోజు తాగి వెళ్ళి ఆమెను బలాత్కరిస్తాడు. అతను గుమ్మం దాటుతున్నప్పుడు చంద్రమోహన్ ఇంట్లోకి వస్తాడు. లోపల భార్య రోదన, బైటికి వెల్తున్న శరత్ ను చూసి పరిస్థితి అర్ధం చేసుకుంటాడు. అప్పటి దాకా భయపడి అసహాయంగా రోదిస్తున్న సుహాసిని భర్తను చూసి పరిగెత్తుకు వచ్చి అతనికి తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంటుంది. అతని నుండి సాంత్వనను, ఓదార్పును ఆశిస్తుంది. ఏమీ మాట్లాడని ఆ భర్త ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. రాత్రి పూట ఒక చీర అరుగు మీద పడేసి ఊరు వదిలి వెళ్ళిపోతాడు ఆ భర్త. భయంతో రాత్రంతా భర్త కోసం గాలిస్తుంది సుహాసిని. భర్త ఎందుకు తనను వదిలి వెళ్ళాడో అందులో తన తప్పేం ఉందో అర్ధం కాదు. ఊరి వారి నిందలు, అనాధ అయిపోయిన జీవితం, అకలి, వీధి కుక్కల మధ్య నిద్రించవలసి రావడం ఇది ఆమె స్థితి. పెళ్ళి నాటి ప్రమాణాలు, రక్షిస్తానని వేద మంత్రాల సాక్షిగా భర్త చేసిన ప్రమాణాలు ఇవన్నీ గుర్తుకు వస్తూ వుంటాయి. పెళ్ళి ద్వారా అన్ని రకాలుగా సుఖపడ్డ భర్త తనను ఆ స్థితికి తేవడం దానికి కారణమైన శరత్ పై కోపాని పెంచుకుంటుంది.
అదే ఊరిలో మరో క్రిస్టియన్ సత్యనారాయణ. నీతిమంతుడు, నిజాయితీపరుడు. శరత్ అన్యాయాన్ని ప్రశ్నించే ఒకే ఒక వ్యక్తి ఇతను. అతను సుహాసిని ని ఆమె స్థితికి కారణమైన శరత్ కు శిక్ష విధించకుండా ఓడిపోవద్దని సలహా ఇస్తాడు. అప్పుడు సుహాసిని తీసుకునే నిర్ణయం కథలో ఒక పెద్ద మలుపు. తననా స్థితికి తీసుకువచ్చిన శరత్ ఇంటికి వెళ్ళి అతని ఇంట్లో ఉండిపోతుంది సుహాసిని. తనని ఏ రకంగా ఇబ్బంది పెట్టినా అక్కడే ఆత్మహత్య చేసుకుని మరణిస్తానని ఒక గదిలో ఉండిపోతుంది. తాను చేసిన తప్పిదాన్ని అర్ధం చేసుకున్న శరత్ ఏమీ అనలేడు. కాని ఆమె రక్షణ భాధ్యత తన మీద వీసుకుంటాడు. నౌకరు సహాయంతో ఆమెకు నచ్చిన విధంగా ఇంటిలో సౌకర్యాలు కల్పిస్తాడు. బ్రాహ్మణ స్త్రీ గా ఆ ఇంట్లో తిండి తినననే ఆమె కోసం వంట పాత్రలు సామాను తెప్పిస్తాడు. ఆమె ఆచారాలను ఏ మాత్రం అడ్డు రాకుండా ఆమెకు సౌకర్యాలు సమకూరుస్తుంటాడు. ఊరిలో జనం ఆమెను అవమానకరంగా మాట్లాడుతుంటే వారిని తన అధికార బలంలో నోరు మూయిస్తాడు. ఆమెకు సముచిత గౌరవం తన ఇంట దొరికేటట్లు జాగ్రత్త పడతాడు. ప్రతి క్షణం పశ్చాత్తాపంతో దహించుకుపోతుంటాడు. ఆ భార్యా భర్తలను కలపడానికి సత్యనారాయణ సహాయం కోరతాడు. ఆరోగ్యం క్షీణించి పక్షపాతంతో మంచంలో పడి తాను చెసిన తప్పును తలుచుకుని కుమిలిపోతూ ఉంటాడు. సత్యనారాయణ చంద్రమోహన్ వద్ధకు వెళ్ళి వచ్చి భార్యను తీసుకు వెళ్ళమని బ్రతిమాలతాడు. తాను ఆలోచించి, మనసు కుదుటపర్చుకుని తర్వాత ఊరు వస్తానని చంద్రమోహన్ అంటే నిరాశగా తిరిగి వచ్చిన రోజే శరత్ చనిపోతాడు. తరువాత వచ్చిన భర్తతో సుహాసిని చెసే సంభాషణ వివాహం పై ఎన్నీ ప్రశ్నలను సంధిస్తుంది.
ఆదుకోవల్సిన భర్త తనను రోడ్డు పాలు చేస్తే దుర్మార్గుడైన శరత్ చేసిన ఒకే ఒక తప్పుకు దహించుకు పోతూ నిరంతరం ఆమె క్షేమం కోసం పరితపిస్తూ ప్రాణాలు వదలడం చూసిన తరువాత ఆ ఇద్దరు వ్యక్తుల తో తనకున్న సంబంధంలో దేనికి విలువ ఇవ్వాలో ఎందుకు ఇవ్వాలో సుహాసిని చెప్పడం నిజంగా ఒక గొప్ప పాయింట్. అగ్నిసాక్షిగా తాళి కట్టిన భర్త తనతో అన్ని సుఖాలు పొంది, ఆనందించి, ఆదరించవలసిన సమయంలో తోడు ఉండవలసిన సమయంలో అనాధలా తనను వదిలివేస్తే, దుర్మార్గుడైన శరత్ తన క్షేమం కోసిన పడిన తపన చూపిన ఆదరణ అతన్ని తాను భర్తగా స్వీకరించేలా చేసాయని, ఆ పూజారి భార్యగా బ్రతికే కన్నా శరత్ విధవగా బ్రతకడమే తనకు ఆదర్శమని విధవగా జీవితాంతం ఉండిపోవడానికి నిర్ణయించుకుంటుంది సుహాసిని.
స్త్రీ మనసును భార్యా భర్తల బంధంలోని భాద్యతను గుర్తుకు తెచ్చె గొప్ప కథ ఇది. ఒక భార్య భర్త నుండి ఆశించేది ఎలాంటి ఆదరణ. పెళ్ళీ నాటి ప్రమాణాలను ఎంత మంది అర్ధం చేసుకోగలుగుతున్నారు, ఆచరించగలుగుతునారు. కష్టకాలంలో ఆదరణ ఇవ్వలేని మానవ సంబంధాలు ఎంతో పవిత్రమైనవని సమాజం నిర్దేశించినా, వాటిని భరించడం ఎంత బాధాకరమైన విషయం అన్న విషయాలన్ని సుహాసిని పాత్ర ద్వారా చూపించగలిగారు. ఈ చిత్రాన్ని ఎంత మంది ఆ రోజుల్లో చూసారో తెలీదు కాని చాలా గొప్ప పాయింట్ తో వచ్చిన సినిమాగా ఇప్పటికీ నాకు గుర్తుండిపోయింది. సున్నితంగా వివాహం అనే బంధాన్ని విడమర్చి చెప్పగలిగిన గొప్ప సినిమా ఇది. ఒక స్త్రీ కోసం తనను తాను మార్చుకుని, ఆలోచించడం నేర్చుకుని, అమెను ఒక భాధ్యతగా స్వీకరించి, అమె క్షేమం కోసం పాటుపడిన వ్యక్తి భౌతికంగా దూరమయినా అతని రక్షణ ను అనుభవించిన తరువాత ఆమెకు వేదమంత్రాల సాక్షిగా వివాహం చేసుకున్న ఆమె భర్త లోని అవకాశవాదం, దుర్మార్గం ఇంకా స్పష్టంగా అర్ధం అవుతాయి. భర్త బ్రతికి ఉన్నాడు, తనతో రమ్మంటున్నాడు, అమె చేయని తప్పుకి ఆమెను క్షమించానని తన అధికారం చాటుతున్నాడు. సమాజం కోసం అతని వద్దకు మళ్ళి వెళ్ళి జీవితాన్ని అనుభవించే కన్నా, మరణించిన ఆ వ్యక్తి విధవగా ఒంటరిగా ఉండిపోవాలనే నిర్ణయం తీసుకుని భర్త అనే బంధంలోని భాద్యతను గౌరవించే ఒక స్త్రీ గా సుహాసిని చేసిన ప్రయాణం ఎన్నో ఆలోచనలను కలిగిస్తుంది. ఈ సినిమా ప్రస్తుతం యూ ట్యూబ్లో ఉంది.
పి.జ్యోతి
9885384740