Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తగుళ్ళ గోపాల్ అచ్చమైన తెలంగాణా మట్టి కవి. ఇంకా చెప్పాలంటే అణచబడిన వర్గం వారి కవి. చరిత్రలో విస్మృతికి గురైన వాళ్ల కోసం సమాజ యవనికపై తనదైన కవితా సంతకం చేస్తున్న కవి. తాను పుట్టి పెరిగిన నేలపై సాహితీ విక్షణాలు సోకని ప్రాంతీయ, సామాజిక, కుల, భాష, అస్తిత్వ చైతన్యాలకై నిటారుగా నిలబడి ఇదే సమాజమని చూసిన కవి.
తొలి కవిత 'అమ్మ దీపం'తో పశుపక్ష్యాదుల కన్నా హీనంగా నేటి కొడుకుల ప్రవర్తనలుంటున్నాయని సోదాహరణంగా చెప్పాడు. కాదేదీ కవితకనర్హం అన్నట్లు, గంజిపై ఎర్రమన్ను తట్టపై, జొన్న రొట్టెపై, చియ్య కూరలపై ఇలా తాను చూసిన ప్రతి అంశంపై అనేక పొరలను తడుముతూ కవితా సేద్యం చేసాడు.
'గంజి' అనే కవితలో ''అమ్మ కాచిన ఆ అమృతాన్ని తాగడానికి / అగ్ని దేవుడు కూడా నోరు చూపుతాడు'' ఇది ఎంత వాస్తవ చిత్రీకరణ తనివితీరా చూసిన వాళ్ళకు మాత్రమే అర్థమౌతుంది. ఆ దృశ్యం 'గుల్లగురిగి' కవితలో ''వీధిలోకి ఎన్ని ఏటియం లోస్తేనేం / నా గుల్ల గురిగితో సాటిరావు'' అంటూ తన బాల్య జ్ఞాపకాలను నెమరు వేసుకుంటాడు. 'నాన్న గొడ్డలి'ని జ్ఞాపకం చేసుకొంటూ 'నాన్న అరచేతి రేఖల్ని ముద్దాడి / మా నుదుటి రాతల్ని మార్చింది' అని దానికి కృతజ్ఞతలు చెబుతాడు.
ఈ కవితా సంపుటిని చదువుతుంటే అచ్చమైన పల్లెటూరితో కలిసి తిరిగనట్లుంది. దు:ఖపు గంప అడవిలో పొద్దుకూకినట్లు, అరవై మూడు దు:ఖమాగుతలేదు. వంటి కవితలు సందర్భానుసారంగా స్పందించి రాసినవి చివరగా ఆంగ్ల కవితను కూడా చేర్చి ఉభయ భాషల కవిగా నిరూపించాడు గోపాల్. ఇతనికి మంచి భవిష్యత్తు ఉందని చెప్పవచ్చు.
దండి కడియం (కవిత్వం), రచన : తగుళ్ళ గోపాల్, పేజీలు : 164, వెల : రూ.150/-, ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు.